
సాక్షి, న్యూఢిల్లీ : రైతులపై మధ్యంతర బడ్జెట్ వరాల జల్లు కురిపించింది. పెట్టుబడి సాయంగా ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయల నగదు సాయం ప్రకటించింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరిట ప్రకటించిన ఈ పథకంలో భాగంగా చిన్న, సన్నకారు రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు వెళుతుందని చెప్పారు.
ఈ పథకం కోసం 76 వేల కోట్లు కేటాయించనున్నట్టు వెల్లడించారు. మూడు వాయిదాల్లో డబ్బు లబ్ధిదారులకు చేరుతుందన్నారు. తొలి విడతగా తక్షణమే రూ.2వేల ఆర్థిక సాయం రైతులకు అందజేస్తామని, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా ఈ నగదు నేరుగా రైతుల ఖాతాలోకి మళ్లిస్తామని గోయల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment