
రాజీవ్ గౌబా
సాక్షి, న్యూఢిల్లీ : విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలోని నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ రెండో రోజు సమీక్ష జరిపింది. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ఏపీ చీఫ్ సెక్రటరీ తీసుకున్న చర్యలను కమిటీకి వివరించారు. ఈ సందర్భంగా కెమికల్ సేఫ్టీకి సంబంధించి అంతర్జాతీయ నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన కమిటీ తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన కెమికల్స్ పంపేందుకు సిద్ధమని హామీ ఇచ్చారు.
కాగా, ఎల్జీ పాలిమర్స్ కంపెనీ గ్యాస్ లీకేజీ ఘటనపై శుక్రవారం ఐఏఎస్ల హైపవర్ కమిటీ విచారణ ప్రారంభమైంది. కమిటీ ఛైర్మన్ సీనియర్ ఐఏఎస్ అధికారి, పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్ వలవెన్.. కమిటీ కన్వీనర్, కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు వివేక్ యాదవ్, విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్లు ఈ విచారణలో పాల్గొన్నారు. కమిటీ సభ్యులు అరగంటకు పైగా కంపెనీలో గ్యాస్ లీక్ అయిన తీరుపై అధికారులు, కార్మికులను విచారించారు.