
కోర్టుకు వస్తున్న గద్దర్
ఏడుగురు పోలీసుల ఊచకోత కేసు...
కర్ణాటక,తుమకూరు: ప్రజా గాయకుడు గద్దర్ బుధవారం కర్ణాటకలో తుమకూరు జిల్లా పావగడ జేఎంఎఫ్సీ కోర్టులో విచారణకు హాజరయ్యారు. 2005 ఫిబ్రవరి నెలలో కొప్ప తాలూకా మెణసినహడ్యలో పోలీసులు, నక్సలైట్ల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు నేత సాకేత్ రాజన్ మృతి చెందాడు. కొంతకాలానికి దీనికి ప్రతీకారంగా పావగడ తాలూకా వెంకటమ్మనహళ్లి పోలీసు క్యాంపుపై తీవ్రవాదులు చేసిన దాడిలో ఏడుమంది పోలీసులు, ఒక సాధారణ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో గద్దర్ను 11వ ముద్దాయిగా, కవి, మానవహక్కుల నాయకుడు వరవరరావును 12వ ముద్దాయిగా చేర్చారు. అప్పటినుంచి కేసు వాయిదాలకు హాజరవుతున్న గద్దర్ బుధవారం కూడా కోర్టుకు వచ్చారు. కాగా గత ఏడాది పోలీసులు కొత్తగా రూపొందించి చార్జ్షీట్లో గద్దర్ను నాలుగో ముద్దాయిగా చేర్చారు. మంగళవారం తుమకూరులో ఎస్పీ, డీఎస్పీ ఎదుట ఆయన విచారణకు హాజరయ్యారు.
గట్టి బందోబస్తు మధ్య..
గద్దర్ గట్టి పోలీస్ బందోబస్తు మధ్య బుధవారం స్థానిక మున్సిఫ్ కోర్టుకు హాజరయ్యారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గద్దర్ తరపున న్యాయవాది పావగడ శ్రీరామ్ అందించిన రెండు ష్యూరిటీలు, హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ పత్రాల మేరకు స్థానిక జేఎంఫ్ కోర్టు న్యాయమూర్తి భరత్ యోగీశ్ బెయిల్ మంజూరు చేశారు. కేసు ఏమిటంటే.. 2005 ఫిబ్రవరి 11 న రాత్రి ఆంధ్ర సరిహద్దు లోని తాలూకాకు చెందిన వెంకటమ్మనహళ్ళి గ్రామంలో ఓ ప్రభుత్వ పాఠశాలలో బసచేసిన కర్ణాటక పోలీసులపై మినీ లారీలో వచ్చిన సుమారు 300 మంది నక్సలైట్లు తుపాకులు, బాంబుల దాడులతో విక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఏడుగుర ు పోలీసులు, ఒక స్థానికుడు అసువులు బాశారు. ఈ హత్యాకాండ కేసులో సుమారు 300 మంది పై కేసు నమోదు చేయగా 80 మందిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరచి మిగిలిçన వారు పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆధారాలు లేకపోవడంతో తరువాత అనేకమందిని కోర్టు విముక్తుల్ని చేసింది.