
ఇరాన్లో సగానికి పైగా కోలుకున్న కరోనా పాజిటివ్ రోగులు
టెహ్రాన్ : ఇరాన్లో కరోనా వైరస్ సోకినవారిలో సగానికి పైగా కోలుకోవడం మహమ్మారి ముప్పును ఎదుర్కోవడంపై సరికొత్త ఆశలు నింపుతోంది. కరోనా బారిన పడిన వారిలో సగం మందికి పైగా కోలుకున్నారని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి కియనుష్ జహన్పూర్ ఇరాన్ స్టేట్ టెలివిజన్తో మాట్లాడుతూ శుక్రవారం వెల్లడించారు. ఇరాన్లో అదృష్టవశాత్తూ మహమ్మారి నుంచి రోగులు కోలుకునే ప్రక్రియ వేగవంతమైందని చెప్పారు.
ఇరాన్లో 68,192 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, వారిలో 35,465 మంది ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్నారని తెలిపారు. కాగా అన్ని వాణిజ్య సంస్ధల యజమానులు, వ్యాపారులు తమ సిబ్బంది ఆరోగ్య పరిస్ధితిని వివరిస్తూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందించే ప్రశ్నావళిని నింపాలని ఆయన సూచించారు. ఇక ఇరాన్లో ఇప్పటివరకూ కరోనా వైరస్తో బాధపడుతూ 4232 మంది మరణించారని ఆ ప్రతినిధి వివరించారు.