
యోగి ఆదిత్యనాథ్( పాత ఫోటో)
లక్నో: ఉత్తరప్రదేశ్లో రూ.6వేల కోట్లతో మెగా ఫుడ్ పార్క్ పెట్టాలన్న ఆలోచనను వెనక్కి తీసుకుంటున్నట్లు పతాంజలి సంస్థ ప్రకటించిన నేపథ్యంలో యూపీ సీఎం రంగంలోకి దిగారు. ఫుడ్ పార్క్ రాష్ట్రం నుంచి తరలించవద్దని పతాంజలి సంస్థ సహ వ్యవస్థాపకులైన రాందేవ్ బాబాను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోరారు.
ఈ మేరకు ఆయనే స్వయంగా ఫోన్ చేసి పతంజలి ఆయుర్వేద్ ఛీప్ ఆచార్య బాలక్రిష్ణ, రాందేవ్ బాబాలతో మాట్లాడారు. పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యలు త్వరలోనే పరిష్కారం చేస్తామని యోగి వారికి హామీ ఇచ్చారు. సీఎం హామీ ఇవ్వడంతో రాందేవ్ కూడా పుడ్ పార్క్ను యూపీలోనే ఏర్పాటు చేయడానికి అంగీకరించారని యూపీ పరిశ్రమల మంత్రి సతీశ్ మహానా పేర్కొన్నారు.
యూపీలోని యమునా ఎక్స్ప్రెస్ హైవే సమీపంలో 425 ఎకరాల్లో పతంజలి మెగా ఫుడ్ పార్క్ పెట్టాలని భావించింది. అయితే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇందుకు సహకరించడంలేదని పతంజలి ఛీప్ ఆచార్య బాలక్రిష్ణ మంగళవారం ఆరోపించారు.
‘పుడ్ పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదు. అనుమతుల కోసం చాలా కాలం ఎదురుచూశాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడం లేదు. ఇప్పుడు మేము ఈ ప్రాజెక్టును వేరే రాష్ట్రానికి మార్చాలని నిర్ణయించాం’ అని బాలకృష్ణ వెల్లడించారు. ఆచార్య బాల క్రిష్ణ ఇలా బహిరంగంగా ప్రభుత్వాన్ని విమర్శించడంతో యోగి వెంటనే రాందేవ్ బాబాతో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment