
విలేకరిపై చిర్రుబుర్రు లాడిన బాలీవుడ్ భామ
ప్రకంకపనలు సృష్టించిన పనామా పేపర్స్ లీక్ వ్యవహారంపై బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ బచ్చన్ చిర్రుబుర్రు లాడారు.
ముంబై: ప్రకంకపనలు సృష్టించిన పనామా పేపర్స్ లీక్ వ్యవహారంపై బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ బచ్చన్ చిర్రుబుర్రు లాడారు. ఈ పత్రాల్లో తన పేరు వుండడాన్ని ప్రశ్నించిన పాత్రికేయులపై అసహనాన్ని ప్రదర్శించారు. ఇందులో మీకు ఎందుకింత అత్యుత్సాహం అంటూ విరుచుకుపడ్డారు. తన నటనా చాతుర్యంతో పలువురిని ఆకట్టుకున్నఅందాల తార ఐష్ ప్రవర్తనపై విమర్శలు చెలరేగాయి.
ఓమంగ్ కుమార్ దర్శకత్వంలో ఐష్ ,రణదీప్ హుడా నటించిన బయోపిక్ 'సరభ్ జిత్' ట్రైలర్ విడుదల సందర్భంగా ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా పాత్రికేయులు పనామా పత్రాల్లో ఆమె పేరు వుండడంపై ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా కాసేపు మౌనాన్ని పాటించింది. ఈ వ్యవహారంలో అక్కడే ఉన్న రణదీప్ హుడా కల్పించుకొని ఆమెకు మద్దతుగా నిలిచారు. కేవలం సినిమాకు సంబంధించిన అంశాలనే ప్రస్తావించాలని కోరారు. అయినా ఓ జర్నలిస్టు మళ్లీ విదేశీ కంపెనీల్లో పె ట్టుబడుల వ్యవహారాన్ని ప్రస్తావించడంతో ఐష్ అతనిపై మండి పడ్డింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేశాం.. మీ అందరికీ తెలుసు కదా... మీ రు ఒక్కరే అడుగుతున్నారు.. ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారంటూ కస్సుబుస్సులాడారు. దీంతోపాటు ఇప్పటికే ఒక ప్రకటన ఇచ్చాం.. దాన్ని చూసుకోవాలంటూ ఆమె మేనేజర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
కాగా 'పనామా పేపర్స్' విడుదల చేసిన రహస్య జాబితా లో 500 ప్రముఖ భారతీయులలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, సైఫ్ అలీ ఖాన్, కరీనా, కరిష్మా, పలువురు క్రీడా, రాజకీయ వ్యాపారవేత్తల పేర్లు ప్రముఖంగా నిలవడం సంచలనం రేపింది. బాలీవుడ్ మెగా స్టార్ , ఐష్ మామగారైన అమితాబ్ బచ్చన్ ఈవార్తలను ఖండించారు. తన పేరును దుర్వినియోగం చేశారని, నివేదికలో పేర్కొన్న కంపెనీలతో తనకెలాంటి సంబంధంలేదంటూ ఒక ప్రకటన జారీ చేశారు. అటు ఇవి తప్పుడు విచారణ పత్రాలని ఐశ్వర్య న్యాయసలహాదారు గతంలో వీటిని కొట్టిపారేసిన సంగతి విదితమే.