
జిగిషా ఘోష్ (ఫైల్)
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 2009లో సంచలనం సృష్టించిన జిగిషా ఘోష్ హత్య కేసులో దోషులుగా తేలిన ముగ్గురికి ఢిల్లీ అదనపు సెషన్స్ కోర్టు సోమవారం శిక్షలు ఖరారు చేసింది. ఇద్దరికి మరణశిక్ష, ఒకరికి జీవితఖైదు విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దోషులు రవి కపూర్, అమిత్ శుక్లాకు ఉరిశిక్ష.. బల్జీ మాలిక్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఐటి ఉద్యోగిని జిగిషా ఘోష్ను అపహరించి, హత్య చేసిన కేసులో వీరిని అదనపు సెషన్స్ న్యాయమూర్తి సందీప్ యాదవ్ జూలై 14న దోషులుగా నిర్ధారించారు.
28 సంవత్సరాల జిగిషా ఘోష్ హెవిట్ అసోసియేట్ ప్రైవేట్ లిమిటెడ్లో ఆపరేషన్స్ మేనేజర్గా పనిచేసేది. 2009 మార్చి 18 వేకువజామున నాలుగు గంటలకు వసంత్ విహార్లోని తన ఇంటి వద్ద కంపెనీ క్యాబ్ నుంచి దిగిన జిగిషా తర్వాత కనిపించకుండా పోయింది. తర్వాత ఆమె వృతదేహం సూరజ్కుండ్లోని ఓ మురికి కాలువలో లభించింది.
దోషులను పట్టించిన ఆయుధం
దోషులుగా తేలిన ముగ్గురు వ్యక్తులు జిగిషాను అపహరించి హత్య చేశారని పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత ఆమె క్రెడిట్ కార్డులోని డబ్బు కాజేశారని, నగల్ని, రిస్ట్ వాచ్లను, షూస్ను సరోజినీ నగర్ మార్కెట్లో అమ్ముకున్నట్లు వివరించారు. జిగిషాను హత్య చేయడానికి ఉపయోగించిన ఆయుధం పోలీసుల చేతికి చిక్కడంతో వారు ఈ కేసును ఛేదించగలిగారు.
ఈ ముగ్గురు దోషులు టీవీ జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో కూడా నిందితులు కావడం గమనార్హం. సౌమ్య 2008 సెప్టెంబర్ 30న హత్యకు గురైంది. ఆఫీసు నుంచి రాత్రి వేళ కారులో తిరిగి వస్తుండగా సౌమ్య హత్యకు గురైంది. జిగిషా కేసు దర్యాప్తులో నిందితులకు సౌమ్య విశ్వనాథన్ హత్యలోనూ హస్తముందని పోలీసులు గుర్తించారు.