
జమ్మూ: భారత సైన్యం రెండు రోజుల క్రితం భారీ కాల్పులతో పీవోకేలో ఉన్న ఉగ్రవాదుల శిబిరాలను, సైనిక పోస్టులను ధ్వంసం చేసినా పాకిస్తాన్ బుద్ధి మారలేదు. సరిహద్దుల గుండా ఉగ్రమూకలను పంపడం, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం మారలేదు. తాజాగా జరిగిన ఘటనలే ఇందుకు ఉదాహరణ. జమ్మూకశ్మీర్లో మంగళవారం చోటుచేసుకున్న వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ముష్కరులు హతం కాగా, ఒక సైన్యాధికారి నేలకొరిగాడు. ఎల్వోసీ వెంట పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు గాయపడ్డారు. దక్షిణ కశీ్మర్లోని త్రాల్ ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో జైషే మొహమ్మద్కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆగస్టులో గుజ్జర్ వర్గానికి చెందిన ఇద్దరు సోదరులను చంపడంలో వీరి ప్రమేయం ఉందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
మంగళవారం మధ్యాహ్నం రాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్లో గస్తీ తిరుగుతున్న బలగాలపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ నేలకొరిగారు. అదే సమయంలో ఎల్వోసీ ఆవలి వైపు నుంచి పాక్ సైన్యం కూడా కాల్పులు జరపగా దీటుగా బదులిచ్చామని సైన్యం పేర్కొంది. అంతకుముందు పూంచ్ జిల్లాలో ఎల్వోసీ వెంట పాక్ బలగాలు మోరా్టర్లతో జరిపిన కాల్పుల్లో మహిళ సహా ఇద్దరు పౌరులు గాయపడ్డారు. ఈ కాల్పులు మధ్యాహ్నం రెండు గంటల వరకు సాగాయి. ప్రతిగా భారత సైన్యం కూడా కాల్పులు జరిపింది. కాల్పుల నేపథ్యంలో ఆ ప్రాంతంలోని ప్రజలు భూగర్భ బంకర్లలో తలదాచుకున్నారు. పాఠశాలల్లోని చిన్నారులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని సైన్యం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment