
ప్రధాని మోదీపై బీజేపీ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు
నోట్ల రద్దుకు ప్రజలు సంపూర్ణ మద్దతు ఇచ్చారన్న మోదీ వ్యాఖ్యలను శత్రుఘ్నసిన్హా తప్పుబట్టారు.
న్యూఢిల్లీ: పాత పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న సంచలనాత్మన నిర్ణయాన్ని బీజేపీ నాయకులంతా ప్రశంసిస్తుంటే ఆ పార్టీకే చెందిన అసమ్మతి ఎంపీ, మాజీ నటుడు శత్రుఘ్నసిన్హా మాత్రం భిన్నంగా స్పందించారు. భ్రమల్లో బతకొద్దని ప్రధాని మోదీకి పరోక్షంగా సూచించారు. నోట్ల రద్దుకు ప్రజలు సంపూర్ణ మద్దతు ఇచ్చారన్న మోదీ వ్యాఖ్యలను శత్రుఘ్నసిన్హా తప్పుబట్టారు. ‘ పిచ్చోళ్ల స్వర్గంలో విహరించడం మానుకోండి. కట్టుకథలు, స్వప్రయోజనాల కోసం నిర్వహించిన సర్వేలకు దూరంగా ఉండాల’ని శత్రుఘ్నసిన్హా అన్నారు.
మొబైల్ యాప్ ద్వారా నిర్వహించిన సర్వేలో 93 శాతం మంది పెద్దనోట్ల రద్దుకు మద్దతిచ్చారని, కేవలం 2 శాతం మంది మాత్రమే దాన్ని వ్యతిరేకించారన్నారని ప్రధాని మోదీ బుధవారం వెల్లడించారు. అయితే మోదీ సర్కారు తమకు అనుకూలంగా ఈ సర్వే చేయించుకుందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. గ్రామీణ భారతానికి ఈ సర్వేలో ప్రాతినిథ్యం లేదని వ్యాఖ్యానించాయి. గ్రామాల్లో చాలా మందికి స్మార్ట్ ఫోన్లు లేవని తెలిపాయి. తమకు వ్యతిరేకంగా వచ్చిన సమాధానాలను ప్రభుత్వం తొలగించిందని ఆరోపించాయి.