
పాతికేళ్ల తర్వాత...
రాజేంద్రప్రసాద్, సీత నటించిన ‘చెవిలో పువ్వు’, ‘ముత్యమంత ముద్దు’ చిత్రాలు అప్పట్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ జంటకు మంచి పేరొచ్చింది. మళ్లీ పాతికేళ్ల తర్వాత ఈ జోడీ ‘టామీ’ సినిమా కోసం కలిశారు. రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో చేగొండి హరిబాబు, బోనం చినబాబు నిర్మిస్తోన్న ‘టామీ’ చిత్రం కేవలం నెల రోజుల్లో నర్సాపురం, పాలకొల్లు ప్రాంతాల్లో చిత్రీకరణ పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా చేగొండి హరిబాబు మాట్లాడుతూ -‘‘కుక్కకూ, యజమానికి మధ్య ఉన్న అనుబంధాన్ని ఇందులో ఎంతో బాగా ఆవిష్కరించాం. మా టామీ అందర్నీ నవ్వించడంతో పాటు, ఆఖరిగా ఆలోచింపజేస్తుంది. తదుపది మేం ‘టామీ-2’ చేయాలని నిర్ణయించుకున్నాం. ఇందు కోసం ఓ కుక్కకు శిక్షణ ఇప్పిస్తున్నాం’’ అని తెలిపారు. కుక్క చేసే విన్యాసాలు ఈ చిత్రానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: చక్రి, కెమెరా: మోహన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాబు బండారు.