
చైనా యుద్ధ నౌక (ఫైల్ ఫొటో)
సాక్షి, న్యూఢిల్లీ : తమ దేశానికి చెందిన యుద్ధ నౌకలు మాల్దీవులకు సమీపంలో ఉన్నాయంటూ చైనా మీడియా వెల్లడించిన కథనాలను భారత్ కొట్టి పారేసింది. చైనాకు చెందిన ఒక్క యుద్ధనౌక కూడా మాల్దీవులకు సమీపంగా లేదని, చైనా మీడియా చెబుతున్న మాటలన్నీ కూడా ఒట్టి అబద్ధాలేనని భారత నేవీ స్పష్టం చేసింది. మాల్దీవుల్లో నెలకొన్న సంక్షోభాన్ని ఆసరాగా చేసుకొని హిందూ మహాసముద్రంపై చైనా తన ఆధిపత్యాన్ని పెంచుకునే ఉద్దేశంతో తన యుద్ధ నౌకలను మాల్దీవులకు పంపించినట్లు వార్తలు వచ్చాయి.
దీంతో అంతర్జాతీయ వార్తా సంస్థలు అప్రమత్తమయ్యాయి. అయితే, చైనా యుద్ధ నౌకల ఆగమన వార్తలపై ఆరా తీసిన భారత నావికా దళం అదంతా అబద్ధం అని కొట్టి పారేసింది. కాగా, మాల్దీవుల్లో సమస్య వచ్చిన ప్రతిసారి పరిష్కారం వంకతో భారత్ తన సైన్యాన్ని అక్కడికి పంపిస్తూ అడ్వాంటేజ్ తీసుకుంటుందని, మాల్దీవుల విషయంలో భారత్ సైన్య జోక్యం ఆపేయాలంటూ చైనా ఆరోపిస్తోంది. అయితే, భారత్ ఈ వ్యాఖ్యలను కొట్టిపారేసింది.