
పుణే : ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు వెంబడి సర్జికల్ స్ట్రైక్స్ లాంటి ప్రయత్నం మరోసారి చేయకపోవటమే మంచిదని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘సరిహద్దు రేఖ వెంబడి మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేయకూడదనే భావిస్తున్నాం. ఎందుకంటే అందులో కొత్తదనం ఏం ఉండబోదు కాబట్టి. ఒకవేళ మేం సర్ప్రైజ్లే ఇవ్వాలనుకుంటే కొత్తరకంగా ఉపాయం వేసుకుంటాం. అది ఎలా ఉంటుందంటే అవతలివాళ్లు ఊహించని విధంగా.. సర్జికల్ స్ట్రైక్స్ కంటే మరింత సమర్థవంతంగా ఉంటాయి’’ అని ఆయన పేర్కొన్నారు.
2015లో మయన్మార్, 2016లో పీఓకే వెంబడి నిర్వహించిన సునిశిత దాడుల ఆపరేషన్ల గురించి, ఆయా సందర్భాల గురించి వివరించిన ఆయన.. ప్రస్తుతం ఉత్తర, తూర్పు సరిహద్దులో ఉన్న పరిస్థితులు, బలగాల మోహరింపు మొదలైన అంశాల కూలంకశంగా వివరించారు. శుక్రవారం పుణేలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.