
జమ్మూ: జమ్మూకశ్మీర్లోని నియంత్రణ రేఖ(ఎల్వోసీ), అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంబడి ఈ ఏడాది జూలై చివరి వరకు శత్రుసైన్యం జరిపిన కాల్పుల్లో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచార హక్కు చట్టం కింద కార్యకర్త రమణ్ సింగ్ అడిగిన ప్రశ్నకు హోం శాఖ ఈ మేరకు సమాధానమిచ్చింది. జనవరి నుంచి జూలై చివరి వరకు జరిగిన మొత్తం 1,435 కాల్పుల ఘటనల్లో 28 మంది పౌరులు, 12 మంది సైనిక సిబ్బంది, 12 బీఎస్ఎఫ్ జవాన్లు నేలకొరిగారని పేర్కొంది. దీంతోపాటు 140 మంది పౌరులు, 45 మంది సైనిక సిబ్బంది, 47 మంది బీఎస్ఎఫ్ జవాన్లు గాయపడ్డారని తెలిపింది. మొత్తం 1,435 కాల్పుల విరమణ ఉల్లంఘనల్లో ఎల్వోసీ వెంట 945, ఐబీ వెంట 490 ఘటనలు చోటుచేసుకున్నట్లు వివరించింది.