
24 రోజుల్లో 173 కట్టించారు..
కర్నాటకలో ఓ గ్రామం సక్సెస్ స్టోరీ
ప్రతి ఇంటికీ ఓ మరుగుదొడ్డి పథకం అమలు చేయడంటూ టీవీ చానెళ్లు, వార్తా పత్రికల్లో బాలీవుడ్ తార విద్యాబాలన్ ప్రకటన కనిపిస్తుంటుంది. దాన్ని ఎంతమంది ప్రేక్షకులు పట్టించుకున్నారో తెలియదుగానీ కర్నాటకలోని ఖానాపూర్ గ్రామం పంచాయతీ నాయకురాలు ప్రేమ తిమ్మనగౌడర్ మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నారు. గ్రామంలోని 173 ఇళ్లలో 24 రోజుల్లో 173 మరుగుదొడ్లను కట్టించారు.
ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం..
ఖానాపూర్తోపాటు మరో రెండు గ్రామాలకు చైర్పర్సన్గా ప్రేమ గత నెలలోనే ఎన్నికయ్యారు. అప్పుడు గ్రామంలో పది శాతం ఇళ్లలో కూడా మరుగుదొడ్లు లేవు. ఉన్నవి కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. మరుగుదొడ్ల ఆవశ్యకత గురించి ఆమె ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. మొదట్లో దాదాపు 90 శాతం మంది ప్రజలు ఆమె ప్రతిపాదనను వ్యతిరేకించారు. మరుగుదొడ్ల నిర్మాణానికి ఒప్పుకోలేదు. తన ఆందోళనను అర్థం చేసుకున్న పది శాతం మంది ప్రజలు, ముఖ్యంగా చదువుకుంటున్న యువతను తీసుకొని కాళ్లరిగేలా మళ్లీ ఇంటింటికీ తిరిగారు. వారికి నచ్చచెప్పేందుకు శాయశక్తులా యత్నించారు. ఫలితంగా కొంత సానుకూలత పెరిగింది.
తలా ఓ చేయి..
మరుగుదొడ్ల నిర్మాణానికి అంగీకరించిన ఇళ్లలో ముందుగా ఆ పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో మొత్తం 173 టాయిలెట్లు నిర్మించాలని పంచాయతీ సమక్షంలో ప్రేమ నిర్ణయం తీసుకున్నారు. ఖర్చు నాలుగు లక్షల రూపాయలు అవుతుందని అంచనా వేశారు. అంత సొమ్ము పంచాయతీ వద్ద లేదు. ప్రేమతోపాటు పంచాయతీ సిబ్బంది, యువత శక్తిమేరకు చందాలు వేసుకున్నారు. మరుగుదొడ్ల నిర్మాణానంతరం కేంద్ర ప్రభుత్వం ఖర్చును తిరిగి చెల్లిస్తుందని తెలిసిన ప్రేమ ధైర్యంగా కొంత అప్పుకూడా చేశారు. ఊరిలో అందరి నుంచి సహాయం అర్థించారు.
కొందరు సమీపంలోని వాగు నుంచి ఇసుకను తీసుకు రావడానికి అద్దె లేకుండా వాహనాలు ఇచ్చారు. మరికొందరు శక్తిమేరకు ఇటుకలు, రాళ్లు ఇచ్చారు. కొన్ని రోజులు కొంతమంది స్వచ్ఛందంగా కూలి చేశారు. సిమెంటును మాత్రం కొనుగోలు చేయక తప్పలేదు. ఇలా తలా ఓ సాయం చేస్తూ ఊరంతా కలిసిపోగా మరుగుదొడ్లను వద్దన్నవారు కూడా ముందుకొచ్చారు. అంతే... రికార్డు స్థాయిలో 24 రోజుల్లో 173 మరుగుదొడ్లను విజయవంతంగా నిర్మించారు. చైర్పర్సన్ ప్రేమ తిమ్మనగౌడర్ కృషిని ప్రశంసిస్తూ కేంద్రం మరుగుదొడ్ల నిర్మాణానికైన ఖర్చును తక్షణమే రీయింబర్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.