
ఐటం సాంగ్ అయినా నచ్చాల్సిందే!
దేనికైనా తన నిబంధన ఒక్కటే అంటున్నారు నటి పార్వతి మీనన్. తన జాతి పేరును చెప్పుకోవడానికి ఇష్టపడని ఈ కేరళ కుట్టి నటిగా దశాబ్దానికి చేరువయ్యారు. అయితే స్వభాషతో పాటు తమిళం వంటి ఇతర భాషల్లోనూ నటిస్తున్నా.. చేసింది మాత్రం చాలా తక్కువ చిత్రాలే. తమిళంలో పూ చిత్రంతో కేరీర్ను ప్రారంభించి చెన్నైయిల్ ఒరు నాళ్, మరియాన్ చిత్రాలలో నటించారు. తాజాగా బెంగుళూర్ నాట్కళ్ చిత్రంలో ఒక హీరోయిన్గా ముఖ్య భూమికను పోషించారు. ఇందులో ఆర్యకు జంటగా నటించారు.
బాబీసింహా, రానా, శ్రీదివ్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో అతిథి పాత్రల్లో రాయ్లక్ష్మి, సమంత మెరిసిన బెంగుళూర్ నాట్కల్ చిత్రాన్ని పీవీపీ సినిమా సంస్థ నిర్మించింది. టాలీవుడ్ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. నటి పార్వతి తన అనుభవాలను పంచుకుంటూ బెంగుళూర్ నాట్కళ్ చిత్రంలో నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. దీని వరిజినల్ మలయాళ వెర్షన్ బెంగుళూర్ డేస్ చిత్రంలో నటించిన పాత్రనే ఇందులోనూ పోషించానని చెప్పారు.
ఈ చిత్ర నిర్మాత నటించమని అడిగినప్పుడు కాదన్నానన్నారు. ఆ తరువాత దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కలిసి తనను కన్విన్స్ చేయడంతో కొన్ని షరతులతో నటించడానకి అంగీకరించినట్లు తెలిపారు. అందులో ముఖ్యమైనది తన పాత్రలో ఎలాంటి మార్పులు చేయరాదన్నారు. ఇక తన సహ నటీమణులు అధిక చిత్రాల్లో నటిస్తున్నారు. మీరెందుకు నటించడం లేదని అడుగుతున్నారని ఆయితే ఆ విషయం గురించి తాను ఆలోచించడం లేదని బదులిచ్చారు.
తాను నటించే పాత్ర తన మనసుకు దగ్గరగా ఉండాలన్నారు. తను చాలా నిరాడంబరంగా ఉంటానంటున్నారని అది తన సహజ గుణం అనీ అన్నారు. తనకు సహాయంగా ఒక వ్యక్తే ఉంటారని నలుగురైదుగురిని నియమించుకుంటే వారితోనే సమయం వృథా అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తనకు అన్ని భాషల్లోనూ నటించాలన్న ఆసక్తి ఉందని, ఏ భాషలోనైనా తన నిబంధన ఒకటేననీ, అది ఐటమ్ సాంగ్ అయినా సరే నచ్చాలని పార్వతి స్పష్టం చేశారు.