
ఏనుగు కళేబరాన్ని నది ఒడ్డుకు తీసుకొస్తున్న సిబ్బంది
కొచ్చీ: మనుషుల్లోని క్రూరత్వానికి అద్దం పట్టే సంఘటన కేరళలో జరిగింది. టపాకాయల్లో ఉపయోగించే పేలుడు పదార్థాలు నింపిన పైనాపిల్ను తినిపించడంతో గర్భంతో ఉన్న ఓ ఏనుగు మృతి చెందింది. కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాలో సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్కులోని వెల్లియార్ నది వద్ద మే 27వ తేదీన జరిగిన ఈ దారుణం పట్ల తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గుర్తు తెలియని దుండగుడు ఇచ్చిన పైనాపిల్ ఏనుగు గొంతులో పేలిపోయింది.
అడవుల్లో ఏనుగులను వేటాడే ముఠా ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దారుణాన్ని మోహన్ కృష్ణన్ అనే అటవీ అధికారి వెలుగులోకి తీసుకొచ్చారు. గర్భిణి ఏనుగు మరణించిన తీరును, ఫొటోలను ఆయన తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేశారు. ఏనుగు తల నీటిలో కూరుకుపోయిందని పేర్కొన్నారు. మూగ జీవాన్ని రాక్షసంగా చంపేసిన దుండగుడిని గుర్తించి, అదుపులోకి తీసుకోవాలని కేరళ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ మొత్తం ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment