రూ. 2 కోట్ల విలువైన డ్రగ్ స్వాధీనం | Rs. 2 million worth of drug possession | Sakshi
Sakshi News home page

రూ. 2 కోట్ల విలువైన డ్రగ్ స్వాధీనం

Published Sun, Dec 8 2013 5:15 AM | Last Updated on Sat, Aug 25 2018 6:13 PM

Rs. 2 million worth of drug possession

చందానగర్, న్యూస్‌లైన్: రెండు కోట్ల విలువ చేసే ఎఫిడ్రిన్ మత్తు పదార్థంతోపాటు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సైబరాబాద్ ఎస్‌వోటీ, చందానగర్ పోలీసులు సంయుక్తంగా కేసును ఛేదించారు. చందానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబరాబాద్ ఎస్‌వోటీ ఓఎస్‌డీ గోవర్ధన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. నల్లగొండ జిల్లా మఠంపల్లి మండలం చోటపల్లికి చెందిన బుబ్బా శ్రీనివాస్‌రెడ్డి చందానగర్ హుడా కాలనీలో ఉంటుండగా.. ఇతని సోదరుడు బుబ్బా వెంకట్‌రెడ్డి లింగంపల్లి నారాయణరెడ్డి కాలనీ శ్రీరాములు రెసిడెన్సీలో ఉంటున్నాడు.

బొబ్బా శ్రీనివాస్‌రెడ్డి హుజూరానగర్‌లో బీఎస్సీ వరకు చదువుకున్నారు. 2000 సంవత్సరంలో నగరానికి వచ్చి జిన్నారం మండలం ఖాజీపల్లిలోని హెరెన్ డ్రగ్స్ అండ్ ఫార్మాసూటికల్‌లో కెమిస్ట్‌గా రెండేళ్లు పనిచేశాడు. అనంతరం నాచారంలోని హెర్మాస్ కెమికల్స్‌లో చేరాడు. ఆపై ఆర్టీసీ బస్సులో కాంట్రాక్టు పద్ధతిలో కండక్టర్‌గా, ఎల్‌బీనగర్‌లోని సాయి అడ్వాంటియమ్ ఫార్మా లిమిటెడ్‌లో ప్లాంట్ ఇన్‌చార్జిగా, బీదర్‌లోని బీఎస్‌ఎన్ ఫార్మా లిమిటెడ్‌లో కొన్నాళ్లు పనిచేశాడు. కెమికల్ ప్రాసెసింగ్‌లో అనుభవం గడించిన శ్రీనివాస్‌రెడ్డి కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌లో శ్రీకర్‌ల్యాబ్స్‌ను ఏర్పాటు చేసి బ్రెస్ట్ క్యాన్సర్‌కు ఉపయోగపడే ఆనస్రేజోల్ అండ్ లిట్రేజోల్ డ్రగ్‌ను సొంతంగా తయారు చేశాడు.

దానిని రెండేళ్లు మార్కెటింగ్ చేశాడు. తీవ్ర నష్టాలు చవిచూసిన శ్రీనివాస్‌రెడ్డికి సులభ పద్దతిలో డబ్బు సంపాదించాలనే ఆలోచన వచ్చింది. అరబిందో ఫార్మా లిమిటెడ్‌లో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న తన సోదరుడు వెంకట్‌రెడ్డితో కలిసి జీడిమెట్లలోని ఆర్‌ఎస్ మాలిక్యూర్స్‌ను అద్దెకు తీసుకున్నారు. ఇద్దరికి ఫార్మాలో మంచి అనుభవం ఉండటంతో ముంబైకి చెందిన జావిద్ నుంచి ప్రొపైఫినన్, బ్రోమైన్, సోడియం బోరో హైడ్రైడ్‌ను దిగుమతి చేసుకొని ఆర్‌ఎస్ మాలిక్యూర్స్‌లో ప్రాసెసింగ్ ద్వారా ఎఫిడ్రిన్‌గా తయారు చేస్తున్నారు.

ఆరు నెలల క్రితం వీరు ఆర్‌ఎస్ మాలిక్యూర్స్‌ను అద్దెకు తీసుకొని 50 కిలోల మత్తు పదార్థాన్ని తయారు చేసి.. నెల్లూరు జిల్లా అనంత సాగరం మండలం రవికుంటపాడుకు చెందిన తిరుమల విజయ్‌కుమార్‌రెడ్డి (ఈయన సరూర్‌నగర్ మండలం మీర్‌పేట తిరుమలహిల్స్‌లో ఉంటున్నారు)కి అమ్మకానికి ప్రతిపాదించారు. గతంలో ఎర్రచందనం వ్యాపారంలో దెబ్బతిన్న విజయ్‌కుమార్‌రెడ్డి డ్రగ్ విక్రయించేందుకు తన సొంత గ్రామానికి చెంది చెన్నైలో స్థిరపడిన నవాజ్‌ఖాన్ అలియాస్ భాయ్‌ను సంప్రదించాడు. రెండు నెలల క్రితం 50కిలోల డ్రగ్‌ను నవాజ్‌ఖాన్‌ను ఇవ్వగా కిలోకు రూ.1.5లక్షల చొప్పున రూ.75లక్షలు ఇచ్చాడు.

భాయ్ వీరి నుంచి డ్రగ్స్‌ను కొని మలేసియా, సింగపూర్, ఇతర దేశాలకు కిలో రూ.5 లక్షల చొప్పున విక్రయిస్తుంటాడు. వ్యాపారం లాభసాటిగా ఉండటంతో మరో 56 కిలోల డ్రగ్స్‌ను తయారు చేసి విక్రయించేందుకు గంగారం ఐసీఐసీఐ బ్యాంకు సమీపంలో వేగనార్ (ఏపీ 28డిబి 791)కారులో శనివారం ఉదయం 10గంటల సమయంలో వేచివున్నారు. సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు, చందానగర్ పోలీసులు దాడిచేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ. 2 కోట్ల విలువ చేసే 56 కిలోల డ్రగ్స్, రూ.7లక్షల నగదు, మూడు సెల్‌ఫోన్లతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులను పట్టుకున్న ఇన్‌స్పెక్టర్లు కె. చంద్రశేఖర్, బి. పుష్పన్‌కుమార్, బస్వారెడ్డి, అంజయ్య, సబ్ ఇన్‌స్పెక్టర్లు జి. నాగరాజు, మహేశ్‌గౌడ్, శివ, రమేష్‌లతో పాటు చందానగర్ సీఐ వాసులను ఆయన అభినందించారు.
 
న్యూ ఇయర్ వేడుకల కోసమేనా...


 కొత్త సంవత్సరం వేడుకల్లో విక్రయించడానికే ముఠా పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను తయారు చేసినట్లు అనుమానిస్తున్నారు. నగరంలోని పబ్స్, ప్రైవేట్ పార్టీలకు, రిసార్ట్స్‌లో 100, 50 గ్రామల ప్యాకెట్లను విక్రయించేందుకు ముఠా సభ్యులు వ్యూహం పన్నినట్లు సమాచారం. కాగా, ఈ డ్రగ్ మనిషి మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని పోలీసులు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement