పాకిస్తాన్ లోని లాహోర్ లో ఒక హత్య, దొమ్మీ కేసు విచారణ జరుగుతోంది. ఒక్కో నిందితుడినీ కోర్టు ముందు ప్రవేశపెడుతున్నారు. కోర్టులో డఫేదారు మూసాఖాన్ అలియాస్ మహ్మద్ ఉమర్ పేరును గట్టిగా మూడు సార్లు పిలిచాడు.
అందరూ ఆ హత్యానేరారోపణ ఎదుర్కొంటున్న ఆ వ్యక్తి కోసం ఆసక్తిగా చూస్తున్నారు. అంతలో ఒక నడివయస్సు వ్యక్తి నెమ్మదిగా వచ్చాడు. ఆయన చేతిలో ఒక తొమ్మిది నెలల బిడ్డ. నేరస్తుడెవరా అని అందరూ ఆశ్చర్యపోయారు. పెద్దాయన ఒళ్లో ఉన్న బుడ్డోడే హత్యానేరారోపితుడని డఫేదారు ప్రకటించాడు.
లాహోర్ లో ఇరు వర్గాల మధ్య జరుగుతున్న హోరాహోరీని ఆపేందుకు వెళ్లిన పోలీసులపై ఒక వర్గం దాడి చేసింది. ఈ సంఘటనలో ఒక పోలీసు చనిపోయాడు. ఇప్పుడు అక్కడ ఉన్న వారందరిపై కేసులు నమోదయ్యాయి. అందులో ఈ బుడ్డోడు కూడా ఉన్నాడు.
పిల్లవాడి తండ్రి కోరిక మేరకు మూసాఖాన్ కి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బుడ్డోడిని చూసేందుకు ఇప్పుడు జనం క్యూలు కడుతున్నారు. తొమ్మిది నెలల పిల్లోడు అసలు ఎలా హత్య చేయగలడు వంటి ప్రశ్నలు ఎవరూ వేయకపోవడం, అసలు బుజ్జోడిని చూడగానే కేసు కొట్టేయాలని అనిపించకపోవడం ఆశ్చర్యమే కదూ!
ఇప్పుడీ వార్త వెలువడగానే పోలీసు ఉన్నతాధికారులు, పంజాబ్ ముఖ్యమంత్రి , తదితరులు అసలేం జరిగిందంటూ విచారణలు మొదలుబెట్టాడు. మన బుజ్జి మూసాఖాన్ కి ఇదంతా ఏమీ అర్ధం కావడం లేదు. ఖాన్ బాబు పాలపీకను నోట్లో పెట్టుకుని ఉంగా ఉంగా అంటున్నాడు. అప్పుడప్పుడూ పక్కలు తడిపేస్తున్నాడు.