
విష్ణువర్థన్ కు నివాళులర్పిస్తున్న మంత్రి రామలింగారెడ్డి, భారతి విష్ణువర్థన్
పూనే ఫిలిం ఇన్స్టిట్యూట్ తరహాలో బెంగళూరు నగరంలోని మైలసంద్రలో విష్ణువర్ధన్ ఫిలిం ఇన్స్టిట్యూట్ను స్థాపిస్తామని నటి భారతి విష్ణువర్ధన్ తెలిపారు. నటుడు విష్ణువర్ధన్ నాలుగో వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం ఇక్కడి అభిమాన్ స్టూడియోలోని ఆయన సమాధి వద్ద ఆమె నివాళులర్పించారు.
అనంతరం భారతి విష్ణువర్థన్ విలేకరులతో మాట్లాడుతూ.... విష్ణువర్ధన్ పేరిట స్టూడియో నిర్మాణానికి కర్నాటక ప్రభుత్వం మైలసంద్రలో రెండెకరాల భూమిని కేటాయించిందని తెలిపారు. ప్రభుత్వంతో పాటు తమ కుటుంబం భాగస్వామ్యంలో ఫిలిం ఇనిస్టిట్యూట్ను నిర్మిస్తామని వెల్లడించారు. మహానటుడు విష్ణువర్ధన్పై రాసిన పుస్తకాన్ని ఆమె ఈ సందర్భంగా ఆవిష్కరించారు. విష్ణు వర్థన్ కు నివాళులర్పించిన వారిలో మంత్రి రామలింగా రెడ్డి కూడా ఉన్నారు.