
ఢిల్లీలో విస్తృతంగా కరోనా పరీక్షలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తుండటంతో మహమ్మారి కట్టడికి పలు చర్యలు చేపడుతున్నారు. ఢిల్లీ నగరంలో ప్రతి ఒక్కరికీ కరోనా టెస్టులు నిర్వహించేందుకు సిద్ధమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన క్రమంలో దేశ రాజధానిలో 6 లక్షల కోవిడ్-19 టెస్టులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. కొత్తగా ఏర్పాటు చేసే 169 కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ మెథడాలజీ ద్వారా భారీఎత్తున టెస్ట్లు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
మరోవైపు కోవిడ్-19 నిర్ధారణ కోసం నిర్వహించే ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ కోసం ధరను 2400 రూపాయలుగా నిర్ధారించినట్టు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వెల్లడించారు. మరోవైపు దేశ రాజధానిలో కరోనా వైరస్ కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం మరోసారి ఢిల్లీ ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చించారు.