
సాక్షి, షిమ్లా : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా ఓ మహిళా పోలీసు కానిస్టేబుల్పై చేయి చేసుకున్న ఆ పార్టీ నేత ఆశాకుమారి క్షమాపణలు చెప్పారు. అలా ఎందుకు తాను చేయాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. అదే సమయంలో ఆ కానిస్టేబుల్ వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఆమె(మహిళా కానిస్టేబుల్) నన్ను తిట్టింది. నన్ను తోసింది. ఆమె నన్ను వెళ్లకుండా నిలువరించాల్సింది.. నాకు ఆమె తల్లికున్న వయసు ఉంటుంది. అయితే, ఈ సమయంలో నేను నా సహనాన్ని కోల్పోకుండా ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకోవాల్సి ఉండాల్సింది. నేను అందుకు క్షమాపణలు చెబుతున్నాను' అని మీడియా సాక్షిగా తెలిపారు.
సమీక్ష సమావేశం కోసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు షిమ్లాకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్యాయలం దగ్గరకు ఆశాకుమారి చేరుకున్నారు. అయితే పోలీస్ సిబ్బంది ఆమెను లోపలికి అనుమతించలేదు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ఆమె వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా ఓ మహిళా కానిస్టేబుల్ చెంప పగలకొట్టారు. అయితే దానికి ప్రతిగా ఆ కానిస్టేబుల్ కూడా ఆమె చెంప వాయించింది. దీంతో ఆశాకుమారి ఆగ్రహంతో ఊగిపోగా.. కార్యకర్తలు ఆమెను పక్కకు తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment