
ఫిరాయింపులపై సుప్రీంకు: ఉత్తమ్
గుత్తాపై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు...
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని పీసీసీ నిర్ణయిం చింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ఈ అంశంపై గురువారం గాంధీభవన్లో న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం అదే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని ఈ సందర్భంగా ఉత్తమ్ విమర్శించారు. దీనిపై ఇప్పటికే అన్ని ప్రజాస్వామిక వేదికలపైనా ఫిర్యాదులు చేసినా ఫలితం లేదన్నారు.
సీఎం కేసీఆర్ నిర్లజ్జగా రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారన్నారు. సచివాలయం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వేదికలుగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ టీఆర్ఎస్ కండువాలు కప్పుతున్నారన్నారు. ‘‘రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి యథేచ్ఛగా ఫిరాయింపులకు పాల్పడుతున్నారు. దీనిపై ఈ నెల 28న సుప్రీంకోర్టుకు సెలవులు పూర్తవగానే పిటిషన్ వేస్తాం’’ అన్నారు. కాంగ్రెస్ నుంచి ఇటీవల టీఆర్ఎస్లో చేరిన నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డిపై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. గుత్తాపై సుప్రీంకోర్టులోనూ కేసు వేస్తామన్నారు. కాంగ్రెస్ నేతలు షబ్బీర్అలీ, డి.కె.అరుణ, సబితా ఇంద్రారెడ్డి, సంపత్కుమార్, మర్రి శశిధర్రెడ్డి పాల్గొన్నారు.