
న్యూఢిల్లీ: దేశంలో తీవ్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నప్పుడు ప్రజల్ని హెచ్చరించేందుకు వీలుగా భారత వాతావరణశాఖ(ఐఎండీ) సిద్ధమవుతోంది. ఇందులోభాగంగా ప్రజలకు ముందస్తు అలర్ట్స్ పంపేందుకు బీఎస్ఎన్ఎల్తో ఐఎండీ జట్టుకట్టినట్లు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వాతావరణ శాఖ తమకు కచ్చితమైన అలర్ట్స్ పంపడం లేదని ఇటీవల పలు రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శించిన నేపథ్యంలో ఐఎండీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎం.రాజీవన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజలకు వాతావరణానికి సంబంధించిన అలర్ట్స్ పంపేందుకు ఐఎండీ, బీఎస్ఎన్ఎల్ కలసి పనిచేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం బీఎస్ఎన్ఎల్ ఓ సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఐఎండీ ఓ అలర్ట్ను పంపిస్తే.. దాన్ని బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులందరికీ పంపిస్తుంది. ఈ సాంకేతికత ప్రయోగ దశలోనే ఉంది’ అని చెప్పారు.