
యాంగాన్: మయన్మార్లో ఘోర ప్రమాదం జరిగింది. మయన్మార్ ఉత్తర ప్రాంతంలో ఉన్న కాచిన్ రాష్ట్రంలో సోమవారం అర్ధరాత్రి కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 50 మందికిపైగా మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు. కొండచరియలు విరిగిపడటంతో వచ్చిన బురదలో 54 మంది కొట్టుకుపోయారని, ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. మిగిలిన వారు బతికిఉండే అవకాశాలు తక్కువేనని పేర్కొన్నారు. ప్రమాదాన్ని మయన్మార్ సమాచార మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. చైనా సరిహద్దుల్లో రంగురాళ్ల కోసం ఇష్టారీతిన నిర్వహిస్తున్న మైనింగ్ కార్యకలాపాల వల్ల కొండచరియలు విరిగిపడి ప్రతి సంవత్సరం చాలా మంది మరణిస్తున్నారు.