
కొలంబో: పార్లమెంట్ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు వీలుగా సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను శ్రీలంక రాజకీయ పార్టీలు అంగీకరించాయి. అక్టోబర్ 26న ప్రధాని విక్రమసింఘేను తొలగిస్తూ అధ్యక్షుడు సిరిసేన తీసుకున్న నిర్ణయంతో ఆ దేశంలో సంక్షోభ పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు జోక్యంతో పార్లమెంట్లో బలపరీక్ష జరపగా..కొత్త ప్రధాని రాజపక్స అందులో ఓడిపోయారు. ఈ పరిణామం అనంతరం పార్లమెంట్ కార్యకలాపాలు గందరగోళం మధ్య సాగుతున్నాయి. సభా కార్యకలాపాలు సవ్యంగా సాగేలా చూసేందుకు సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలన్న అధ్యక్షుడి ప్రతిపాదనకు సోమవారం అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. అయితే, ఇందులో ఎవరి ప్రాతినిధ్యం ఎంత ఉండాలన్న విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు.