
మహాత్మాగాంధీ చిత్రాన్ని మద్యం సీసాలపై చిత్రించిన ఘటనలో...
న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ చిత్రాన్ని మద్యం సీసాలపై చిత్రించిన ఘటనలో ఇజ్రాయెల్ కంపెనీ క్షమాపణలు కోరిందని, ఆ చిత్రంతో మద్యం ఉత్పత్తిని నిలిపివేసిందని, సరఫరా చేసిన సీసాలను వెనక్కి తీసుకుందని విదేశాంగమంత్రి జయశంకర్ తెలిపారు. మంగళవారం జీరోఅవర్ సందర్భంగా రాజ్యసభలో ఈ అంశాన్ని ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ లేవనెత్తారు. దీనిపై జైశంకర్ ‘ఆ సంస్థ ప్రజలకు, భారత ప్రభుత్వానికి హృదయపూర్వక క్షమాపణలు తెలిపిందని, జరిగిన దానిపై విచారం వ్యక్తం చేసింది’ అని తెలిపారు.
ఇజ్రాయెల్ 71వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశ బీర్ తయారీ కంపెనీలు మాల్కా బ్రేవరీ, నెగేవ్ బీర్స్ ఈ చర్యకు పాల్పడ్డాయి. తమ బీర్లకు పబ్లిసిటీ కల్పించేందుకు ఏకంగా వివిధ దేశాల ప్రముఖ వ్యక్తుల ముఖచిత్రాలను బీర్ బాటిళ్లపై ముద్రించాయి. ఇందులో భాగంగా టీ షర్ట్ వేసుకొని.. కూలింగ్ గ్లాస్ పెట్టుకున్న మహాత్మాగాంధీ చిత్రాన్ని బీర్ బాటిల్పై ముద్రించాయి. తమ ఉత్పత్తుల ప్రచారం కోసం ఏకంగా బీర్ బాటిళ్లపై మహాత్మా గాంధీ చిత్రాన్ని ముద్రించి.. అవమానించడంపై భారతీయులు మండిపడుతున్నారు. ఈవిధంగా స్వాతంత్ర్యయోధులను కించపరిచిన ఆ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహులకు లేఖలు రాశారు.
ఇజ్రాయెల్లో పనిచేసే ఓ భారతీయుడు మొదట ఈ బీర్ బాటిల్ను ఆన్లైన్లో పోస్ట్ చేసి.. తన ఆవేదనను వ్యక్తం చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. భారత జాతిపిత అయిన గాంధీని అవమానించడంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవితమంతా మద్యం ముట్టనని తన తల్లికి వాగ్దానం చేసి.. మద్యపానానికి వ్యతిరేకంగా పోరాడిన గాంధీని ఇలా చేయడం నిజంగా అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2015 సంవత్సరంలో కూడా అమెరికాకు చెందిన ఒక బీరు కంపెనీ గాంధీని అవమానించేలా ఓ వాణిజ్య ప్రకటనను రూపొందించింది. దీనిపై భారత ప్రభుత్వం నిరసన తెలపడంతో ఆ కంపెనీ క్షమాపణలు చెప్పింది.