
తిరువనంతపురం/న్యూఢిల్లీ: కేరళలో వరద బీభత్సం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 37 మంది మరణించగా, 35,874 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. భారీ వర్షాలకు పెరియార్ నదికి వరద పోటెత్తుతోంది. దీంతో పరీవాహాక ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వరద బాధితుల సహాయార్థం తమిళనాడు ప్రభుత్వం 5 కోట్లు, సినీ నటులు కమల్ రూ.25 లక్షలు, సూర్య, కార్తీలు కలిపి రూ.25 లక్షలు విరాళాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కేరళ సర్కారుకు తగినన్ని సహాయనిధులు కేటాయించాలని ప్రధానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ లేఖ రాశారు. ఏపీ, కర్ణాటక తీరప్రాంతాలు, తమిళనాడు, బెంగాల్, కేరళ, సిక్కిం, హిమాచల్, యూపీ, ఛత్తీస్గఢ్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, అరుణాచల్, మేఘాలయ, అస్సాంలోనూ అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) హెచ్చరించింది.