
న్యూఢిల్లీ : విమానంలో ఓ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురై తుది శ్వాస విడవడం విషాదాన్ని నింపింది. చెన్నై నుంచి కోల్కతా వెళ్లడానికి స్పైస్ జెట్ విమానంలో ప్రయాణిస్తుండగా అశోక్ కుమార్ అనే వ్యక్తి మృత్యువాత పడ్డాడు. 48 ఏళ్ల అశోక్ కుమార్ కోల్కతా వెళుతుండగా శ్వాస కోస బారిన పడి మరణించాడు.
వివరాల్లోకి వెళితే... అశోక్ కుమార్ శర్మ అనే వ్యక్తి కోల్కతా వెళ్లడానికి చెన్నైలో స్పైస్ జెట్ ఫ్లైట్ ఎస్జీ -623 బోయింగ్ విమానంలో బయలుదేరాడు. కాగా చెన్నై నుంచి బయలుదేరిన కాసేపటికే శ్వాస సమస్యతో బాధపడుతున్నట్లు శర్మ తెలపడంతో వెంటనే మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించి విమానాన్ని భువనేశ్వరకు మళ్లించినట్లు అధికారులు తెలిపారు.
భువనేశ్వర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన వెంటనే మెడికల్ రూమ్కు తీసుకెళ్లినట్లు విమానాశ్రయం డైరెక్టర్ ఎస్ సి హోటా పేర్కొన్నారు. అనంతరం పైలట్ సూచనతో అప్పటికే సిద్ధంగా ఉన్న అంబులెన్స్లో అక్కడి నుంచి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లామని తెలిపారు. వైద్యులు అశోక్శర్మను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. కాగా, పోస్టుమార్టం నిర్వహించేందుకు అశోక్ మృతదేహాన్ని క్యాపిటల్ ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment