కింగ్ ఆఫ్ రొమాన్స్కి క్వీన్స్ నీరాజనం
‘దిల్ తో పాగల్ హై’ తీసినప్పుడు యశ్ చోప్రా వయసు 65 ఏళ్లు. కృష్ణా రామా అనుకునే ఆ వయసులో ఓ టీనేజర్లా మారిపోయి అద్భుతంగా ఆ సినిమాలో ప్రణయ రసాన్ని ఆవిష్కరించారు. అసలు బాలీవుడ్లో రొమాన్స్ని అంత చక్కగా, చిక్కగా ఇంకెవరూ తీయలేరేమో! అందుకే ఆయన్ని ‘కింగ్ ఆఫ్ రొమాన్స్’గా అభివర్ణిస్తుంటారు. గత ఏడాది అక్టోబర్ 21న ఆయన పరమపదించారు. యశ్ చోప్రా లేని లోటుని ఇప్పటికీ బాలీవుడ్ జీర్ణించుకోలేకపోతోంది.
ఏదో ఒక సందర్భంలో ఆయన్ని గుర్తు చేసుకుంటూనే ఉంది. సెప్టెంబర్ 27 ఆయన 81వ పుట్టిన్రోజు. ఈ సందర్భంగా ఆయన జయంతి వేడుకలను ముంబైలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. యశ్ సినిమాల్లో నటించిన పలువురు నటీనటులు, ఇతర తారలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేఖ, శ్రీదేవి, మాధురీ దీక్షిత్, జూహి చావ్లా, రాణి ముఖర్జీ, ప్రీతి జింతా, కత్రినా కైఫ్, అనుష్కశర్మ, పరిణీతి చోప్రా ఇత్యాది బ్యూటీ క్వీన్స్ అంతా ర్యాంప్ వాక్ చేశారు. అలాగే ఈ తొమ్మిది మంది తారలతో షారుక్ ఖాన్ కూడా ర్యాంప్ వాక్ చేశారు. యశ్తో తమకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా అందరూ గుర్తు చేసుకున్నారు.