
ఇద్దరికి అస్వస్థత.. ఒకరి పరిస్థితి విషమం
పరవాడ: జేఎన్ ఫార్మాసిటీలోని రక్షిత్ డ్రగ్స్ ఫార్మా పరిశ్రమలో సోమవారం ఉదయం జరిగిన విష వాయువుల లీకేజీ ప్రమాదంలో ఇద్దరు కాంట్రాక్టు కార్మీకులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరు కోలుకోగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని పరవాడ సీఐ మల్లికార్జునరావు చెప్పారు. పరిశ్రమలో ప్రొడక్షన్ బ్లాక్–1లో తెల్లవారు జాము 3.30 గంటల సమయంలో రియాక్టర్లో పైకా బెండా జోన్ డ్రగ్ తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో పైపులైన్ నుంచి హైడ్రోజన్ సల్ఫేడ్ అనే విష వాయువు లీకైంది.
తెల్లవారు జామున విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే క్రమంలో ఒడిశాకు చెందిన దేవ్ బాగ్, ఉగ్రేష్ గౌడ్లు విష వాయువును పీల్చడంతో అస్వస్థతకు లోనయ్యారు. ఇతర కార్మికులు యాజమాన్యానికి సమాచారం అందించి, వెంటనే అంబులెన్స్లో గాజువాకలోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఒకరు కొలుకోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే పరవాడ తహసీల్దార్ అంబేడ్కర్ ఘటన స్థలానికి చేరుకుని వివరాలను ఉన్నతాధికారులకు నివేదించారు.