నవీముంబై, ఠాణే, గేట్ వే ఆఫ్ ఇండియా జల రవాణా మార్గానికి కేంద్ర జల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ఆమోద ముద్రవేశారు.
సాక్షి, ముంబై: నవీముంబై, ఠాణే, గేట్ వే ఆఫ్ ఇండియా జల రవాణా మార్గానికి కేంద్ర జల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ఆమోద ముద్రవేశారు. దీంతో ఈ ప్రాంత ప్రజలకు త్వరలో లాంచీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ముంబై-లోణావాలాలోని పవన్ జలాశయం వరకు సీ ప్లేన్ సేవలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పుడు నవీముంబై, ఠాణే-గేట్ వే ఆఫ్ ఇండియా 50 కి.మీ. దూరం గల జల రవాణా మార్గం అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చడానికి పోర్టు ట్రస్టు కీలక పాత్ర పోషించనుంది.
జల మార్గం వినియోగంలోకి వస్తే నవీముంబై-ముంబై, ఠాణే-ముంబై రహదారులపై ఏర్పడుతున్న ట్రాఫిక్ జాం సమస్య కొంతమేర పరిష్కారం కానుంది. నిత్యం రాకపోకలు సాగించే ఉద్యోగులకు, ఇతర పనుల నిమిత్తం వచ్చే వారికి వ్యయప్రయాసల నుంచి ఉపశమనం లభించనుంది. కొలాబా నుంచి ఏడు కార్పొరేషన్ల హద్దుల్లో ఉన్న సముద్ర ఖాడీ మీదుగా ఈ మార్గం వెళుతుంది. వసయి, భివండీ, ఉల్లాస్నగర్, కల్యాణ్, డోంబివలి, భయందర్, ఠాణే, నవీముంబై ప్రాంత ప్రజలకు ఈ లాంచీ సేవలు ఉపయోగపడనున్నాయి.