నివేదాపేతురాజ్
తమిళసినిమా: తనకిప్పటి వరకు అలాంటి సంఘటనలు ఎదురవలేదని అంటోంది నటి నివేదా పేతురాజ్. మదురైకి చెందిన అచ్చ తమిళమ్మాయి అయినా దుబాయిలో 13 ఏళ్లు పెరిగిన నివేదా పేతురాజ్ యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అందాల పోటీల్లో మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది. అనంతరం మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి అలా కోలీవుడ్కు ఒరు నాళ్ కూత్తు చిత్రంతో కథానాయకిగా పరిచయమైంది. ఆ తరువాత పొదువాగ ఎన్ మనసు తంగం చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు జయంరవికి జంటగా నటించిన టిక్ టిక్ టిక్ చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తోంది. అయితే ప్రస్తుతం పార్టీ, తిమిరుపిడిచవన్, జగజాల కిల్లాడి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. టిక్ టిక్ టిక్ చిత్రం వచ్చే నెల తొలి వారంలో తెరపైకి రానుంది.
ఈ సందర్భంగా ఈ అమ్మడిచ్చిన భేటీలో తమిళ సినిమాలో హీరోయిన్లు ఇప్పుడు బాగా మారిపోయారనిపిస్తోందని పేర్కొంది. చిత్రాలను ఎంపిక చేసుకునే ముందు పాత్ర నచ్చిందా అన్న విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని అంది. పారితోషికాన్ని మాత్రమే ప్రధానంగా చూడడం లేదని, స్క్రిప్ట్ పూర్తిగా చదివి తమ కథా పాత్ర నచ్చితేనే నటించడానికి ఒప్పుకుంటున్నారని చెప్పింది. ఇకపోతే కాస్టింగ్ కౌచ్ సమస్య సోషల్ మీడియాల్లో బాగా వైరల్ అవుతోందని, అయితే తనకు సంబంధించినంత వరకూ అలాంటి ఘటనలు ఇంతవరకు తనకు ఎదురవలేదని చెప్పింది. తనకు ఆత్మరక్షణ విద్యలు తెలుసని చెప్పింది. బాక్సింగ్ లాంటి ఆత్మరక్షణ విద్యలను థాయ్ల్యాండ్లో రెండేళ్ల పాటు నేర్చుకున్నానని పేర్కొంది. ఆ విద్యలిప్పుడు టిక్ టిక్ టిక్ చిత్రంలో నటించడానికి బాగా ఉపయోగపడినట్లు చెప్పింది. ఇది అంతరిక్ష కథాంశంతో తెరకెక్కిన తొలి భారతీయ చిత్రంగా నమోదవుతుందని, ఇలాంటి చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని నివేదా పేతురాజ్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment