Union Budget 2019
-
ఎవరి రూటు వారిదే!!
రేపేదేశంలో ఆర్థిక సరళీకరణ మొదలైన తర్వాత కాలంతో పాటు బడ్జెట్ లక్ష్యాలు కూడా మారిపోతున్నాయి. 1990వ దశకం నుంచి ఇప్పటి వరకు చూస్తే అప్పటి ప్రభుత్వ ప్రాధమ్యాలు ఏ విధంగా ఉన్నాయనేది అర్థం చేసుకోవచ్చు. 1991 నుంచి బడ్జెట్లను గమనిస్తే.. 90వ దశకంలో ఆర్థిక సంస్కరణలకు పెద్ద పీట వేయగా, ఆ తర్వాత 2000 నుంచి 2010 మధ్య కాలంలో ద్రవ్య స్థిరీకరణకు ప్రాధాన్యమిచ్చారు. ఇక 2010 తర్వాత బడ్జెట్లు సామాజిక కార్యక్రమాలపై ఎక్కువగా ఖర్చు చేసేలా దృష్టిపెట్టాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వాలు పేదల సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టగా, ఎన్డీయే ప్రభుత్వాలు పన్నుల సంస్కరణలకు పెద్దపీట వేశాయి. మన్మోహన్... ఆర్థిక వ్యవస్థకు తలుపులు బార్లా! ♦ 1991– 92 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్సింగ్ వాణిజ్య విధాన సంస్కరణల్లో నూతన దిశను చూపించారు. పరిమాణ పరిమితుల నుంచి ధరల ఆధారిత యంత్రాంగానికి మారే దిశగా అడుగులు వేశారు. విధానాల పరంగా స్వేచ్ఛనివ్వడంతోపాటు, ప్రాధాన్య రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) 51 శాతానికి మన్మోహన్సింగ్ పెంచేశారు. వడ్డీ రేట్ల విధానాన్ని కూడా సరళతరం చేశారు. ఇదిగో... ఇప్పటి నుంచే బడ్జెట్లలో ఆర్థిక రంగ పాత్ర విస్తృతమవుతూ వచ్చింది. మ్యూచువల్ ఫండ్స్ అభివృద్ధికి ప్రోత్సాహం, ప్రైవేటు రంగానికి ద్వారాలు తెరవడం జరిగింది. చిదంబరం... సంస్థాగత నిర్మాణం ♦ 1997–98లో నాటి ఆర్థిక మంత్రి పి.చిదంబరం సంస్థాగత నిర్మాణం, నియంత్రణపరమైన కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. స్వేచ్ఛాయుత ఆర్థిక వ్యవస్థతో అనుసంధానమైన నియంత్రణపరమైన కార్యాచరణ ఏర్పాటే లక్ష్యంగా ముందుకెళ్లారు. పలితం... సంస్థాగతంగా మార్పుల్లేకుండా నియంత్రణలతో కూడిన ఆర్థిక వ్యవస్థ కాస్తా క్రమబద్ధీకరణ ఆర్థిక వ్యవస్థగా మారింది. విదేశీ మారక నిర్వహణ చట్టం, నూతన కంపెనీల బిల్లు, నూతన ప్రత్యక్ష పెట్టుబడుల బిల్లుకు చిదంబరం చోటిచ్చారు. సిన్హా... మౌలికానికి పెద్దపీట ♦ 1998–99లో ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన యశ్వంత్ సిన్హా స్వేచ్ఛగానే వ్యవహరించారు. పట్టణాలు, నగరాల్లోని మధ్య తరగతి ప్రజలే లక్ష్యంగా ఆయన చర్యలను చేపట్టారు. అనుమతులు పొందిన హౌసింగ్ ప్రాజెక్టులకు మొదటి ఐదేళ్లపాటు లాభాలపై నూరు శాతం పన్ను మినహాయింపు కల్పించారు. ఆ తర్వాత ఐదేళ్లకూ 30 శాతం రాయితీ కల్పించారు. ♦ 2001–02 బడ్జెట్లో యశ్వంత్సిన్హా ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ రెగ్యులేషన్స్ను ప్రవేశపెట్టారు. దీని వల్ల భాగస్వామ్య కంపెనీల మధ్య లావాదేవీలు పారదర్శకంగా నిర్వహించడం తప్పనిసరిగా మారింది. పన్ను ఎగవేతల నిరోధం విషయంలో ఈ నియంత్రణ ఎంతో ముఖ్య పాత్ర పోషించిందనే చెప్పుకోవాలి. ప్రణబ్ ముఖర్జీ... సంక్షేమ బాట ♦ ఇక 2005 నాటి బడ్జెట్లో (యూపీఏ–1లో) పి.చిదంబరం పేద ప్రజలే ఫోకస్గా ముందుకొచ్చారు. అంతక్రితం ఐదేళ్లలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే పాలన, భారత్ వెలిగిపోతోందంటూ వారు చేసుకున్న ప్రచారం బెడిసి కొట్టి ఓటమిపాలవడంతో, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ సర్కారు సామాన్యులపై దృష్టి పెట్టింది. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాలు అమల్లోకి వచ్చాయి. ఇక యూపీఏ–2లో చివర్లో ఆర్థిక మంత్రిగా పగ్గాలు చేపట్టిన ప్రణబ్ ముఖర్జీ కూడా సంక్షేమనానికే సై అన్నారు. అరుణ్ జైట్లీ... పన్ను సంస్కరణలకు సై ♦ 2014– 2018 మధ్యలో మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో అరుణ్ జైట్లీ కీలక సంస్కరణలతోపాటు ఇతర చర్యలూ చేపట్టారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు, డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియాకు నిధులు అందించారు. జీఎస్టీ సంస్కరణను తీసుకొచ్చారు. మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారం తగ్గించారు. 2015లో వెల్త్ ట్యాక్స్ను (సంపద పన్ను) రద్దు చేసి, రూ.కోటి ఆదాయం దాటిన వారిపై 2% అదనపు సర్చార్జ్ తీసుకొచ్చారు. 2017లో రూ.2.5–5 లక్షల మధ్య పన్ను వర్తించే ఆదాయం వారికి పన్ను రేటు 10% నుంచి 5%కి తగ్గించారు. దీంతో పన్ను చెల్లింపుదారులకు రూ.12,500 ఆదా అయింది. -
రైతులందరికీ పిఎం - కిసాన్ పథకం అమలు
-
ఆర్థిక సర్వే-2019 : చాలా ఉత్సాహంగా ఉంది
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ (47) ట్వీట్ చేశారు. ఎన్డీఏ సర్కారు రెండవ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వ మొట్టమొదటి ఆర్థిక సర్వే -2019ను ప్రవేశపెట్టనున్నామని మంగళవారం ట్వీట్ చేశారు కాగా కేంద్ర ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్కు కూడా తొలి మహిళా ఆర్థికమంత్రిగా కేంద్ర ప్రభుత్వ మొదటి పూర్తిస్థాయి బడ్జెట్ను జూన్ 5వ శుక్రవారం ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్కు ముందు ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయిదేళ్ల కనిష్టానికి పడిపోయిన జీడీపీ, 45 కనిష్టానికి పతనమైన నిరుద్యోగం లాంటి దేశీయ ఆర్థిక పరిస్థతులకు తోడు, అంతర్జాతీయ ఆర్ధిక అనిశ్చితి, ముదురు తున్న ట్రేడ్ వార్ అందోళన నడుము సీతారామన్ బడ్జెట్ కీలకంగా మారనుంది. అరవింద్ సుబ్రమణియన్ పదవీకాలం ముగిసిన దాదాపు ఆరు నెలల తరువాత, కృష్ణమూర్తి సుబ్రమణియన్ గత ఏడాది డిసెంబరులో ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమితులైన సంగతి తెలిసిందే. Looking forward with excitement to table my first - and the new Government's first - Economic Survey in Parliament on Thursday. #EcoSurvey2019 — K V Subramanian (@SubramanianKri) July 2, 2019 -
సొంతింటి కల నెరవేరేలా..
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈనెల 5న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్పై వివిధ వర్గాల ప్రజలు తమదైన అంచనాలు, ఆకాంక్షలు నెరవేరాలని కోరుతున్నారు. బడ్జెట్లో ఏయే వర్గాలకు ఊరట ఉంటుందనే అంశంపైనా పలు అంచనాలు వెల్లడవుతున్నాయి. హోం ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులపై ఆదాయ పన్ను నుంచి ఆర్థిక మంత్రి బడ్జెట్లో వెసులుబాటు ఇస్తారని భావిస్తున్నారు. సెక్షన్ 80డీని విస్తరించడం ద్వారా లేదా గృహ, ఆరోగ్య, జీవిత బీమా చెల్లింపులపై ప్రత్యేక సెక్షన్ ద్వారా రిబేట్ను వర్తింపచేస్తారని భావిస్తున్నారు. అందుబాటు గృహాలకు బీమా ప్రీమియం చెల్లింపులపై పన్ను రిబేటు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు గృహ బీమా రంగంలో మార్కెట్ వాటా కోసం శ్రమిస్తున్న ఐసీఐసీఐ లాంబార్డ్, న్యూ ఇండియా ఎష్యూరెన్స్, జీఐసీ ఆర్ఈ వంటి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకూ ప్రభుత్వ నిర్ణయం లాభించనుంది. కాగా గృహ బీమా పన్ను నుంచి ఊరట కల్పించాలని ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ప్రీ బడ్జెట్ భేటీల సందర్భంగా బీమా కంపెనీలు కోరాయని చెబుతున్నారు. -
వేతన జీవులకు ఊరట..?
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 5న ప్రవేశపెట్టబోయే బడ్జెట్పై వివిద వర్గాలు పలు అంచనాలతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితి ప్రస్తుత రూ 2.5 లక్షల నుంచి పెంచాలని కేపీఎంజీ ఇండియా నిర్వహించిన ప్రీ బడ్జెట్ సర్వేలో పాల్గొన్నవారిలో అత్యధికులు కోరారు. ఇక రూ 10 కోట్ల పైబడిన వార్షికాదాయం కలిగిన సంపన్నులపై 40 శాతం పన్ను రేటు విధించాలని కూడా పలువురు కోరారు. వివిధ పరిశ్రమలకు చెందిన 226 మందిని ప్రీ బడ్జెట్ సర్వేలో భాగంగా కేపీఎంజీ పలుకరించింది. ఇక వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ 2.5 లక్షల నుంచి పెంచాలని 74 శాతం మంది అభిప్రాయపడగా, రూ 10 కోట్ల పైబడిన ఆదాయం కలిగిన వారిపై 40 శాతం పన్ను రేటు వర్తింపచేయాలని 58 శాతం మంది కోరడం గమనార్హం. మరోవైపు ప్రభుత్వం వెల్త్ ట్యాక్స్ లేదా ఎస్టేట్ సుంకాన్ని తిరిగి ప్రవేశపెట్టవచ్చని 10 శాతం మంది అంచనా వేశారు. ఇక వారసత్వ పన్ను కూడా తిరగతోడతారని 13 శాతం మంది పేర్కొన్నారు. ఇక గృహరుణంపై వడ్డీకి పన్ను డిడక్షన్ను ప్రస్తుతం ఉన్న రూ 2 లక్షల నుంచి ప్రభుత్వం పెంచాలని సర్వేలో పాల్గొన్న వారిలో 65 శాతం మంది కోరారు. -
మాజీ ప్రధానితో నిర్మలా భేటీ
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మాజీ ప్రధాని మన్మోహన్సింగ్తో భేటీ అయ్యారు. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్మలా, మన్మోహన్తో సమావేశం కావడం ఇదే తొలిసారి. జూలై 5 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా.. ఈ నేపథ్యంలో గతంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన మన్మోహన్తో సమావేశమైనట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సమావేశంలో వీరు ఏ అంశాలు చర్చించారనేదానిపై సమాచారం లేదు. చాలా ఏళ్లపాటు రాజ్యసభ సభ్యునిగా కొనసాగిన మన్మోహన్.. తన పదవీ కాలం ముగియడంతో ఈ సమావేశాలకు దూరంగా ఉండనున్నారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన ఆర్థిక మంత్రిగా సేవలు అందించారు.1991లో కేంద్రం తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణల్లో మన్మోహన్ కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే. 1982 నుంచి 1985 మధ్యకాలంలో ఆర్బీఐ గవర్నర్గా విధులు నిర్వర్తించిన మన్మోహన్.. 1985 నుంచి 1987 వరకు ప్లానింగ్ కమిషన్కు డిప్యూటీ చైర్మన్గా కొనసాగారు. -
అందరమూ దానికోసమే వెదుకుతున్నాం..!
సాక్షి, ముంబై : 2019 కేంద్ర బడ్జెట్లో ఆటో పరిశ్రమ ఆశలు, అంచనాలపై పారిశ్రామికవేత్త మహింద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహింద్రా ఆనంద్ మహీంద్ర స్పందించారు. ఆటో మొబైల్స్పై వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) తగ్గించాలని కోరుకున్నారు. అది దేశ ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుందని అన్నారు. ఆటో పరిశ్రమ రంగం చిన్న కంపెనీలు, ఉపాధి కల్పనపై పెను ప్రభావం చూపుతుందని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే (అమృతాన్నిపంచే) మందర పర్వతం(క్షీరసాగర మథనంలోని పర్వతం) వైపు అందరం చూస్తున్నాం. తానూ పక్షపాతంగానే ఆలోచిస్తున్నప్పటికీ.. జీఎస్టీ తగ్గిస్తే.. ఉద్యోగాల కల్పన, చిన్న పరిశ్రమల వృద్ధిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. ముఖ్యంగా ఆటోకార్ ప్రొఫెషనల్ అనే ఆటోమోటివ్ మ్యాగజీన్ ట్వీట్కు ఆనంద్ మహీంద్ర స్పందించారు. దేశంలో భారీగా(మూడో వంతు) ఉద్యోగాలు సృష్టించే ఆటోమొబైల్ రంగం మళ్లీ వృద్ధి దిశగా పయనించాలంటే వాహనాలపై జీఎస్టీ తగ్గించాల్సిన అవసరం ఉందన్న ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు జాన్ కే పాల్ వ్యాఖ్యలను మ్యాగజైన్ ట్వీట్ చేసింది. అటు పరిశ్రమ బాడీ సియామ్ కూడా వాహనాలపై జీఎస్టీని 28శాతం నుంచి 18శాతానికి తగ్గించాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా 18 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఆటోమొబైల్ విక్రయాలు భారీగా పతనమయ్యాయి. మే నెలలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 20 శాతానికి పైగా క్షీణించాయి. అంతక్రితం 2001 సెప్టెంబరులో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 21.91శాతం పడిపోయాయి. What we’re all searching for is the ‘Mt. Mandara’ which can start the ‘Manthan’ of the economy & get it spinning faster. I’m biased, of course,but the auto industry is one such ‘Mandara.’ It has a huge multiplier effect on small companies & on employment. Lowering GST would help https://t.co/13SOajY3Lt — anand mahindra (@anandmahindra) June 26, 2019 -
బడ్జెట్లో తీపి కబురు ఉండేనా..?
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019-20 ఆర్ధిక సంవత్సరానికి జులై 5న ప్రవేశపెట్టబోయే బడ్జెట్ మోదీ సర్కార్ తదుపరి ఐదేళ్లకు రోడ్మ్యాప్లా ఉంటుందని భావిస్తున్నారు. నరేంద్ర మోదీ సారధ్యంలో బీజేపీ ప్రభుత్వానికి ఓటర్లు మరోసారి పట్టం కట్టిన నేపథ్యంలో బడ్జెట్లో ప్రజలకు ఊరట కల్పించే అంశాలు పొందుపరుస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిని ప్రస్తుత రూ 2.5 లక్షల నుంచి రూ 5 లక్షలకు పెంచుతారని అంచనాలున్నాయి. లోక్సభ ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్లో అప్పటి ఆర్థిక మంత్రి రూ 5 లక్షల వరకూ పూర్తిగా పన్ను రిబేటును ప్రకటించినా, ఆదాయ పన్ను శ్లాబ్ల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఆదాయ పన్ను మినహాయింపుకు వార్షికాదాయ పరిమితి రూ 2.5 లక్షల శ్లాబును అలాగే ఉంచారు. 2014 నుంచి ఈ శ్లాబులో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. రూ 2.5 లక్షల నుంచి రూ 5 లక్షల ఆదాయానికి పన్ను రేటును 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించినా రూ 5 లక్షల నుంచి రూ 10 లక్షల లోపు ఆదాయానికి పన్ను రేటును ఏకంగా 20 శాతంగా నిర్ధారించారు. ఇక తాజా బడ్జెట్లో పన్ను శ్లాబ్ల్లో హేతుబద్ధత పాటించడంతో పాటు వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ 2.5 లక్షల నుంచి రూ 3 లక్షలకు పెంచవచ్చని భావిస్తున్నారు. అయితే సెక్షన్ 87(ఏ) కింద రూ 5 లక్షల వరకూ వార్షికాదాయంపై పూర్తి పన్ను మినహాయింపును ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించడంతో కనీస వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిని రూ 2.5 లక్షల నుంచి పెంచకపోవచ్చని మరో అంచనా వెల్లడవుతోంది. తాజా బడ్జెట్లో బేసిక్ ఇన్కం ట్యాక్స్ పరిమితిని రూ 2.5 లక్షలు యథాతథంగా ఉంచితే వేతన జీవులు, పన్నుచెల్లింపుదారులకు తీవ్ర నిరాశ ఎదురవనుంది. -
నేడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బీజేపీ పార్లమెంటరీ బోర్డు మంగళవారం సమావేశం కానుంది. హోంమంత్రి అమిత్ షా సహా పార్టీకి చెందిన ఎంపీలందరూ ఈ సమావేశానికి హాజరు కావచ్చని భావిస్తున్నారు. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ భేటీ జరగనుండటం గమనార్హం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా జేపీ నడ్డా ఎన్నికైన అనంతరం పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఇదే తొలిసారి. పార్లమెంట్ లైబ్రరీ భవనంలో మంగళవారం ఉదయం సమావేశం ప్రారంభంకానుంది. జులై 5న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న క్రమంలో ఈ అంశంపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇక ట్రిపుల్ తలాక్ బిల్లు, పశ్చిమ బెంగాల్లో చెలరేగుతున్న ఎన్నికల అనంతర హింసాకాండ తదితర అంశాలపైనా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. -
రూ 1.20 లక్షల కోట్లతో అభివృద్ధికి రహ‘దారి’
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న బడ్జెట్లో తమకు రూ 1.20 లక్షల కోట్ల నిధులు కేటాయించాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కోరుతోంది. జులై 5న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో తమ మంత్రిత్వ శాఖకు అధిక నిధులు కోరుతూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను స్వయంగా కలిసి అభ్యర్ధించారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 1న పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో కేటాయింపుల కంటే రూ 37,000 కోట్లు అదనంగా రూ 1.20 లక్షల కోట్లు తమ శాఖకు కేటాయించాలని గడ్కరీ కోరుతున్నారు. జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు మౌలిక రంగ ప్రాజెక్టులను ప్రైవేట్ పెట్టుబడులతో నిమిత్తం లేకుండా సత్వరమే పూర్తిచేసేందుకు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ బడ్జెట్లో అధిక నిధులను కోరుతోందని ఆ మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు. భారత్ పది లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్ధగా ఎదగాలంటే మౌలిక వసతులను అత్యాధునికంగా నిర్మించాలని మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. -
బడుగుల్ని పక్కనబెట్టిన బడ్జెట్
నరేంద్ర మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో (1–2–2019) ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాజిక న్యాయానికి చాలా దూరంగా ఉంది. ఓట్ ఆన్ అకౌంట్గా పెట్టవలసిన బడ్జెట్ను 2019–20 బడ్జెట్గా పెట్టడం రాజ్యాంగ విరుద్ధం. పీయూష్ గోయల్ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్లో మొత్తం కేటాయింపులు 27.84 లక్షల కోట్లు. బడ్జెట్లోని కీలకాంశాలు ఇలా వున్నాయి. రైల్వేకు రూ. 64,587 కోట్లు, రక్షణ రంగంకు రూ.3,05,296 కోట్లు, పెన్షన్లు రూ.1,74,300 కోట్లు, ప్రధాన సబ్సిడీలకు రూ.2,96,684 కోట్లు, వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1,49,981 కోట్లు, వాణిజ్యం, పరిశ్రమలకు రూ.27,600 కోట్లు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి రూ.3,000 కోట్లు, విద్యకు రూ.93,848 కోట్లు, ఇంధన రంగంకు రూ.44,101 కోట్లు, విదేశీ వ్యవహారాలకు రూ.16,062 కోట్లు, ఆర్థికశాఖకు రూ.19,812 కోట్లు, ఆరోగ్య రంగంకు రూ.63,538 కోట్లు, హోంశాఖకు రూ.1,03,927 కోట్లు, ఐటి,టెలికాంకు రూ.21,549 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.1,38,962 కోట్లు, సాంఘిక సంక్షేమాంకు రూ. 49,337 కోట్లు, రవాణా వ్యవస్ధకు రూ.1,56,187 కోట్లు, పట్టణాభివృద్ధికి రూ.48,032 కోట్లు, ఇతర రంగాలకు రూ.75,822 కోట్లు. ఈ పద్దును పరిశీలిస్తే ఇందులో అణగారిన సామాజిక శ్రేణుల ప్రస్తావన లేకుండా బడ్జెట్ను ప్రవేశపెట్టారని స్పష్టంగా తెలుస్తోంది. నిజానికి ఏ బడ్జెట్లో అయినా దళితులు, ఆదివాసీలు, స్త్రీలు, ప్రధాన పాత్రలో ఉండాలి. అయితే మోదీ ప్రభుత్వానికి వీళ్ళు ముఖ్యులు కారు. వాళ్ల దృష్టిలో కూడా లేరు. రక్తలేమితో పిల్లల్ని కనలేక వేలాది ఆదివాసీ స్త్రీలు చనిపోతున్నారు. దోమతెరలు లేక లక్షలాది మంది గిరిజనులు చనిపోతున్నారు. వారి ప్రస్తావన మోదీ బడ్జెట్లో లేదు. ఓట్ల కోసం హిందువుల్ని రెచ్చగొట్టాలని గో సంపదను జన్యు పరంగా తీర్చిదిద్దాలని, రాష్ట్రీయ గోకుల్మిషన్ కోసం 750 కోట్లు పెంచారు. అంటే ఒక తల్లి బిడ్డను కనలేక రక్తలేమితో మరణిస్తుంటే ఆమె పౌష్టికాహారానికి ఇవ్వాల్సిన ధనాన్ని పక్కనబెట్టి గోరక్షణకు కేటాయింపులు చేశారు. మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖకు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో రూ.29 వేల కోట్లను కేటాయించింది. మొత్తం భారతదేశంలో వితంతువుల సంఖ్య ఎంత? లెక్కలున్నాయా. మీ మద్యపాన విధానాల వల్ల, రహదారుల విధానాల వల్ల ఎందరో త్వరగా మరణిస్తున్నారు. ఎంతో మంది వితంతువులుగా మిగిలిపోతున్నారు. వీరికి పునరావాస కేంద్రాలు ఏవి, వాటి నిర్మాణం ఏది? ప్రధానమంత్రి కిసాన్సమ్మాన్ నిధి పేరిట ఎకరాకు 6 వేలు ఇవ్వాలని మోదీ నిర్ణయించారు. కానీ దేశంలో 100కి 80% భూమిని కౌలు రైతులు సాగుచేస్తున్నారు. వారిలో ఎక్కువ మంది గిరిజనులు, దళితులు ఉన్నారు. మరి వారి సంగతి ఏమిటి. పోడు వ్యవసాయం చేసే గిరి జనులకు పట్టా పుస్తకాలు, పాసు పుస్తకాలు లేవు. భూయజమాన్య హక్కుల ఆధారంగా బ్యాంక్ రుణాలు తీసుకునే రైతులకు కేంద్రం నేరుగా ధనం బదిలీ అవుతుంది. ఇవి లేని దళిత, గిరిజన రైతుల పరిస్ధితి ఏమిటి? అంటే దళితులు రైతులు కాదా! సాగు చేస్తూ భూ హక్కులు లేనివారి సంఖ్య ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే 25 లక్షల పైనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 16 లక్షల మంది ఉన్నారు. ఇందులో పది లక్షల మంది దళితులే ఉన్నారు. కేసీఆర్ తెలంగాణలో దళితులను దెబ్బతీయాలని కేవలం రైతులకు నగదు బ్యాంకుల్లో వేశారు. చంద్రబాబు నీరు, చెట్టు పేరుతో దళితుల భూములు లాక్కుని సొంత కులాలకు ఇచ్చారు. ఇప్పుడు దళితుల భూములు లాక్కుంటున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కౌలు రౌతులు ముందస్తుగా రైతులకు ఎకరాకు 30 వేలు వడ్డీలకు తెచ్చి చెల్లిస్తున్నారు. తుఫాన్లు వస్తే నష్టాన్ని తామే భరిస్తున్నారు. దళితులు వ్యవసాయ కూలీల నుంచి కౌలు రైతులుగా మారే క్రమంలో వారిని అప్పుల్లో ముంచే ప్రయత్నం కేంద్రం రాష్ట్రాలు చేస్తున్నాయి. రైతుకు 6 వేల రూపాయలు మూడు విడతలుగా బ్యాంక్లో వేయడం కూడా జరుగుతోంది. ఇదీ రైతు కులాలకు అవమానమే. ప్రభుత్వాన్ని పోషించాల్సిన రైతును భిక్షగాళ్ళగా మార్చుతున్నారు. అడుక్కునే స్వభావాన్ని నేర్పుతున్నారు. బడ్జెట్ పద్దుల్లో ఏపీ విద్యా సంస్ధల పేర్లు ప్రత్యేకంగా చూపినప్పటికీ కేటాయిం పులు మాత్రం చేయలేదు. 2018–19లో కేటాయిం చిన రూ.49 కోట్లను మాత్రం అంచనాల సవరణ సమయానికి రూ.70.40 కోట్లకు పెంచారు. ఈ కేంద్ర బడ్జెట్ను చూస్తే తప్పకుండా కేంద్రప్రభుత్వం దళిత, మైనార్టీ, స్త్రీ ద్వేషి అని అర్థం అవుతుంది. ‘హిందూ’ సెంటిమెంట్ను రెచ్చగొట్టి ‘గోవు’ను కేంద్రం చేసి మళ్ళీ రాజ్యానికి రావాలని చూస్తున్నారు. ఈ సందర్భంగా లౌకికవాదుల, వామపక్షవాదుల, సామాజిక ఉద్యమకారుల, హేతువాదుల ఐక్యత రాజకీయంగా పటిష్టం కావాల్సిఉంది. వ్యాసకర్త: డా‘‘ కత్తి పద్మారావు, సామాజిక తత్వవేత్త, నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ‘ 98497 41695 -
పీఎం–కిసాన్ మొదటి విడతలో కోటి మందికి..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు లబ్ధి చేకూర్చే పీఎం–కిసాన్ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 24వ తేదీన ప్రారంభించనున్నారు. ప్రధాన్మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(పీఎం–కిసాన్)ను ప్రభుత్వం ఇటీవల 2019–20 మధ్యంతర బడ్జెట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని 24న ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. 5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6 వేలను మూడు విడతలుగా అందిం చడం కేంద్రం లక్ష్యం కాగా మొదటి విడతలో కోటి మందికి పైగా లబ్ధిదారులకు రూ.2 వేలు చొప్పున అందనున్నాయి. ఈనెల 24వ తేదీ వరకు పీఎం–కిసాన్ పోర్టల్లో నమోదైన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ డబ్బు జమ కానుంది. రెండో విడతలో రూ.2 వేలను ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల చేయనుంది. ఇప్పటికే 12 రాష్ట్రాల్లో 95 శాతం వివరాలు, 9 రాష్ట్రాల్లో 80 శాతం రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు కాగా మిగతా రాష్ట్రాలు కాస్తంత వెనుకబడి ఉన్నాయని అధికారు లు తెలిపారు. మొదటి విడత జాబితాలో తమ పేర్లు నమోదైందీ లేనిదీ చెక్ చేసుకోవాలని రైతులను కోరారు. -
వెనుకబాటుపై బడ్జెట్ పోటు
బీజేపీ ప్రభుత్వ బడ్జెట్ ఉపన్యాసాల్లో కనీసం ఎస్సీ, ఎస్టీ కార్యక్రమాల ప్రస్తావన లేకుండా పోతోంది. ప్రతి సంవత్సరం ప్రకటించే ఎకనామిక్ సర్వే నివేదికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధి పట్ల ఒక అంచనా, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఉండేది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది పూర్తిగా తొలగించారు. వీటన్నింటికీ పరాకాష్టగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అగ్రకులాల పేదలను ఆదుకునే పేరుతో తీసుకొచ్చిన పదిశాతం రిజర్వేషన్లు. ఇది కేవలం దళిత, ఆదివాసీ, వెనుకబడిన కులాల వ్యతిరేక బడ్జెట్ అని చెప్పడానికి ఎటువంటి సంకోచం అవసరం లేదు. ‘‘సామాజిక న్యాయం, సామాజిక సామరస్య సూత్రాల ఆధారంగా సమాజంలోని అంతరాలను తొలగించడానికి బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. ఆర్థిక న్యాయం, రాజకీయ సాధికారతతో కూడిన సామాజిక న్యాయం మరింత శక్తివంతమయ్యేందుకు, అస్థిత్వ రాజకీ యాలు, తాత్కాలిక ఉపశమనాలకు బదులుగా సమాజంలోని అణగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీల సమగ్రాభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరిస్తుంది. విద్య, వైద్యం, ఉపాధి విషయాల్లో సమానావకాశాలను అందించడానికి సమతుల్యతను పాటిస్తాం’’ అని భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికల ప్రణాళికలో ఆర్భాటంగాప్రకటించుకుంది. అయితే ఆచరణలో ఐదేళ్ళ మోదీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు దీనికి పూర్తి భిన్నంగా ఉన్నదన్నది అక్షర సత్యం. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం బీజేపీ ప్రభుత్వ ఆలోచనలో సైతం లేదన్న వాస్తవాన్ని బలోపేతం చేస్తోంది. గత ఐదేళ్ళుగా ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కుల సంగతి అటుంచితే కనీసం వాళ్ళని మనుషులుగా చూడనిపరిస్థితికి అద్దం పడుతోంది. ఐదేళ్ళ బీజేపీ పాలన దేశంలోని దళితుల, ఆదివాసీల బతుకులను శతాబ్దాల అగాధాల్లోకి నెట్టివేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమంలో కేంద్ర ప్రభుత్వం విద్యాభివృద్ధి మీద దృష్టిపెడుతున్నది. అందుకోసం విశ్వవిద్యాలయాల్లో పరిశోధన సాగించే వారి కోసం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజీవ్ గాంధీ ఫెలోషిప్స్ ప్రారంభించింది. ఆ పథకం ఎంతో మంది అణగారిన వర్గాల వారిని పరిశోధన వైపు తీసుకురాగలిగింది. కానీ బీజీపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆ పథకాన్ని పూర్తిగా నీరుగార్చే ప్రయత్నం చేసింది. బడ్జెట్లో కేటాయింపులే దానికి ప్రత్యక్షనిదర్శనం. బీసీ విద్యార్థుల కోసం ప్రకటించిన జాతీయ స్కాలర్షిప్లు 2012–2013 సంవత్సరంలో 45 కోట్లు ఖర్చు చేస్తే, 2019–20 సంవత్సరానికి 30 కోట్లు కేటాయించడం శోచనీయం. ఇందులో దాగి ఉన్న మరో మోసం ఏమిటంటే, 2018–19 సంవ త్సరం బడ్జెట్లో 110 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. కానీ బడ్జెట్ సవరణలలో అది 30 కోట్లకు కుదించారు. ఇలాంటి నిర్లక్ష్యం కారణంగానే కొన్ని వేల మంది విద్యార్థులు నష్టపోయారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్సీ విద్యార్థులు అధికంగా ఆధారపడే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు చాలా ఘోరంగా కోతకు గురయ్యాయి. 2017–18లో 3414 కోట్లు కేటాయిస్తే, 2019–20 సంవత్సరానికి అది 2926 కోట్లకు పడిపోయింది. ఎస్సీల కోసం ముఖ్యమైన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్ కోసం గత రెండేళ్ళుగా కేటాయింపులు లేనేలేవు. ఇక రాష్ట్రాలలో ఆదివాసుల కోసం అమలు చేసే స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ గత రెండేళ్లుగా 1350 కోట్లుగా నిలకడగా కొనసాగుతున్నది. బడ్జెట్ మాత్రం లక్షల కోట్లకు పెరిగిపోతున్నా వీరి అభివృద్ధి కోసం కేటాయిం చాల్సిన నిధులు మాత్రం అంతకంతకూ కనుమరుగైపోతున్నాయి. ఆది వాసీ విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి కేటాయించే నిధు లను చూస్తే ప్రభుత్వ చేతలకీ, మాటలకీ పొంతన లేని విషయం తేటతెల్లం అవుతుంది. 2017– 18లో కోటి రూపాయలు, 2019–20లో రెండు కోట్లు కేటాయించారు. అదేవిధంగా బీసీ విద్యార్థులు విదేశాలకు వెళ్ళే స్కాలర్ షిప్ల మొత్తం గణనీయంగా తగ్గించేశారు. 2017–18లో 19 కోట్ల 87 లక్షలుంటే, అది 2018–19, 2019–20లలో 10 కోట్లకు కుదించారు. ఇవి బీజేపీ విధానాల డొల్లతనాన్ని బయటపెట్టే మచ్చుకి కొన్ని ఉదాహరణలు మాత్రమే. కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించుకున్న కార్యక్రమం స్వచ్ఛ భారత్. ఈ అక్టోబర్ 2తో ఇది పరిసమాప్తం కాబోతున్నది. స్వచ్ఛభారత్లో చెరగని మచ్చ మాన్యువల్ స్కావెంజింగ్. మలమూత్రాలను చేతులతో ఎత్తివేసే అమానవీయ చర్యను నిర్మూలించే ఉద్దేశంతో 15 ఏళ్ళ క్రితమే ఒక చట్టం వచ్చింది. కానీ ఆ చట్టం సమర్థవం తంగా అమలు జరిగిన దాఖలాలు లేవు. ఇప్పటికీ ఈ దారుణమైన పనిలో 58 వేల మంది ఉన్నట్టు ప్రభుత్వమే ప్రకటించింది. కానీ ఈ లెక్కలు కాకి లెక్కలన్న విషయాన్ని సఫాయికర్మచారీ ఆందోళన్ నాయకుడు, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్ సాక్ష్యాధారాలతో సహా వివరిస్తున్నారు. మాన్యువల్ స్కావెంజర్స్ సంఖ్య ఒక లక్షకుపైనే ఉంటుం దని బెజవాడ విల్సన్ ప్రకటించారు. అయితే ఈ అత్యంత అమానవీయ పనిలో శతాబ్దాల తరబడి మునిగితేలుతున్న దళితులకు పునరావాసం కల్పించి, వారిని ఆ వృత్తి నుంచి దూరంగా తీసుకురావాలని చట్టం నిర్దేశిస్తున్నది. ప్రతి కార్మికుడికీ ఒకేసారి 40 వేల రూపాయలు ఇచ్చి ఆ పనిని మాన్పించేందుకు సహకరించాలని ప్రభుత్వాలే నిర్ణయించాయి. అయితే ఈ సంవత్సరాంతంలోగా వీరికి పునరావాసం కల్పించాలి. అందుకు ప్రభుత్వ లెక్కల ప్రకారమే 232 కోట్లు అవసరమవుతాయి. సఫాయికర్మచారీ ఆందోళన్ అంచనాను తీసుకుంటే 480 కోట్లు ఖర్చవుతాయి. కానీ, కేంద్రం దీనికి కేవలం 30 కోట్లు మాత్రమే కేటాయించడం చూస్తే ప్రభుత్వ ద్వంద్వ వైఖరి స్పష్టమౌతుంది. 2017–18లో ఈ కార్యక్రమానికి కేటాయింపులే లేకపోవడం మరో విచిత్రమైన విషయం. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకున్న నిర్ణయాల్లో ప్రణాళికా సంఘం రద్దు ఒకటి. దీనివల్ల బడ్జెట్లో మార్పులు జరిగాయి. ప్రణాళిక, ప్రణాళికేతర బడ్జెట్ అనే విధానానికే స్వస్తి పలి కారు. దీంతో ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధికోసం రూపొందించిన సబ్ప్లాన్ విధానం ప్రమాదంలో పడిపోయింది. అయితే కేంద్రంలో మాత్రం ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు ఏవో లెక్కలు చూపిస్తున్నారు. సెంటర్ ఫర్ బడ్జెట్, గవర్నెన్స్ అకౌంటబిలిటీ సంస్థ అధ్యయనం ప్రకారం, ఈ పథకం కేవలం నామమాత్రంగానే కొనసాగుతున్నదని తేలిపోయింది. 1974 నుంచి ట్రైబల్ సబ్ ప్లాన్, 1979–80 నుంచి స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ అమలులో ఉంది, 2006 నుంచి స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ను షెడ్యూల్డ్ కులాల సబ్ప్లాన్గా మార్చారు. ప్రభుత్వాలు అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో ఎస్సీ, ఎస్టీల జనాభా దామాషా ప్రకారం వారికి బడ్జెట్లో నిధులు కేటాయించాలనేది సబ్ప్లాన్ సారాంశం. ఎస్సీ, ఎస్టీల వాడలు, పల్లెలు, గూడేలు, తండాలు అభి వృద్ధితో పాటు, వ్యక్తిగత అభివృద్ధి కూడా దీని ఉద్దేశం. కానీ కనీసం కాగితాలవరకైనా జనాభా దామాషా ప్రకారం నిధుల కేటాయింపులే లేవు. ఎస్సీల సబ్ప్లాన్ 16 శాతం కేటాయించాల్సి ఉండగా, 2017–18లో 8.4 శాతం, 2018–19లో 8.8 శాతం, 2019–20లో 9.3 శాతం మాత్రమే కేటాయించారు. ఇవి ఏవీ కూడా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అమలు చేయవు. రక్షణ రంగం, శాస్త్రసాంకేతిక రంగాలు, పరిశోధనా విభాగాలు, ఇంకా ఇతర రంగాలు ఏవీ కూడా ఎస్సీల అభివృద్ధికి ప్రత్యక్షంగా, పరోక్షంగా గానీ ఉపయోగపడవు. ట్రైబల్ సబ్ప్లాన్ ప్రకారం ఆదివాసులకు 8.6 శాతం కేటాయించాల్సి ఉండగా 2017–18లో 5.6 శాతం, 2018–19లో 5.8 శాతం, 2019–20లో 6.1 శాతం కేటాయింపులు చూపించి చేతులు దులుపుకున్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికోసం గత ప్రభుత్వాలు అనుసరించిన విధా నాలను ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్న దాఖలాలు లేవు. అంతే కాకుండా ఎస్సీ, ఎస్టీల పట్ల ముఖ్యంగా ఎస్సీల పట్ల ఈ ప్రభుత్వం ఒకరకంగా శతృవైఖరినే అవలంబిస్తూ వస్తున్నది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల బలిదానం నుంచి మొదలుకొని, ఆవు మాంసం తిన్నారనే పేరుతోనో మరో కారణంతోనో దళితుల మీద జరిగిన హత్యాకాండను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రోత్సహిస్తూండటం ప్రజలకు తెలియంది కాదు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ఆ పార్టీ అనుసరిస్తోన్న రాజకీయవిధానం ఇందుకు నిదర్శనం. రాజ్యాంగం అందించిన హక్కుల ద్వారా చదువుకొని, విద్యావంతులవుతున్న దళితుల పట్ల హిందూ సమాజంలోని కులాలకు సహజంగానే కంటగింపుగా ఉంటుంది. రిజర్వేషన్ల వల్ల తమ పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదనే కోపం కూడా ఉంది. దీనిని ఉపయోగించుకొని బీసీలతో సహా హిందూ సమాజంలోని కులాలన్నింటినీ ఏకం చేయడం కోసమే ప్రభుత్వం దళితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఉత్తరప్రదేశ్లో జరిగిన గత ఎన్నికల్లో ఇది ప్రస్ఫుటంగా కనిపించింది. దానికి ముస్లింల పట్ల ఉన్న వ్యతిరేకతను కూడా ప్రభుత్వం దీనికి జతచేస్తున్నది. దళితులు, ముస్లింలమీద గోసంరక్షణ పేరుతో జరిగిన దాడులు దీనికి నిదర్శనం. ఈ దృక్పథమే బడ్జెట్ కేటాయింపులు, అభివృద్ధి కార్యక్రమాల అమలు మీద ప్రభావం చూపుతున్నది. అందువల్లనే బీజేపీ ప్రభుత్వ బడ్జెట్ ఉపన్యాసాల్లో కనీసం ఎస్సీ, ఎస్టీ కార్యక్రమాల ప్రస్తావనలేకుండా పోతోంది. ప్రతి సంవత్సరం ప్రకటించే ఎకనామిక్ సర్వే నివేదికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధి పట్ల ఒక అంచనా, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఉండేది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది పూర్తిగా తొలగించారు. వీటన్నింటికీ పరాకాష్టగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అగ్రకులాల పేదలను ఆదుకునే పేరుతో తీసుకొచ్చిన పదిశాతం రిజర్వేషన్లు. ప్రభుత్వాల దగ్గర నిధులు లేకకాదు. వాళ్ళు అనుకుంటే వేల కోట్లను రాత్రికి రాత్రే తమ కులాల వాళ్ళకు పంపిణీ చేయగలరు. అది వ్యవసాయ రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు. చివరకు బాగా ముడుపులు అందే రక్షణ రంగం కావచ్చు. కానీ దళిత, ఆదివాసీల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని ఈ బడ్జెట్ చాలా స్పష్టంగా బయటపెట్టింది. ఇది కేవలం దళిత, ఆదివాసీ, వెనుకబడిన కులాల వ్యతిరేక బడ్జెట్ అని చెప్పడానికి ఎటువంటి సంకోచం అవసరం లేదు. వ్యాసకర్త : మల్లెపల్లి లక్ష్మయ్య , సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
మితిమీరిన లోటుతో బడ్జెట్కు చేటు
అంచనాలలో లెక్కలు తప్పితే మొదటికే మోసం వస్తుంది. ఈ బడ్జెట్లో కొన్ని ప్రజారంజకమైన నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి నాలుగేళ్లు చిత్తశుద్ధితో చేసిన కొన్ని కార్యక్రమాలు వెసులుబాటు కల్పించాయి. రాష్ట్ర బడ్జెట్లో ఆదాయాన్ని ఏకంగా 15శాతం పెంచి 19–20 సంవత్సరానికి రెండు లక్షల 25 వేల కోట్లుగా చూపెట్టారు. ఈ స్థాయిలో అమాంతంగా వనరులు ఎట్లా పెరుగుతాయో అర్థం కావటం లేదు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు ఏకంగా ఒక సంవత్సరంలో 10 వేల కోట్లు పెరుగుతున్నట్లుగా చూపెట్టారు. అమలుచేయలేని, చేయాలన్న ఉద్దేశం లేని అనేక కార్యక్రమాలను ప్రకటించడం కేవలం బడ్జెట్ను అపహాస్యం చేయడమే అవుతుంది. కేంద్రంలో ఒక బడ్జెట్టు, రాష్ట్రంలో ఒక బడ్జెట్టు ప్రవేశపెట్టారు. ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి రెండు బడ్జెట్లలో ప్రజాకర్షణ పథకాలను, వరాలను పొందుపరిచారు. ఎవరు తాయిలాలు ఇవ్వాలన్నా దానికి తగ్గ వనరులు ఉండాలి. బడ్జెట్ అంటేనే భవిష్యత్తులోని ఆదాయ వ్యయ అంచనా. ఈ అంచనాలలో లెక్కలు తప్పితే మొదటికే మోసం వస్తుంది. ఈ రెండు బడ్జెట్లు ఎలా ఉన్నాయనే అంశాన్ని పరిశీలించే ముందు రెండు, మూడు సాంకేతికమైన విషయాల మీద మౌలికమైన పరిజ్ఞానం అవసరం. ప్రతి బడ్జెట్లో రెవెన్యూ విభాగం, మూలధన విభాగం ఉంటాయి. సాలుసరి పన్నుల రూపంలో ఇతరత్రా వచ్చే ఆదాయాలు రెవెన్యూ ఆదాయంగా చూపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా జీతాలు, పెన్షన్లు లాంటి సాలుసరి ఖర్చులను రెవెన్యూ ఖర్చులుగా చూపెట్టడం జరుగుతుంది. ఈ విభాగంలో ఖర్చుకన్నా ఆదాయం ఎక్కువగా ఉంటే దానిని రెవెన్యూ మిగులు అంటారు. అది చాలా శుభకరమైన పరిణామం. అదే ఖర్చు ఆదాయం కన్నా ఎక్కువగా ఉంటే రెవెన్యూ లోటు అంటారు. ఇది మంచి పరిణామం కాదు. ఎంత ఎక్కువ ఉంటే అంత ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతుంది. ఇక మూలధన పట్టికలో వచ్చే నిధులు అప్పుల రూపంలో ఉంటాయి. ఖర్చు ప్రాజెక్టుల మీద ఆదాయాన్నిచ్చే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే స్థిరాస్తుల మీద ఉంటుంది. తీసుకున్న మొత్తం అప్పులను ద్రవ్యలోటు అంటారు. ఈ తీసుకున్న అప్పులో కొంత భాగం రెవెన్యూ లోటును భర్తీ చేయడానికి ఉపయోగిస్తే అంతవరకు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టడానికి ఉండే నిధులు తక్కువవుతాయి. ఏ దేశంలో రెవెన్యూ లోటు సున్నా ఉండి మొత్తం అప్పులు ప్రాజెక్ట్స్ మీద ఖర్చు పెడతారో ఆ ఆర్థిక వ్యవస్థ సమర్థవంతంగా బలోపేతంగా ఉంటుంది. ఇంకొక చిన్న అంశం ప్రాథమిక లోటు. తెచ్చే అప్పులు కనీసం పాత వడ్డీలను కట్టడానికైనా ఉపయోగపడితే ప్రాథమిక లోటు ఉండదు. అప్పుడు భవిష్యత్తులో మరింత అప్పుల భారం వచ్చే అవకాశం ఉండదు. కానీ ప్రాథమిక లోటు ఉండి తెచ్చిన అప్పులు కట్టే వడ్డీల కన్నా ఎక్కువగా ఉంటే భవిష్యత్తులో అప్పుల భారం పెరుగుతున్నట్టు అర్థం. ఇది మంచి పరిణామం కాదు. విచ్చలవిడి బడ్జెట్తో మొదటికే మోసం ప్రజాస్వామ్యంలో ప్రజలదే రాజ్యం. బడ్జెట్లు ప్రజారంజకంగాను, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగానూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ప్రజారంజకం పేరుతో పైన పేర్కొన్న సూచికలను పూర్తిగా విస్మరించి విచ్చలవిడిగా బడ్జెట్ రూపొందిస్తే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అందుకనే బడ్జెట్లు ఎప్పుడూ వాస్తవికతకు దగ్గ రగా ఉండాలి. ఇక దర్శనీయంగా పెట్టుబడులను, అభివృద్ధిని ఇబ్బడిముబ్బడిగా ప్రోత్సహించే విధంగా ఉండాలి. ఈ ప్రామాణికాలను ఆధా రంగా చేసుకొని కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లు పరిశీలిద్దాం. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మూడు ప్రధానమైన ప్రజారంజక కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. చిన్న, సన్నకారు రైతులకు ప్రత్యక్ష నగదు బదిలీ విధానం ద్వారా దేశమంతటా రైతుల ఖాతాల్లో ఆరువేల రూపాయలు జమ చేసే విధంగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. అదేవిధంగా అసంఘటిత కార్మికులకు మూడు వేల రూపాయల పెన్షన్ వచ్చే విధంగా మరొక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఐదు లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్న వారు ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా మార్పు తీసుకొని వచ్చింది. ఇంకా ఎన్నో ఇతర కార్యక్రమాలు ఉన్నా బడ్జెట్లో బాగా ప్రాధాన్యత సంతరించుకున్న పథకాలు ఈ మూడు. మరి ఇవి ఆచరణ సాధ్యమేనా! బడ్జెట్లోని గణాంకాలు చూస్తే వాస్తవికతకు దగ్గరగా ఆచరణ సాధ్యంగా ఈ మూడింటినీ ప్రవేశపెట్టారని అర్థం అవుతుంది. ఆదాయపు అంచనాలను చాలా వాస్తవికంగా రూపొందిం చారు. జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయంలో పెరుగుదలను 2%గానే తీసు కున్నారు. 17–18, 18–19 సంవత్సరాల మధ్య వచ్చిన రాబడిలో పెరుగుదల 20% ఉంటే 19–20 ఏడాది రాబడిలో పెరుగుదల 14% గానే తీసుకున్నారు. కాబట్టి ఈ ఆదాయాలు రావటంలో ఎటువంటి సమస్యా ఉండకపోవచ్చు. ద్రవ్యలోటు జాతీయాదాయంలో 3.4%గా అంచనా వేశారు. మూడు శాతం కన్నా తక్కువ ఉంటే మంచి పరిణామంగా భావించాల్సి ఉన్న ద్రవ్యలోటు నిర్వహణ పరిమితులలోనే ఉన్నది (ఝ్చn్చజ్ఛ్చb ్ఛ జీఝజ్టీట). రెవెన్యూ లోటు కూడా 1.3% దగ్గర ఉంది. ఇది పూర్తిగా లేకపోయినా ద్రవ్య మిగులు ఉన్నా చాలా మంచి పరిణామం. కానీ 1.3% ప్రమాదకరమైన సంకేతమైతే కాదు. ఏడు లక్షల కోట్లకు ప్రాథమిక లోటు చాలా తక్కువగా 38 వేల కోట్లు ఉన్నది. ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే తీసుకున్న అప్పులలో ఎక్కువ శాతం వడ్డీలు చెల్లించడానికి పోతున్నది కాబట్టి అదనంగా అప్పుల భారం పడే అవకాశం చాలా తక్కువ. వాస్తవికతకు దగ్గరగా కేంద్ర బడ్జెట్ ఈ బడ్జెట్లో కొన్ని ప్రజారంజకమైన నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి గత నాలుగు సంవత్సరాలు చిత్తశుద్ధితో చేసిన కొన్ని కార్య క్రమాలు వెసులుబాటు కల్పించాయి. ఎన్నాళ్ల నుంచో తెగకుండా సాగు తున్న జీఎస్టీని ఒక కొలిక్కి తెచ్చి ప్రవేశపెట్టడంతో దేశమంతటా ఒకే మార్కెట్ ఏర్పడింది. దీని వల్ల వచ్చే ఆదాయాలు కూడా పెరిగాయి. ఆర్థిక మంత్రి చెప్పినట్టు జీఎస్టీ ప్రవేశ పెట్టిన కొత్తలో నెలకు 89,700 కోట్లు ఉన్న ఆదాయం 97 వేల కోట్లకు పెరిగింది. నోట్ల రద్దుతో అదనంగా చాలామంది ఆదాయపన్ను మదింపుకి వచ్చారు. నిరర్థక ఆస్తులను రాబట్టడంలో ఇన్సాల్వెన్సీ చట్టం చాలా ఉపయోగపడింది. ఇప్పటికే మూడు లక్షల కోట్ల దాకా మొండి బకాయిలు వసూలు అయినట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. దీనితో బ్యాంకింగ్ రంగానికి బడ్జెట్ ద్వారా సహాయం చేయాల్సిన అవసరం తగ్గింది. ఈ మంచి పరిణామాలను ఉపయోగించుకొని కొన్ని వర్గాల ప్రజలకు రాయితీలను ప్రకటిస్తూ వాస్తవికతకు దగ్గరగా ఆచరణకు ఏ విధమైన ఇబ్బంది ఉండని బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను పరిశీలిద్దాం. 2017– 18లో రాష్ట్రానికి వచ్చిన మొత్తం ఆదాయం ఒక లక్షా 91 వేల కోట్లు. 18–19కి ఈ ఆదాయం ఇదే స్థాయిలో ఉంటుందని అంచనా వేసినా, సంవత్సరాంతానికి రెండు శాతం పెరిగి లక్షా 95 వేల కోట్లు అయింది. ఈ ఆదాయాన్ని ఏకంగా 15 శాతం పెంచి 19–20 సంవత్సరానికి రెండు లక్షల 25 వేల కోట్లుగా చూపెట్టారు. ఇంత స్థాయిలో అమాంతంగా వనరులు ఎట్లా పెరుగుతాయో అర్థం కావటం లేదు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు ఏకంగా ఒక సంవత్సరంలో 10 వేల కోట్లు పెరుగుతున్నట్లుగా చూపెట్టారు. కేంద్రం పన్నులలో రాష్ట్రాల వాటా 14వ ఆర్థిక సంఘం పెంచిన తర్వాత కేంద్రం గ్రాంట్లను తగ్గించింది. అటువంటి పరిస్థితుల్లో పదివేల కోట్లు అమాంతంగా అదనంగా వస్తాయని చూపెట్టి అమలుచేయలేని, చేయాలన్న ఉద్దేశం లేని అనేక కార్యక్రమాలను ప్రకటించడం కేవలం బడ్జెట్ను అపహాస్యం చేయడమే అవుతుంది. అదేవిధంగా సొంత పన్నుల రాబడిలో కూడా పొంతన లేని పెరుగుదలను చూపెట్టుకు న్నారు. జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత ఒక మద్యం, పెట్రోల్ మీద తప్పితే మిగిలిన వాటిపై అమ్మకం పన్ను పెంచే అధికారం రాష్ట్రాలకు లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇంత అనూహ్యంగా రాబడి ఎక్కడి నుంచి వస్తుందని అంచనా వేశారో అర్థం కాకుండా ఉంది. ఇక అప్పుల విష యానికొస్తే 2017–18 సంవత్సరంలో రికార్డు స్థాయిలో 86 వేల కోట్ల అప్పు, 2018–19 సంవత్సరంలో 39 వేల కోట్ల రూపాయల అప్పు చేయడం జరిగింది. దీనికి అదనంగా ఈ సంవత్సరం 17 శాతం వృద్ధితో 47 వేల కోట్ల రూపాయల అప్పులకు ప్రతిపాదించారు. రెవెన్యూ లోటు రెండు వేల కోట్ల రూపాయలుగా చూపెట్టినా అంచనా వేసిన రాబడి వాస్తవ విరుద్ధంగా ఉంది కాబట్టి ఇది చాలా పెరిగే అవకాశం ఉంది. 32 వేల కోట్లుగా అంచనా వేసిన ద్రవ్యలోటు కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి దారుణం అన్నిటికీ మించి ప్రాథమిక లోటు 14, 570 కోట్లు. అంటే మనం తీసుకునే అప్పు వడ్డీలు కట్టగా కూడా ఇంకా 14,570 కోట్లు అప్పు ఉండి భవిష్యత్తులో ఇంకా రుణ భారం, వడ్డీ భారం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను క్రుంగ తీయబోతున్నాయి. 27 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న కేంద్ర బడ్జెట్లో ప్రాథమిక లోటు 39 వేల కోట్లు ఉంటే రెండు లక్షల 25 వేల కోట్ల బడ్జెట్ ఉన్న మన రాష్ట్రానికి ప్రాథమిక లోటు 14,570 కోట్లు ఉందంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజారంజకంగా బడ్జెట్ను తయారు చేసుకోవడంలో ఎటువంటి తప్పులేదు. ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించటానికి ఎటువంటి విధి విధానాలు అవలంబిస్తే బాగుంటుందో ఆర్థిక శాస్త్రవేత్తలు కొన్ని సూచికలు స్థిరీకరించారు. వాటికి కొంత అటూఇటుగా కొన్ని సంవత్సరాలు బడ్జెట్ను రూపొందించి అమలు చేసే అవకాశం ఉంటుంది. అది ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి హాని చేయదు. కానీ ఆ సూచికలను పూర్తిగా ఉల్లంఘిస్తూ ఆచరణ సాధ్యం కాని వనరులు లేని ఖర్చు మాత్రమే చూపెడుతూ తయారుచేసిన బడ్జెట్ కేవలం భ్రమల భ్రాంతుల బడ్జెట్గా మిగిలిపోతుంది. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు కదా. ఎవరి చేతి లోనూ మంత్ర దండాలు లేవు కదా. వ్యాసకర్త : ఐవైఆర్ కృష్ణారావు, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఈ–మెయిల్ : iyrk45@gmail.com -
వెల్కమ్ బ్యాక్ సర్ : ఎంపీ కవిత
సాక్షి, న్యూఢిల్లీ : క్యాన్సర్ చికిత్స నిమిత్తం న్యూయార్క్ వెళ్లిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ భారత్కు తిరిగి వచ్చారు. ఈ మేరకు ‘ఇంటికి తిరిగి రావడం సంతోషంగా ఉంది’ అని శనివారం ఆయన ట్వీట్ చేశారు. తొడ భాగంలో అరుదైన క్యాన్సర్ సోకడంతో గత నెల 13న వైద్య పరీక్షల కోసం జైట్లీ అమెరికా వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్నప్పటికీ సోషల్ మీడియాలో చురుగ్గానే ఉంటున్నారు. కాగా ఆయన స్థానంలో తాత్కాలిక ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన పీయూష్ గోయల్.. గత శుక్రవారం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా జైట్లీ అనారోగ్యం పాలవడం ఇదే మొదటిసారి కాదు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జైట్లీ బరువు తగ్గేందుకు బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు. అంతేకాదు గతేడాది మే 14న ఢిల్లీలోని ఎయిమ్స్లో జైట్లీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. ఇక జైట్లీ కోలుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘ వెల్కమ్ బ్యాక్ సర్!! మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి’ అని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్విటర్ వేదికగా ఆకాంక్షించారు. Welcome back sir !! Wish you good health !!! https://t.co/ow0jSPRZmU — Kavitha Kalvakuntla (@RaoKavitha) February 9, 2019 -
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి వీరు అనర్హులు!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో ప్రకటించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం–కిసాన్) విధి విధానాలను కేంద్రం ప్రకటించింది. ఐదెకరాల్లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులకు రూ.6వేలు సాయంగా అందించేందుకు ఉద్దేశించిన పీఎం–కిసాన్ తాజా మార్గదర్శకాల ప్రకారం.. ఆదాయ పన్ను చెల్లింపుదారులు, పని చేస్తున్న/రిటైరైన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రస్తుత/మాజీ.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మునిసిపల్ మేయర్లు, జిల్లా పంచాయతీ అధ్యక్షులు ఈ పథకానికి అర్హులు కారు. గత ఏడాది ఆదాయ పన్ను చెల్లించిన వారిని కూడా అనర్హులుగా ప్రకటించింది. ఐదెకరాల్లోపు భూమి ఉన్నా కూడా.. కుటుంబంలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది వృత్తి నిపుణులు (వైద్యులు, ఇంజినీర్లు, లాయర్లు, చార్టెర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్టులు)ఉన్నా అర్హులు కారని తెలిపింది. ఈ పథకం కింద కేంద్రం రూ.75వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి 31వ తేదీ లోపు మొదటి విడతగా బ్యాంకు ఖాతాల్లో జమచేయనుంది. రెండో విడతకు మాత్రం ఆధార్ కార్డును జత చేయాల్సి ఉంటుంది. -
పాలకుల నిర్లక్ష్యానికి చేనేత బలి
చేనేత రంగం భారత దేశంలోనే అనాది కాలంగా వస్తున్న వృత్తి. అనేక దశాబ్దాలలో ఈ రంగం అనేక మార్పులు చెంది, పరిణతి చెందుతూ తన ఉనికిని కాపాడుకుంటూ, వినియోగదారుల మన్ననలు పొందుతూ, ఇప్పటికి అనైతిక పోటీని ఎదుర్కొంటూ లక్షలాది కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్నది. ఒకప్పుడు వెలుగు వెలిగిన ఈ రంగం, 1990 దశాబ్ది చివరకు కష్టాలలో పడింది. ప్రపంచ వాణిజ్య ఏర్పాటు, అందులో భాగంగా సభ్య దేశాలు చేసుకున్న జౌళి, వస్త్రాల ఒప్పందం, తదనంతరం భారత ప్రభుత్వాలు తీసుకున్న విధాన నిర్ణయాలు చేనేత రంగానికి చేటు తీసుకు వచ్చినాయి. ఉపాధి పేరిట ఉపాధిని భక్షించే పాలక నిర్ణయాలు, చేనేత రంగాన్ని దెబ్బ తీసే పరిస్థితిని సృష్టిం చినాయి. రాజకీయ పార్టీలు, నాయకులూ, ఆయా ప్రభుత్వాలు హామీలు ఇస్తూనే, ఇంకొక పక్క అధికారం రాగానే, ఈ రంగాన్ని నిర్వీర్యం చేసే ఆధునిక జౌళి పరిశ్రమకు వత్తాసు పలుకుతూనే ఉన్నాయి. కుల రాజకీయాలు పెరుగుతున్న క్రమంలో, అనేక కులాలకు చెందిన చేనేత కుటుంబాలు ఒక ఓటు బ్యాంకుగా ఆయా రాజకీయ పార్టీలకు కనిపిం చలేదు. చేనేత వృత్తిని నమ్ముకుని, ఆయా రాష్ట్రాలలో గణనీయ సంఖ్యలో ఉన్న ఒకే కులస్తులు కొంత ఒత్తిడి చేయగల్గినా, ఎన్నికల తదనంతరం వారికిచ్చిన హామీలు గాలికి వదిలేసినారు. గత ఇరవై ఏళ్ల కాలంలో, అనేక మంది పద్మశాలీలు, ఇతర వృత్తులకు మళ్లడంతో, ‘చేనేత’ వృత్తికి రాజకీయ ప్రాధాన్యం మరింత తగ్గింది. ఈనాడు, అన్ని రాజకీయ పార్టీలలో చేనేత అనుబంధ విభాగాలు ఉన్నా, అవి ఆశించినంత మేర పార్టీ నిర్ణయాల మీద ప్రభావం చూపెట్టలేకపోతున్నాయి. ప్రధాన, జాతీయ పార్టీలలో చేనేత విభాగాలు ‘కుల’ రాజకీయాలకే పరిమితమయినాయి. గత పదిహేను ఏళ్లలో, కేంద్రంలో ఏ కూటమి అధికారంలో ఉన్నా, చేనేత రంగం ఆశి స్తున్న నిధుల కేటాయింపు పెరగలేదు. చేనేత రంగాన్ని పట్టించుకోలేదు. చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరిగాయి. 1997లో చేనేత రంగానికి ప్రణాళిక వ్యయం కేవలం రూ. 107 కోట్లే. ఈ రాజకీయ, పాలక నిర్లక్ష్యం ఫలితమే చేనేత కార్మికుల ఆత్మహత్యలు. రాజకీయంగా సాధించలేనిది, ఆత్మహత్యల ద్వారా తమ గోడు ప్రభుత్వానికి, ప్రపంచానికి వినిపించగలిగారు. ఫలితంగా 2012–13లో, చేనేత కేటాయింపు రుణమాఫీ పథకంతో కలిపి రూ.2,960 కోట్లకు పెరిగింది. చేనేత రుణ మాఫీ పథకం అమలు కాలేదు. అప్పులు పెరుగుతున్న తరుణంలో ఆదాయం పెరగక ఇబ్బందులూ పడుతున్న చేనేత కుటుంబాల మీద గోరు చుట్టు మీద రోకటి పోటు లాగ, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వల్ల సమస్యలు ఇంకా జటిలం అయినాయి. ఎన్నడూ లేని పన్నులు చేనేత మీద భారం విపరీతంగా పెంచాయి. చేనేత వస్త్రాల కొనుగోలు తగ్గిపోయింది. 2019–20 వోట్–అన్–అకౌంట్ బడ్జెట్లో చేనేతకు కేటాయించింది రూ. 456.80 కోట్లు. 2018–19లో కేటాయించింది రూ. 396.09 కోట్లు. 2017–18లో కేటాయించింది రూ. 604 కోట్లు, ఖర్చు చేసింది రూ. 468.98 కోట్లు. ఎన్నికల సమయంలో కూడా చేనేతకు కావాల్సిన నిధులు ఇవ్వలేదు. జీఎస్టీ మినహాయింపు గురించి బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావన కూడా లేదు. రుణ మాఫీ పథకానికి ఇచ్చిందే తక్కువ. దాన్ని కూడా పూర్తిగా ఖర్చు చేయలేదు. 95 శాతం చేనేత కుటుంబాలకు ఈ పథకం చేరనేలేదు. మళ్లీ రుణ మాఫీ ప్రకటించలేదు. చేనేత రంగంలోని కుటుంబాలు అప్పులతో కుదేలు అవుతున్న పరిస్థితులలో చేనేత రుణ మాఫీ 2019–20 బడ్జెట్లో ప్రకటించి ఉంటే చేనేత కార్మికులు సంతోషించేవారు. చేనేతపై వివక్ష ప్రభుత్వాలు మారినా కొనసాగుతూనే ఉంది. కేటాయింపులు ఎన్ని ఉన్నా, రాజకీయంగా పోరాడి సాధించుకున్నా, అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్ల ఈ పాటి కేటాయిం పులు సరిగ్గా ఖర్చు కాకపోవడం చేనేత రంగాన్ని పీడిస్తున్న పాలనాపరమైన అంశం. 2012–13లో రూ. 2,960 కోట్లు కేటాయిస్తే, రూ.793.28 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఎనిమిది సంవత్సరాల కాలంలో ఖర్చు వివరాలు గమనిస్తే కేటాయింపు కంటే ఖర్చు తక్కువగానే ఉంది. 2014 ఎన్నికలలో చేనేత రంగానికి ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కానీ నాయకుడు కానీ ఆశ కలిపించలేదు. తెలుగు రాష్ట్రాలలో (ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ) చేనేతలు గణనీయ సంఖ్యలో ఉన్నారు. రాబోయే ఎన్నికలలో అనేక ప్రాంతాలలో బహుముఖ పోటి ఉన్న తరుణంలో చేనేతల మద్దతు చాలా అవసరం అవుతుంది. చేనేత మద్దతు కోరే నాయకులూ పార్టీలు ఈ రంగానికి మద్దతు ఇచ్చే హామీలు ఇచ్చి విశ్వాసం కలిగిస్తేనే వారికి కావాల్సిన ఓట్లు వస్తాయి. చివరిగా, సమగ్ర చేనేత అభివృద్ధి మా లక్ష్యం అని ప్రకటిస్తే చేనేత కుటుంబాలు సంపూర్ణ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. డి. నరసింహారెడ్డి వ్యాసకర్త ప్రముఖ ఆర్థికరంగ నిపుణులు -
కూ... చుక్చుక్ !
మహబూబ్నగర్: కేంద్రప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైల్వే కేటాయింపులకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు ఆశాజనకంగానే నిధులు ప్రకటించారు. మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని రెండు ముఖ్యమైన ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించారు. మహబూబ్నగర్ – మునీరాబాద్ రైల్వే లైన్, సికింద్రాబాద్ – మహబూబ్నగర్ డబ్లింగ్ లైన్లకు ప్రకటించిన నిధులపై ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఈ పనులు ఇప్పటికే కొనసాగుతుండగా.. ఈసారి కేటాయించనున్న నిధులతో పనుల్లో వేగం పెరగనుందని భావిస్తున్నారు. అయితే, ఈసారి బడ్జెట్లో కూడా గద్వాల – మాచర్ల రైల్వే లైన్ ప్రస్తావన లేకపోవడం మాత్రం నిరాశకు గురిచేసిందనే చెప్పాలి. అలాగే, ఆదర్శ రైల్వేస్టేషన్ల ప్రకటన, ఎస్కటేటర్ల ఏర్పాటు, ఆర్వోబీల నిర్మాణంపై ప్రకటన చేయకపోవడం గమనార్హం. మహబూబ్నగర్ డబ్లింగ్ దాదాపు రూ.728 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన సికింద్రాబాద్ – మహబూబ్నగర్ డబ్లింగ్ లైన్కు గత రెండేళ్ల నుంచి మెరుగైన నిధులు కేటాయిస్తున్నారు. గత ఏడాది బడ్జెట్లో రూ.250 కోట్లు కేటాయించగా ఈసారి కూడా రూ.200 కోట్లు కేటాయించారు. ఈ రైల్వేలైన్ పనులు జిల్లా పరిధిలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఉందానగర్ నుంచి ప్రారంభమైన డబ్లింగ్ రైల్వే పనులు చకచకా జరుగుతున్నాయి. ప్రస్తుతం పనులు మహబూబ్నగర్ – దివిటిపల్లి మధ్య నడుస్తున్నాయి. తాజాగా కేటాయించిన నిధులతో పనుల్లో మరింత వేగం పెరుగుతుందని రైల్వే ప్రయాణీకులు భావిస్తున్నారు. మొత్తంగా ఏడాదిలోపు డబ్లింగ్ లైన్ పనులు పూర్తయ్యే అవకాశముందని చెబుతున్నారు. తగ్గనున్న దూరాభారం సికింద్రాబాద్ – మహబూబ్నగర్ డబ్లింగ్ లైన్ పనులు పూర్తయితే జిల్లా ప్రయాణికులకు వెసులుబాటు లభించనుంది. మహబూబ్నగర్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సికింద్రాబాద్కు ప్యాసింజర్ రైలులోనైతే 3 గంటలు, ఎక్స్ప్రెస్లోనైతే 2.30 గంటల సమయం పడుతోంది. అదే డబ్లింగ్ లైన్ పనులు పూర్తయితే గంట పాటు సమయం ఆదా అయ్యే అవకాశముంది. ఇంకా వాణిజ్యపరంగా కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయని భావిస్తున్నారు. మునీరాబాద్ లైన్ మహబూబ్నగర్ – మునీరాబాద్ రైల్వేలైన్ను 246 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నారు. ఈ పనులకు 1997 – 98 బడ్జెట్లో ఆమోద ముద్ర లభించింది. రూ.645 కోట్ల వ్యయంతో ఈ రైల్వే పనులు చేపట్టగా తాజా బడ్జెట్లో రూ.275 కోట్లు కేటాయించారు. గత ఏడాది కూడా ఇంతేస్థాయిలో నిధులు కేటాయించడం విశేషం. ప్రస్తుతం ఈ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. జిల్లా పరిధిలో ఇప్పటివరకు 30 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. జిల్లాలోని కృష్ణాతోపాటు కర్నాటక రాష్ట్రం మునీరాబాద్ పరిధిలో పనులు పురోగతిలో ఉన్నాయి. అదే విధంగా జిల్లా రైల్వే పరిధిలోని ఆర్యూబీల నిర్మాణం కూడా పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సర్వేలకే పరిమితం గద్వాల – మాచర్ల రైల్వేలైన్ నిర్మాణం కోసం దా దాపు మూడు దశాబ్దాలుగా అటు ప్రజాప్రతినిధు లు ప్రయత్నాలు చేస్తుండగా.. ఇటు ప్రజలు ఏటే టా ఎదురుచూస్తూనే ఉన్నారు.కానీ ఇప్పటివరకు రైల్వేలైన్ నిర్మాణానికి ఆమోదమే లభించడం లేదు. దీని కోసం మూడు సార్లు సర్వే చేసినా రైల్వేలైన్ నిర్మాణ ప్రక్రియ ప్రారంభం కాకపోవడం ఈ ప్రాంత ప్రయాణికులను ఆవేదనకు గురిచేస్తోంది. అలాగే, మహబూబ్నగర్ రైల్వే స్టేషన్ను ఆదర్శ స్టేషన్గా మార్చాలన్న డిమాండ్ కూడా మిగిలిపోయిందనే విమర్శలున్నాయి. అధిక నిధులు కేటాయించడం సంతోషం... ప్రస్తుత బడ్జెట్లో మునీరాబాద్– మహబూబ్నగర్ డబ్లింగ్ లైన్కు అధిక నిధులు కేటాయించడం సంతోషంగా ఉంది. ఈ నిధులతో లైన్ల నిర్మాణ పనులు మరింత చురుగ్గా జరిగే అవకాశం ఉంది. అలాగే, జిల్లా రైల్వేస్టేషన్లో లిఫ్ట్ ఎస్కలేటర్ ఏర్పాటు, జిల్లా కేంద్రంలోని టీడీగుట్ట రైల్వే గేట్ వద్ద ఆర్ఓబీ నిర్మాణానికి కూడా నిధులు కేటాయించాలి. – మీర్జా జాకీర్బేగ్, రైల్వే కమ్యూటర్స్ ప్రతినిధి మహబూబ్నగర్ – దివిటిపల్లి మధ్య డబ్లింగ్ లైన్ నిర్మాణ పనులు మహబూబ్నగర్–మునీరాబాద్ రైల్వేలైన్ -
‘పీఎం–కిసాన్’ లబ్ధిదారుల్ని గుర్తించండి
న్యూఢిల్లీ: పీఎం–కిసాన్ పథకం కింద తొలి విడతలో రూ.2 వేలు పొందే చిన్న, సన్నకారు రైతులను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. బడ్జెట్లో ప్రతిపాదించిన ఈ పథకానికి ఇప్పటికే రూ.20 వేల కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా మొత్తం 12 కోట్ల మంది రైతులు ఈ పథకం కింద ప్రయోజనం పొందుతారని అంచనా. ఈశాన్య రాష్ట్రాల్లో మినహా ఈ రైతు ప్యాకేజీ అమలులో పెద్దగా ఇబ్బందులేమీ రావని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ చెప్పారు. సాగుకు పెట్టుబడి సాయంపై వ్యవసాయ శాఖ చాలా రోజులుగా కసరత్తు చేస్తోందని, అదే ఉత్సాహంతో ఈ పథకాన్ని అమలుచేస్తామని తెలిపారు. రూపకల్పన కన్నా అమలుపరచడమే ఇందులో ప్రధానమని, చిన్న, సన్నకారు రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధను తాజా బడ్జెట్ ప్రతిబింబిస్తోందని అన్నారు. లబ్ధిదారుల్ని గుర్తించే ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధానకార్యదర్శులు, వ్యవసాయ కార్యదర్శులకు ఈ నెల 1న లేఖలు పంపారని వెల్లడించారు. లబ్ధిదారుల పేరు, కులం తదితర వివరాల్ని సేకరించి స్థానిక గ్రామ పంచాయతీ నోటీసు బోర్డులో ఉంచాలని లేఖలో సూచించారు. చాలా రాష్ట్రాల్లో భూ దస్త్రాల డిజిటలీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, ఫిబ్రవరి ఒకటి నాటికి భూ రికార్డుల్లో పేర్లు నమోదైన యజమానులే పీఎం–కిసాన్ పథకానికి అర్హులని రాజీవ్ కుమార్ తెలిపారు. ఏడాదికి రూ.6 వేలు అంటే చిన్న మొత్తమేమీ కాదని, ఆ డబ్బుతో పేద రైతులు ఎన్నో ఖర్చులు వెళ్లదీసుకోవచ్చని అన్నారు. చిక్కులు తప్పవు: నిపుణులు పథకం అమలులో న్యాయపర చిక్కులు తప్పవని వ్యవసాయ నిపుణుల విశ్లేషణ. యాజమాన్య హక్కులపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ పథకానికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయని సీనియర్ న్యాయవాది ఎన్కే పొద్దార్ పేర్కొన్నారు. ఒకే సాగు భూమికి ఒకరి కన్నా ఎక్కువ మంది యజమానులు ఉండి, వారందరికీ రూ.6 వేల చొప్పున సాయం అందితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ పథకం కింద వెచ్చించే కోట్లాది రూపాయలు అనుత్పాదక వినియోగంలోకి వెళ్తాయని ఆర్థిక నిపుణుడు శశికాంత్ సిన్హా అన్నారు. -
ఇది నవభారత బడ్జెట్: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నవభారత నిర్మాణం కోసం ఉద్దేశించినట్లుగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. శనివారం ఇక్కడ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్లో తాజా కేంద్ర బడ్జెట్పై రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. లక్ష్మణ్ మాట్లాడుతూ నోట్లరద్దు, జీఎస్టీ వల్ల కోటిమంది అదనంగా ఐటీ పరిధిలోకి వచ్చారని, ఆదాయపన్ను ద్వారా దాదాపు ఆరు లక్షల కోట్ల రూపాయలు సమకూరాయన్నారు. కోటి 53 లక్షల మంది పేదలకు సొంతింటి కల సాకారం చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనన్నారు. డబుల్బెడ్ రూమ్ పథకం కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్ ఎంపీ దత్తాత్రేయ మాట్లాడుతూ రక్షణ రంగానికి మొదటిసారిగా రూ.మూడు లక్షల కోట్ల భారీ కేటాయింపులు జరిగాయన్నారు. ఇది పీపుల్స్ బడ్జెట్ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిషన్రెడ్డి మాట్లాడుతూ మునుపెన్నడూలేని విధంగా ఐదేళ్లకోసారి జరిగే సర్వే ఇప్పుడు క్వార్టర్లీగా జరుగుతోందంటూ దాని లాభాలను వివరించారు. ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ను పీపుల్స్ బడ్జెట్గా అభివర్ణించారు. 33 కోట్ల కుటుంబాలకు ఈ బడ్జెట్ లాభదాయకంగా ఉందని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ జనాకర్షణ, శాస్త్రీయత రెండూ సమపాళ్లలో ఉన్నాయని, ఇదొక ప్రాక్టికల్ బడ్జెట్ అని ప్రశంసించారు. కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం తదితరులు పాల్గొన్నారు. -
మనమే ఆదర్శం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్తో రాష్ట్రానికి పెద్దగా ఒరిగిందేమీ లేదని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. వ్యవసాయరంగాన్ని సుభిక్షం చేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని కేంద్రం కాపీ కొట్టిందని ఆయన పేర్కొన్నారు. అయితే ఆ పనిని కూడా కేంద్రం సరిగా చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. రైతుబంధు తరహాలోనే కేంద్రం రైతులకు సరిపడా సాయం చేస్తే బాగుండేదని చెప్పారు. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఆర్థికశాఖ ఉన్నతాధికారులు శనివారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అధికారులతో బడ్జెట్పై ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ అమలు చేసే దిశగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన జరగాలని కేసీఆర్ ఆదేశించారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన నిధుల కేటాయింపు జరగాలని చెప్పారు. ఈ సందర్భంగా బడ్జెట్ రూపకల్పనపై పలు సూచనలు చేశారు. ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజలకు పలు హామీలు ఇచ్చామని, వాటి అమలుకు ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఈ హామీల అమలు జరిగే విధంగా బడ్జెట్ రూపకల్పన జరగాలన్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని.. వీటికి నిధుల కొరత లేకుండా బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, ఆర్ అండ్ బీ ఈఎన్సీలు గణపతి రెడ్డి, రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇంకా మెరుగైన పథకం కావాలి ‘రైతుబంధు పథకం చాలా గొప్పది. రైతులకు నేరుగా సాయం చేసేలా మన పథకం ఉంది. మనం ఇచ్చే సాయం మరీ ఎక్కువ కాకున్నా రైతులకు ఊరట కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇదే పథకాన్ని కొత్తగా ప్రవేశపెట్టినట్లు చెబుతోంది. అయితే కేంద్రం ఇచ్చే సాయం తక్కువగా ఉంది. రైతులకు ఈ మొత్తం దేనికీ సరిపోదు. పెట్టుబడి సాయం విషయంలో కేంద్రం ఇప్పటికైనా ఇంకా మెరుగైన పథకం ప్రవేశపెట్టేలా యోచిస్తే బాగుంటుంది. కేంద్రం తరహాలోనే తెలంగాణ బడ్జెట్ను రూపొందించాలి. దీనిపై మరోసారి వివరంగా సమీక్షించుకుందాం. 15వ ఆర్థిక సంఘం రాష్ట్ర పర్యటనకు వస్తోంది. మన రాష్ట్రం ఎక్కువ నిధులు పొందేలా సమగ్ర నివేదిక రూపొంచాలి. దీనిపై దృష్టి పెట్టండి. గ్రామపంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా మన ప్రణాళిక ఉండాలి. వచ్చే ఐదేళ్లల్లో అన్ని గ్రామాల్లో మెరుగైన మౌలిక వసతులు ఉండాలి. బడ్జెట్ రూపకల్పనలో ఈ దిశగా చర్యలు తీసుకోవాలి’అని సీఎం అన్నారు. 18న ఆర్థిక సంఘం రాక 15వ ఆర్థిక సంఘం ఈ నెల 18న తెలంగాణకు రానుంది. మూడ్రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. మొదటి రెండ్రోజులు సీఎం కేసీఆర్తో, రాష్ట్రంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం కానుంది. 20న రాష్ట్రంలో పర్యటించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనుంది. మిషన్ భగీరథ పనులను పరిశీలించనుంది. ఆర్థిక సంఘం పర్యటన ముగిసిన తర్వాతే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం తరహాలోనే రాష్ట్రంలోనూ తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. అప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. సాగుకు 25వేల కోట్లు! రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు ఈసారి కూడా గతేడాదిలాగే భారీగా బడ్జెట్ కేటాయింపులు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టుల పనుల్లో ప్రస్తుత పురోగతి, వాటి ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకుంటూ రూ.25 వేల కోట్ల బడ్జెట్ను సర్దుబాటు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. నీటిపారుదల శాఖ గతంలో పంపిన బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలించిన ఆర్థికశాఖ రూ.25 వేల కోట్లకు సీలింగ్ ఇచ్చింది. సాగునీటి ప్రాజెక్టులకు ఈ ఏడాది జనవరిలో నీటిపారుదల శాఖ రూ.26,700 కోట్లతో ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపింది. చాలా ప్రాజెక్టుల పరిధిలో నెలకొన్న భూసేకరణ, సహాయ పునరావాస, అటవీ, పర్యావరణ సమస్యలు, గతేడాది పనుల పురోగతిని దృష్టిలో పెట్టుకొని ఈ మేర నిధులు అవసరమని తెలిపింది. దీనిపై ప్రాజెక్టుల వారీగా సమీక్ష జరిపిన అనంతరం రూ.25వేల కోట్ల బడ్జెట్కే ఆర్ధిక శాఖ సీలింగ్ ఇచ్చింది. ఇందులో రూ.1,316.13 కోట్లు నిర్వహణ పద్దుకై ప్రతిపాదించగా, మిగతా 23,683.87 కోట్లు ప్రగతి పద్దుకై ప్రతిపాదించారు. ప్రగతి పద్దు కింద ప్రతిపాదించిన నిధుల్లో రాష్ట్ర ప్రణాళిక కింద రూ.13,253.77 కోట్లు కేటాయించేలా ప్రతిపాదనలు సిధ్ధం కాగా.. మిగతా రూ.10,430.10కోట్లను ఇప్పటికే ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల ద్వారా రుణాల రూపంలో తీసుకోవాలని ప్రతిపాదించారు. ఇక ప్రాజెక్టుల వారీగా చూస్తే అంతా ఊహిస్తున్నట్లే కాళేశ్వరం ప్రాజెక్టుకు గరిష్టంగా రూ.5,988.10 కోట్లు కేటాయించాలని, సీతారామకు రూ.2,915కోట్లు, పాలమూరు–రంగారెడ్డికి రూ.2,732కోట్లు, మైనర్ ఇరిగేషన్కు రూ.1,601కోట్లు కేటాయించేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కాగా, సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్ బిల్లులు, బడ్జెట్ కేటాయింపులపై సీఎం కేసీఆర్ శనివారం బడ్జెట్పై సమీక్ష సందర్భంగా అధికారులతో చర్చించారు. వచ్చే బడ్జెట్లో రూ.25వేల కేటాయింపులకు ఓకే చెప్పినట్లుగా తెలిసింది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు రుణాల ప్రక్రియను వేగిరం చేయాలని సూచించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. నేడు యాదాద్రికి సీఎం ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ఆదివారం యాదాద్రికి వెళ్లనున్నారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని యాదాద్రి ఆలయంలో జరుగుతున్న ఆలయ విస్తరణ పనులను అధికారులతో కలిసి పరిశీలించనున్నారు. అనంతరం అభి వృద్ధి పనులపై అధికారులతో సమీక్షించనున్నారు. కేసీఆర్ రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి యాదాద్రికి వెళ్తున్నారు. -
సాగు విడిచి సాము!
ఎన్నికలకు మూడు మాసాల ముందు ప్రవేశపెట్టే తాత్కాలిక బడ్జెట్ లేదా ఓట్ ఆన్ అకౌంట్ (అనామతు పద్దు)పట్ల సాధారణంగా ఎవ్వరికీ ఆసక్తి ఉండదు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత వచ్చే ప్రభుత్వం ప్రాధామ్యాలను బట్టి వార్షిక బడ్జెట్ ఉంటుంది కనుక అంతవరకూ జమాఖర్చుల తబ్శీళ్ళను తెలి యజేసి ఖర్చుకు ఆమోదం తీసుకోవడం ఆనవాయితీ. తాత్కాలిక బడ్జెట్లో తాత్కాలిక అంచనాలే ఉండాలి కానీ ఆర్థిక సంవత్సరం అంతటికీ వర్తించే ప్రతిపాదనలు చేయకూడదన్నది మొన్నటి దాకా ఆర్థికమంత్రులందరూ విధిగా పాటించిన నియమం. కానీ శుక్రవారంనాడు తాత్కాలిక ఆర్థికమంత్రి పీయూష్ గోయల్ చేసింది రాజ్యాంగ స్పూర్తికి భిన్నమైనది. సంప్రదాయ ఉల్లంఘన. ఎన్డీఏ అధికారంలో కొనసాగితే ఎటువంటి ఆర్థికవిధానాలు అవలంబిస్తుందో సూచించడమే కాకుండా ఎన్నికలలో కొనసాగడానికి అవసరమైన తాయిలాలను ప్రజలకు విచ్చలవిడిగా పంచడానికి తాత్కాలిక బడ్జెట్ను ప్రధాని నరేంద్రమోదీ ఆదేశం మేరకు గోయల్ దుర్వినియోగం చేశారు. రాజ్యాంగధర్మానికి విరుద్ధంగా మోదీ సర్కార్ వ్యవహరించినప్పటికీ బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలించి విశ్లేషించడం అనివార్యం. అసంఘటిత రంగంలో పనిచేసిన కార్మికులకు పింఛన్లు ఇవ్వడానికీ, అంగన్వాడీ ఉద్యోగినుల ఆదాయం రెట్టింపు చేయడానికీ, ఆదా యంపన్ను లెక్కింపులో రిబేట్ స్థాయిని అయిదు లక్షల రూపాయలకు పెంచడానికీ, ఈఎస్ఐ వర్తించే ఉద్యోగుల జీతం పరిమితిని 15 నుంచి 21 వేలకు పెంచడానికీ, ఇటువంటివే అనేక ప్రయోజనాలు ఉద్యోగులకూ, ఇతర వర్గాలకూ కలిగించడానికీ చేసిన ప్రతిపాదనల విషయంలో ఎవ్వరికీ ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న వ్యవసాయ కుటుం బానికి ఏటా ఆరు వేల రూపాయల చొప్పున నగదు సహాయం చేసే ‘ప్రధాని కిసాన్ సమ్మాన్ యోజన’ను ఆర్థికమంత్రి ప్రకటించారు. వ్యవసాయ రుణం నేరుగా మాఫ్ చేయడం, రైతుకే నేరుగా నగదు బదిలీ చేసే కార్యక్రమం వంటివి పాలకులు చేస్తున్నారు. కానీ వ్యవసాయరంగాన్ని పట్టిపల్లార్చుతున్న, రైతులను కుంగదీస్తున్న మౌలికమైన సమస్యల పరిష్కారానికి చేయవలసింది చేయలేకపోతున్నారు. ఎన్నికలు సమీపించిన తరుణంలోనే రైతుల గురించి ఆలోచించడం, తాత్కాలిక ఉపశమనం కలిగించే ఉపాయాలను ఆశ్రయిం చడంతో బడుగు రైతుల బతుకులు తెల్లవారిపోతున్నాయి. ఆరువేల రూపా యలు సంవత్సరానికి సన్నకారు రైతుల ఖాతాలలో జమచేయడమే మహో పకారమంటూ మోదీని కీర్తించేవారికి చెప్పేది ఏమీ లేదు. ఏదో గట్టి మేలు చేసినట్టు ‘అబ్కీ బార్ చార్సౌ పార్’ (ఈ దెబ్బతో నాలుగు వందలకు మించి లోక్సభ స్థానాలు బీజేపీకి దక్కుతాయి) అంటూ సంబరం చేసుకునేవారికి నమస్కారం. ఏకపక్ష నిర్ణయాలు నిష్ప్రయోజనం నిజంగా వ్యవసాయం గిట్టుబాటు కావాలనీ, ఫలప్రదమైన, లాభదాయకమైన, గౌరవప్రదమైన వ్యాసంగం కావాలనీ కోరుకునేవారు రైతుల గోడు ఆలకించాలి. పాలకులకి తోచిన చర్యలు ఏకపక్షంగా ప్రకటించడం కాకుండా రైతులు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దాదాపు రెండు దశాబ్దాలుగా నేను అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకొని ఒక విన్నపం చేస్తూ వచ్చాను. వ్యవసాయసంక్షోభం పరిష్కారానికి మార్గం కనుక్కోవడం ఒక్కటే ఎజెండాగా పార్లమెంటు ప్రత్యేక సమావేశం నిర్వహించాలనీ, పార్లమెంటు సభ్యులూ, మంత్రిమండలి సభ్యులతో పాటు రైతు సంఘాల ప్రతినిధులూ, డాక్టర్ స్వామినాధన్ వంటి వ్యవసాయశాస్త్రజ్ఞులూ, ప్రవీణులూ, రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వేతర సంస్థల సభ్యులూ చర్చలో పాల్గొనాలనీ నా సూచన. ఈ చర్చలో ఇప్పటికే ఈ దిశగా చొరవ ప్రదర్శించిన తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్ ముఖ్యమంత్రులు కూడా పాల్గొనాలి. రెండేళ్ళ కిందటే ‘వైఎస్సార్ రైతు భరోసా’కింద ప్రతి రైతు కుటుంబానికి రూ. 12,500 ల వంతును ఆర్థిక సహాయం అందిస్తామంటూ ప్రకటించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి వంటి నాయకులను సైతం చర్చకు ఆహ్వానించి మాట్లాడించాలి. సంక్షోభానికి పరిష్కారం లభించేవరకూ, అది అందరికీ లేదా మెజారిటీ సభ్యులకు ఆమోదయోగ్యమని నిర్ధారించే వరకూ ఈ ప్రత్యేక సమావేశం ఎన్ని రోజులైనా కొనసాగాలి, శాశ్వత పరిష్కారం సాధించాలి. పార్టీల ప్రయోజనాలకూ, ఎన్నికలలో లాభనష్టాలకూ అతీతంగా వ్యవహరించి సమష్టిగా సమాలోచన జరిపితే కానీ దారి దొరకదు. హరితవిప్లవం తర్వాత ఏదీ పూనిక? ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా 1960లలో హరితవిప్లవ సాధనకోసం విశేషమైన ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత వ్యవసాయరంగంలో అనేక మార్పులు వచ్చాయి. 1950లలో, 60లలో ఆహారధాన్యాలను దిగుమతి చేసుకునే దుస్థితి నుంచి ఇప్పుడు ఆహారధాన్యాలను ఎగుమతి చేసే స్థాయికి దేశం ఎదిగింది. ఆహారభద్రతపైన దృష్టి పెట్టామే కానీ రైతు సంక్షేమం పట్టిం చుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా ఆహారాధాన్యాల ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. ధరలు తగ్గిపోయాయి. అదే సమయంలో వ్యవసాయానికి పెట్టుబడి వ్యయం హెచ్చింది. రైతు కుదేలైనాడు. కుప్పకూలిపోయాడు. ఇంతవరకూ కోలుకోలేదు. ఆహారధాన్యాల కొరత లే నేలేదు. ప్రకృతి సహకరించి, వానలు పడితే పంటలు పుష్కలంగా పండుతున్నాయి. రైతుల జీవన ప్రమాణాలు మాత్రం దిగ జారుతున్నాయి. రైతు తెప్పరిల్లడానికి అనువైన పరిస్థితులు కల్పించడంలో ప్రభుత్వాలు వరుసగా విఫలమైనాయి. అరకొరగా అక్కడక్కడా కొన్ని ప్రయ త్నాలు జరగకపోలేదు. వాజపేయి హయాం (2003)లో చేసిన అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) యాక్ట్ను దృష్టిలో పెట్టుకొని అన్ని రాష్ట్రాలలో అదే పద్ధతిలో చట్టాలు చేసుకొని మార్కెటింగ్ వ్యవస్థను బలంగా నిర్మించి ఉంటే, జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలలోని కమిటీలనూ సమన్వయం చేసే వ్యవస్థను ఏర్పాటు చేసి ఉంటే ఆహారధాన్యాలకు గిట్టుబాటు ధర సాధించడానికి తగిన యంత్రాంగం ఉండేది. కేవలం 18 రాష్ట్రాలు మాత్రమే ఏపీఎంసీ చట్టాన్ని పురస్కరించుకొని చట్టాలు చేశాయి. తక్కిన రాష్ట్రాలు పట్టించుకోలేదు. మోదీ సర్కార్ ప్రధానమంత్రి ఫసల్బీమా యోజన, ప్రధానమంత్రి కృషి సించాయీ యోజనా వంటి పథకాలు అమలు చేస్తున్నది. నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఏర్పాటు చేసింది. కానీ ఆశించిన ప్రయోజనం సిద్ధించడం లేదు. ప్రభుత్వ చర్యలు కొన్ని సందర్భాలలో రైతుకు శాపంగా పరిణమించే ప్రమాదం ఉన్నది. ద్రవ్యోల్బణం హద్దు మీరకుండా చూసే క్రమంలో ఆహారధాన్యాల మద్దతు ధరను తగినంత పెంచకుండా కేంద్ర ప్రభుత్వం ఉపేక్షించింది. 1995 నుంచి 2016 వరకూ దేశ వ్యాప్తంగా 3,18,528 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలియజేసింది. 2016 నుంచి ఆ బ్యూరో తాజా వివరాలు నమోదు చేయకుండా, వెల్లడించకుండా ప్రభుత్వం కట్టడి చేసింది. ఈ కారణంగా దేశంలో రైతుల బలవన్మరణాల గురించి చర్చ జరగదు. సమస్య పరిష్కరించవలసింది పోయి సమస్య ప్రజల దృష్టికి రాకుండా చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? 2022 నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుందనీ, అప్పటికల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని సంకల్పించామనీ మోదీ చాలా సందర్భాలలో ప్రకటించారు. మొన్న పీయూష్ గోయల్ కూడా చెప్పారు. ఈ సంకల్పం నెరవేరాలంటే వ్యవ సాయరంగం 2017 నుంచి 2022 వరకూ సంవత్సరానికి 14 శాతం చొప్పున వృద్ధి చెందాలని వ్యవసాయరంగ ప్రవీణుడు అశోక్గులాటీ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్–ఐసీఆర్ఐఇఆర్–సభ్యుడు) చెప్పారు. పీయూష్ గోయల్ ప్రతిపాదనలో కౌలురైతు ప్రస్తావన లేదు. వ్యవసాయకూలీల ఊసు లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఈ రెండు వర్గాలనూ పట్టించుకోలేదు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వ్యవసాయ కుటుంబానికి లేదా కౌలు రైతు కుటుంబానికి సాలీనా రూ 10,000 నగదు సాయం చేస్తూ ఇల్లు లేని వ్యవసాయ కూలీలకు రూ.12,000 నగదు చెల్లించే ‘కాలియా పథకం’ అమలు చేస్తున్నారు. కౌలు రైతుకు నగదు బదిలీ చేస్తే భూమి యజమానికి అభద్రతాభావం ఏర్పడుతుందనీ, భూమిపైన హక్కు పోతుందనే భయం పీడిస్తుందనీ, అందువల్ల కౌలు రైతులకు ఆసరా ఇచ్చే అవకాశం లేదనీ తెలంగాణ ప్రభుత్వం వివరించింది. కానీ మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే నీతి ఆయోగ్ సభ్యుడు రమేశ్చంద్ నేతృత్వంలో భూమి కౌలును న్యాయబద్ధం చేయడానికి ఒక నమూనా శాసనాన్ని (మోడల్ ల్యాండ్ లీజింగ్ లా) రూపొందించింది. భూమి యజమానులకు భూమిపైన హక్కు పదిలంగా ఉంటూనే కౌలురైతుకు చట్టబద్ధంగా గుర్తింపు ఇవ్వడానికి ఉద్దేశించిన ఈ నమూనా అమలు చేసినట్లయితే కౌలు రైతుకు వ్యవస్థాగత రుణాలు అందు బాటులోకి వస్తాయి. సమాజంలో గుర్తింపు ఉంటుంది. భూమి సాగు చేసుకునే యజమానులూ, సాగు చేయకుండా కౌలుకు ఇచ్చే యజమానులూ (ఆబ్సెంటీ ల్యాండ్లార్డ్స్), కౌలు రైతులూ, వ్యవసాయకూలీలూ అంటూ నాలుగు రకాల వ్యక్తులు భూమిపైన ఆధారపడి ఉంటారు. భూమి యజమానులకు నగదు బదిలీ చేయడం కంటే కౌలు చెల్లిస్తూ, పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసేవారికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందడం న్యాయం. దున్నేవాడికే వెన్నుదన్నుగా ప్రభుత్వాలు నిలవాలి. ఈ ఉద్దేశంతోనే రమేశ్చంద్ నమూనా బిల్లును తయారు చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక్కటే ఈ నమూనాను ఆధారం చేసుకొని కౌలు రైతులకు ఉపయోగపడే చట్టం చేసింది. బీజేపీ పాలనలో 19 రాష్ట్రాలు ఉన్నప్పటికీ మధ్యప్రదేశ్ మినహా తక్కిన రాష్ట్రాలు దీన్ని పట్టించుకోకపోవడం ఆశ్చర్యం. న్యాయభావన పాలకులలో అంతంతమాత్రమే ఉన్నదనడానికి ఇది నిదర్శనం. వ్యవసాయశాఖ ఎంత అస్తవ్యస్తంగా ఉన్నదో కూడా ఇది స్పష్టం చేస్తున్నది. వ్యవసాయ సంస్కరణల ఆవశ్యకత చిన్నచిన్న కమతాల వల్ల వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదనే అభిప్రాయం బలంగా ఉన్నది. సహకార వ్యవస్థలోకి సన్నకారు రైతులను తీసుకువచ్చే ప్రయత్నం చేయవచ్చు. భూసార కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఆరంభించి, కొన్ని రాష్ట్రాలలో అమలు చేసి ఆనక వదిలేసింది. దాన్ని అన్ని రాష్ట్రాలకూ విస్తరించి ఏ నేల సారం ఏమిటో, ఏ పంట పండుతుందో, ఏ పంట పండిస్తే రైతులకు లాభాలు వస్తాయో వివరించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. వ్యవసాయ విస్తరణాధికారులు ఇది వరకూ ఈ పని చేసేవారు. మలేసియాకు చెందిన డాక్టర్ లిమ్సియోజిన్ పాతికేళ్ళుగా చేస్తున్న కృషిని గమనించాలి. అతడు డీఎక్స్ఎన్ అనే కంపెనీని నెలకొల్పి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించుకొని ఆహారపదార్థాలను తయారు చేసి 180 దేశాలలో విక్రయిస్తున్నాడు. ఇటీవలే తెలంగాణలో సిద్ధిపేట వ్యవసాయ క్షేత్రంలో సాగుకూ, వ్యవసాయ ఉత్పత్తులను ఉపయోగించి ఆహారపదార్థాలను తయారు చేసే యంత్రాల స్థాపనకూ ఆయన ఉపక్రమించాడు. మాజీ మంత్రి హరీష్రావు చొరవతో ఇది సాధ్యమైంది. తన కంపెనీకి ఎటువంటి వ్యవసాయ ఉత్పత్తులు అవసరమో లిమ్ చెబుతారు. ఆ ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. వాటిని ఉపయోగించి ఆహారపదార్థాలు తయారు చేసే ప్రాసెసింగ్లో అదే రైతు కుటుంబంలోని సభ్యులకు ఉద్యోగావకాశం ఉంటుంది. ఆ విధంగా తయారైన పదార్థాలను విక్రయించడం (మార్కెటింగ్) లోనూ రైతు కుటుంబానికి చెందిన మరో సభ్యుడు లేదా సభ్యురాలు పని చేయవచ్చు. ఇటువంటి వ్యవసాయాధార పరిశ్రమలను ప్రభుత్వాలు ప్రోత్సహించడం ద్వారా రైతు కుటుంబాలకు ఆదాయం సమకూర్చవచ్చు. గ్రామస్థాయిలోనే వ్యవసాయ పరిశ్రమలు నెల కొల్పి కుటీర పరిశ్రమలను ప్రోత్సహించి వ్యవసాయ పేదరికాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్న చైనా నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. పాలకులూ, సమాజం మనస్ఫూర్తిగా పట్టించుకోవలసిన సమస్య ఇది. గట్టిగా ప్రయత్నిస్తే పరిష్కరించడం అసాధ్యం కానేకాదు. సృజనాత్మకంగా ఆలోచించకుండా బడ్జెట్లలో అరకొర ప్రయోజనాలు విదిలించడం వల్ల పాలకులకు ఓట్లు వస్తా యేమో కానీ రైతుల బతుకులు బాగుపడవు. కె. రామచంద్రమూర్తి -
పింఛను పథకం ప్రచారాస్త్రమే!
సాక్షి, న్యూఢిల్లీ : అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల ప్రయోజనం కోసం కేంద్ర మంత్రి పియూష్ గోయల్ గురువారం పార్లమెంట్కు సమర్పించిన బడ్జెట్లో కొత్త పింఛను పథకాన్ని ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ పథకం కింద కార్మికులకు 60 ఏళ్ల నుంచి నెలకు మూడువేల రూపాయల చొప్పున పింఛను లభిస్తుంది. అందుకోసం 29 ఏళ్లు నిండిన కార్మికుడు నెలకు వంద రూపాయల చొప్పున, 18 ఏళ్లు నిండిన కార్మికుడయితే నెలకు 55 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుందని, దీనివల్ల పది కోట్ల మంది కార్మికులు ప్రయోజనం పొందుతారని పియూష్ గోయల్ తెలిపారు. పింఛను కోసం కనీసంగా ఎంతకాలం పాటు కార్మికుడు తనవంతు భాగాన్ని చెల్లిస్తూ పోవాలనే కాల పరిమితి ఈ పథకంలో ఎక్కడా లేకపోవడం ప్రధాన లోపంగా కనిపిస్తోంది. ఇది కొత్త పథకంగా మోదీ ప్రభుత్వం పేర్కొంటున్నప్పటికీ 2015, మార్చిలో ప్రవేశ పెట్టిన ‘అటల్ పెన్షన్ యోజన’ పథకానికి మరో రూపమని తెలుస్తోంది. అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం ప్రవేశపెట్టిన అటల్ పెన్షన్ పథకంలో నెలవారి పింఛన్ను కనీసంగా వెయ్యి రూపాయలు, గరిష్టంగా ఐదువేల రూపాయలుగా నిర్ణయించారు. పింఛను సొమ్ము ప్రాతిపదికన పింఛను పథకానికి లబ్దిదారుడు నెలవారిగా ఎంత చెల్లిస్తాడో అందులో యాభై శాతాన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. అలా కార్మికుడి పేరిట వెయ్యి రూపాయలు జమయ్యే వరకు ప్రభుత్వం తన వాటాను చెల్లించాల్సి ఉంటుంది. 2017, ఫిబ్రవరి నెల నాటికి ఈ అటల్ పెన్షన్ పథకం కింద లబ్దిదారులుగా నమోదయినది 42.8 లక్షల మంది కార్మికులు మాత్రమే. వీరిలో 48 శాతం మంది కనిష్ట పింఛను వెయ్యి రూపాయలను ఎంపిక చేసుకున్నట్లు ‘పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ’ తెలియజేసింది. ఈ పథకానికి మోదీ ప్రభుత్వం కూడా పెద్దగా ప్రచారం కల్పించలేదు. ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త పథకంలో అటల్ పథకాన్ని విలీనం చేస్తారా ? లేదా రెండింటిని కొనసాగిస్తారా? అన్న విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేదు. ఈ పథకం కోసం 500 కోట్ల రూపాయలను కార్మికులు తమ వంతు వాటా చెల్లించే పింఛను పథకాలు యూరప్ దేశాల్లో విజయవంతం అయ్యాయిగానీ భారత్ లాంటి ఏ వర్ధమాన దేశాల్లో విజయవంతం కాలేదు. అందుకు కారణం దేశంలో కార్మికులకు చాలీ చాలని జీతాలు లభించడమే. ఎప్పుడో వచ్చే పింఛను కోసం, అసలు అప్పటికి బతికి ఉంటామో, లేదో అన్న సంశయంతో నెలకు వంద రూపాయలను చెల్లించలేని మనస్థత్వం కలిగిన వాళ్లు, ఆర్థిక స్థోమత లేనివాళ్లు భారత కార్మిక రంగంలో ఎక్కువ మంది. నెలకు 15 వేల రూపాయల లోపు జీతం అందుకునే కార్మికులకు మాత్రమే ఈ పింఛను పథకం వర్తించడం ఇక్కడ గమనార్హం. 60 ఏళ్ల వయస్సులో వచ్చే మూడు వేల రూపాయలు నెలవారి పన్ల పొడికి కూడా సరిపోకపోవచ్చు. అలాంటప్పుడు ఈ పథకం వల్ల పది కోట్ల మంది కార్మికులకు ప్రయోజనం కలుగుతుందని ఎలా లెక్కలు వేశారో కేంద్రానికే తెలియాలి. అయినా ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన పథకానికి ప్రచారం కావాలిగానీ ప్రయోజనం సంగతి ప్రభుత్వానికి ఎందుకు? -
‘పుండు మీద కారం చల్లుతున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. బడ్జెట్లో తెలంగాణ ప్రయోజనాలను కాపాడంలో టీఆర్ఎస్ ఎంపీలు ఘోరంగా విఫలమైయ్యారని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలకు జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను కూడా సాధించలేకపోయారని మండిపడ్డారు. మిషన్ భగీరథ పథకానికి నిధులు, రైల్వే కోచ్, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని డిమాండ్ చేయడంలో టీఆర్ఎస్ దారుణంగా విఫలమైందని శ్రవణ్ వ్యాఖ్యానించారు. రైతుల ఓట్లును కొనేందుకు ఆరువేల ఇస్తామని చెప్తూ.. పుండు మీద కారం చల్లుతున్నారని శ్రవణ్ మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీకి టీఆర్ఎస్ పార్టీ కొమ్ము కాస్తోందని ఆయన ఆరోపించారు. ఆ రెండు పార్టీలు కలిసి తెలంగాణ ప్రజల నోళ్లలో మన్ను కొట్టాయని ధ్వజమెత్తారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకోలేదని, ఆదాయపన్ను స్లాబులు మార్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని శ్రవణ్ అన్నారు. -
ఇది ‘గరిష్ట ప్రభుత్వం కనిష్ట పాలన’
సాక్షి, న్యూఢిల్లీ : ‘మినిమమ్ గవర్నమెంట్, మాగ్జిమమ్ గవర్నెస్ (కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలన)’ అన్నది 2014లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇటు నరేంద్ర మోదీ అటు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ప్రధాన నినాదం. అలాగే ‘పేద ప్రజల జీవితాలను మెరగుపర్చడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలకు ప్రత్యక్ష తార్కాణం. మేము అధికారంలోకి వస్తే సాంఘిక సంక్షేమ తాయిలాల జోలికి వెళ్లకుండా కొత్త ఉద్యోగాలను సష్టించడం ద్వారా, ఆర్థిక అవకాశాలను పెంచడం ద్వారా ప్రజల ప్రగతిని సాధిస్తాం’ అదే ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీ విస్తతంగా చేసిన ప్రచారం. ‘కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలన’ నినాదానికి కట్టుబడి నరేంద్ర మోదీ 2014, మే నెలలో కేవలం 45 మందితో కేంద్ర కేబినెట్ను ఏర్పాటు చేశారు. అంతకుముందు మన్మోహన్ సింగ్ నేతత్వంలోని యూపీఏ ప్రభుత్వం కేబినెట్లో 71 మంది సభ్యులు ఉన్నారు. 2014, నవంబర్లో మోదీ తన కేబినెట్ను 66 మంది సభ్యులకు విస్తరించారు. ఆ తర్వాత 2016, జూలై నెలలో మోదీ తన కేబినెట్ను మరోసారి విస్తరించి 78 మంది సభ్యులకు చేర్చారు. అంటే మన్మోహన్ సింగ్ కేబినెట్ కన్నా ఏడుగురు సభ్యులు ఎక్కువ. ఈ లెక్కన ఆయన కనిష్ట ప్రభుత్వం అనే నినాదం కాలగర్భంలో కలిసి పోయింది. ఇక గరిష్ట పాలన గురించి చెప్పాలంటే ‘పెద్ద నోట్ల రద్దు’ నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థనే చిన్నాభిన్నం చేశారు. కొత్త ఉద్యోగాలను సష్టించే మాట దేవుడెరుగు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కారణంగా ప్రైవేటు రంగంలో 86 లక్షల నుంచి కోటి ఉద్యోగాల వరకు ప్రజలు కోల్పోయారని పలు సర్వేలు ఇప్పటికే తేల్చాయి. ‘స్వచ్ భారత్’ లాంటి విస్తృత ప్రచార పథకం ఏమేరకు విజయం సాధించిందో ప్రజలకు తెల్సిందే. సాంఘిక సంక్షేమ కార్యక్రమాల జోలికి వెళ్లనన్న నరేంద్ర మోదీ 2016లో చాలా ఆర్భాటంగా ‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన’ పథకాన్ని ప్రవేశ పెట్టారు. దారిద్య్ర దిగువనున్న పేద మహిళలకు ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి, సబ్సిడీపై సిలిండర్లను సరఫరా చేయడం ఈ పథకం ఉద్దేశం. మొదటిసారి సరఫరా చేసిన సిలిండర్ ఖర్చు కాగానే మెజారిటీ గ్యాస్ కనెక్షన్లన్నీ అటకెక్కాయి. ఖర్చుతో కూడిన గ్యాస్ కనెక్షకన్నా ఉచితంగా దొరికే వంట చెరకును పేద ప్రజలు ఆశ్రయించడం వల్ల ఈ పథకం 20 శాతం కూడా విజయం సాధించలేదు. అతిపెద్ద సాంఘిక సంక్షేమ కార్యక్రమంగా పేరుపొందిన జాతీయ గ్రామీణ పథకాన్ని అమలు చేయడంలో కూడా మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలం అవుతోంది. గతేడాది నవంబర్ 15 నాటి బకాయిలను తెలుగు రాష్ట్రాలతోపాటు పలు రాష్ట్రాలకు ఇంతవరకు కేంద్రం విడుదల చేయలేదు. మోదీ ప్రభుత్వం శుక్రవారం నాడు పార్లమెంట్ సమావేశంలో ప్రవేశ పెట్టిన బడ్జెట్లో కూడా ఎక్కువగా సాంఘిక సంక్షేమ తాయిలాలే ఉన్నాయి. రైతులకు ఏడాదికి ఆరువేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం, అసంఘటిత రంగంలో నెలకు 15 వేల రూపాయలకు మించని వేతన జీవులకు నెలకు మూడు వేల రూపాయల పింఛను ఇస్తామనడం, వ్యక్తిగత ఆదాయం పన్ను మినహాయింపు పరిమితిని రెండున్నర లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంచడం సంక్షేమ తాయిలాలు కావా? వీటి జోలికి వెల్లకుండా కొత్త ఉద్యోగాలను సష్టిస్తానన్న మోదీ, ఆ దిశగా బడ్జెట్లో ఒక్క చర్య కూడా తీసుకోలేదు. పైగా మూడు నెలల తాత్కాలిక బడ్జెట్ అంటూ పూర్తి బడ్జెట్ను సమర్పించడం ఎంతమేరకు సమంజసం. ‘కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలన’ పూర్తిగా తిరగబడింది. -
‘రాహుల్కు కనీసం ఆ విషయమైనా తెలుసా’
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ నేత కిషన్రెడ్డి విమర్శలు గుప్పించారు. రాహుల్కు వ్యవసాయం అంటే తెలుసా అని ప్రశ్నించారు. కనీసం పాలు బర్రె నుంచి వస్తాయా.. దున్నపోతు నుంచి వస్తాయా అనేది కూడా తెలియదని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ అన్ని వర్గాలకు న్యాయం చేసేదిగా ఉందని కొనియాడారు. ప్రధాని మోదీ నీతి, నిజాయితీతోనే దేశంలో పాలన గాడిన పడిందన్నారు. మోదీ ప్రజాకర్షక బడ్జెట్ను జీర్ణించుకోలేక కొందరు అనవరస ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్ చుట్టూ.. కేంద్రంలో మోదీ చుట్టూ ‘రైతులకు రోజుకు 17 రూపాయలు ఇచ్చే పథకాన్ని ప్రారంభించారని రాహుల్ విమర్శిస్తున్నారు. మరి ఇన్నేళ్ల కాంగ్రెస్ పాలనలో వారికి 10 రూపాయలైనా ఇచ్చారా’ అని రాహుల్ విమర్శలను తిప్పికొట్టారు. పంటలకు కనీస మద్దతు ఇవ్వని కాంగ్రెస్ ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం తెచ్చిన పథకాలపై ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ‘కిసాన్ సమ్మాన్’ పథకంతో రైతులకెంతో మేలు జరగుతుందని, ఏడాదికి 6 వేల రూపాయల నగదు బదిలీ పథకం రైతుల్లో ఉత్సాహం నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘మొన్న తెలంగాణ ఎన్నికలు కేసీఆర్ చుట్టూ తిరిగాయి. రాబోయే పార్లమెంటు ఎన్నికలు మోదీ, బీజేపీ చుట్టూ తిరుగుతాయి’ అని జోస్యం చెప్పారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ రైతుబంధు పథకం ప్రారంభించారని.. కానీ, ఎన్నికలకు ముందే ‘కిసాన్ సమ్మాన్ నిధి’ని తెచ్చారని కిషన్రెడ్డి చెప్పుకొచ్చారు. -
ఓట్ల బడ్జెట్..!
-
రైతులపై వరాల జల్లు
కేంద్ర బడ్జెట్లో మధ్యతరగతి వర్గాలపై వరాల జల్లు కురిసింది. ముఖ్యంగా రైతులకు అగ్ర తాంబూలం ఇచ్చారు. పెట్టుబడికి ఇబ్బంది ఉండొద్దనే ఉద్దేశంతో ఏడాదికి ఆరు వేల రూపాయలు అందజేసేందుకు ‘కిసాన్ సమ్మాన్ నిధి’ని ప్రవేశపెట్టింది. దీనికితోడు పంట రుణాలపై రెండు శాతం వడ్డీ మాఫీని ప్రకటించింది. అంగన్వాడీల వేతనాలను యాభై శాతం పెంచాలనే నిర్ణయంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసంఘటిత రంగ కార్మికులకు రూ.3 వేల పింఛన్ ఇవ్వడానికి ‘ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్’ స్కీంను ప్రవేశపెట్టారు. వేతనజీవులకు రూ.5లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు ఇస్తుండటంతో వారికి మరింత మేలు చేకూరనుంది. సాక్షి, మెదక్: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రైతులపై వరాలు కురిపించింది. ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6వేల ఆర్థిక సహాయం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకే రైతు బంధు పథకం అమలు చేస్తుండగా కేంద్రం ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు ఏడాదికి రూ.6వేలు అందనున్నాయి. ఈ పథకం ద్వారా జిల్లాలోని 2,03,788 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రైతుల ఖాతాల్లో ఏడాదికి రూ.122.27 కోట్ల నిధులు మూడు విడతల్లో జమ కానున్నాయి. ఈ పథకం 1 డిసెంబర్ 2018 నుంచి అమలులోకి రానుంది. జిల్లాలో మొత్తం 2,18,747 మంది రైతులు ఉన్నారు. వీరిలో 2.5 ఎకరాలలోపు వ్యవసాయ భూమి ఉన్న చిన్నకారు రైతులు 51,885 మంది ఉన్నారు. 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాలోపు వ్యవసాయ సాగుభూమి ఉన్న సన్నకారు రైతులు 1,51,903 మంది ఉన్నారు. ఐదు ఎకరాలలోపు వ్యవసాయసాగు భూమి ఉన్న 2,03,788 మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద లబ్ధి చేకూరనుంది. ఏడాదికి రూ.6వేల చొప్పున జిల్లాలోని 2,03,788 మంది రైతులకు రూ.122.27 కోట్ల పెట్టుబడి సాయం అందనుంది. తొలి విడత ఆర్థిక సహాయం రూ.40.75 కోట్లు మార్చిలోపు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఎకరాను యూనిట్గా తీసుకుని ఆర్థిక సహాయం ప్రకటిస్తే రైతులకు మరింత మేలు జరిగేది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అందజేసే ఆర్థిక సహాయంతో రైతులకు అప్పుల తిప్పలు తప్పటంతోపాటు ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టేందుకు అవకాశం ఉంది. అలాగే జిల్లాలో పంటరుణాలపై 2 శాతం వడ్డీ మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. జిల్లాలో ఏటా లక్ష మందికిపైగా రైతులు రుణాలు తీసుకుంటున్నారు. వీరిలో సగానికిపైగా రైతులు సకాలంలో రుణాలు చెల్లించటం జరుగుతుంది. దీంతో 50వేల మంది రైతులకు 2 శాతం వడ్డీ మాఫీ అయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా గోవుల ఉత్పాదకత పెంచేందుకు చర్యలు తీసుకోనుంది. మత్స్యకార్మికులు కిసాన్ క్రెడిట్ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపితే 2 శాతం వడ్డీ మాఫీ ప్రకటించింది. ఇదికూడా జిల్లాలోని మత్సకార్మికులకు లాభం చేకూర్చనుంది. ఆనందంలో అంగన్వాడీలు కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల వేతనం 50 శాతం పెంచుతున్నట్లు బడ్జెట్లో ప్రకటించింది. ఈ నిర్ణయంతో జిల్లాలోని 865 మంది అంగన్వాడీ ఉద్యోగులకు వేతనం పెరగనుంది. జిల్లాలో మొత్తం 885 అంగన్వాడీలు ఉండగా వీటిలో 865 మంది అంగన్వాడీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరికి రూ.10,500 వేతనం అందుతుంది. ఇందులో కేంద్రం వాటా రూ.4500 కాగా రాష్ట్ర ప్రభుత్వం రూ.6వేల తనవాటాగా చెల్లిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 50 శాతం పెంచి తన వాటాగా ఉద్యోగులకు ఇకపై రూ.6750 చెల్లించనుంది. దీంతో అంగన్వాడీలకు ఇకపై ప్రతినెలా రూ.12,750 వేతనం అందనుంది. అసంఘటిత రంగ కార్మికులకు మేలు కేంద్రం అసంఘటిత రంగ కార్మికులకు వరం ప్రకటించింది. 60 ఏళ్ల వయస్సుదాటిన వారికి ప్రతినెలా రూ.3వేల పింఛన్ ఇవ్వనున్నట్లు బడ్జెట్లో తెలిపింది. ‘ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్’ పేరిట అసంఘటిత రంగ కార్మికులకు రూ.3 వేల పింఛన్ ఇస్తుంది. ఇందుకోసం రూ.15వేల లోపు ఆదాయం ఉన్న అసంఘటితరంగ కార్మికుల నుంచి ప్రతినెలా రూ.100 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 4,300 మంది అసంఘటితరంగ కార్మికులు ఉన్నారు. వీరందిరికీ పింఛన్ పథకం వర్తిసుంది. అయితే జిల్లాలో పదివేల మందికిపైగా అసంఘటితరంగ కార్మికులు ఉన్నట్లు అంచనా. సర్వే చేసి వీరి పేర్లను నూతన పథకంలో చేర్చాలని సీఐటీయూ నేతలు కోరుతున్నారు. పన్ను మినహాయింపు.. వేతన జీవులకు కేంద్రం బడ్జెట్లో ఊరటనిచ్చే ప్రకటన చేసింది. వార్షిక ఆదాయం రూ.5 లక్షలు ఉన్న ఉద్యోగులకు ఆదాయపు పన్ను పూర్తిగా మినహాయింపు ప్రకటించింది. ఈ నిర్ణయంతో జిల్లాలోని 1,500 మంది ఉద్యోగులకు మేలు జరనుంది. మెదక్ జిల్లాలో మొత్తం 6,400 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 1500 మంది ఆదాయపు పన్ను చెల్లించే వారు ఉన్నారు. కేంద్రం నిర్ణయంతో వీరందరికీ మేలు జరనుంది. -
‘బడ్జెట్ బాగాలేదన్నా అరెస్ట్ చేస్తారు’
కోల్కతా : విపక్షాలను రాజకీయంగా ఎదుర్కోలేకనే.. ప్రధాని ఇలా వ్యక్తిగత దాడులకు పాల్పడుతన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టిన అనంతరం మమతా మీడియాతో మాట్లాడుతూ.. ‘నాకు హిందీ సరిగా రాదు. చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ అర చేతిలో వైకుంఠం చూపినట్లుగా ఉంది. ఈ బడ్జెట్ వల్ల జనాలకు ఎలాంటి ప్రయెజనం ఉండదు. ఇలా అంటున్నందుకు వారు(నరేంద్ర మోదీ) నన్ను అరెస్ట్ చేయవచ్చు. కానీ నేను ఇలాంటి వాటికి భయపడను’ అని తెలిపారు. అంతేకాక ‘ప్రసుత్తం నరేంద్ర మోదీ ప్రభుత్వం విపక్షాలను రాజకీయంగా ఎదుర్కొలేక.. వ్యక్తిగత దాడులకు పాల్పడుతున్నదనే విషయం జనాలందరికి తెలుసు. అందులో భాగంగానే ఏదో ఒకటి చేసి ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురి చేయ్యండి అంటూ మోదీ.. అధికారులను ఆదేశిస్తున్నారు. ప్రధాని ఒత్తిడి మేరకే అధికారలు ఇలా చేస్తున్నారు. ఈ విషయంలో అధికారుల మీద నాకు ఎలాంటి కోపం లేదు. కానీ ఇలాంటి చర్యలకు పూనుకుని మోదీ ప్రతిపక్షాలను తీవ్రంగా అవమానిస్తున్నార’ని మమతా ఆరోపించారు. అయితే మమతా మోదీపై ఇలా విరుచుకు పడటానికి కారణం ఉంది. సంచలనం సృష్టించిన కోట్ల రూపాయల ‘శారద పోంజి’ స్కామ్ విచారణ నిమిత్తం సీబీఐ అధికారులు రెండు రోజుల క్రితం మమతా పర్సనల్ సెక్రటరీని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మమతా, మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక వ్యక్తిగత రాగద్వేషాలకు తావు లేకుండా పవిత్రంగా రాజకీయాలు చేయగలరా అంటూ మమతా, మోదీకి సవాలు విసిరారు. -
2.13లక్షల మంది రైతులకు ప్రయోజనం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: లోక్సభ ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర సర్కారు వరాల వర్షం కురిపించింది. మరోసారి గెలుపే లక్ష్యంగా సాగిన ఈ బడ్జెట్లో వేతన జీవులకు, రైతాంగానికి భారీగా తాయిలాలు ప్రకటించింది. ఆర్థిక మంత్రి పీయూష్గోయల్ శుక్రవారం పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో ప్రభుత్వం అన్నదాతలకు ఆర్థిక చేయూత ఇచ్చింది. ఆదాయ పన్ను పరిమితి పెంచుతూ చారిత్రక నిర్ణయం తీసుకుంది. గృహ కొనుగోళ్లపై జీఎస్టీ తగ్గింపు వంటి నిర్ణయాల పట్ల జిల్లా ప్రజల్లో సానుకూల స్పందన లభిస్తోంది. అసంఘటిత కార్మికులకు అండ అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం దిశగా అడుగులు పడ్డాయి. 60 ఏళ్లు నిండిన కార్మికులకు నెలకు రూ.3 వేల చొప్పున పెన్షన్ ఇవ్వన్నుట్లు బడ్జెట్లో పొందుపర్చారు. అయితే ఈ కార్మికులు నెలకు రూ.100 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. వయసు 60 ఏళ్లు నిండినప్పటి నుంచి నెలకు రూ.3 వేల చొప్పున పెన్షన్ పొందవచ్చు. జిల్లాలో వందల సంఖ్యలో పరిశ్రమలు, కంపెనీలు ఉన్నాయి. రియల్ రంగం జోరుమీదుండటంతో భవన నిర్మాణ కార్మికులు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. మొత్తం మీద జిల్లాలోని సుమారు 1.60 లక్షల మంది అసంఘటిత కార్మికులకు లబ్ధి చేకూరనుంది. ఐదు లక్షల మంది ఉద్యోగులకు ఊరట వేతన జీవులకు కేంద్రం ఊరట కల్పించింది. ఆదాయ పన్ను పరిమితిని భారీగా పెంచింది. ఊహించనిరీతిలో పరిమితిని రూ.5 లక్షలుగా నిర్దేశించింది. వార్షిక ఆదాయం రూ.5లక్షల వరకూ ఉన్న వారు ఇకపై ఆదాయపుపన్ను చెల్లించనవసరం లేదు. పొదుపు, పెట్టుబడులతో కలిపి రూ.6.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చారు. దీంతో జిల్లావ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది వేతనజీవులకు వెసులుబాటు కలుగనుంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 20వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు పనిచేస్తుండగా..వీరందరికి తాజా నిర్ణయంతో ఐటీ చెల్లింపు బాధల నుంచి విముక్తి కలుగనుంది. జిల్లాలోని ఐటీ హబ్లో పనిచేస్తున్న దాదాపు లక్ష మందికిపైగా ఐటీ నిపుణులకు కూడా కొంతమేర పన్ను మినహాయింపు దక్కనుంది. వీరేగాకుండా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, రక్షణసంస్థల్లో పనిచేస్తున్న మరో లక్ష మందికి కూడా ఆదాయ పన్ను పరిమితి పెంపుతో రాయితీ లభించనుంది. ఇంకోవైపు ప్రవేటు రంగ సంస్థల్లో పనిచేసే వేతన జీవులకు కూడా ఈ నిర్ణయం కలిసి రానుంది. 2.13లక్షల మంది రైతులకు ప్రయోజనం వ్యవసాయానికి మంచిరోజులు వచ్చాయి. రైతుబంధు కింద రాష్ట్ర సర్కారు ఇప్పటికే ఏడాదికి ఎకరాకు రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయించగా.. తాజాగా కేంద్రం కూడా ఐదెకరాల్లోపు రైతులకు ఏడాదికి రూ.6,000 ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ ద్వారా చిన్నకారు రైతులకు ఈ సాయం అందనుంది. ఐదు ఎకరాల్లోపు భూమి ఉండే ప్రతి రైతుకు మూడు వాయిదాల్లో ఈ మొత్తం చెల్లించనున్నారు. నేరుగా వారి ఖాతాల్లోకి ఈ సొమ్మును బదిలీ చేయనున్నారు. ఈ పథకంతో జిల్లా వ్యాప్తంగా 2,13,208 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుందని అధికారవర్గాలు తెలిపాయి. తద్వారా కేంద్ర ప్రభుత్వంపై రూ.127.92 కోట్ల ఆర్థిక భారం పడనుంది. 2018 డిసెంబర్ నుంచి ఈ పథకం అమలులోకి వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. అంగన్వాడీలకు మేలు మధ్యంతర బడ్జెట్లో అంగన్వాడీ టీచర్లకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం శుభపరిణామం. వారి వేతనాలను 50 శాతం పెంచారు. ప్రస్తుతం ప్రతి అంగన్వాడీ టీచర్కు నెలకు రూ. 10,500 గౌరవ వేతనాన్ని అందజేస్తున్నారు. ఇందులో కేంద్రం వాటా రూ.3 వేలు కాగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 చెల్లిస్తోంది. బడ్జెట్లో పొందుపర్చిన మేరకు ఇకపై కేంద్రం వాటా రూ.6 వేలు ఉండనుంది. అంటే టీచర్లకు రూ.13,500 వేతనం అందనుంది. ఫలితంగా జిల్లాలో సుమారు 1,580 మంది అంగన్వాడీ టీచర్లకు మేలు ఒనగూరనుంది. -
భరోసా.. ఊరట
కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఓట్ఆన్ అకౌంట్ బడ్జెట్లో రైతులు, మధ్యతరగతి ప్రజలపై వరాలు జల్లు కురిపించింది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు పెద్దపీట వేసిన ఎన్డీయే సర్కారు ఒడిదుడుకుల్లో ఉన్న వ్యవసాయానికి దన్నుగా నిలవడానికి సాయం ప్రకటించింది. మరోవైపు ఆదాయ పరిమితిని పెంచడంతో ఉద్యోగులకు పన్నుల నుంచి కొంత ఉపశమనం లభించనుంది. అంగన్వాడీ ఉద్యోగులకు 50 శాతం మేర జీతాలు పెంచనుండటంతో వారిలో ఆనందం నెలకొంది. పింఛన్ ప్రకటనతో అసంఘటిత రంగ కార్మికుల్లో భరోసా పెరిగింది. సాక్షి, వరంగల్ రూరల్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోఝెల్ శుక్రవారం పార్లమెంట్లో శుక్రవారం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ రైతులు, అసంఘటిత రంగ కార్మికుల్లో భరోసా నింపేలా.. ఉద్యోగ వర్గాలకు ఊరటనిచ్చేలా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని లక్షలాది మందికి లబ్ధి చేకూరేలా ఉండగా.. ఆయా వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగులో గిరిజన యూనివర్సిటీకీ నిధులు కేటాయించడంతో గిరిజనుల ఉన్నత విద్యపై ఆశలు రేకెత్తుతున్నాయి. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వర్యం ప్రాజెక్ట్కు జాతీయ హోదా అంశం ప్రస్తావనకు రాలేదు. వరంగల్ రూరల్ జిల్లాలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు సాయమందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా.. కేంద్రం స్పందించలేదు. రైతులకు చేయూత ప్రధానమంత్రి కిసాన్ సమ్మిట్ పేరుతో రైతులకు ప్రతి నాలుగు నెలలకోసారి రూ.2000 చొప్పున ఏడాదికి రూ.6000 వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు పీయూష్ గోయల్ పార్లమెంట్లో బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6,29,110 మంది రైతులు ఉన్నారు. ఇందులో ఐదెకరాల లోపు వ్యవసాయ భూమి కలిగిన చిన్న, సన్నకారు రైతులు జిల్లాలో 5 లక్షలకు పైగా మంది ఉన్నట్లు అంచనా. ఈ మేరకు వీరందరి ఖాతాల్లో నగదు జమ కానుంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం 2018లోనే ఎకరానికి రూ.4000 చొప్పున జిల్లాలోని 6,29,110 మంది రైతులకు రెండు విడతలుగా రైతుబంధు పథకం ద్వారా నగదు పంపిణీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం లాగానే కేంద్రం కూడా రైతులకు ఆర్థిక సాయం చేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కార్మికులకు పెన్షన్ ప్రధానమంత్రి శ్రమ యోగి మన్ధన్ పథకం ద్వారా కొత్త పింఛన్ పథకాన్ని అసంఘటితరంగ కార్మికులకు ప్రకటించింది. రూ.15వేల లోపు ఆదాయం కలిగిన వారందరూ నెలకు రూ.100 ప్రీమియం చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3000 చొప్పున పింఛన్ వస్తుంది. దీని ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 2 లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులు లబ్ధి పొందే అవకాశముంది. రూ.5 లక్షల వరకు పన్ను లేదు.. కేంద్ర బడ్జెట్లో వేతన జీవులకు శుభవార్త చెప్పారు. సంవత్సరాదాయం రూ.5 లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని.. ప్రావిడెంట్ ఫండ్స్, నిర్దేశిత ఈక్విటీలలో రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టిన వారికి కూడా పన్ను మినహాయింపు లభిస్తుందని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఈ లెక్కన ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 40 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, రెండు లక్షలకు పైగా ప్రైవేట్ ఉద్యోగులకు ఊరట లభించనుంది. 50 శాతం వేతనం పెంపుతో అంగన్వాడీ టీచర్లకు ప్రయోజనం చేకూరనుంది. గిరిజన యూనివర్సిటీకి నిధులు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ములుగులో ఏర్పాటు చేయనున్న గిరిజన యూనివర్సిటీకి బడ్టెట్లో రూ.4 కోట్లు కేటాయించారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు రూ.10 కోట్లు కేటాయించింది. తాజాగా కేంద్రం నిధులు కేటాయించడంతో గిరిజనులకు ఉన్నత విద్య అందుబాటులోకి రానుంది. కోరినా స్పందించని కేంద్రం.. ముఖ్యమంత్రిగా రెండో సారి ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కేసీఆర్ గత ఏడాది డిసెంబర్ 26న ప్రధానితో తొలిసారిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వరంగల్ రూరల్ జిల్లాలో ఏర్పాటు చేయనున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్కు రూ.1000 కోట్లు కేటాయించాలని కోరారు. దీంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్ట్కు జాతీయ హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ములుగులో గిరిజన యూనివర్సిటీ, కొత్త జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుతోపాటు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై వినతిపత్రం సమర్పించారు. ఇందులో ఒక్క గిరిజన యూనివర్సిటీకి రూ.4 కోట్లు కేటాయించారు. టెక్స్టైల్ పార్కు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఊసే లేదు. -
హమ్..తుమ్ బడ్జెట్..
సొంత ఇంటి కలను నిజం చేసుకోవచ్చు.స్టార్టప్ కంపెనీలు పెట్టుకోవచ్చు. సినిమాకు హాయిగా వెళ్లొచ్చు...వేతన జీవులు జాలీగా షాపింగ్ చేయొచ్చు..పన్ను పరిమితి లాభంతో సిటీలో సరికొత్త మార్కెటింగ్ ట్రెండ్స్ చోటుచేసుకోనున్నాయి. మాల్స్...స్టాల్స్..మల్టీప్లెక్స్లు ఇతర వ్యాపార వాణిజ్య కేంద్రాలు పెరిగే అవకాశం ఉంది. మధ్యతరగతి ప్రజలు సైతం వీకెండ్ను ఎంజాయ్ చేయవచ్చు.ఎందుకంటే ఇది పీపుల్స్ ఫ్రెండ్లీ బడ్జెట్. శుక్రవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ మధ్యతరగతి ప్రజలకు వరాలు కురిపించింది. ముఖ్యంగా ఆదాయ పన్ను పరిమితి పెంపు నగరంలోని పది లక్షల మంది వేతనజీవులకు భారీఊరట. సాక్షి, సిటీబ్యూరో: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్పై నగరంలోని వేతనజీవులు,మధ్యతరగతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా శుక్రవారం ప్రకటించిన ‘బడ్జెట్’ గ్రేటర్లోని వేతన జీవులకు భారీ ఊరటనిచ్చింది. ఆదాయ పన్ను పరిమితి రెండున్నర లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంచడంతో గ్రేటర్ నగరంలోని సుమారు 10 లక్షల మంది వేతనజీవులకులబ్ధి చేకూరనుంది. అలాగే నగరంలోని మధ్యతరగతి, వేతన జీవులకుగృహరుణాల చెల్లింపుల్లో రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చారు. ‘ప్రధానమంత్రి శ్రమ్ యోజన’ కింద 60 ఏళ్లు దాటిన కార్మికులకు నెలకు రూ.3,000 పింఛను చెల్లిస్తారు. ఈ పథకం కింద గ్రేటర్ పరిధిలో సుమారు15 లక్షల మంది కార్మికుల భద్రతకు భరోసా చేకూరనుంది. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి గతేడాది కంటే స్వల్పంగా కేటాయింపులు తగ్గడంతో పెద్దగా ప్రభావమేమీ ఉండదనిభావిస్తున్నారు. నగరంలో ఇప్పటికే 92 ప్రాంతాల్లో నిర్మించనున్న లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షల చొప్పునమంజూరయ్యాయి. 2022 నాటికి అందరికీ ఇళ్లు లక్ష్యంలో భాగంగా, లక్ష ఇళ్ల నిర్మాణ పురోగతిని బట్టి నిధులందుతాయి. ♦ సినిమా థియేటర్లపై జీఎస్టీ భారాన్ని కాస్త తగ్గించారు. సింగిల్ థియేటర్లపై గతంలో ఉన్న 18 శాతం జీఎస్టీని 12 శాతానికి, మల్టీప్లెక్స్లో 28 శాతం నుంచి 18 శాతానికి జీఎస్టీ తగ్గించారు. దీంతో సింగిల్ థియేటర్లలో గతంలో రూ.118 ఉన్న టిక్కెట్ ధర రూ.112కు తగ్గనుంది. నగరంలోని సుమారు 1100 సింగిల్ థియేటర్లకు ఇది ఊరట కలిగించే అంశమే. మల్టిప్లెక్స్ల్లోనూ ధర తగ్గే అవకాశం ఉంది. ♦ కేంద్ర బడ్జెట్లో ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, బీబీనగర్లోని ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ ప్రస్తావనే లేదు.‘ఆయుష్మాన్ భవ’ సహా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని కీలక ఆస్పత్రులకు కనీస నిధులు కేటాయించలేదు. హెచ్సీయూ సహా ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ, రాష్ట్రస్థాయిలోని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఈ బడ్జెట్ నిరాశే మిగిల్చింది. ♦ రైళ్లకు సంబంధించి కొత్త రైళ్లు గానీ, లైన్లు గానీ లేవు. పాతప్రాజెక్టులకు మాత్రం నామమాత్రం నిధులిచ్చారు. ఎంఎంటీఎస్–2కు రూ.10 లక్షలు, యాదాద్రి ఎంఎంటీఎస్కు రూ.20 కోట్లు, చర్లపల్లి టర్మినల్కు రూ.5 కోట్ల బడ్జెట్ కేటాయించారు. దీంతో రాష్ట్రం వాటా ఇస్తే తప్ప రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. ♦ ఇక కిసాన్ సమ్మాన్ పథకం కింద గ్రేటర్ పరిధిలోని మేడ్చల్ జిల్లాలో 24,591 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ♦ ఉజ్వల పథకానికి కేంద్రం మరింత ఊతం ఇచ్చినా...ఈ పథకం పట్ల గ్రేటర్లో లబ్ధిదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ పథకం కింద ఎల్పీజీ కనెక్షన్ పొందడానికి సవాలక్ష నిబంధనలు అడ్డుపడుతున్నాయి. ♦ మొత్తంగా కేంద్రబడ్జెట్ ఈసారి నగరంలోని ఎక్కువ మంది జనాభాకు ఊరటనిచ్చినట్లేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు విపక్షాలు మాత్రం బడ్జెట్ను విమర్శిస్తున్నాయి. ఎన్నికల కోసం ప్రవేశపెట్టిన ప్రజాకర్షక బడ్జెట్ అంటూ విమర్శించగా...బీజేపీ నేతలు మాత్రం హర్షం వ్యక్తం చేశారు. -
కేంద్ర బడ్జెట్.. కాంగ్రెస్పై కుళ్లు జోక్స్
న్యూఢిల్లీ : తాత్కాలిక ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ నేపథ్యలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్పై సోషల్ మీడియాలో కుళ్లు జోకులు పేలుతున్నాయి. మీమ్స్, సెటైరిక్ కామెంట్స్ తెగహల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్లో మధ్యతరగతి కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వడం.. వేతన జీవులకు భారీ ఊరట లభించడంపై నెటిజన్లు ఫన్నీ మీమ్స్ సృష్టిస్తున్నారు. తమ వీడియో ఎడిటింగ్ నైపుణ్యానికి పని చెప్పి మరి ట్రోల్ చేస్తున్నారు. గోయల్ ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదని సెటైర్స్ వేస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ల ఫొటోలతో సరదాగా ఉన్న ఈ ట్వీట్ల్ నవ్వును తెప్పిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో వేతన జీవులకు రూ.5లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం, 15వేల లోపు జీతం ఉన్న అసంఘటిత కార్మికులకు పెన్షన్ స్కీం ప్రవేశపెట్టడం, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడంపై అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. ప్రతిపక్షాలు మాత్రం ఇది బీజేపీ ఎన్నికల జిమ్మిక్కేనని పెదవి విరుస్తున్నాయి. This is what Piyush Goyal did to the opposition with #Budget2019 . pic.twitter.com/CzEFFJF3MR — Krishna (@Atheist_Krishna) February 1, 2019 Pic1- Opposition before #Budget2019 Pic2- Opposition After #Budget2019#BudgetSession2019 #BudgetForNewIndia pic.twitter.com/ElDapx37tu — Dhavan kadia (@dhaone110) February 1, 2019 Middle class salaried people watching #Budget2019 from start to finish. pic.twitter.com/rTPxqXf4JN — Krishna (@Atheist_Krishna) February 1, 2019 Middle class before and after #Budget2019 pic.twitter.com/JBbK8PQWVM — Kuptaan 🇮🇳 (@Kuptaan) February 1, 2019 -
ఉద్యోగులకు ఊరట
కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్ చిన్న, సన్నకారు రైతులు, ఉద్యోగులు, అంగన్వాడీలు, అసంఘటిత రంగ కార్మికులకు మేలు కల్పించింది. ఐదెకరాలలోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ. 6 వేలు అందించనున్నట్లు ప్రకటించింది. అక్రమాలకు తావు లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే పెట్టుబడి సాయం జమకానుంది. ఆదాయపు పన్ను పరిమితి రూ. 5 లక్షలకు పెంచడంతో ఉద్యోగులు, వేతనాలు పెంచడంతో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 60 ఏళ్లు నిండిన అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ కింద రూ. 3 వేలు అందించనున్నారు. కార్మికులు పెన్షన్ కోసం ప్రతి నెల రూ. 100 చొప్పున జమ చేయాల్సి ఉంటుంది. నిజామాబాద్నాగారం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఉద్యోగులకు ఊరట లభించింది. ఎప్పటి నుంచో ఉద్యోగులు ఆదాయ పరిమితి పెంపు, గ్రాడ్యూటీ, ఒకే పెన్షన్ విధానం తదితర వాటిపై ఎదురుచూస్తున్నారు. ఈ బడ్జెట్లో ప్రభు త్వం ఆదాయ పరిమితిని పెంచడంతో ఉద్యోగుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. నిజామాబాద్ ఉమ్మడి(కామారెడ్డి–నిజామాబాద్)ల్లో సుమారు 42 వేల మంది ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉన్నారు. ఉద్యోగులకు లబ్ధి ఇలా.. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు 42 వేల మంది ఉన్నారు. ఇందులో నిజామాబాద్ జిల్లాలో 24 వేల మంది ఉద్యోగులు, కామారెడ్డి జిల్లాలో 18 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో సీపీఎస్ విధానంలో ఉన్న ఉద్యోగులు సుమారుగా రెండు జిల్లాలో కలిపి 9 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో 5342 మంది, కామారెడ్డి జిల్లాలో 3,560 మంది ఉన్నారు. అయితే ఉద్యోగుల ఆదాయ పరిమితి పెంపు 2.50 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచారు. గ్రాట్యూటీ పరిధి రూ. 10 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు పెంచారు. ప్రావిడెంట్ ఫండ్లో పెట్టుబడి పెడితే ఉద్యోగులకు రూ. 6.5 లక్షలలోపు ఆదాయపన్ను మినహాయింపు, స్టాండెడ్ డిడెక్షన్ ఇప్పటి వరకు రూ. లక్షా 50 వేల వరకు ఉండేది. మరో రూ. 50 వేలు పెంచడం జరిగింది. ఆదాయ పరిమితి పెంపు విషయంలో ఈబీసీ కులాల వారికి మాత్రం రూ. 8 లక్షలలోపు ఆదాయ పరిమితి ఉన్న వారిని పేదలుగా గుర్తించారు. అలాగే ఉద్యోగులకు కూడా రూ. 5 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు చేసి ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సీపీఎస్ ఉద్యోగులకు అన్యాయం దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని ప్రవేశపెడుతున్న ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో అన్యాయం చేసింది. ప్రజాప్రతినిధులకు మాత్రం ఐదేళ్లు పరిపాలిస్తే జీవితాంతం పెన్షన్ సౌకర్యం ఉంది. అదే ఏళ్ల తరబడి ఉద్యోగులు నిర్వహిస్తున్న వారికి మాత్రం పెన్షన్ సౌకర్యం లేకుండా పోయింది. ఉమ్మడి జిల్లాలో సుమారు 9 వేల మందికిపైగా సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారు. 2004 సంవత్సరం తరువాత ఉద్యోగంలో చేరిన ప్రతి ఒక్కరికి సీపీఎస్ విధానం అమలవుతోంది. దీంతో ప్రభుత్వం నుంచి పెన్షన్ లేకుండా పోయింది. ఒకే దేశం ఒకే పెన్షన్ విధానాన్ని ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తే బాగుండేదని కోరుతున్నారు. ఏళ్ల తరబడిగా పోరాటాలు చేస్తున్న సీపీఎస్ ఉద్యోగులకు మాత్రం అన్యాయం జరుగుతూనే ఉంది. ప్రభుత్వాలు మారినా సీపీఎస్ ఉద్యోగులకు మాత్రం పాతపెన్షన్ విధానాన్ని అమలు చేయడం లేదు. దీంతో పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయులు సీపీఎస్ విధానం కొనసాగింపుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
అన్నదాతకు..భరోసా!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : కేంద్ర బడ్జెట్ జిల్లారైతుల్లో ఆశలు నింపింది. సాగు భారంగా మారి, పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోయి ఆత్మహత్యలను ఆశ్రయించిన రైతుల సంఖ్య తక్కువేం కాదు. ఈ నేపథ్యంలోనే సాగును పండగ చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం పేర రెండు పంట సీజన్లకు కలిపి ఏటా ఎకరాకు రూ.8వేల ఆర్థిక సాయం అందిస్తోంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలకు ముందు ఈ మొత్తాన్ని రూ.10వేల వరకు పెంచుతున్నామని ప్రకటించింది. తాజాగా, శుక్రవారం కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో రైతుబంధును పోలిన పథకాన్నే ప్రకటించారు. ఈ మేరకు కేంద్రం ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు రెండు సీజన్లకు కలిపి రూ.6వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమచేస్తారు. దీంతో ప్రతి ఎకరాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయమే రూ.16వేలు అవుతుంది. దీంతో రైతుల పెట్టుబడి కష్టాలు తీరినట్టేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జిల్లా వ్యాప్తంగా 4.41లక్షల మంది రైతులు ఉండగా, ఐదు ఎకరాల లోపు పంట భూములున్న రైతులు 4.25లక్షల మందిదాకా ఉంటారని జిల్లా వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. అంటే 90శాతానికి పైగా రైతులు ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న వారే. దీంతో కేంద్రం నుంచి ప్రతి ఏటా రూ.255కోట్ల మేర ఆర్థిక సాయం పెట్టుబడుల కోసం అందనుంది. కేంద్రం బడ్జెట్లో ప్రకటించిన ఈ నిర్ణయం పట్ల రైతులు, రైతు సంఘాల నేతలు హర్షం ప్రకటించారు. అంగన్వాడీ టీచర్లకూ తీపి కబురు అంగన్వాడీ టీచర్లకూ కేంద్ర బడ్జెట్ తీపి కబురే అందించింది. వారు ప్రస్తుతం తీసుకుంటున్న వేతనాలను 50 శాతం పెంచుతున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. దీంతో ప్రతిఏటా జిల్లాలోని అంగన్వాడీ టీచర్లకు అదనంగా రూ.19.41కోట్లు చెల్లింపులు జరగనున్నాయి. జిల్లాలో 2093 అంగన్వాడీ కేద్రాలు ఉండగా, వాటిలో 261 మినీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో పనిచేసే టీచర్లకు ప్రతినెలా రూ.6700 వేతనం అందుతోంది. అంటే ఏటా రూ.2,09,84,400 వేతనాలు అవుతుండగా 50 శాతం పెంపుతో అదనంగా మరో రూ.1,04,92,200 లభించనున్నాయి. మరో 1,832 కేంద్రాల్లో అంతే సంఖ్యలో ఉన్న ఆయాలకు ప్రతినెలా రూ.6700 వేతనం లభిస్తోంది. వీరికీ ఏటా అదనంగా రూ.1,04,92,200 ముట్టనున్నాయి. ఇదే కేంద్రాల్లో పనిచేస్తున్న 1832 మంది అంగన్వాడీ టీచర్లకు నెలకు రూ.10వేల వేతనం అందుతోంది. ఇక నుంచి ఈ వేతనం రూ.15వేలు కానుంది. రూ.10వేల చొప్పున ఏటా రూ.21,98,40,000 ఖర్చు అవుతుండగా, ఇపుడు అదనంగా మరో రూ.10,99,20,000 అందనున్నాయి. మొత్తంగా అంగన్వాడీ టీచర్లకు ఏటా రూ.19,40,58,600 వేతనాల రూపంలో కేంద్రం అందించనుంది. ఒక్కసారిగా యాభై శాతం పెరిగిన వేతనాలతో అంగన్వాడీ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల హర్షం కేంద్ర బడ్జెట్ సగటు ఉద్యోగిపైనా కరుణ చూపింది. ఇదివరకటి ఆదాయ పన్ను పరిమితిని పెంచడంతో ఎక్కువ మంది ఉద్యోగులు పన్నుల భారంనుంచి బయట పడుతున్నారు. గతంలో రూ.2.50లక్షల రూపాయల వార్షిక వేతన ఆదాయం ఉన్న ప్రతిఉద్యోగి ఆదాయ పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఈ మొత్తాన్ని ఈసారి రూ.5లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించడంతో ఉద్యోగ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వార్షిక వేతనంలో ఇతర మినహాయింపులు, సేవింగ్స్ మినహాయించే రూ.5లక్షల సీలింగ్ పెట్టడంతో ఇది కనీసం రూ.6లక్షలపైచిలుకు వార్షిక వేతనానికి పన్ను మినహాయింపు లభించినట్టేనని అభిప్రాయం పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు రమారమి 41,500 మంది ఉండగా, వీరిలో రూ.5లక్షల వేతనం పొందే వారు సగానికిపైగానే ఉంటారని అంచనా. ఆదాయ పన్ను పరిమితిని పెంచడంతో వీరందరికీ లబ్ధి చేకూరినట్లేనని పేర్కొంటున్నారు. -
సినిమా ఓకే..తినుబండారాలే..!
సాక్షి,సిటీబ్యూరో :సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం మధ్య తరగతిపై వరాలు జల్లు కురిపించింది. శుక్రవారం ప్రకటించిన ‘బడ్జెట్’గ్రేటర్లోని వేతన జీవులకు భారీ ఊరటనిచ్చింది. గత బడ్జెట్లలో మధ్య తరగతికి, ఉద్యోగులకు అనుకున్న స్థాయిలో లబ్ధి చేకూరలేదన్న నిస్పృహతో ఉన్నఉద్యోగులకు ఈసారి కేంద్ర ఆర్థికశాఖ తాత్కాలిక మంత్రి పీయూష్ గోయల్ వరాలు ప్రకటించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆదాయపు పన్నుకలలను మోదీ ప్రభుత్వం సాకారం చేసింది. దీనిపై గ్రేటర్లోని సుమారు10 లక్షల మంది వేతనజీవులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వేతనజీవులకు ఉపశమనం ఇలా.. ఆదాయ పన్ను మినహాయింపు పరిధిని రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడంతో మహానగరం పరిధిలో సుమారు 10 లక్షల మంది ఉద్యోగులకు ఉపశమనం కలగనుంది. దీనికి అదనంగా రూ.6.5 లక్షల ఆదాయం ఉండి బాండ్లు, పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టిన వారికి కూడా పూర్తి పన్ను మినహాయింపునివ్వడం విశేషం. ఆదాయపు పన్ను స్టాండర్డ్ డిడక్షన్ను రూ.40 వేల నుంచి రూ.50 వేలకు పెంచడం మరో ఊరటనిచ్చే అంశం. దీంతోపాటు పోస్టల్, బ్యాంక్ డిపాజిట్లపై వచ్చే వడ్డీపైనా రూ.40 వేల వరకు రాయితీని ఇచ్చింది. అంతేకాదు, రూ.10 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని గ్రాట్యుటీగా అందుకొనే వారికి కూడా ఉపశమనం కల్పించారు. రూ.20 లక్షల వరకు గ్రాట్యుటీపై పన్ను మినహాయించడంపై పదవీవిరమణ పొందిన ఉద్యోగులు సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. సొంతింటికల సాకారం ఆదాయ పన్ను చట్టం సెక్షన్–54 కింద, ఒక ఇంటికి సంబంధించి వర్తించే మూలధన పన్ను మినహాయింపును ఇప్పుడు రెండు ఇళ్లకు పెంచారు. ఈ క్రమంలో ఆ మొత్తం రూ.2 కోట్లకు మించకూడదు. అయితే, ఒక వ్యక్తికి ఈ మినహాయింపు జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే వర్తిస్తుంది. ఈ పరిణామంతో మహానగరంలో సొంతిళ్లు కొనుగోలు చేయాలనుకుంటున్న ఉద్యోగులకు ఇంటి కలలను సాకారం చేసుకునే అవకాశం లభినట్టయింది. హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వశాఖకు గత సంవత్సరం కంటే దాదాపు 12 శాతం బడ్జెట్ పెరగడంతో నగరంపైనా దీని ప్రభావం ఉంటుందనే అభిప్రాయాలున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి గతేడాది కంటే స్వల్పంగా కేటాయింపులు తగ్గడంతో పెద్దగా ప్రభావమేమీ ఉండదని భావిస్తున్నారు. నగరంలో ఇప్పటికే 92 ప్రాంతాల్లో నిర్మించనున్న లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షల చొప్పున మంజూరయ్యాయి. 2022 నాటికి అందరికీ ఇళ్లు లక్ష్యంలో భాగంగా, లక్ష ఇళ్ల నిర్మాణ పురోగతిని బట్టి నిధులందుతాయి. గ్రేటర్లో ప్రస్తుతం మంజూరైన లక్ష ఇళ్లు కాక అదనంగా మరో 20 వేల ఇళ్లు నిర్మించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అందుకు స్థలాలు ఎంపిక చేయాల్సిందిగా అధికారులను ఆదేశించింది. సేకరణ పూర్తయితే వాటికీ నిధులందే అవకాశం ఉంది. ఇళ్ల కొనుగోలుదారుల్లో ఆశలు.. నగరంలో ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగిపోవడంతో చాలామంది ఇళ్ల కొనుగోళ్ల కోసం చూస్తున్నారు. దీంతోపాటు రెండో ఇంటి రుణానికీ ఐటీ బెనిఫిట్ ఇవ్వడంతో నగరంలో ఇళ్ల నిర్మాణం పెరగ్గలదని యోచిస్తున్నారు. ఇంటి అద్దె ద్వారా వచ్చే ఆదాయంపైనా పన్ను విధింపును 1.8 లక్షల నుంచి 2.4 లక్షలకు పెంచడంతో నగరంలో ఇళ్లు అద్దెలకిచ్చిన సొంత భవనాల యజమానులకు సైతం ఉపశమనం కలిగించింది. రెండుఅద్దెలకుమినహాయింపు పిల్లల చదువు రీత్యా కుటుంబం ఒక చోట.. తాను మరో చోట ఉండే ఉద్యోగులకు కూడా బడ్జెట్ ఊరటనిచ్చింది. అటువంటి వారు రెండు చోట్ల ఇళ్లపై చెల్లించే అద్దెలకు మినహాయింపునకు క్లెయిమ్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఉద్యోగులు ‘చెల్లించిన అద్దెకు’ పన్ను మినహాయింపును రూ.2.4 లక్షలకు పెంచడం విశేషం. ఇక నగరంలోని మధ్యతరగతి, వేతన జీవులు గృహరుణాల చెల్లింపుల్లో రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపును ఇచ్చారు. 24 గంటల్లో రీఫండ్లు.. ఆదాయపు పన్ను రీఫండ్లు వేగవంతం కానున్నాయి. వీటిని 24 గంటల్లో పరిష్కరించి నిధులను విడుదల చేయనున్నారు. వచ్చే రెండేళ్లలో అన్ని పన్ను రిటర్నుల అంచనాలను కంప్యూటరీ కరిస్తామన్నారు. పన్ను చెల్లింపుదారులకు, అధికారులకు సంబంధం లేకుండా చేస్తామన్నారు. ఇది వాస్తవ రూపంలోకి వస్తే అవినీతి మరింత తగ్గే అవకాశం ఉంది. కార్మికులభద్రతకు భరోసా.. ‘ప్రస్తుత కేంద్ర బడ్జెట్లో కార్మికులకు మేలు చేకూరే పలు ప్రయోజనాలను ఆమోదించారు. ముఖ్యంగా ప్రధానమంత్రి శ్రమ్ యోజన’ కింద 60 ఏళ్లు దాటిన కార్మికులకు నెలకు రూ.3,000 పింఛను చెల్లిస్తారు. దీనికోసం సంఘటిత రంగ కార్మికులు నెలకు రూ.100 ప్రీమియంగా చెల్లించాలి. ఈ పథకం కింద గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 15 లక్షల మంది కార్మికుల భద్రతకు భరోసా లభించనుంది. సినిమా ఓకే..తినుబండారాలే..! కేంద్ర బడ్జెట్ ‘వినోదానికి’ భరోసానిచ్చింది. సినిమా థియేటర్లపై జీఎస్టీ భారాన్ని కాస్త తగ్గించారు. సింగిల్ థియేటర్లపై గతంలో ఉన్న 18 శాతం జీఎస్టీని 12 శాతానికి, మల్టీప్లెక్స్లో 28 శాతం నుంచి 18 శాతానికి జీఎస్టీ తగ్గించారు. దీంతో సింగిల్ థియేటర్లలో గతంలో రూ.118 ఉన్న టిక్కెట్ ధర రూ.112కు తగ్గనుంది. నగరంలోని సుమారు 1100 సింగిల్ థియేటర్లకు ఇది ఊరట కలిగించే అంశమే. మల్టిప్లెక్స్ల్లో రూ.150 నుంచి రూ.250 వరకు ఉంది. ఈ ఏడాది ఆరంభం నుంచే ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. ఆ మార్పులనే తాజా బడ్జెట్లో పొందపర్చారని పలు సినిమా థియేటర్ల నిర్వాహకులు చెబుతున్నారు. మల్టిప్లెక్స్ల్లో జీఎస్టీ తగ్గినప్పటికీ, తినుబండారాలు, వాటర్బాటిళ్లు, ఇతర ఎంటర్టైన్మెంట్స్పై స్పష్టత లేకపోవడంతో ప్రేక్షకులపై పెద్దగా భారం తగ్గలేదు. ‘ఉజ్వల’కు ఆదరణఅంతంతే.. సాక్షి.సిటీబ్యూరో: విశ్వనగరం వైపు పరుగులు తీస్తున్న హైదరాబాద్ మహా నగరంలో ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ పథకానికి ఆదరణ కరవైంది. తాజగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మరిన్నీ ఎల్పీజీ కనెక్షన్లను మంజూరు చేసింది. ఇప్పటికే నగరంలో ఐదు లక్షలకు పైగా కుటుంబాలు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లకు దూరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. రెండేళ్లుగా హైదరాబాద్ నగరాన్ని ‘కిరోసిన్ ఫ్రీ’ నగరంగా తీర్చిదిద్దేందకు కసరత్తు చేస్తున్నా ఆచరణలో సాధ్యం కావడం లేదు. మరోవైపు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద ఎల్పీజీ కనెక్షన్ల పింపిణీకి సవాలక్ష కొర్రీలు అడ్డుపడుతున్నాయి. మహానగరంలో 32 లక్షల వరకు కుటుంబాలు ఉండగా, వంట గ్యాస్ కనెక్షన్లు 26.21 లక్షల వరకు ఉన్నట్టు అధికార లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం గుర్తించిన ఆహార భద్రత బీపీఎల్ కుటుంబాల్లోనే సుమారు 2.50 లక్షలకు పైగా కుటుంబాలు గ్యాస్ కనెక్షన్లకు దూరంగా ఉన్నాయి. ‘జై కిసాన్’ సమ్మాన్ సాక్షి,మేడ్చల్ జిల్లా: కేంద్ర బడ్జెట్తో మేడ్చల్ జిల్లా రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఐదెకరాలు లోపున్న రైతులకు ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్’ పథకం కింద ఎకరానికి ఏడాదికి రూ.6 వేలు అందజేసేందుకు బడ్జెట్లో కేటాయింపులు చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 47 వేల మంది రైతులు ఉండగా, ఐదెకరాలు లోపున్న వారు 24,591 మంది ఉన్నారు. వీరందరికీ కిసాన్ సమ్మాన్ పథకం ద్వారా మేలు చేకూరనుంది. ఇక ‘శ్రమ్ యోజన పథకం’ కింద జిల్లాలోని 6 లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులకు లబ్ధి చేకూరనుంది. విపక్షాల పెదవి విరుపు..బీజేపీ ఆనందం రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పీయూష్ గోయల్తో ప్రజలను ఆకట్టుకునే బడ్జెట్ను ప్రవేశ పెట్టించిందని, అయితే ఆ మేరకు బడ్జెట్లో కేటాయింపులు జరపలేదని విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. ఎన్నికల ముందు మరోసారి ప్రజలను మోసగించేలా బడ్జెట్ రూపకల్పన చేశారని విమర్శిస్తున్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఓరటబెట్టింది ఏమీ లేకపోగా, సార్వత్రిక ఎన్నికల ముందు అంకెల గారడీతో పేద ప్రజలను మోసగించాలని చూడడం దారుణమని మేడ్చల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత తోటకూరి జంగయ్య యాదవ్, సీపీఎం జిల్లా కార్యదర్శి సత్యం, సీపీఐ నేత బాలమల్లేశం పేర్కొన్నారు. కాగా, కేంద్ర బడ్జెట్ రైతులకు, పేద ప్రజలు, కార్మికులు, ఉద్యోగులకు ఎంతో మేలు చేసే విధంగా ఉందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు మోహన్రెడ్డి, జిల్లా అధ్యక్షడు మాధవరం కాంతారావు, తిరుమల్రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. చాలా అంశాలను వదిలేశారు.. బడ్జెట్లో ఉద్యోగ, మధ్యతరగతివర్గాలకు ఊరటనిచ్చారు. రైతుకు పెట్టుబడి సహాయం మంచి పరిణామం. కానీ ఇంకా అనేక అంశాలపై దృష్టి పెట్టలేదు. సంఘటిత రంగ పెన్షనర్ల డిమాండ్లు పట్టించుకోలేదు. యువత, ఇతర వర్గాల అభ్యున్నతికి, స్మాల్స్కేల్ ఇండస్ట్రీలకు ప్రోత్సాహకాలు ఇవ్వలేదు. స్వామినాథన్ సిఫార్సులను విస్మరించారు. – టి.రామస్వామి యాదవ్,బీహెచ్ఈఎల్ రిటైర్డ్ ఉద్యోగి -
కొత్త రైళ్లు లేవు.. కొత్త లైన్లూ లేవు
సాక్షి,సిటీబ్యూరో: దక్షిణమధ్య రైల్వేలో గతంలో చేపట్టిన ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం మినహా తాజా బడ్జెట్లో ఎలాంటి కొత్త ప్రతిపాదనలు చేయలేదు. ఐదేళ్ల నుంచి నత్తనడక సాగుతున్న ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టుకు ఈ బడ్జెట్లో కేవలం రూ.10 లక్షలే కేటాయించారు. అలాగే రెండేళ్ల క్రితం ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన యాదాద్రి ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టుకు రూ.20 కోట్ల నిధులను కేటాయించారు. రెండేళ్ల క్రితం ప్రతిపాదించిన చర్లపల్లి రైల్వే టర్మినల్కు మరో రూ.5 కోట్లు ఇచ్చారు. మౌలాలిలో నిర్మించనున్న రైల్వే ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్కు మరో రూ.1.5 కోట్ల నిధులను కేటాయించారు. ఎంఎంటీఎస్ రెండో దశ మినహా ఎలాంటి పురోగతి లేని మిగతా మూడు ప్రాజెక్టులకు ప్రస్తుత నిధులు సైతం అరకొరే. గతంలో ప్రకటించిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రీ డెవలప్మెంట్ ప్రతిపాదన, లాలాగూడ కేంద్రీయ ఆస్పత్రి సూపర్ స్పెషాలిటీ హోదా, నర్సింగ్ కళాశాల నిర్మాణం, వట్టినాగులపల్లి టర్మినల్ వంటి ప్రతిపాదనలు మరోసారి పెండింగ్ జాబితాలోకి చేరిపోయాయి. జంటనగరాల నుంచి షిరిడీ, బెంగళూరు, శబరిమలై, పట్నా, తదితర ప్రాంతాలకు కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని ఎంతోకాలంగా డిమాండ్ ఉన్నప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. పట్టాలెక్కించేందుకు పాట్లు నగర శివార్లను అనుసంధానం చేసే ఎంఎంటీఎస్ రెండో దశ రైళ్లను పట్టాలెక్కించేందుకు దక్షిణమధ్య రైల్వే పాట్లు పడుతోంది. రూ.817 కోట్లతో, 2012–13 లో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేదు. అన్ని మార్గాల్లో లైన్ల నిర్మాణం తుది దశకు వచ్చింది. కానీ నిధుల కొరత కారణంగా కొత్త రైళ్లను కొనుగోలు చేసేందుకు అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఈ ప్రాజెక్టుకు రూ.10 లక్షలు కేటాయించింది. యాదాద్రి ..సర్వేలకే పరిమితం ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా నిర్మిస్తున్న సికింద్రాబాద్–ఘట్కేసర్ మార్గానికి పొడిగింపుగా ఘట్కేసర్–రాయిగిరి మధ్య 33 కి.మీ రైల్వేలైన్ నిర్మించేందుకు 2016–17లోనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అప్పట్లో ఈ ప్రాజెక్టును రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించింది. రూ.412 కోట్ల అంచనాలతో దీనికి ప్రణాళిక రూపొందించారు. ఆర్వీఎన్ఎల్సర్వే కూడా పూర్తి చేసింది. నిర్మాణ వ్యయంలో 51 శాతం రాష్ట్రం వాటాగా, 49 శాతం రైల్వే వాటాగా ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు కోసం భూమి, ఇతర మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించాల్సి ఉంది. దీనికి తాజాగా కేంద్రం రూ.20 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టుకూ టెండర్లు ఖరారు కాలేదు. నిమ్స్, ఎయిమ్స్కు మొండిచేయి కేంద్ర బడ్జెట్లో ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, బీబీనగర్లోని ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ‘ఆయుస్మాన్ భవ’ సహా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని కీలక ఆస్పత్రులకు కనీస నిధులు కేటాయించలేదు. సాధారణ నిధులను మినహాయిస్తే.. ఆస్పత్రులకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంజగుట్ట నిమ్స్లో ట్రామాకేర్, సూపర్ స్పెషాలిటీ బ్లాకుల నిర్మాణం, ఆధునీకీకరణ పూర్తిగా కేంద్ర బడ్జెట్తోనే జరిగింది. ఇటీవల నిమ్స్ ఆదాయం భారీగా తగ్గిపోయింది. ప్రతినెలా ఉద్యోగుల వేతనాలు, ఫించన్ల చెల్లింపు కోసం రూ.12 కోట్ల వరకు అవసరం అవుతుండగా, ఆ మేరకు ఆదాయం రాకపోవడంతో వేతనాల చెల్లింపునకూ ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఆదుకుంటుందని భావించినా ఫలితం దక్కలేదు. బీబీనగర్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్న ఆల్ ఇండియా మెడికల్ సైన్స్(ఎయిమ్స్)కు ఇటీవల రూ.1028 కోట్లు కేటాయించడం మినహా తాజా బడ్జెట్లో అదనపు కేటాయింపులు చేయలేదు. హెచ్సీయూ సహా ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీతో పాటు రాష్ట్రస్థాయిలోని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఈ బడ్జెట్ నిరాశేమిగిల్చింది. -
జై కిసాన్..
ఆదిలాబాద్టౌన్: పార్లమెంట్ ఎన్నికల వేళా కేంద్రం రైతన్నకు జై కొట్టింది. బడ్జెట్లో అన్నదాతకు పెట్టపీట వేసింది. రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ.8వేలు పొందుతున్న కర్షకులకు కేంద్రం సైతం పెట్టుబడి ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6వేలు ఇస్తామని బడ్జెట్లో ప్రకటించింది. తాత్కాలిక ఆర్థికశాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. రైతులు, మధ్యతరగతి వర్గాలు, ఉద్యోగులు, మహిళలు, తదితర వర్గాలను ఆకర్షించే పథకాలు ప్రకటించారు. అయితే బడ్జెట్లో ముఖ్యంగా ఉద్యోగుల ఆదాయ పరిమితి పన్ను పెంపు, 60 ఏళ్లు నిండిన వారికి పెన్షన్, ఐదెకరాల్లోపు ఉన్న రైతులకు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో ఏడాదికి రూ.6వేలు జమ చేయడం, గ్రాట్యుటీ పరిమితి రూ.20లక్షల నుంచి రూ.30లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో జిల్లా వాసులకు లబ్ధి చేకూరనుంది. జిల్లాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు దాదాపు 10వేల మంది వరకు ఉన్నారు. ఇది వరకు ఉద్యోగుల ఆదాయ పన్ను పరిమితి రూ.2లక్షల 50వేలు ఉండగా, ఈ బడ్జెట్లో వార్షిక ఆదాయ రూ.5లక్షల వరకు ఉన్నవారు ఇకపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.6.5లక్షల వరకు ఉన్న వారికి బీమా, పెన్షన్ ఫండ్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రాయితీ స్టాండర్డ్ పరిమితి రూ.40వేల నుంచి రూ.50వేల పరిమితికి పెంచారు. పోస్టల్, బ్యాంక్ డిపాజిట్లపై టీడీఎస్ పరిమితి పెంచారు. రూ.10వేల నుంచి రూ.40వేల వరకు టీడీఎస్ పెంపు జరిగింది. 60 ఏళ్లు నిండిన వారికి రూ.3వేల పెన్షన్.. జిల్లాలో 60 ఏళ్లు నిండిన వృద్ధులు 63వేల మంది ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు రూ.వెయ్యి పింఛన్ అందిస్తుంది. అయితే ఎన్నికల మెనిఫెస్టోలో హామీలో నెలకు రూ.2వేలు ఇస్తామని ప్రకటించిన విషయం విధితమే. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి శ్రమయోగి బంధన్ పేరుతో అసంఘటిత కార్మికులకు పింఛన్, 60 ఏళ్లు నిండిన వారందరికీ ప్రతీనెల రూ.3వేలు ఇచ్చే విధంగా ఈ పథకం ప్రవేశపెడుతోంది. నెలకు రూ.100 చొప్పున ప్రీమియం చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత రూ.3వేల పింఛన్ ఇవ్వనున్నట్లు బడ్జెట్లో పేర్కొన్నారు. అసంఘటిత కార్మిక రంగంలో పనిచేస్తున్న దాదాపు 50వేల మంది కార్మికులకు ఈ పథకం దోహద పడనుంది. రైతు ఖాతాలోకి ఏడాదికి రూ.6వేలు.. పేద రైతు ఆదాయ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఎకరానికి రెండు విడతల్లో కలిపి మొత్తం రూ.8వేలు చెల్లిస్తుండగా, ఎన్నికల మెనిఫెస్టోలో పొందుపర్చిన విధంగా ఇకపై రెండు విడతలకు కలిపి మొత్తం రూ.10వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే బడ్జెట్లో తాత్కాలిక ఆర్థిక శాఖ పీయూష్ గోయల్ రైతుల కోసం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏడాదికి మూడు విడతల్లో రూ.6వేలు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే రెండు హెక్టార్లలోపు (5ఎకరాలు) వ్యవసాయ భూమి ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం వర్తించనుంది. దీనిద్వారా జిల్లాలో దాదాపు 50వేల మంది అన్నదాతలకు ప్రయోజనం చేకూరనుంది. అంగన్వాడీల జీతాల పెంపు అంగన్వాడీ కార్యకర్తలపై కేంద్రం కరుణించింది. వీరి జీతాలను 50 శాతం పెంచుతున్నట్లు బడ్జెట్లో ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ వేతనాల కింద రూ.3వేలు ఇస్తుండగా..రాష్ట్రం మరో రూ.7,500 కలిపి రూ.10,500 ఇస్తోంది. జీతాల పెంపుతో వారికి లబ్ధి చేకూరనుంది. జిల్లాలో మొత్తం 2,248 మంది అంగన్వాడీలు ఉన్నారు. ఇందులో అంగన్వాడీ కార్యకర్తలు 992 మంది, ఆయాలు 992, మినీ అంగన్వాడీ కార్యకర్తలు 264 మంది ఉన్నారు. 50 శాతం జీతాల పెంపు ప్రకటనతో వీరికి అదనంగా మరో రూ.1500 జీతం పెరగనుంది. అన్ని వర్గాలను ఆకర్షించేలా.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ అన్నివర్గాలను ఆకర్షించేలా ఉందని పలువురు పేర్కొంటున్నారు. అసంఘటిత కార్మికులకు శ్రమయోగి బంధన్ పేరుతో పెన్షన్, కార్మికుల ప్రమాద బీమా రూ.1లక్ష 50వేల నుంచి రూ.6లక్షలకు పెంపు, ఇంటి కొనుగోలుదారులకు జీఎస్టీ ఆదాయం మినహాయింపు, సినిమా థియేటర్ ధరలపై జీఎస్టీ 12 శాతానికి తగ్గింపు, వంట గ్యాస్ కనెక్షన్లు లేనివారికి ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు, అంగన్వాడీ కార్యకర్తల వేతనం 50శాతం పెంపు, ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టపోయిన రైతుల రుణాలను రీషెడ్యూల్ చేయడం, ఆవుల సంరక్షణకు ప్రత్యేక పథకం, కిసాన్ క్రెడిట్ కార్డు కింద రుణాలు ఇవ్వడం, ఆయుష్మాన్ భారత్, తదితర పథకాలను ప్రవేశపెట్టారు. రైతులకు ప్రయోజనం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తీసుకున్న నిర్ణయంలో రైతులకు మేలు జరుగుతుంది. 5 ఎకరాలు ఉన్న రైతులకు సంవత్సరానికి రూ.6వేలు ఇస్తుందని ప్రకటించడం సంతోషమే. అయితే ఏడాది పాటు కష్టపడి రైతులు పండించిన పంటలకు మద్దతు ధర పెంచాలి. రైతులను అన్ని విధాలా ఆదుకోవాలి. ఎరువులు, విత్తనాలు ఉచితంగా పంపిణీ చేస్తే బాగుంటుంది. – గంధం నవీన్, రైతు, వడూర్ ఉద్యోగులకు ఊరట.. ఉద్యోగ, ఉపాధ్యాయులు నిజాయతీగా ఆదాయ పన్ను చెల్లిస్తున్నారు. ప్రస్తుతం ఆదాయ పన్ను పరిమితి రూ.2లక్షల 50వేలకు ఉండగా, కేంద్ర ప్రభుత్వం రూ.5లక్షల వరకు పెంచడాన్ని స్వాగతిస్తున్నాం. అయితే దీని పరిమితిని మరింతగా పెంచితే బాగుండేది. సీనియర్ ఉద్యోగులు 3 నెలల జీతం ఐటీకే సరిపోతుంది. కొంతమేరకైతే బడ్జెట్ నిర్ణయం ఊరటనిచ్చింది. – శ్రీహరిబాబు, ఉపాధ్యాయుడు, ఆదిలాబాద్ -
మీడియాతో మంత్రి.. అమ్మాయి కొంటెపని!
న్యూఢిల్లీ : కేంద్ర సహాయ మంత్రి జయంత్ సిన్హా మీడియాతో సీరియస్గా మాట్లాడుతుండగా.. ఓ అమ్మాయి చేసిన తమషా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తాత్కాలిక ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలోనే ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్లో రైతులు, వేతన జీవులపై వరాల జల్లు కురిపించారు. అయితే బడ్జెట్ సెషన్ అనంతరం జయంత్ సిన్హా మీడియాతో మాట్లాడుతుండగా.. ఓ ఫన్నీ ఘటన చోటుచేసుకుంది. ఆయన సీరియస్గా తమ ప్రభుత్వ బడ్జెట్పై ప్రశంసలు కురిపిస్తూ మాట్లాడుతుండగా.. ఆయన వెనకాల ఉన్న ఓ అమ్మాయి కొంటె పనిచేసింది. కెమెరాను చూసి నాలుకను బయటపెట్టి వెక్కిరిచ్చింది. అయితే ఆమె తమాషా కొద్ది చేసిన ఈ పని ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది. ఆ అమ్మాయి బడ్జెట్పై తన అభిప్రాయాన్ని తెలిపిందని ఒకరు, బడ్జెట్కు సూపర్బ్ రివ్యూ అని మరొకరు కామెంట్ చేస్తున్నారు. ఇక 2019 లోక్సభ ఎన్నికల అనంతరం భారత్ పురోభివృద్ధికి ఏయే అంశాలు దోహదం చేస్తాయన్నదానికి తాజా బడ్జెట్ ట్రైలర్ మాత్రమేనని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడగా.. ప్రతిపక్షాలు మాత్రం కేవలం ఎన్నికల జిమ్మిక్కేనని విమర్శిస్తున్నాయి. Who's this kid? Photo bombing a minister outside parliament on budget day is no mean feat. #Budget2019 pic.twitter.com/pwIpGXaF9e — Devjyot Ghoshal (@DevjyotGhoshal) February 1, 2019 -
వరాల..వాన
సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో వరాల జల్లు కురిసింది. రైతులు, కార్మికులు, ఉద్యోగులతో పాటు మధ్య తరగతి ప్రజలకు ఊరట నిచ్చింది. ముఖ్యంగా రైతులకు బలమైన ఊరట, వేతన జీవికి పన్ను మినహాయింపులు భారీగా లభించాయి. త్వరలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ప్రజలందరినీ ఆకట్టుకునేలా.. అందరికీ ప్రయోజనం కలిగించేలా పలు అంశాలను ఈ 2019–20 తాత్కాలిక బడ్జెట్లో చేర్చారు. అందరికీ మేలు జరిగేలా బడ్జెట్ ఉంటుందన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన ‘ఎన్నికల’ల బడ్జెట్ను పీయూష్ గోయల్ ద్వారా శుక్రవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు రైతులు, కార్మికులు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధుకు తోడు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా పేద రైతులకు ఏడాదికి రూ.6వేలు మూడు విడతల్లో ఇవ్వనున్నట్లు ప్రకటించడం ఊరట. అలాగే అసంఘటిత కార్మికులకు పెన్షన్, ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు, రైతుల కోసం కేంద్రం పద్దుల్లో పెద్దపీట వేసింది. ఈ బడ్జెట్పై మొత్తంగా అన్నివర్గాల నుంచి సంతృప్తి వ్యక్తమవుతుండగా.. కొన్ని రాజకీయ పక్షాలు మాత్రం ఓట్లను రాబట్టే ఎన్నికల బడ్జెట్గా వర్ణిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గుంట నుంచి 1.25 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు 2,74,368 మంది కాగా, 1.25 నుంచి 2.5 ఎకరాలున్న వారు 1,72,669 మంది, 2.5 నుంచి 5 ఎకరాలున్న వారు 1,45,008 మంది రైతులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.6000 నగదు బదిలీ పథకం వల్ల మొత్తం 5,92,045 మందికి లబ్ది చేకూరనుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఐదెకరాల్లోపు భూమి ఉండే ప్రతి రైతుకు మూడు వాయిదాల్లో ఈ మొత్తం వారి ఖాతాలకు బదిలీ చేయనున్నారు. ఈ పథకం 2018 డిసెంబర్ నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొనడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రీయ గోకుల్ మిషన్కు రూ.750 కోట్ల కేటాయించగా, దీంతో పాటు పాడిపరిశ్రమ, మత్స్య పరిశ్రమకు చెందిన రైతులు తీసుకొన్న కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలపై 2శాతం వడ్డీ రాయితీ లభించనుంది. ప్రకృతి విపత్తులకు గురైన ప్రాంతాల్లోని రైతులు తీసుకొన్న రుణాలపై 2శాతం వడ్డీ రాయితీ, సకాలంలో చెల్లింపులు చేసిన వారికి 3శాతం వడ్డీ రాయితీ వర్తింపజేయనుండటం శుభపరిణామం. అసంఘటిత కార్మికులకు అండ... అసంఘటిత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం కొత్త పింఛన్ పథకం ప్రకటించింది. ప్రధానమంత్రి శ్రమయోగి బంధన్ పేరుతో ప్రవేశపెట్టనున్న ఈ పింఛన్ పథకం ద్వారా 60 ఏళ్లు నిండిన వారందరికీ నెలకు రూ.3వేలు పింఛన్ రానుంది. ఇందుకోసం నెలకు రూ.100 చొప్పున కార్మికులు ప్రీమియం చెల్లించాలి. దీనిద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12,45,806 మందికి మేలు జరుగనుంది. ఇందులో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న కూలీల సంఖ్య 5,84,654 మంది ఉండగా, భవనాలు, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం తదితర రంగాల్లో 6,61,052 మంది కార్మికులు ఉన్నట్లు ప్రభుత్వ నివేదికల ద్వారా తెలుస్తోంది. వేతనజీవులకు ఊరట... వేతన జీవులకు, పింఛన్దారులకు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఊరట కల్పించింది. ఆదాయపు పన్ను పరిమితిని రూ.5లక్షలకు పెంచింది. వార్షిక ఆదాయం రూ.5లక్షల వరకూ ఉన్న వారు ఇకపై ఆదాయపుపన్ను చెల్లించనవసరం లేదు. పొదుపు, పెట్టుబడులతో కలిపి రూ.6.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చారు. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ.40వేల నుంచి రూ.50వేలకు పెంచారు. పోస్టల్, బ్యాంకు డిపాజిట్లపై టీడీఎస్ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. టీడీఎస్ పరిమితి రూ.10 వేల నుంచి రూ.40 వేలకు పెంచారు. మహిళలు, మహిళా ఉద్యోగులకు భరోసా... మహిళల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వారి అనేక రాయితీలను ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాలలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఇప్పటికే 6కోట్ల మందికి ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చిన కేంద్రం మరో రెండు కోట్ల కనెక్షన్లను ప్రకటించింది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 30 వేల వరకు కనెక్షన్లు రానున్నాయి. మాతృత్వయోజన పథకం కింద మహిళ ఉద్యోగులకు 26 వారాల సెలవులు ఇవ్వడం హర్షనీయం. సుమారు 23,478 మంది మహిళ ఉద్యోగులకు 26 వారాల సెలవు దినాలు వర్తించనున్నాయి. అంగన్వాడీలకు పెరగునున్న వేతనం మహిళా శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్న మహిళా టీచర్లు, ఆయాలకు వేతనాలను 50 శాతం పెంచడం వల్ల ఉమ్మడి జిల్లాలో 6,235 మంది వేతనాలు పెరగనున్నాయి. అంగన్వాడీ టీచర్లకు రూ.10,500 వస్తుండగా రూ.1,500 పెంచినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా ఇంకా అమల్లోకి రావడం లేదు. అదేవిధంగా ఆయాలకు రూ.7,500లకు అదనంగా రూ.750 పెంచినట్లు ప్రకటించినా, ప్రస్తుతం రూ.7,500 వస్తోంది. కొత్తపల్లి–మనోహర్బాద్ లైన్కు రూ.200 కోట్లు... ఈ బడ్జెట్లో రైల్వేశాఖకు రూ.64,587 కోట్లు కేటాయించినట్లు పేర్కొనగా... గతంతో పోలిస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు బాగానే విదిల్చారు. కరీంనగర్ జిల్లా పరిధిలోని కొత్తపల్లి నుంచి మనోహరాబాద్ 150 కిలోమీటర్ల దూరం రైల్వేలైన్ను 2006–07లో ప్రతిపాదించారు. ఆ సమయంలో దాని ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,160 కోట్లు. గడిచిన నాలుగేళ్లుగా ప్రతీ ఏటా రూ.137 కోట్లు కేటాయించగా ప్రస్తుతం మొదటి విడతలో భాగంగా 32 కిలోమీటర్ల దూరం వరకు మనోహరాబాద్–గజ్వేల్ మధ్య పనులు పూర్తయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేపట్టే పనులకు రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రతిపాదించారు. కాజీపేట–బల్హర్షా మధ్య 202 కిలోమీటర్ల దూరం వరకు మూడవ రైల్వే ట్రాక్ ఏర్పాటు చేయాలని 2015–16వ ఆర్థిక సంవత్సరంలోనే నిర్ణయించి రూ.2,063 కోట్లు అంచనా వేశారు. గడిచిన నాలుగేళ్లుగా రూ.360 కోట్లు కేటాయించగా ప్రస్తుత పనుల నిమిత్తం రూ.265 కోట్లు కేటాయించేందుకు ప్రతిపాదించారు. ఇప్పటికే రాఘవపూర్ నుంచి మందమర్రి వరకు మూడవ రైల్వే ట్రాక్ వినియోగంలోకి రాగా రాఘవపూర్–పొత్కపల్లి–బిజిగిరిషరీఫ్–ఉప్పల్ మధ్య రెండవ విడత పనులు చేపట్టేందుకు నిధులను కేటాయించాలని ప్రతిపాదించారు. రైతుబంధును కాపీ కొట్టిన కేంద్రం తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని కేంద్రం కాపీ కొట్టింది. ఈ బడ్జెట్ ఓటర్లను ఆకట్టుకునేలా ఉంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో రాజకీయ లబ్దికి ప్రాధాన్యం ఇచ్చారు. బడ్జెట్లో చెప్పిన అంశాలు అమలు కావడం సాధ్యం కాదని తెలిసినా ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అమలులో ఇబ్బందులు వస్తాయి. రాష్ట్రానికి రావాల్సిన వాటిని ఐదేళ్లలో చాలా సాధించాం. చట్టంలో లేకపోయినా తెలంగాణకు ఎయిమ్స్ సాధించాం. ఇంకా చాలా అంశాలకు సంబంధించి గెజిట్ విడుదల కావాల్సి ఉంది. – బోయినపల్లి వినోద్కుమార్, కరీంనగర్ ఎంపీ కేసీఆర్ పథకాలను ఫాలో అయిన కేంద్రం కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్తో దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ లాభం జరుగుతున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. మన రాష్ట్రంలో ఎకరానికి, ఫసల్కు రూ.5వేలు ఇస్తున్నం. కేంద్రం మాత్రం రెండున్నర హెక్టార్లకు అంటే 5 ఎకరాలకు రూ.6వేల చొప్పున ఇచ్చేలా బడ్జెట్లో ప్రవేశపెట్టింది. సంస్కరణలు చేపట్టాం.. సంక్షేమం చేస్తున్నామని బీజేపీ నేతలు చెబుతున్నరు. కానీ నల్లధనం ఎంత మేరకు వెనక్కి తీసుకువచ్చారో... నోట్ల రద్దు తర్వాత ఎన్ని డబ్బులు తిరిగి వచ్చాయో చెప్పలేని పరిస్థితి. అయితే సంక్షేమం అని చెప్పి తెలంగాణ మోడల్ మొత్తం తీసుకున్నరు సంతోషం. – కల్వకుంట్ల కవిత, నిజామాబాద్ ఎంపీ ఓట్ల కోసమే మభ్యపెట్టే బడ్జెట్ కేంద్ర బడ్జెట్ తీరు చూస్తుంటే ప్రజలను మభ్యపెట్టి మరోసారి అధికారంలోకి వచ్చేందుకే చేసిన ప్రయత్నంగా కనబడుతోంది. నాలుగున్నరేళ్లుగా రైతాంగం సమస్యలపై ఊసేత్తని బీజేపీ సర్కార్ ఒక్కసారిగా రైతుల కోసం ఎకరాకు రూ.6వేలు అంటూ వరాలు కురిపించడం రానున్న ఎన్నికల్లో లబ్ది పొందేందుకేనని అర్థమవుతోంది. మోడీ అధికారంలోకి వచ్చాక వంటనూనె, చక్కెర, పప్పుధాన్యాలను దిగుమతి చేసుకున్నారు. ఈ దిగుమతులు వ్యవసాయరంగ సంక్షోభాన్ని తెలుపుతున్నాయి. కాంగ్రెస్ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడితే మోడీ సర్కార్ నిర్వీర్యం చేసింది. –కటుకం మృత్యుంజయం, డీసీసీ అధ్యక్షుడు సామాన్యులకు లాభం లేదు.. ఇది ఓట్ల బడ్జెట్ మాత్రమే. దీంతో సామాన్య ప్రజలకు న్యాయం జరగదు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైంది. ఐదెకరాల లోపు ఉన్న రైతులకు రూ.6వేలు మూడు విడతలుగా చెల్లించడం కంటి తుడుపు మాత్రమే. ఉద్యోగాలివ్వడంలో విఫలమయ్యారు. రాజ్యాంగ వ్యవస్థలను మోడీ నిర్వీర్యం చేస్తున్నారు. రానున్న రోజుల్లో మోడీ సర్కార్పై ప్రజలు సర్జికల్ స్ట్రయిక్ చేస్తారు. –అంబటి జోజిరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు -
లెక్క లేదాయే..!
సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి, ఏలూరు: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో జిల్లాకు నిరాశ ఎదురైంది. జిల్లా ప్రస్తావన ఎక్కడా కానరాలేదు. ఎన్నికల సంవత్సరం కావడంతో ఆదాయ పన్ను రాయితీల వల్ల వేతన జీవులకు కొంత ఊరట లభించింది. వివాదాల మధ్య చిక్కుకున్న బహుళార్ధసాధక పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై పాలకుల నిర్లక్ష్యం మరోసారి స్పష్టంగా బయటపడింది. శుక్రవారం పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ ఇన్చార్జ్ మంత్రి పీయూష్గోయల్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క పైసా కేటాయించకపోవడం గమనార్హం. పోలవరానికి నాబార్డు ద్వారా నిధులు ఇస్తున్నట్లు చెబుతు న్నా.. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంపై బడ్జెట్లో ప్రస్తావన చేయకపోవడం నిరాశను మిగిల్చింది. వేతన జీవులకు ఊరట వార్షిక ఆదాయం 5 లక్షల రూపాయలలోపు ఉన్న వారు ఇకపై ఆదాయ పన్ను చెల్లించనవసరం లేదు. రూ.6.5 లక్షల వరకూఉన్న వారు కూడా బీమా, పెన్షన్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా రాయితీ పొందవచ్చు. ఇక కొత్తగా ఇల్లు కొనాలనుకునే వారికి జీఎస్టీ మినహాయింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. గృహరుణాలు, ఆరోగ్య బీమా, జాతీయ పింఛను పథకానికి చెల్లించే వారికి రూ.రెండు లక్షల వరకు మినహాయింపు లభించనుంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రైవేటు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యూటీ మొత్తాన్ని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రెండో గృహానికి కూడా అద్దె చెల్లించే వారికి ఆ మేరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వడం, పోస్టాఫీస్ పొదుపు పథకాలపై వచ్చే వడ్డీపై టీడీఎస్ రూ.10 వేల నుంచి రూ.40 వేలకు పెంచడం, ఇంటి అద్దెలపై టీడీఎస్ రూ.1.80 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంపు, ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 54 కింద రెండు ఇళ్లపై పెట్టుబడులు పెట్టవచ్చన్న నిబంధనల పట్ల ఉద్యోగవర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. మరోవైపు పేదలకు ఇళ్ల పథకం కింద 2020 లోపు రిజిస్టర్ చేసుకొన్న ఇళ్లకు కూడా ఆదాయç పన్నులో మినహాయింపు లభించనుంది. రైతులకు నామమాత్రపు భరోసా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం కింద ఐదు ఎకరాలలోపు రైతులకు ఏటా రూ.6,000 చెల్లిస్తామని పీయూష్ ప్రకటించారు.. దీనిని రూ.2,000 చొప్పున మూడు విడతలుగా అందిస్తారు. ఈ మొత్తం నేరుగా బ్యాంక్ ఖాతాల్లో పడుతుంది. అయితే ఈ పథకం పట్ల రైతుల్లో పెద్దగా స్పందన లేదు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏటా రైతుకు రూ. 12,500 పెట్టుబడి నిధి కింద ఇవ్వడానికి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ హామీతో చూస్తే కేంద్రం ప్రకటించిన మొత్తం పట్ల పెద్దగా హర్షం వ్యక్తం కాలేదు. ప్రత్యేకహోదా, ప్యాకేజీ ఊసే లేదు పీయూష్గోయల్ బడ్జెట్లో ఎక్కడా ఓ రాష్ట్రానికి, ప్రాంతానికి సంబంధించిన ప్రస్తావన రాలేదు. అయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రత్యేక హోదా, ప్యాకేజీలతోపాటు విభజన చట్టం హామీల అమలు ఊసు వస్తుందని అందరూ ఆశించారు. కానీ బడ్జెట్ ప్రసంగంలో ఏపీ హోదా, ప్యాకేజీల గురించే కాదు రాజధాని నిర్మాణం నిధుల గురించి కూడాఎక్కడా ప్రస్తావన రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చేపల సాగుదారులకు వడ్డీపై రెండు శాతం సబ్సిడీ ఇవ్వడం వల్ల ఆక్వా రైతులకు కొంతమేర ఊరట కలగనుంది. రాష్ట్రానికి ద్రోహం కేంద్ర బడ్జెట్ రాష్ట్ర ప్రజలకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ప్రత్యేక హోదా ప్రస్తావన, విభజన హామీలకు ఒక్క పైసా కేటాయించలేదు. పోలవరానికి నిధులేమీ ఇవ్వలేదు. కంటి తుడుపు చర్యగా ఐదెకరాలలోపు ఉన్న రైతులకు సంవత్సరానికి రూ.6000 ఆర్థిక సాయాన్ని ప్రకటించడం దారుణం. రానున్న రోజుల్లో ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం మరిన్ని ఉద్యమాలు చేయాలి. దీనికి ప్రజలు సన్నద్ధం కావాలి.– చింతకాయల బాబురావు. సీపీఎం జిల్లా అప్ల్యాండ్ కార్యదర్శి ఎన్నికల్లో ఇచ్చిన హామీల ఊసులేదు.. కేంద్ర బడ్జెట్ నిరాశ పరిచింది. గత ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల ఊసు లేదు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తానని హామీ ఇచ్చి గాలికొదిలేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేశారు. ప్రత్యేక హోదా అంశాన్ని విస్మరించారు. విభజన హామీలనూ ప్రస్తావించకపోవడం దారుణం. – డేగా ప్రభాకర్. సీపీఐ జిల్లా కార్యదర్శి రైతుల ఆశలపై నీళ్లు కేంద్ర బడ్జెట్ రైతుల ఆశలపైనీళ్లు చల్లింది. కంటితుడుపు చర్యగా కేవలం రూ.6వేలు సాయంప్రకటించడం దారుణం. సాయాన్ని ఎకరాకు కనీసం రూ.పది వేలు చేయాలి. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పుల ఊబిలో కూరుకుపోయారు. రుణామాఫీచేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నా.. పట్టించుకోకపోవడం దారుణం. – కె.శ్రీనివాస్. రైతు సంఘం అప్ల్యాండ్ జిల్లా కార్యదర్శి పేదల బడ్జెట్ కాదు బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం దారుణం. ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నట్టు ప్రకటించిన కేంద్రం గ్యాస్ ధరలు పైపైకి పోవడంపై పెదవి విప్పలేదు. ఇది పేదల బడ్జెట్ కాదు. మహిళలకు ఈ బడ్జెట్లో మొండిచేయి చూపారు. – మహ్మద్ ఆమరజహాబేగ్. ఏఐసీసీ సభ్యులు -
బడ్జెట్పై పెదవి విరిచిన కాంగ్రెస్
-
ఎన్నికలే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్
-
చంద్రబాబు చేతగానితనం వల్లే రాష్ట్రానికి అన్యాయం
-
నమో ఓటర్
-
కిసాన్.. ముస్కాన్!
సాక్షి వనపర్తి : కేంద్ర ప్రభుత్వం రైతులకు గుర్తుండిపోయేలా వరమిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం తరహాలోనే సమ్మాన్ నిధి పేరుతో రెండు హెక్టార్లు (5 ఎకరాలు) ఉన్న రైతులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.6వేలు అందిస్తామని పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా ఉన్న సన్న, చిన్న కారు రైతులకు ఎంతో మేలు జరగనుంది. రైతులకు మేలుచేసే బడ్జెట్ పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ మేరకు కేంద్రమంత్రి పీయుష్ గోయల్ శుక్రవారం ఉదయం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టినవిషయం విధితమే. ఈ బడ్జెట్ ఇన్నాళ్లూ సంక్షోభంలో కొట్టుమిట్టాడిన రైతాంగానికి ఊరటనిచ్చింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం పేరుతో ఎకరానికి రూ.4వేల చొప్పున ఏడాదికి రూ.8వేలు అందిస్తోంది. మరో అడుగు ముందుకేస్తూ ఏడాదికి ఎకరానికి రూ.10 వేలు అందిస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. ఈ పథకం తరహాలోనే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం చివరి బడ్జెట్లో 2 హెక్టార్ల లోపు అంటే 5 ఎకరాల లోపు భూమి ఉన్న సన్న, చిన్న కారు రైతులకు మాత్రమే ఏడాదికి మూడు పర్యాయాలు రెండు ఎకరాల చొప్పున మొత్తం రూ.6 వేలు అందిస్తామని ప్రకటించింది. రైతుబంధు స్ఫూర్తితో.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కేంద్రం దృష్టిని ఆకర్షించింది. ఈ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వారివారి రాష్ట్రాల్లో ఈ తరహా పథకాలను ప్రవేశపెడతామని ఇప్పటికే ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు ఇదే అంశంపై మాట్లాడారు. రైతుబంధు పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం భారీ మెజార్టీతో మరోసారి అధికారంలోకి రావడంలో రైతుబంధు పథకం కీలకంగా మారింది. దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నా అధిక శాతం మంది ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయ రంగం పైనే ఆధారపడ్డారు. కిసాన్కు సమ్మాన్ ఎన్నికల ముందు ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు రైతులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేయడం సర్వసాధారణం. అదే తరహాలో కేంద్ర ప్రభుత్వం రైతుల మద్దతు పొందడానికి పార్లమెంట్ ఎన్నికలకు ముందు ‘కిసాన్ సమ్మాన్ నిధి’ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. కేవలం 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులందరికీ ఈ పథకం వర్తించనుంది. ఎకరానికి రూ.6 చొప్పున సంవత్సరంలో మూడు పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. ఐదు ఎకరాలున్నవారికే.. భూ రికార్డుల ప్రక్షాళన ప్రకారం జిల్లాలో 1,52,621 మంది రైతులు ఉన్నారు. ఖరీఫ్ సీజన్లో 1,21,839 మంది రైతులకు ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున రూ.125 కోట్ల 16 లక్షలను పంపిణీ చేశారు. అదే రబీ సీజన్లో 1,07,528 మంది రైతులకు రూ.117 కోట్ల 51 లక్షల 66 వేలు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇదిలాఉండగా జిల్లాలో ఒక హెక్టారు లోపు భూమి ఉన్న రైతులు 85,944 , రెండు హెక్టార్ల లోపు ఉన్న రైతులు 31,474 మంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టిన కిసాన్ సమ్మాన్ పథకానికి 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులే అర్హులుగా ప్రకటించగా నిజానికి జిల్లాలో 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులే అధికంగా ఉన్నారు. 4 హెక్టార్లలోపు భూమి ఉన్న వారు 15,557 మంది, 10 హెక్టార్ల లోపు ఉన్న వారు 4,002 మంది, 10 హెక్టార్ల కంటే అధికంగా ఉన్న వారు 350 మంది ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకంలో భూమి కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి పెట్టుబడి సాయం అందుతోంది. నాగర్కర్నూల్ జిల్లాలో.. జిల్లాలో ఒక హెక్టారు భూమి ఉన్న రైతులు 1,42,416 మంది ఉన్నారు. అలాగే రెండు హెక్టార్ల భూమి ఉన్న రైతులు 67,658 మంది ఉన్నారు. అదేవిధంగా 4 హెక్టార్ల లోపు భూమి ఉన్న రైతుల 33,672 , 4 నుంచి 10 హెక్టార్లలోపు 8563 మంది, 10 హెక్టార్లకు మించి భూమి కలిగి ఉన్న వారు 841 మంది రైతులు ఉన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో... ఒక హెక్టారు 1,80,328, రెండు హెక్టార్లు ఉన్న రైతులు 77,611 మంది, 4 హెక్టార్ల లోపు భూమి ఉన్న రైతులు 38,264, 4 నుంచి 10 హెక్టార్లలోపు 11,618, 10 హెక్టార్లకు పైగా ఉన్న వారు 1263 మంది ఉన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో.. ఈ జిల్లాలో ఒక హెక్టారు ఉన్న రైతులు 76,414 మంది, రెండు హెక్టార్లు ఉన్న రైతులు 39,038 మంది ఉన్నారు. అలాగే నాలుగు హెక్టార్ల లోపున్నవారు 20,267 మంది, 4 నుంచి 10 హెక్టార్లలోపు 6,026, 10 హెక్టార్లకు మించి భూమి కలిగి ఉన్న వారు 620 మంది రైతులు ఉన్నారు. -
వైఎస్ అభయహస్తం బాటలో కేంద్ర పింఛన్ పథకం
సాక్షి, అమరావతి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో అమలు చేసిన ఒక పథకానికి అచ్చుగుద్దినట్టు అలానే ఉండే పథకాన్ని ఇప్పుడు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశమంతటా అమలు చేస్తామని బడ్జెట్లో ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి డ్వాక్రా మహిళలందరికీ 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా ఎంతో కొంత పింఛను అందించాలనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం తీరునే ఇప్పుడు దేశంలోని అసంఘటిత కార్మికులందరికీ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి 60 ఏళ్ల తర్వాత పింఛన్లు అందించే పథకాన్ని అమలు చేయడానికి కేంద్రం ముందుకొచ్చింది. 60 ఏళ్లు దాటిన మహిళలు సభ్యులుగా ఉన్న డ్వాక్రా సంఘాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు అనేక అంక్షలు అమలు చేస్తున్న విషయాన్ని అప్పటి ప్రభుత్వ ఉన్నతాధికారులు వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకు రాగా వారి కోసం అభయహస్తం పేరుతో పింఛన్ల పథకాన్ని ప్రకటించారు. డ్వాక్రా మహిళలు రోజుకు రూపాయి చొప్పున ఏడాదికి రూ.365 చొప్పున ఈ పథకంలో జమ చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి మహిళ పేరున ఏడాదికి రూ.365 చొప్పున చెల్లిస్తుంది. మహిళ వాటా, ప్రభుత్వ వాటా రెండు కలిపి ప్రభుత్వమే ఆ డబ్బులను ఎల్ఐసీ వంటి బీమా సంస్థల్లో పింఛన్ల స్కీంలో పెట్టుబడిగా పెడుతుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత వారికి పింఛన్లు చెల్లిస్తోంది. సభ్యులు పథకంలో చేరిన సంవత్సరాల ఆధారంగా రూ.500 నుంచి రూ.2,600 మధ్య పింఛను చెల్లించాలి. మహిళలకు 60 ఏళ్లు రాకమునుపే ఆ కుటుంబంలో చదువుకునే పిల్లలకు స్కాలర్ షిప్పు ఇవ్వడం.. ఒక వేళ దుర్మరణం వంటి విషాదకర సంఘటన జరిగితే బీమాగా కొంత మొత్తాన్ని ఆ కుటుంబానికి అందజేయడం ఈ పథకం ప్రధాన ఉద్ధేశం. ప్రస్తుత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు 34 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఈ పథకంలో సభ్యులుగా కొనసాగుతుండగా, వారిలో 3,21,703 మంది ఈ పథకం ద్వారా ప్రతి నెలా ప్రస్తుతం పింఛన్లు అందుకుంటున్నారు. వైఎస్ ముందు చూపుతో ఆనాడే ఆదర్శ పథకం అసంఘటిత కార్మికుల కోసం ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో సభ్యులుగా చేరిన వారు ఏడాదికి రూ.100 జమ చేస్తే.. ప్రభుత్వం కూడా వంద రూపాయలు అతని పేరిట జమ చేస్తూ.. అతనికి 60 ఏళ్ల తర్వాత రూ.3 వేల వరకు పింఛను ఇస్తుంది. ఇది అభయహస్తం పథకానికి అచ్చుగుదినట్టుగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2008లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో ముందు చూపుతో ఇలాంటి విన్నూత పథకాలు ప్రవేశపెట్టారని, ఇప్పుడు అవి దేశానికి ఆదర్శంగా మారాయని అంటున్నారు. అయితే, అభయహస్తం పథకానికి చంద్రబాబు ప్రభుత్వం ‘అన్న అభయహస్తం’ అని పేరు మార్చిందే గానీ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ పథకంలో కొన్ని మార్పులు తీసుకొచ్చి మరింత మంది డ్వాక్రా మహిళలకు పింఛన్ల లబ్ధి కలిగేలా చేయడానికి మాత్రం అసక్తి చూపడం లేదనే విమర్శ ఉంది. -
ఏపీకి తీరని అన్యాయం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం జరిగిందని వైఎస్సార్ సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్ట ప్రకారం ఏపీకి ఇచ్చిన హామీలపై కేంద్ర ఆర్థికమంత్రి పియూష్ గోయల్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. ఆర్థిక మంత్రి శుక్రవారం లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టుకు నిధుల మంజూరును బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం అన్యాయం చేసింది కేవలం ఈ ఒక్క బడ్జెట్లో మాత్రమే కాదని, గత నాలుగేళ్లు బీజేపీ మిత్రపక్షంగా టీడీపీ ఆమోదించిన నాలుగు బడ్జెట్లలో జరిగిన అన్యాయమే పునరావృతమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దేశంలో 2018 నాటికి బ్యాంకులకు రూ.10 లక్షల కోట్ల మొండిబకాయిలు ఉంటే.. 25 శాతం కూడా రికవరీ చేయని దుస్థితి నెలకొందన్నారు. మరోవైపు ఆర్థిక వ్యవస్థలో చెలామణిలోకి రాని నల్లధనం రూ.70 లక్షల కోట్లు ఉంటే.. రూ.1.3 లక్షల కోట్లు పన్నుల రూపంలోకి తీసుకొచ్చామని కేంద్ర మంత్రి అంటున్నారని, అయితే ఇందులో 30 శాతం పన్ను, 30% పెనాల్టీ పోనూ వచ్చింది కేవలం 50% నుంచి 60% ఆదాయం మాత్రమే అన్నారు. మొత్తంగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. పార్టీ పార్లమెంటరీ నేత వి.విజయసాయిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ప్రత్యేక హోదా అమలు చేయడంతో పాటు విభజన చట్టంలో పొందుపరచిన హామీలను నెరవేర్చాలని నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. -
ఏపీకి మళ్లీ మొండిచేయి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ తాజా మధ్యంతర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు యథావిధిగా మొండిచేయి చూపింది. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చివరి బడ్జెట్లో కూడా ఏపీకి నిరాశే మిగిల్చింది. కనీసం జాతీయ విద్యా సంస్థలకూ కేటాయింపుల్లేకుండా చేసింది. కేవలం ఏపీ సెంట్రల్ వర్సిటీకి, గిరిజన విశ్వవిద్యాలయానికే నిధులు కేటాయించారు. ఇక చట్టబద్ధమైన హామీల ప్రస్తావనగానీ, ప్రత్యేక హోదా ఊసుగానీ ఈ బడ్జెట్లో లేదు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ఇవ్వాల్సిన పారిశ్రామిక రాయితీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కలిపి వడ్డీ రాయితీ కింద 2018–19 బడ్జెట్ అంచనాలను రూ.100 కోట్లుగా చూపారు. కానీ సవరించిన అంచనాల్లో సున్నాగా చూపారు. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిధులు కేటాయించలేదు. అలాగే 2019–20కి కూడా ఈ పద్దు కింద నిధులు కేటాయించ లేదు. పూర్తిస్థాయి బడ్జెట్లో జాతీయ సంస్థలకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. కొన్ని జాతీయ సంస్థలకు దేశవ్యాప్తంగా ఒకే కేటగిరీలో కలిపి చూపారు. ఏపీ వాటా రూ.36.3 వేల కోట్లు కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా అయిన 4.305 శాతం కింద రూ.36,360.26 కోట్లు రానున్నాయి. ఇందులో కార్పొరేషన్ టాక్స్ రూ.11,775.31 కోట్లు, ఆదాయ పన్ను రూ.9,893.51 కోట్లు, సెంట్రల్ జీఎస్టీ రూ.11,004.42 కోట్లు, కస్టమ్స్ టాక్స్ రూ.2284.72 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ రూ.1402.62 కోట్లుగా ఉన్నాయి. సంపద పన్నును – 0.32 కోట్లుగా చూపారు. గతేడాది కేంద్ర పన్నుల్లో వాటాగా రూ.32,738.03 కోట్లు ఉండగా ఈ ఏడాది దాదాపు రూ.3,582 కోట్లు అదనంగా రానున్నాయి. -
బడ్జెట్ తయారీ ఇలా..
బడ్జెట్ అనగానే చాలామంది లెక్కల చిక్కులే అనుకుంటారు! కానీ ఈ మూడక్షరాల వెనుక చాలా కృషి దాగుంటుంది. ఎంతో కసరత్తు.. లెక్కకు మించి భేటీలు.. ఆద్యంతం గోప్యత.. అబ్బో చాలా తతంగమే ఉంటుంది. అదేంటో ఓ లుక్కేయండి! సెప్టెంబర్లో.. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఏయే రంగానికి ఎంత ఖర్చు పెట్టాలన్న కసరత్తు మొదలవుతుంది. దేశంలో మొత్తం జనాభా తమ తిండి కోసం ఏడాది అంతా ఎంత ఖర్చు చేస్తున్నారో దాదాపు అంత మొత్తాన్ని ప్రభుత్వం బడ్జెట్కు కేటాయిస్తుంది. అక్టోబర్లో.. తమకు కావాల్సిన నిధులపై వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు ఆర్థికశాఖతో చర్చల్లో తలమునకలవుతారు. డిసెంబర్ ముసాయిదా బడ్జెట్ కాపీలను అధికారులు ఆర్థికమంత్రికి నివేదిస్తారు. ఈ ముసాయిదా పత్రాలన్నీ నీలం రంగులో ఉంటాయి. జనవరి.. పారిశ్రామిక, బ్యాంకింగ్ రంగాలకు చెందిన వివిధ సంఘాల ప్రతినిధులు ఆర్థికమంత్రిని కలసి తమ సమస్యలను సలహాలను, సూచనలను అందజేస్తారు. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి అందరి వాదనలు వింటారుగానీ ఎవరికీ నిర్దిష్టమైన హామీ ఇవ్వరు. ముద్రణ ప్రక్రియ బడ్జెట్కు సంబంధించిన అన్ని వివరాలను అత్యంత రహస్యంగా ఉంచేందుకు జనవరి నుంచి ఆర్థికమంత్రిత్వ శాఖ కార్యాలయాల్లోకి జర్నలిస్టుల ప్రవేశాన్ని నిషేధిస్తారు. ఫోన్ ట్యాపింగ్ బడ్జెట్ ప్రతిపాదనలు ఏమాత్రం లీక్ కాకుండా చూసే బాధ్యతను ఇంటెలిజెన్స్ విభాగం చూసుకుంటుంది. ఇందుకు కొందరు ఉన్నతాధికారుల ఫోన్లను సైతం ట్యాప్ చేస్తుంటుంది. మూడో కన్ను.. ఆర్థిక శాఖ కార్యాలయానికి వచ్చే సందర్శకులపై సీసీటీవీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు నిఘా ఉంటుంది. ఈ కెమెరాల పరిధిని దాటి వారు కనీసం కుర్చీలపై కూర్చోవడానికి కూడా అనుమతి ఉండదు. అంతా ప్రత్యేకం బడ్జెట్ పత్రాలను తయారు చేసే ‘ప్రింటింగ్ ప్రెస్’ సిబ్బందిని ఎవరితో సంబంధం లేకుం డా ప్రత్యేకంగా ఉంచుతారు. వీరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. ఆహారంపైనా.. ప్రింటింగ్ ప్రెస్ సిబ్బందికి అందించే తిండిపై అత్యంత జాగ్రత్త తీసుకుంటారు. ఏ ఆహారాన్నైనా పరీక్షించిన తర్వాతే వారికి ఇస్తారు. నీడలా వెన్నంటే.. ముద్రణ విభాగంలో పనిచేసే సిబ్బంది ఎవరైనా అత్యవసరంగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. సదరు వ్యక్తి వెంట ఓ ఇంటెలిజెన్స్ అధికారి, ఓ పోలీసు ఉంటారు. వారు అనుక్షణం ఆయనను నీడలా అనుసరిస్తారు. ఫిబ్రవరి 1న.. ఉదయం 11 గంటలకు ఆర్థికమంత్రి పార్లమెంటుకు బడ్జెట్ను సమర్పిస్తారు. సభలో ప్రవేశపెట్టేముందు రాష్ట్రపతి, ప్రధానమంత్రికి బడ్జెట్ గురించి స్థూలంగా వివరిస్తారు. బడ్జెట్ లీక్.. పరీక్ష పేపర్లే కాదు.. బడ్జెట్ పేపర్లు కూడా లీకైన సంఘటన 1950లో చోటుచేసుకుంది. అప్పట్లో బడ్జెట్ పత్రాల్ని రాష్ట్రపతి భవన్లో ముద్రించేవారు. 1950లో ఈ పత్రాలు లీక్ కావడంతో అప్పట్నుంచీ మింట్రోడ్లోని సెక్యూరిటీ ప్రెస్కు వేదికను మార్చారు. 1980 నుంచి ఢిల్లీలోని నార్త్ బ్లాక్లో బడ్జెట్ పత్రాల్ని ముద్రిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రింటింగ్ ప్రెస్ను ఏర్పాటు చేశారు. -
సామాజిక న్యాయ, సాధికారతకు రూ.7,800 కోట్లు
న్యూఢిల్లీ: సామాజిక, న్యాయ సాధికారత శాఖకు ఈసారి బడ్జెట్ కేటాయింపులు గతేడాది కంటే కాస్త పెరిగాయి. 2018–19లో రూ.7,750 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.7,800 కోట్లకు పెంచారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రూ.1,144.90 కోట్లు కేటాయించారు. గతేడాది కంటే(రూ.1,070 కోట్లు) ఇది ఏడు శాతం అధికం. ‘షెడ్యూల్ క్యాస్ట్కు సంబంధించి 2018–19 బడ్జెట్ అంచనాలు రూ.56,619 కోట్లు కాగా.. 2019–20కి వచ్చేసరికి రూ.76,801 కోట్లకు పెరిగింది. మొత్తంగా ఇది 35.6 శాతం అధికం’ అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, సఫాయీ కర్మచారీస్ తదితర ఐదు జాతీయ కమిషన్ల కోసం గత బడ్జెట్లో రూ.33.72 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.39.87 కోట్లకు పెంచారు. జాతీయ స్కాలర్షిప్ పథకాలకు కేటాయింపులు తగ్గించారు. గతేడాది రూ.500 కోట్లు కేటాయించగా.. ఈ సారి రూ.390.50 కోట్లకు పరిమితం చేశారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర ఆర్థిక, అభివృద్ధి బోర్డులకు రూ.215 కోట్లు కేటాయించారు. డీవోపీటీకి 241 కోట్ల నిధులు న్యూఢిల్లీ: అధికారులకు జాతీయంగా, అంతర్జాతీయంగా శిక్షణ ఇచ్చేందుకు గానూ డీవోపీటీకి ఈ బడ్జెట్లో రూ. 241.8 కోట్లను కేంద్రం ప్రకటించింది. కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల విభాగానికి (డీవోపీటీ).. గతేడాది రూ. 194.76 కోట్లు కేటాయించగా.. దీనికి ఈ ఏడాది కేటాయింపులను 24% నిధులను పెంచారు. ఇందులో రూ. 79.06 కోట్లతో ఢిల్లీలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెక్రటేరియట్ ట్రైనింగ్ అండ్ మేనేజ్మెంట్ (ఐఎస్టీమ్), ముస్సోరీలో లాల్బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (ఎల్బీఎస్ఎన్ఏఏ) లను నిర్మించనున్నారు. ఈ రెండు కేంద్రాల్లో ఐఏఎస్ అధికారులకోసం పలు శిక్షణాకార్యక్రమాలు నిర్వహిస్తారు. మిగిలిన రూ.162.75కోట్లను శిక్షణ అవసరాలకోసం ఖర్చు చేస్తారు. అటు.. కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ), పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు (పీఈఎస్బీ)లకు వేరుగా రూ. 30.26కోట్లు కేటాయించారు. గతేడాది ఈ రెండు విభాగాలకు కలిపి రూ.29.27కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. అధికారుల సమస్యల పరిష్కారానికి ఉద్దేశించింన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ (క్యాట్)కు రూ.119.46 కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపట్టే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ)కి రూ. 239.97కోట్లను తాజా బడ్జెట్లో ప్రకటించారు. పర్యావరణానికి రూ.3,111 కోట్లు న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్లో పర్యావరణ మంత్రిత్వ శాఖకు ప్రభుత్వం రూ.3,111.20 కోట్లు కేటాయించింది. గత కేటాయింపులతో పోలిస్తే ఇది 20.27 శాతం ఎక్కువ. గత ఆర్థిక సంవత్సరంలో ఈ శాఖకు రూ.2,586.67 కోట్లు కేటాయించింది. గత ఏడాది మాదిరిగానే పులులను సంరక్షించే ‘ప్రాజెక్టు టైగర్’కు రూ.350 కోట్లు, ఏనుగుల కోసం అమలు చేస్తున్న ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’కు రూ.30 కోట్లు వెచ్చించనుంది. పులుల సంరక్షణ ప్రాజెక్టులో భాగంగా ఉన్న నేషనల్ టైగర్ కాన్జర్వేషన్ అథారిటీ(ఎన్టీసీఏ)కి గత ఏడాది కంటే రూ.కోటి ఎక్కువగా రూ.10 కోట్లు ఇచ్చింది. ఈ కేటాయింపులపై ఎన్టీసీఏ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ నిశాంత్ వర్మ సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా, జంతు సంక్షేమ బోర్డు(ఏడబ్య్లూబీ)కు గత ఏడాది కంటే రూ.2 కోట్లు ఎక్కువగా అంటే రూ.12 కోట్లు ప్రత్యేకించింది. నేషనల్ కమిషన్ ఫర్ గ్రీన్ ఇండియాకు గత ఏడాది కంటే రూ.30 కోట్లు ఎక్కువగా రూ.240 కోట్లు కేటాయించింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(సీపీసీబీ)కి గత ఏడాది మాదిరిగానే రూ.100 కోట్లు ప్రత్యేకించిన ప్రభుత్వం, కాలుష్య నివారణ కార్యక్రమాలకు గత ఏడాది కంటే సగానికి తగ్గించి రూ.10 కోట్లు ఇచ్చింది. ఈ పరిణామంపై స్పందించేందుకు సీపీసీబీ అధికారులు నిరాకరించారు. లోక్పాల్కు, సీవీసీకి అంతంతే న్యూఢిల్లీ: అవినీతి నిరోధక అంబుడ్స్మెన్ లోక్పాల్కు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)కు 2019–20 మధ్యంతర బడ్జెట్లో నామమాత్రపు నిధులనే కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరం లోక్పాల్కు రూ.4.29 కోట్లు కేటాయించగా ఈసారి బడ్జెట్లో కూడా అంతే మొత్తం కేటాయించారు. సీవీసీకి మాత్రం గతేడాది కేటాయింపుల కంటే ఈసారి స్వల్పంగా నిధులను పెంచారు. 2018–19 బడ్జెల్లో సీవీసీకి రూ.34 కోట్లు కేటాయించగా ఈసారి రూ.35.5 కోట్లు కేటాయించారు. సీబీఐకి రూ.777 కోట్లు న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్లో కేంద్రం రూ.777.27 కోట్లు కేటాయించింది. గతేడాది కేటాయింపుల కన్నా ఈసారి కొంచెం తగ్గించారు. గతేడాది బడ్జెట్లో రూ.778.93 కోట్లు కేటాయించారు. దేశ, విదేశాల్లో చాలా సున్నితమైన కేసులపై సీబీఐ దర్యాప్తు చేపడుతుంది. భారత్లో సంచలనం రేపిన అగస్టా వెస్ట్లాండ్ స్కాం, పోంజీ కుంభకోణం, అక్రమ మైనింగ్ వ్యవహారాలు, నకిలీ ఎన్కౌంటర్ల వంటి వాటి గుట్టురట్టు చేసింది. అలాగే విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, జతిన్ మెహతా, మెహుల్ చోస్కీ తదితరులు ఆర్థిక నేరగాళ్ల బండారం బయటపెట్టింది. బడ్జెట్ కేటాయింపులను సీబీఐ ఈ–గవర్నెన్స్, శిక్షణ కార్యాలయాల ఆధునీకరణ, పలు సాంకేతిక, ఫొరెన్సిక్ యూనిట్ల పెంపు, కార్యాలయాల భవనాల కోసం భూ కొనుగోలు, నిర్మాణం తదితరాల కోసం సీబీఐ వినియోగించనుంది. -
రోడ్ల నిర్మాణంలో అత్యంత వేగవంతమైన పురోగతి
న్యూఢిల్లీ: రోజుకు సగటున 27 కి.మీ మేర రహదారులు నిర్మిస్తూ ఈ రంగంలో భారత్ అత్యంత వేగవంతమైన వృద్ధిని నమోదు చేసిందని పీయూష్ గోయల్ చెప్పారు. వచ్చే 8 ఏళ్లలో 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని భారత్ ఉవ్విళ్లూరు తోందని చెప్పారు. మధ్యంతర బడ్జెట్ చారిత్రకమైనదని రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ స్వాగతించారు. దీని ద్వారా 40–50 కోట్ల మంది పేదలు, మధ్యతరగతి ప్రజలు నేరుగా ప్రయోజనం పొందుతారని చెప్పారు. మౌలిక వసతులకు కేటాయింపులు, ప్రతిపాదిత ప్రాజెక్టులు, పూర్తయిన ప్రాజెక్టులపై తాజా బడ్జెట్లో గోయల్ ప్రస్తావించిన విషయాలు.. ► రోడ్లు, రైల్వేలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, పట్టణ రవాణా, గ్యాస్–విద్యుత్ సరఫరా, జలరవాణా మార్గాల లాంటి రంగాల్లో తరువాతి తరం మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ► ఢిల్లీ, అస్సాం, అరుణాచల్ప్రదేశ్లలో ఏళ్లుగా నిలిచి పోయిన వంతెన ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ► రోడ్ల నిర్మాణానికి రూ.83 వేల కోట్లు కేటాయించారు. ► బ్రహ్మపుత్ర నదిలో నౌకాయానాన్ని అభివృద్ధిచేస్తే.. ఈశాన్య ప్రాంతానికి కూడా జలమార్గం గుండా సరుకు రవాణా చేసేందుకు సాధ్యమవుతుంది. ► కోల్కతా నుంచి వారణాసికి తొలిసారిగా దేశీయంగా జలరవాణా ద్వారా సరుకు రవాణా ప్రారంభమైంది. ► రైల్వే చరిత్రలోనే ఈ ఏడాది అత్యంత సురక్షితమైనదిగా గడిచింది. ► సిక్కింలోని పాక్యాంగ్ విమానం అందుబాటులోకి వచ్చాక దేశంలో పనిచేస్తున్న విమానాశ్రయాల సంఖ్య 100కు చేరింది. ► స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి సెమీ హైస్పీడ్ రైలు ‘వందేభారత్ ఎక్స్ప్రెస్’తో ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి సేవలు, వేగం, భద్రత అందుబాటులోకి వస్తాయి. ఈ సాంకేతికతతో మన ఇంజినీర్లు మేకిన్ ఇండియా కార్యక్రమానికి ఊతమిస్తున్నారు. తాజా బడ్జెట్లో రైల్వేలకు సమకూర్చిన మూలధనం: 64,587కోట్లు రైల్వేల మొత్తం మూలధన వ్యయం విలువ: 1,58,658 కోట్లు ► అరుణాచల్ప్రదేశ్లో విమానయాన సేవలు, మేఘాలయ, త్రిపుర, మిజోరంలలో రైల్వే మార్గాల అనుసంధానత ఇటీవలే ప్రారంభమయ్యాయి. ► ఈ మేరకు ఈశాన్య భారత్లో కేటాయింపులు 21 శాతం పెరిగి రూ.58, 166 కోట్లకు చేరుకున్నాయి. ► వచ్చే ఐదేళ్లలో లక్ష గ్రామాలను డిజిటల్ గ్రామాలుగా తీర్చిదిద్దాలని లక్ష్యం. ► 15.80 లక్షల ఇళ్లను పక్కా రోడ్లతో అనుసంధానించారు. మిగిలిపోయిన సుమారు 2 లక్షల ఇళ్లకు కూడా ఈ సౌకర్యం కల్పించేందుకు పనులు జరుగుతున్నాయి. ► ఈసారి పీఎంజీఎస్వైకి కేటాయించిన మొత్తం రూ.19,000 కోట్లు. ► 2014–18 మధ్యకాలంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 1.53 కోట్ల ఇళ్లను నిర్మించారు. -
దిగజారుడు రాజకీయాల్లో కొత్త ఒరవడి
సాక్షి, అమరావతి: నాలుగు నెలలకు ప్రవేశపెట్టే బడ్జెట్లో వరాలు, పథకాలు ప్రవేశపెడుతూ ప్రలోభాలకు దిగడాన్ని చూస్తుంటే ప్రజల్ని మోసం చేయటంలో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పెద్దలు పీహెచ్డీ తీసుకున్నారని అర్థమవుతోందని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ఇది దిగజారుడు రాజకీయాల్లో కొత్త ఒరవడి అని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్, అసెంబ్లీలో ప్రత్యేక హోదా అంశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై జగన్ స్పందించారు. శుక్రవారం సాయంత్రం అందుబాటులో ఉన్న నాయకులతో ప్రతిపక్ష నేత హైదరాబాద్ లోటస్పాండ్లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ‘ఈ చివరి బడ్జెట్లో కూడా రాష్ట్రానికి రావాల్సిన వాటిపై ఎలాంటి ప్రకటన లేదు. ముఖ్యమంత్రి చేతకానివాడు అయితే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా దెబ్బతింటాయో దానికి చంద్రబాబు పెద్ద ఉదాహరణ’ అని దుయ్యబట్టారు. ఓటుకు కోట్లు కేసు తర్వాత చంద్రబాబు లొంగుబాటు వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఆ తర్వాతే ప్రత్యేక హోదాను వదిలేసి లేని ప్యాకేజీకి ఊకొట్టారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ ఇదే అసెంబ్లీలో నాలుగు సార్లు తీర్మానాలు చేయించాడని గుర్తు చేశారు. ఆ రోజు మేం ఇది తప్పు, రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని నల్లచొక్కాలతో వస్తే.. మమ్మల్ని సభలో నానా మాటలు అని ఈరోజు చంద్రబాబు నల్లచొక్కాలు వేసుకొచ్చారని జగన్ మండిపడ్డారు. హత్య చేసినవాడే శాంతి ర్యాలీ చేసినట్లు బాబు వైఖరి ప్రత్యేక హోదా కోసం గొంతు ఎత్తినందుకు తమ ఎమ్మెల్యేలపై ప్రివిలైజ్ నోటీసులు ఇచ్చారని, ప్యాకేజీకి చంద్రబాబు జై కొట్టడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేస్తుంటే, 2016 సెప్టెంబరు 8, 9, 10 తేదీల్లో అసెంబ్లీలో మాట్లాడ్డానికి తనకు 30 సెకన్ల సమయం కూడా ఇవ్వలేదని జగన్ గుర్తు చేశారు. ఈరోజు ఎవరూ లేకుండా చూసి అసెంబ్లీలో చంద్రబాబు భారీ డైలాగులు చెప్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అసెంబ్లీలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదన్న కనీస జ్ఞానం కూడా చంద్రబాబుకు లేదు. 2017 జనవరి 27న ఇదే వ్యక్తి ఏమన్నాడో గుర్తుకు తెచ్చుకోవాలి. ఇంతకంటే ఏ రాష్ట్రానికి ఇచ్చారో చెప్పండి అంటూ వరుసగా నాలుగు సంవత్సరాలు కేంద్రం ఏపీకి అద్భుతంగా సహాయం చేసిందని ఇదే చంద్రబాబు చెప్పారు. హత్యచేసిన వాడే ఆ హత్యకు వ్యతిరేకంగా శాంతి ర్యాలీ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు డైలాగుల్ని చూసినా అలాగే ఉంది. నాలుగేళ్లపాటు టీడీపీకి చెందిన ఇద్దరు మంత్రులు కేంద్ర కేబినెట్లో ఉన్నారు. వాళ్లు ఉండి కూడా ఈ రాష్ట్రానికి ఏం చేశారంటే.. ఏమీ మాట్లాడరు. ఆ మంత్రులు దిగిపోతూ ప్రెస్మీట్ పెట్టి కూడా కేంద్ర ప్రభుత్వం అద్భుతంగా చేసిందని చెప్పారు. నాలుగేళ్లుగా ఏ బడ్జెట్ను కూడా చంద్రబాబు గాని, కేంద్రంలోని ఆయన మంత్రులు గానీ వ్యతిరేకించలేదు. విశాఖ మెట్రో రైల్కు రూ.1 లక్ష రూపాయలు ఇచ్చినా, పోలవరం ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించకపోయినా చంద్రబాబు జై కొట్టారు. కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా ఇవ్వనిది ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఇస్తుందని ఎవరు అనుకుంటారు? ఏపీకి న్యాయం చేసైనా ఎన్నికలకు వెళ్తారు అన్న ఆశ కొద్దిగా ఎవరికైనా మిగిలి ఉంటే అది లేకుండా చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీలన్నింటికీ గుణపాఠం తప్పదు’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు. -
రాష్ట్ర రైతులకు కేంద్రం ‘పెట్టుబడి’ 2,824 కోట్లు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’పథకం కింద తెలంగాణలో 47.08 లక్షల మంది సన్న, చిన్నకారు రైతులు రూ. 2,824 కోట్ల పెట్టుబడి సాయం పొందనున్నారు. ఆయా రైతులందరికీ రూ. 2 వేల చొప్పున మూడు విడతల్లో (ఏటా రూ. 6 వేలు) వారి బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ కానుంది. ప్రస్తుత రబీ సీజన్కు అంటే గతేడాది డిసెంబర్ నుంచి ఈ పథకం అమలులోకి వస్తున్నందున ఈ ఏడాది మార్చి నాటికి రైతులకు డబ్బు జమ అవుతుందని భావిస్తున్నారు. అందుకు అవసరమైన రైతు బ్యాంకు ఖాతా నంబర్లను కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో 90 శాతం మంది రైతులకు ప్రయోజనం... కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెట్టుబడి పథకం వల్ల రాష్ట్రంలోని 90 శాతం మంది రైతులకు ప్రయోజనం కలుగనుంది. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం తెలంగాణలో మొత్తం రైతుల సంఖ్య 57.24 లక్షలుకాగా అందులో ఐదెకరాల లోపున్న సన్న, చిన్నకారు రైతుల సంఖ్య 47.05 లక్షలుగా (అంటే 90 శాతం మంది) ఉంది. సన్న, చిన్నకారు రైతుల్లో అత్యధికంగా ఎకరం లోపు భూమి ఉన్నవారు 14.86 లక్షల మంది ఉన్నారు. రాష్ట్రంలో 1.40 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా సన్న, చిన్నకారు రైతుల చేతిలో 95.59 లక్షల ఎకరాలు (అంటే 68.05 శాతం) ఉంది. ‘రైతుబంధు’ఆదర్శంగా... రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని ఆదర్శంగా తీసుకొని కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి శ్రీకారం చుట్టింది. అయితే కేంద్రం తెచ్చిన ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా ఇప్పటికిప్పుడు అమలు చేయడం అంత సులువు కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ రైతుల బ్యాంకు ఖాతాలు అందుబాటులో లేకపోవడమే అందుకు కారణమని, కాబట్టి సార్వత్రిక ఎన్నికల నాటికి రైతు బ్యాంకు ఖాతాలను సేకరించి ఇవ్వడమనేది సులువైన వ్యవహారం కాదని చెబుతున్నారు. లక్ష్యం ఒకటే అయినా ... రాష్ట్రం అమలు చేస్తున్న రైతుబంధు పథకం, కేంద్రం తెచ్చిన పెట్టుబడి సాయం పథకం లక్ష్యం రైతులను ఆర్థికంగా ఆదుకోవడమే అయినప్పటికీ వాటి అమలు మాత్రం వేర్వేరుగా ఉంది. తెలంగాణలో రైతుబంధు కింద ప్రస్తుతం ఎకరాకు రూ. 4 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తుండగా కేంద్రం ఐదెకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకే ఏటా రూ.6 వేల చొప్పున సాయం అందించనుంది. ఈ లెక్కన ఐదెకరాలున్న ఒక రైతు.. రైతుబంధు ద్వారా ఏడాదికి రెండు సీజన్లకు కలిపి రూ.40 వేలు పొందితే కేంద్ర పథకం ద్వారా రెండు సీజన్లకూ కలిపి రూ.6 వేలే పొందుతాడు. దీనిపై పలువురు రైతులు పెదవి విరుస్తున్నారు. రాష్ట్రంలో రైతుబంధు కింద అన్ని వర్గాలూ పెట్టుబడి సాయం పొందుతుండగా మోదీ ప్రభుత్వం తెచ్చిన పథకంతో ఇప్పుడు సన్న, చిన్నకారు రైతులకే అదనంగా కేంద్ర సాయం అందనుందని వ్యవసాయశాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కేంద్ర పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి అమలు చేస్తే కేంద్రానికి పేరు రాదన్న భావనతోనే విడిగా అమలు చేస్తున్నారంటున్నారు. తెలంగాణ ఊసే లేదు సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు బంధు పథకాన్ని స్ఫూర్తిగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో రైతుబంధు తరహాలో ఐదెకరాలలోపు రైతుకు ఏటా రూ.6 వేల చొప్పున సాయాన్ని ప్రకటించింది. ఈ ఒక్క విషయంలోనే తెలంగాణ చర్చకు వచ్చింది తప్ప బడ్జెట్లో తెలంగాణకు సంబంధించి ప్రత్యేక ప్రస్తావనే లేదు. ఏపీ, తెలంగాణలో కలిపి గిరిజన విశ్వవిద్యాలయాలకు రూ.8 కోట్లు కేటాయించారు. ఈ అంశంలో తప్ప మరెక్కడా తెలంగాణ ప్రస్తావన రాలేదు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ఇవ్వాల్సిన రాయితీల్లో భాగంగా ఏపీకి, తెలంగాణకు కలిపి వడ్డీ రాయితీ కింద 2018–19 బడ్జెట్ అంచనాలను రూ.100 కోట్లుగా చూపారు. సవరించిన అంచనాల్లో సున్నాగా చూపారు. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిధులు కేటాయించలేదు. 2019–20కి కూడా నిధులు కేటాయించలేదు. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులు, పలు జాతీయ సంస్థలకు ఏటా ఇచ్చే సాధారణ ప్రణాళికేతర వ్యయాన్ని కొన్ని పద్దుల్లో చూపారు. తెలంగాణలో ప్రతిపాదిత ఎయిమ్స్కు నిధుల ప్రస్తావన ఈ బడ్జెట్లో కనిపించలేదు. పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ప్రతిపాదించిన బయ్యారంలో స్టీలు ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రస్తావన కూడా ఈ బడ్జెట్లో లేదు. కేంద్ర పన్నుల్లో వాటా ఇలా.. తెలంగాణకు 2019–20 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంచే మొత్తం (42 శాతం వాటా) నిధుల్లో 2.437 శాతం దక్కింది. ఇది రూ.20,583.05 కోట్లకు సమానం. గత ఏడాదికంటే దాదాపు రూ.2,022 కోట్లు అధికం. ఇందులో కార్పొరేషన్ టాక్స్ రూ.6,665.84 కోట్లు, ఆదాయ పన్ను రూ.5,600.58 కోట్లు, సెంట్రల్ జీఎస్టీ రూ.6,229.45 కోట్లు, కస్టమ్స్ టాక్స్ రూ.1,293 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ రూ.794 కోట్లు ఉన్నాయి. 2014–15తో పోల్చితే ఇప్పుడు కేంద్ర పన్నుల్లో వచ్చే వాటా రెట్టింపు కావడం విశేషం. -
స్త్రీ, శిశు.. సంక్షేమానికి 20 శాతం అధిక నిధులు
న్యూఢిల్లీ: స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖకు ఈసారి బడ్జెట్లో కేటాయింపులు పెరిగాయి. తాజా బడ్జెట్లో ఈ శాఖకు రూ. 2,9164.90 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ. 24758.62 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 20 శాతం అధికం. రాబోయే ఐదేళ్లకు చేపట్టాల్సిన పనుల గురించి రోడ్ మ్యాప్ తయారు చేస్తామని స్త్రీశిశు సంక్షేమమంత్రి మనేకా గాంధీ చెప్పారు. దేశవ్యాప్తంగా స్త్రీలు, పిల్లల కోసం ఏకీకృత కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. దేశ జనాభాలో 40 శాతమున్న పిల్లలకు జరపాల్సిన కేటాయింపులు మాత్రం అంచనాలకు అనుగుణంగా లేవని చైల్డ్ రైట్స్ అండ్ యూ సంస్థ సీఈఓ పూజా మర్వాహా పెదవివిరిచారు. బడ్జెట్ ప్రసంగంలోకానీ, విజన్ 2030లో కానీ పిల్లల ప్రస్తావనే లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సుకన్య సమృద్ధి యోజన ప్రస్తావన లేకపోవడంపై కూడా ఎన్జీవోలు నిరాశ వ్యక్తం చేశారు. ప్రధాన కేటాయింపులు ► ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకానికి కేటాయింపులు రూ. 1,200 కోట్ల నుంచి రూ. 2,500 కోట్లకు పెంపు. ► ఈ పథకం కింద గర్భిణీ స్త్రీలు, బాలింతలకు రూ. 6,000 సాయం. ► జాతీయ పౌష్టికాహార మిషన్(ఎన్ఎన్ఎం) ద్వారా పదికోట్ల మందికి ప్రయోజనం. ఈ పథకానికి రూ. 3,400 కోట్ల కేటాయింపు. ► శిశు అభివృద్ధి సేవలకు కేటాయింపులు రూ. 925 కోట్ల నుంచి రూ. 1500కు పెంపుదల. ► బేటీ బచావ్, బేటీ పడావో పథకానికి రూ. 200 కోట్ల నుంచి రూ. 280 కోట్ల కేటాయింపుల పెంపుదల. ► అంగన్వాడీ సేవలకు రూ. 19,834.37 కోట్ల కేటాయింపులు. ► నేషనల్ క్రెచ్ స్కీమ్కు రూ. 30 కోట్ల నుంచి రూ. 50 కోట్లకు కేటాయింపులు పెంచారు. ► వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పథకానికి కేటాయింపులు రూ. 52 కోట్ల నుంచి రూ. 165 కోట్లకు పెంపు. ► మహిళా శక్తి కేంద్రాల పథకానికి కేటాయింపులు రూ. 115 నుంచి రూ. 150 కోట్లకు పెంచారు. ► ఉజ్వల(అక్రమ రవాణా నుంచి కాపాడిన మహిళలను ఆదుకునే పథకం)కు కేటాయింపులు రూ. 20 కోట్ల నుంచి రూ.30 కోట్లకు, విడో గృహాలకు రూ. 8 కోట్ల నుంచి రూ. 15 కోట్లకు పెంచారు. ► మహిళా సాధికారత, సశక్తిత మిషన్కు బడ్జెట్ను రూ. 1,156 కోట్ల నుంచి రూ. 1,330 కోట్లకు పెంపుదల. ‘ఆమె’కోసం రూ.1,330 కోట్లు న్యూఢిల్లీ: మహిళల రక్షణ, సాధికారతకోసం బడ్జెట్లో రూ.1,330 కోట్లు కేటాయించామని ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. గత బడ్జెట్కన్నా ఈ మొత్తం రూ.174 కోట్లు అధికమని శుక్రవారం లోక్సభలో ఆయన తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా తెలిపారు. గత నాలుగేళ్లుగా మహిళలకోసం అనేక పథకాలు ప్రవేశపెట్టామని, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ద్వారా ‘మహిళాభివృద్ధి నుంచి మహిళల నేతృత్వంలో అభివృద్ధి’సాధించగలిగామని ఆయన అన్నారు. ప్రధానమంత్రి ముద్ర యోజన లబ్ధిదారుల్లో 70 శాతంపైగా మహిళలు ఉన్నారని, సులువైన రుణ పద్ధతి ద్వారా వారు స్వయంగా ఉపాధి అవకాశాలు సృష్టించుకున్నారని గోయల్ చెప్పారు. అలాగే 26 వారాల ప్రసూతి సెలవుల ద్వారా మహిళలకు ఉపాధిలో ఆర్థిక భరోసా కలిగిందన్నారు. ఉజ్వల యోజన ద్వారా ఎనిమిది కోట్ల ఉచిత ఎల్పీజీ కనెక్షన్లను ప్రభుత్వం అందిస్తోందని, ఇప్పటికే లబ్ధిదారుల సంఖ్య ఆరుకోట్లు దాటిందని, మిగిలినవి వచ్చే ఆర్థిక సంవత్సరంలో అందజేస్తామని ఆయన వెల్లడించారు. -
పాతపని పూర్తిచేసేందుకే!
సాక్షి, హైదరాబాద్: ఈసారి బడ్జెట్లో పెండింగ్లో ఉన్న పాత ప్రాజెక్టులను పూర్తిచేసేందుకే కేంద్రం ఎక్కువ ఆసక్తి చూపించింది. కొత్త ప్రాజెక్టుల గురించి ఎలాంటి ప్రకటన చేయకుండా.. పాత వాటికి నిధుల కేటాయింపునకే పెద్దపీట వేసింది. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కాజీపేట డివిజన్ హోదా, వట్టినాగులపల్లి టెర్మినల్ నిర్మాణం తదితర డిమాండ్లు ఈ బడ్జెట్లోనూ తీరని కోరికలుగానే మిగిలిపోయాయి. కాజీపేట–బల్లార్షా మూడో లైనుకు ఈ ఏడాది కూడా మోక్షం లభించలేదు. మరోవైపు అక్కన్నపేట–మెదక్ రైలు మార్గం ఈఏడాది ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. కొత్తపల్లి–మనోహరాబాద్కు మార్గంలోనూ మనోహరాబాద్–గజ్వేల్ వరకు ట్రయల్ రన్కు అధికారులు సిద్ధమవుతుండటం శుభసూచకం. శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే కేంద్రమైన సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే అడిషనల్ జనరల్ మేనేజర్ జాన్ థామస్ బడ్జెట్ వివరాలు వెల్లడించారు. కీలక ప్రాజెక్టులకు కేటాయింపులు.. 1. మనోహరాబాద్ కొత్తపల్లి ప్రాజెక్టుకు రూ.200 కోట్లు 2. మునీరాబాద్–మహబూబ్నగర్ మార్గానికి రూ.275 కోట్లు 3. భద్రాచలం–సత్తుపల్లి లైన్కు రూ.405 కోట్లు 4. కాజీపేట–బల్లార్షా మూడో లైన్కు రూ.265 కోట్లు 5. సికింద్రాబాద్–మహబూబ్నగర్ డబ్లింగ్కు రూ.200 కోట్లు 6. కాజీపేట–విజయవాడ మూడోలైన్కు రూ.110 కోట్లు 7. ఘట్కేసర్–యాదాద్రి ఎంఎంటీఎస్ ఫేజ్–2కు రూ.20 కోట్లు 8. చర్లపల్లి శాటిలైట్ స్టేషన్కు రూ.5 కోట్లు 9. కాజీపేట ఓవర్ హాలింగ్ వర్క్షాప్కు రూ.10 కోట్లు 10. మౌలాలిలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైల్వే ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఏర్పాటుకు రూ.1.5 కోట్లు తీరని కలలు... 1980 నుంచి తీరని కలగా మిగిలిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఈసారి కూడా మోక్షం దక్కలేదు. కాజీపేటను డివిజన్గా మార్చాలన్న డిమాండ్, లాలాగూడలో మెడికల్ కాలేజీ నిర్మించాలన్న డిమాండ్ ప్రస్తుతానికి పెండింగ్లోనే ఉన్నాయి. దక్షిణమధ్య రైల్వే పరిధిలోని చర్లపల్లి, వట్టినాగులపల్లి టెర్మినళ్ల నిర్మాణం ఇంకా సాకారం కావడం లేదు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం స్థలం కేటాయించడంలో జాప్యం చేస్తున్నందునే ఇది ఆలస్యమవుతోంది. ఈ సర్వే పనులకు టెండర్లు పిలుస్తారా? 1. పటాన్చెరు–సంగారెడ్డి–జోగిపేట–మెదక్ 95 కిలోమీటర్లు 2. నిజామాబాద్–నిర్మల్–ఆదిలాబాద్ రూ.125 కోట్లు 3. కరీంనగర్–హుజూరాబాద్–ఎల్కతుర్తి: 60 కిమీ ‘ఓట్ల కోసమే ఈ బడ్జెట్ ’ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం ఓట్ల కోసమే పెట్టినట్టుందని కాంగ్రెస్ ఆరోపించింది. పేదలను వదిలి వ్యాపారుల మన్ననలు పొందేలా ఉన్న ఈ బడ్జెట్తో బీజేపీ వ్యాపారస్తుల పార్టీ అని మరోమారు తేలిపోయిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. శుక్రవారం గాంధీభవన్లో ఏఐసీసీ కిసాన్సెల్ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డితో కలసి మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయపు పన్నును మినహాయించినట్టు ప్రకటించి వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని చెప్పడం దారుణమన్నారు. బడాబాబులకు ఐటీ తగ్గించి పేదలను పట్టించుకోకుండా అంకెలు చూపెట్టారని, మోదీ వల్ల దేశానికి ఒరిగిందేమీ లేదని, రాబోయే ఎన్నికల్లో మోదీ సర్కారును గద్దెదింపేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇది పూర్తిగా ఎన్నికల బడ్జెట్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ త్వరలో జరిగే సాధారణ ఎన్నికలకు ప్రచారం మాదిరిగా ఉందని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం కొండా విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ ద్వారా గతంలో తాను ప్రవేశపెట్టిన అన్ని పథకాలు విఫలమైనట్లుగా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నట్టు అయిందన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు, మద్దతు ధర, ఈనామ్ లాంటివన్నీ విఫలమవడంతో ఇప్పుడు కొత్తగా రైతులకు పెట్టుబడి సాయం పేరుతో ముందుకొచ్చారని విమర్శించారు. ఆదాయ పన్ను పరిమితి పెంపు మంచిదని పేర్కొన్నారు. అయితే, దీన్ని గత ఐదేళ్లలో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ఎన్నికల కోణంలో ఉందన్నారు. -
ఆరోగ్యం..ఆయుష్మాన్!
న్యూఢిల్లీ: ఆరోగ్య రంగానికి ఈ ఏడాది బడ్జెట్లో రూ.61,398 కోట్లను కేటాయించారు. అందులో రూ.6,400 కోట్లను ఆయుష్మాన్ ప్రధానమంత్రి జనారోగ్య యోజన(ఆయుష్మాన్ భారత్)కు ప్రత్యేకించారు. గత ఏడాది కన్నా ఈసారి ఆరోగ్య రంగానికి 16 శాతం అధికంగా కేటాయింపులు జరపడం గమనార్హం. ఇతర విశేషాలు.. ► జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్(ఎన్ఆర్హెచ్ఎం)లో భాగంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్, వెల్సెంటర్ల ఏర్పాటుకు రూ.250 కోట్ల కేటాయింపు. ► జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాల ఏర్పాటు నిమిత్తం రూ.1,350.01 కోట్ల కేటాయింపు. ► ఈ పథకం కింద 2022 నాటికి దేశవ్యాప్తంగా 1.5 లక్షల ఉప ఆరోగ్య కేంద్రాల్ని హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలుగా తీర్చిదిద్దుతారు. రక్తపోటు, డయాబెటిస్, కేన్సర్, వృద్ధాప్య సంబంధ వ్యాధులకు ఈ కేంద్రాల్లో చికిత్స అందిస్తారు. ► జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) పథకానికి రూ.31,745 కోట్లు కేటాయించారు. ► ఎన్హెచ్ఎంలో అంతర్భాగమైన రాష్ట్రీయ స్వస్థ్య బీమా యోజన కు రూ. 156 కోట్లు కేటాయించారు. ఈ మొత్తం గతేడాది కన్నా రూ.1,844 కోట్లు తక్కువ కావడం గమనార్హం. ► ఎయిడ్స్, అసురక్షిత లైంగిక వ్యాధుల నివారణ కార్యక్రమానికి రూ.2,500 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఈ మొత్తం రూ.400 కోట్లు అధికం. ► ఎయిమ్స్కు రూ.3,599.65 కోట్లు కేటాయించారు. ► జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమానికి కేటాయింపులను రూ.50 కోట్ల నుంచి రూ.40 కోట్లకు తగ్గించారు. ► కేన్సర్, డయాబెటిస్, హృద్రోగ సంబంధ వ్యాధుల నివారణ, నియంత్రణ కార్యక్రమానికి కేటాయింపులను రూ.295 కోట్ల నుంచి రూ.175 కోట్లకు తగ్గించారు. ► టెర్షరీ కేర్(ప్రత్యేక సంరక్షణ, చికిత్సలు) కార్యక్రమాలకు కేటాయింపులను రూ.750 కోట్ల నుంచి రూ.500 కోట్లకు తగ్గించారు. ► నర్సింగ్ సేవల ఆధునీకరణకు రూ.64 కోట్లు, ఫార్మసీ స్కూల్స్, కళాశాలల బలోపేతానికి రూ.5 కోట్లు, జిల్లా ఆసుపత్రులు, రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కళాశాలల(పీజీ సీట్లు) ఆధునీకరణకు రూ.800 కోట్లు కేటాయించారు. ► ప్రభుత్వ మెడికల్ కళాశాలలు(డిగ్రీ సీట్లు), కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి రూ.1,361 కోట్ల కేటాయింపు. కొత్త వైద్య కళాశాలల స్థాపనకు రూ.2 వేల కోట్లు, రాష్ట్రాల్లో ప్రభుత్వ పారామెడికల్ కళాశాలల ఏర్పాటుకు రూ.20 కోట్లు కేటాయించారు. ‘ఆయుష్మాన్’తో 3 వేల కోట్లు ఆదా: పీయూష్ ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఇప్పటిదాకా ఉచితంగా వైద్యం చేయించుకున్న సుమారు 10 లక్షల మంది పేదలు రూ.3 వేల కోట్లను ఆదాచేసుకున్నారని పీయూష్ గోయల్ చెప్పారు. జన ఔషధి కేంద్రాల ద్వారా ప్రభుత్వం చౌక ధరలకే ఔషధాల్ని అందిస్తోందని, గుండెలో అమర్చే స్టెంట్లు, కృత్రిమ మోకాలి చిప్పల ధరల తగ్గింపుతో లక్షలాది మంది పేదలు ప్రయోజనం పొందారని తెలిపారు. దేశంలో ప్రస్తుతం 21 ఎయిమ్స్ ఆసుపత్రులు పనిచేస్తున్నాయని, అందులో 14 ఆసుపత్రుల్ని ఎన్డీయే ప్రభుత్వమే ప్రారంభించిందని అన్నారు. పేదలకు ఆరోగ్య సేవల్ని చేరువచేసేందుకు మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని ఉటంకిస్తూ..2030 నాటికి ఎలాంటి అవాంతరాలు లేని సమగ్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఏర్పాటుచేసేలా పనిచేస్తున్నామని వెల్లడించారు. అలాంటి ఆరోగ్య భారత నిర్మాణంలో మహిళలనూ సమాన భాగస్వాముల్ని చేస్తామని తెలిపారు. దీర్ఘాయుష్మాన్ భవ... ఇప్పటికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సైతం నోచుకోని పల్లెలున్న భారతమిది. ఇక్కడ నిరుపేదకు సుస్తీ చేస్తే చావే శరణ్యం. కాబట్టి కార్పొరేట్ వైద్యాన్ని సాకారం చేసే సార్వత్రిక ఆరోగ్య బీమానిచ్చే ఏ పథకాన్నయినా దీర్ఘాయుష్మాన్ భవ అంటూ దీవించాల్సిందే. కాకపోతే గత బడ్జెట్లో ప్రకటించి ఊరుకున్నారు. ప్రయోగాలకే పరిమితమయ్యారు. ఈ సారి ఎన్నికలొస్తున్నాయి కనక పూర్తి స్థాయి కేటాయింపులు చేస్తూ... వెల్నెస్ సెంటర్ల నుంచి ఎయిమ్స్ దాకా పూర్తిస్థాయి వైద్య సదుపాయాల్ని అందుబాటులోకి తెచ్చే విజన్నూ ఆవిష్కరించారు. ఏ ప్రభుత్వమున్నా ఆ విజన్ సాకారం కావాలన్నదే నిరుపేదల ఆకాంక్ష. ఎందుకంటే వారికి కావాల్సింది వైద్యం మరి. -
వార్షికాదాయం 9 లక్షలు దాటినా పన్ను లేదు!
సాక్షి బిజినెస్ డెస్క్: ఈ బడ్జెట్లో సెక్షన్ 87–ఏ కింద లభించే పన్ను రిబేటును పెంచడంతో చిన్న వేతనజీవుల నుంచి ఎగువ మధ్యతరగతి ప్రజల వరకు అందరికీ ప్రయోజనం చేకూరుతోంది. ఈ రిబేటుతో పాటు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇతర పన్నుమిన హాయింపులను కూడా పూర్తిగా వినియోగిం చుకుంటే రూ.10 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు. గతంలో రూ.3.50 లక్షలలోపు పన్ను ఆదాయంపై రూ.2,500 పన్ను రిబేటు లభించేది. ఇప్పడు ఈ రిబేటును రూ.5 లక్షల పన్ను ఆదాయంపై రూ.12,500కు పెంచారు. ఇప్పుడు వీటికి అదనంగా సెక్షన్ 80–సీ కింద లభించే రూ.1.50 లక్షలు, స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000, గృహ రుణానికి చెల్లించే వడ్డీ రూ.2,00,000, ఎన్పీఎస్కు చెల్లించే రూ.50 వేలు పన్ను మినహాయింపులను వినియోగించుకుంటే రూ.9 లక్షల వార్షికాదాయం వచ్చేవారు కూడా ఒక్క రూపాయి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ పన్ను ఆదాయం (టాక్సబుల్ ఇన్కమ్) రూ.5,00,000 కన్నా ఒక్క రూపాయి దాటినా ఈ రిబేటు వర్తించదు. అప్పుడు ఆదాయ పన్ను శ్లాబుల ప్రకారం పన్ను లెక్కించి చెల్లించాల్సిందే. ఈ రిబేటును పెంచడంతో వార్షిక ఆదాయం రూ.5.50 లక్షలలోపు ఉన్న వారు ఎటువంటి పొదుపు చేయాల్సిన అవసరం లేకుండానే పన్ను భారం నుంచి పూర్తిగా తప్పించుకోవచ్చు. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి.. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రూ. 5 లక్షల వార్షికాదాయం గలవారికి నేరుగా రూ. 12,500 మేర రిబేటు లభిస్తుందని, దీంతో వారిపై పన్ను భారం ప్రసక్తి ఉండదని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ సుశీల్ చంద్ర తెలిపారు. వార్షికాదాయం రూ. 5 లక్షలు దాటిన వారికి మాత్రం ’పాత’ పన్ను రేట్లు యథాప్రకారం కొనసాగుతాయన్నారు. అయితే పీపీఎఫ్, జీపీఎఫ్, బీమా పథకాలు, మొదలైన వాటిల్లో రూ. 1.5 లక్షల దాకా ఇన్వెస్ట్ చేసిన పక్షంలో రూ. 6.5 లక్షల వార్షికాదాయ వర్గాలూ పన్ను రిబేటు ప్రయోజనాలు పొందవచ్చని సుశీల్ వివరించారు. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ. 40 వేల నుంచి రూ. 50 వేలకు పెంచడంతో వేతన జీవులకు మరో రూ. 10 వేల మేర అదనపు ప్రయోజనమూ లభిస్తుందన్నారు. దీంతో సుమారు 3 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు లబ్ధి పొందగలరన్న సుశీల్ చంద్ర.. ఖజానాకు మాత్రం రూ. 4,700 కోట్ల మేర ఆదాయం తగ్గుతుందన్నారు. రూ. 5 లక్షల దాకా ఆదాయవర్గాలకు రిబేట్ ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి రూ. 18,500 కోట్ల దాకా ఆదాయం పోతుందన్నారు. -
మినహాయింపు ఎన్నికల తర్వాతే..
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు డీమానిటైజేషన్ సహా నల్లధనం కట్టడికి ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలతో బయటకు వెల్లడించని రూ.1.30 లక్షల కోట్ల ధనం పన్ను పరిధిలోకి వచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నల్లధనాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.‘‘నల్లధన నియంత్రణ చట్టం, పరారీలో ఉన్న నేరస్తుల చట్టం, డీమోనిటైజేషన్ వంటి నిర్ణయాలు రూ.1,30,000 కోట్లను పన్ను పరిధిలోకి తీసుకొచ్చింది. రూ.50,000 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నాం. ఈ కాలంలోనే రూ.6,900 కోట్ల మేర బినామీ ఆస్తులు, రూ.1,600 కోట్ల మేర విదేశీ ఆస్తులను స్వాధీనం చేసుకున్నాం. 3,38,000 షెల్ కంపెనీలను గుర్తించి రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతోపాటు ఆ కంపెనీల డైరెక్టర్లను డిస్క్వాలిఫై చేశాం’’ అని మధ్యంతర బడ్జెట్లో భాగంగా మంత్రి చెప్పారు. ఎన్నికల తర్వాత అధికాదాయ వర్గాల వారికి కూడా పన్ను మినహాయింపు లుంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ సంకేతమిచ్చారు. మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రూ.ఐదు లక్షల ఆదాయం దాటిన వారికి పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయలేక పోయామని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చే కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్లో వీరికి ప్రయోజనం కల్పిస్తామని చెప్పారు. ఇది మధ్యంతర బడ్జెట్ కావడంతో కొన్ని పరిమితులున్నాయని, దీంతో అన్ని నిర్ణయాలు తీసుకోలేకపోయినట్లు వివరణ ఇచ్చారు. కొత్త ఆర్థిక సంవత్సరం రాగానే పన్ను ప్రణాళికల గురించి ఆలోచించే మధ్యతరగతి ప్రజల కోసం ఎన్నికల వరకు ఆగకుండా ఇప్పుడే ప్రకటించినట్లు తెలిపారు. ఇప్పుడు ఆదాయ పన్ను విభాగం పూర్తిగా ఆన్లైన్ విధానంలో పనిచేస్తోందని, గతేడాది 99.54% రిటర్నులు ఆన్లైన్ ద్వారానే వచ్చినట్లు తెలిపారు. భవిష్యత్తులో రిటర్నుల స్క్రూట్నీ కూడా మానవ ప్రమేయం లేకుండా పూర్తిగా ఆన్లైన్ ద్వారానే జరిగే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 85శాతం ట్యాక్స్ పేయర్లకు ప్రయోజనం తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్తో 85 శాతం మంది పన్నుచెల్లింపుదారులు ప్రయోజనం పొందుతారని ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. 2019–20 తాత్కాలిక బడ్జెట్లో ప్రతిపాదించిన విధానాలు, రాయితీలతో మధ్య తరగతి కుటుంబాలు, రైతులు, పేదవర్గాలు లబ్ధి పొందుతారని ఓ టీవీ చానల్కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వివరించారు. ‘ఇది ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన బడ్జెట్ కాదు. నాలుగున్నరేళ్లుగా మేం ఈ అంశాలపై నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాం’అని మంత్రి అన్నారు. ప్రధాని చెబుతున్నట్లు ‘అందరితో కలిసి అందరికీ ప్రగతి ఫలాలు’ అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. రైతులు, అసంఘటిత రంగ కార్మికులు, మత్స్య, పశుపోషణ రంగాల్లో పనిచేసే వారందరి కోసం ఈ బడ్జెట్ను రూపొందించాం. మధ్య తరగతి కొనుగోలు శక్తి పెరగడానికి, వస్తు, సేవల వినియోగం, అభివృద్ధికి కృషి చేశాం’ అని ఆయన వివరించారు. దేశ చరిత్రలోనే మొదటిసారి మొత్తం 22 వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించామంటూ మంత్రి.. ఇది కాకుండా పేద రైతులకు ఏటా రూ.6 వేల కోట్ల మేర మేలు చేకూరుస్తున్నట్లు తెలిపారు. -
మిడిల్ క్లాస్ మోదీ..
మధ్య తరగతికి.. మహా ఊరట! ఇది..ముచ్చటగా 3 కోట్ల మందిపై ప్రధాని వేసిన సమ్మోహనాస్త్రం. ఏడాదికి 5 లక్షల రూపాయల్లోపు ఆదాయాన్ని ఆర్జించేవారు రూపాయి కూడా పన్ను కట్టక్కర్లేదు. వీరేకాదు.. రకరకాల మినహాయింపులు, ఇన్వెస్ట్మెంట్లను పరిగణనలోకి తీసుకుంటే రూ. 8–9 లక్షల వార్షికాదాయం ఉన్నవారు కూడా పైసా పన్ను కట్టకుండా తప్పించుకోవచ్చు. కాకపోతే ఏడాదికి దాదాపుగా రూ.10 లక్షలు, ఆపైన ఆర్జించేవారికి మాత్రం ఈ బడ్జెట్తో ఒరిగిందేమీ లేదు. అందుకే కావచ్చు.. ఈ ఏడాదికి తాము ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్లో ఈ వర్గాల గురించీ ఆలోచిస్తామన్నారు గోయల్. న్యూఢిల్లీ: ఎన్నికల వేళ ప్రధాని మోదీ మిడిల్ క్లాస్ వేతన జీవుల మనసు గెలిచే ప్రయత్నం చేశారు. పన్ను శ్లాబులను మార్చకుండా వారికి ఉపశమనం కల్పించారు. పన్ను చెల్లించాల్సిన ఆదాయం గనక రూ.5 లక్షలలోపు ఉంటే.. వారెలాంటి పొదుపులూ చేయకపోయినా పూర్తిగా పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ఈ మేరకు సెక్షన్ 87ఏ కింద ఇస్తున్న రిబేటును రూ.2,500 నుంచి రూ.12,500కు పెంచుతూ బడ్జెట్లో నిర్ణయం తీసుకున్నారు. గతంలో సెక్షన్ 87ఏ రిబేటు పరిమితి రూ.3.50 లక్షలుండగా దీన్ని రూ.5 లక్షలకు పెంచారు. దీంతో రూ.5 లక్షలలోపు పన్ను ఆదాయం (ట్యాక్సబుల్ ఇన్కమ్) ఉన్నవారు ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి గోయల్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. గోయల్ ఈ నిర్ణయాన్ని ప్రకటించాక లోక్సభ కొన్ని నిమిషాల సేపు బీజేపీ కార్యవర్గ సమావేశం మాదిరిగా మారిపోయింది. ఎన్డీఏ ఎంపీలంతా మోదీ... మోదీ అంటూ సభను మార్మోగించారు. ఈ రిబేటు పరిమితిని పెంచడం వల్ల 3 కోట్ల మంది ఉద్యోగులకు రూ.18,500 కోట్ల మేర పన్ను భారం తగ్గుతుందని గోయల్ ప్రకటించారు. అంతేకాదు సెక్షన్ 80సీ కింద లభించే రూ.1.5 లక్షల మినహాయింపు, ఇంటి రుణానికి చెల్లించే వడ్డీ, ఆరోగ్య బీమా ప్రీమియం వంటి ఇతర మినహాయింపులను పూర్తిగా వినియోగించుకుంటే రూ.9 లక్షల వార్షికాదాయం ఉన్న వారూ పన్ను కట్టక్కర్లేదు. అయితే ట్యాక్సబుల్ ఇన్కమ్ కనక రూ.5 లక్షలకన్నా రూపాయి దాటినా.. వారు మునుపటిలానే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. గత నాలుగేళ్లుగా అమలు చేసిన సంస్క రణలు ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వల్ల ఆదాయం పెరిగిందని, ఈ ప్రయోజనాన్ని తిరిగి వారికి అందించాలని ఉన్నా ఇది మధ్యంతర బడ్జెట్ కావడంతో వేతనజీవుల వరకు మాత్రమే పరిమితమవుతున్నామని గోయల్ స్పష్టం చేశారు. బేసిక్ లిమిట్లో మార్పు లేదు... బడ్జెట్ ప్రసంగంలో గోయల్ రూ.5 లక్షలలోపు వారికి ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరంలేదని ప్రకటించడంతో అందరూ ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచినట్లు భావించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం... పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవని, కేవలం సెక్షన్ 87 రిబేటు పరిమితిని రూ.3,50,000 నుంచి రూ.5,00,000 మాత్రమే పెంచామని, మును పటి శ్లాబులు యథాతథంగా కొనసాగుతాయని వివరణ ఇచ్చింది. సెక్షన్ 87ఏ పరిమితిని పెంచడం వల్ల పన్ను చెల్లించాల్సిన ఆదాయం రూ.5 లక్షలలోపు గనక ఉంటే... వారికి గరిష్టంగా రూ.12,500 ప్రయోజనం లభిస్తుంది. స్టాండర్డ్ డిడక్షన్ను రూ.40వేల నుంచి రూ.50వేలకు పెంచడం వల్ల రూ.2,080 నుంచి రూ.3,120 వరకు ప్రయోజనం లభించనుంది. ఈ రెండింటిని కలిపితే గరిష్టంగా రూ.15,000 వరకు ప్రయోజనం చేకూరనుంది. రెండో ఇంటికీ ‘క్యాపిటల్’ గెయిన్స్ ఏదైనా ఇంటిని విక్రయించినపుడు వచ్చిన దీర్ఘకాలిక మూలధన పన్ను లాభాలను రెండు ఇళ్లకు వర్తింప చేస్తూ బడ్జెట్లో ప్రతిపాదన చేశారు. ప్రస్తుతం ఏదైనా ఒక ఇంటిని విక్రయించినపుడు దానిపై వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను చెల్లించాలి. ఒకవేళ ఈ పన్ను భారాన్ని తప్పించుకోవాలంటే ఈ లాభాలతో మరో ఇంటిని కొనుగోలు చేయవచ్చు. ఇంతకాలం ఇది కేవలం ఒక ఇంటి కొనుగోలుకే వర్తించేది. ఇప్పుడు దీన్ని రెండు ఇళ్లను కొనుగోలు చేయడానికి అనుమతించారు. ఈ విధంగా గరిష్ఠంగా రూ.2 కోట్ల వరకూ వచ్చే మొత్తానికి దీర్ఘకాలిక మూలధన పన్ను లాభాలు వర్తిస్తాయి. కాకపోతే ఈ ప్రయోజనాన్ని జీవితంలో ఒకసారి మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉంది. అదే విధంగా వేతన జీవులు ఉద్యోగార్థం ఒక ఇంటిలో ఉండి మరో ఇల్లు ఖాళీగా ఉంచినా దానిని ఊహాజనిత ఆదాయంగా లెక్కించి పన్ను కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు రెండో ఇంటిని ఊహాజనిత ఆదాయం నుంచి మినహాయించారు. పెన్షన్దారులకు ఊరట కేవలం వడ్డీనే ఆదాయంగా ఉన్న వారికి మోదీ సర్కార్ పెద్ద ఊరటనిచ్చింది. పోస్టాఫీసులు, బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన వాటిపై వచ్చే వడ్డీ ఆదాయంపై టీడీఎస్ (మూలం వద్ద ఆదాయ పన్ను) పరిమితిని 3 రెట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఏడాదిలో వడ్డీ రూపంలో వచ్చే మొత్తం రూ.10,000 దాటితే టీడీఎస్ చెల్లించాల్సి వచ్చేది. ఒకవేళ టీడీఎస్ చెల్లించకూడదనుకుంటే... తమ మొత్తం ఆదాయం పన్ను పరిమితికి లోబడే ఉందని నిర్ధారిస్తూ బ్యాంకుకు డిక్లరేషన్ ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ పరిమితిని రూ.40,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అంటే రూ.40,000 దాటేదాకా ఎలాంటి టీడీఎస్ ఉండదు. డిక్లరేషన్ అవసరం లేదు. అదే విధంగా ఇంటి అద్దెల రూపంలో వసూలు చేసే మొత్తంపై కూడా టీడీఎస్ పరిమితిని పెంచారు. ఇప్పటి వరకు ఇంటద్దెల రూపంలో వచ్చే ఆదాయం ఏడాదికి రూ.1.80 లక్షలు దాటితే (నెలకు రూ.15వేలు) టీడీఎస్ చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.2.40 లక్షలకు (నెలకు రూ.20 వేలకు) పెంచారు. -
విదేశాంగశాఖకు రూ.16 వేల కోట్లు
న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్లో విదేశాంగ శాఖకు రూ.16వేల కోట్లను ప్రభుత్వం కేటాయించింది. గత బడ్జెట్తో పోలిస్తే ఇది రూ.వెయ్యి కోట్లు ఎక్కువ. గత బడ్జెట్లో విదేశాలకు అందించిన సాయం రూ.5,545 కోట్లు కాగా ఈసారి రూ.6,447 కోట్లకు ప్రభుత్వం పెంచింది. మాల్దీవులకు సాయం రూ.125 కోట్ల నుంచి రూ.575 కోట్లకు పెరిగింది. భూటాన్కు సాయం గత ఏడాది రూ.2,650 కోట్లు కాగా ఈసారి రూ.2,615 కోట్లకు తగ్గించింది. అఫ్గానిస్తాన్కు రూ.325 కోట్లు, బంగ్లాదేశ్కు రూ.175 కోట్లు, శ్రీలంకకు రూ.150 కోట్లు, మంగోలియాకు రూ.5 కోట్లు బడ్జెట్లో కేటాయించింది. నేపాల్కు రూ.700 కోట్లు కేటాయించారు. -
వ్యవసాయం గట్టెక్కించేనా?
అప్పులకు తాళలేక అన్నదాతల వరుస ఆత్మహత్యలు, పెట్టుబడికి తగిన రాబడి రాకపోవడం, పంట ఉత్పత్తుల ధరల పతనం లాంటి కారణాలతో దేశ రైతాంగం కనీవినీ ఎరుగని సంక్షోభం ఎదుర్కొంటోంది. ఏడాదిన్నర వ్యవధిలో దేశవ్యాప్తంగా రైతులు 18 సార్లు రోడ్డెక్కి ఆందోళనలకు దిగారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 184 రైతు సంఘాలు దేశవ్యాప్త నిరసనలకు దిగడంతో రైతన్నల ఆగ్రహజ్వాలలు ఢిల్లీ పీఠాన్ని తాకాయి. ఇటీవల హిందీ బెల్ట్లోని మూడు రాష్ట్రాల్లో బీజేపీ పరాజయానికి అన్నదాతల ఆగ్రహమే కారణమని నిర్ణయానికొచ్చిన కేంద్ర ప్రభుత్వం వారిని మచ్చిక చేసుకోవడానికి రకరకాల పథకాలపై అధ్యయనం చేసి, చివరికు తెలంగాణ,ఒడిశా రాష్ట్రాలు అమలు చేస్తున్న పెట్టుబడి సాయమే మంచిదన్న నిర్ణయానికొచ్చింది. కేంద్ర బడ్జెట్లో రైతులపై వరాల జల్లులు కురిపిస్తూ ఏడాదికి రూ. 6 వేల పెట్టుబడి సాయాన్ని ప్రకటించింది. కానీ దీని వల్ల రైతులకు కలిగే ప్రయోజనం ఎంత అన్నది ప్రశ్నార్థకమే. – సాక్షి, హైదరాబాద్ వ్యవసాయ సంక్షోభం ఎలా ఉందంటే.. - మన దేశంలో మొత్తం 26 కోట్ల 30 లక్షల మంది రైతులు ఉండగా, 2016–17 నాబార్డ్ ఆర్థిక సర్వే ప్రకారం ఒక్కో రైతు కుటుంబంపై రూ.1.04 లక్షల అప్పు భారం ఉంది. - దేశం మొత్తం మీద 52శాతం మంది రైతులు అప్పుల్లో కూరుకుపోయినట్లు నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు (ఎన్ఎస్ఎస్ఒ) వెల్లడించింది. - రైతు అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది. ఏపీలో 92.9శాతం మంది రైతులు రుణగ్రస్థులు కాగా, తరువాతి స్థానాల్లో తెలంగాణ (89.1%), తమిళనాడు (82.5%) ఉన్నాయి. - ప్రభుత్వ పథకాలపై 64 శాతం మంది రైతులు అసంతృప్తితో ఉన్నట్టు సీఎస్డీఎస్ అధ్యయనంలో తేలింది. - సాగు కమతాల విస్తీర్ణం బాగా తగ్గిపోవడం, ఎకరా, రెండు ఎకరాలు ఉన్న చిన్న రైతుల సంఖ్య పెరగడంతో వారు బేరమాడేశక్తిని కోల్పోతున్నారు. దీంతో దళారులు చెప్పే «ధరకే పంటని అమ్ముకుంటున్నారు. - పంటల ఉత్పత్తికి తగిన డిమాండ్ లేకపోవడంతో రైతులకు ఆశించిన ధర దక్కడం లేదు. - గోదాములు, శీతల గిడ్డంగుల కొరతతో పంట ఉత్పత్తులు తొందరగా చెడిపోవడం కూడా రైతులకు నష్టం కలిగిస్తోంది. - డీజిల్ ధరలు పెరగడం, అంతర్జాతీయంగా రూపాయి విలువ పతనంతో ఎరువుల ధరలు ఎగబాకడంతో పెట్టుబడి వ్యయం అధికమవుతోంది. - ప్రత్యామ్నాయ మార్గాలుంటే వ్యవసాయ రంగాన్ని వదులుకోవాలని సుమారు 40 శాతం రైతులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణంలో 40 శాతం వాటా.. ద్రవ్యోల్బణానికి, వ్యవసాయాదాయానికి మధ్య మౌలికంగా కొంత వైరుధ్యం ఉంది. ద్రవ్యోల్బణాన్ని నిర్ణయించే వినిమయ ధరల సూచి (సీపిఐ)లో 40% వరకు ఆహార పదార్థాలే ఉంటాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం దేశ ద్రవ్యవిధానంలో కీలకమైన అంశం. ద్రవ్యోల్బణం తగ్గడం వ్యవసాయ ఉత్పత్తుల ధరలను దెబ్బతీసింది. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి వ్యవసాయాదాయాన్ని నియంత్రించడం మంచిది కాదు. విధాన నిర్ణేతలు ఎదుర్కొంటున్న అతిపెద్ద రాజకీయ–ఆర్థిక సమస్య ఇది. సాయం కంటితుడుపేనా? 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఇప్పటికే ప్రకటించిన ఎన్డీయే ప్రభుత్వం ఎన్నికల వేళ పెట్టుబడి సాయం రూపంలో తాయిలాలు ప్రకటించింది. భారత్లో వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారి సంఖ్య 50 శాతానికి పైనే అయినా, ఆ రంగం నుంచి వస్తున్న స్థూల జాతీయోత్పత్తి అంతకంతకు తగ్గిపోయి 17–18 శాతానికి చేరుకుంది. సాధారణ ద్రవ్యోల్బణం కంటే ఆహార ద్రవ్యోల్బణం దారుణంగా పడిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడి సాయం చేయడం కంటి తుడుపు చర్యేనన్న అభిప్రాయం వ్యక్తమవు తోంది. పండిన పంటకి గిట్టుబాటు ధర కల్పిం చడం, వ్యయ భారాన్ని తగ్గించడం, పంట నిల్వ వసతుల్ని మెరుగుపరచడం లాంటి వాటిపై దృష్టి సారించాలి. రాష్ట్రాల వారీగా అక్కడున్న ఖర్చుల ఆధారంగా పెట్టుబడి వ్యయాన్ని నిర్ణయించాలని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ఐఐటీ, ఐఐఎంలకు నిధుల కోత
న్యూఢిల్లీ: తాజా బడ్జెట్లో ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్ఈఆర్లతోపాటు నియంత్రణ సంస్థలైన యూజీసీ, ఏఐసీటీఈల కేటాయింపులను 2018–19తో పోలిస్తే కేంద్రం తగ్గించింది. 2019 విద్యాసంవత్సరం నుంచి జనరల్ కేటగిరీలోని పేదలకు 10 శాతం కోటా కల్పించి, దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల్లో 25 శాతం సీట్లను పెంచిన నేపథ్యంలో ఆయా సంస్థలకు కేటాయింపులు తగ్గడం గమనార్హం. ఐఐఎంలకు గత ఏడాది రూ.1,036 కోట్లు కేటాయించగా ఈసారి 59.9 శాతం కోతపెడుతూ 415.41 కోట్లు కేటాయించారు. ఐఐటీలకు గత ఏడాది రూ.6,326 కోట్లు ఇవ్వగా ప్రస్తుత బడ్జెట్లో రూ.6,223.02 కోట్లు కేటాయించారు. 2017–18లో ఐఐటీలకు రూ.8,337.21 కోట్లు ఇచ్చారు. యూజీసీకి గత ఏడాది 4,722.75 కోట్లు ఇవ్వగా, ఇప్పుడు దాన్ని రూ.4,600.66 కోట్లకు తగ్గించారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ)కి గత ఏడాది 485 కోట్లు ఉంటే ఈసారి దాన్ని 466 కోట్లకు తగ్గించారు. మొత్తమ్మీద చట్టబద్ద నియంత్రణ సంస్థలకు గతఏడాదితో పోలిస్తే 2.70 శాతం తక్కువగా ఉంది. ప్రస్తుత బడ్జెట్లో ఈ సంస్థలకు రూ.5,066.66 కోట్లు ప్రతిపాదించగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.5,207.75 కోట్లు కేటాయించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఎడ్యుకేషన్, రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్)లకు ఈ బడ్జెట్లో రూ.660 కోట్లు ప్రతిపాదించారు. ఇది గత ఏడాది రూ.689 కోట్లుగా ఉంది. -
షూటింగ్ కష్టాలకు తెర!
న్యూఢిల్లీ: సినిమా షూటింగ్లకు అనుమతుల జారీని సరళతరం చేసేందుకు సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం ప్రకటించారు. పైరసీని అరికట్టేందుకు యాంటి క్యామ్కార్డింగ్ నిబంధనలు తెస్తున్నట్లు చెప్పారు. భారత్లో చిత్రీకరణ జరిపే విదేశీ సినిమాలకు మాత్రమే సింగిల్ విండో అనుమతుల జారీ విధానం ఉండగా ఇప్పుడు భారతీయ సినిమాలకు కూడా వర్తింపచేస్తున్నట్లు గోయల్ బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. పైరసీని అరికట్టేందుకు సినిమాటోగ్రఫీ చట్టంలో కామ్కార్డింగ్ను నిరోధించే నిబంధనలను పొందుపరుస్తామన్నారు. సినీ పరిశ్రమపై ఆధారపడి వేలాది మంది జీవిస్తున్నారని, చిత్ర నిర్మాతలకు కూడా తాజా నిర్ణయం మేలు చేస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సినీ పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. సింగిల్ విండో విధానంలో సినిమా షూటింగ్లకు అనుమతుల జారీతో చిత్ర పరిశ్రమకు మేలు జరుగుతుందని పేర్కొన్నాయి. -
రైతుకు రొక్కం!
న్యూఢిల్లీ: కేంద్ర మధ్యంతర బడ్జెట్ రైతులపై వరాల జల్లు కురిపించింది. పెట్టుబడి సాయంగా ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయల నగదు సాయం ప్రకటించింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పేరిట ప్రకటించిన ఈ పథకంలో భాగంగా చిన్న, సన్నకారు రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు వెళుతుందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే ఈ పథకం అమల్లోకి వస్తుంది. ఈ పథకం కోసం ఏటా 75 వేల కోట్లు కేటాయించనున్నట్టు మంత్రి వెల్లడించారు. మూడు వాయిదాల్లో డబ్బు లబ్ధిదారులకు చేరుతుందన్నారు. తొలి విడతగా రూ.2వేల ఆర్థిక సాయం ఈ ఏడాది మార్చి లోగా రైతులకు అందజేస్తామని, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా ఈ నగదు నేరుగా రైతుల ఖాతాలోకి మళ్లిస్తామని గోయల్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాలలో ఈ పథకం కోసం రూ. 20 వేల కోట్లను కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మూడు ఉత్తరాది కీలక రాష్ట్రాలలో బీజేపీ అధికారం కోల్పోయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశముందని గత కొంత కాలంగా వినిపిస్తూనే ఉంది. ఈ మూడు రాష్ట్రాలలో బీజేపీ ఓటమికి ప్రధాన కారణం గ్రామీణ ప్రాంతాలలో పెరిగిన అసంతృప్తే కారణమని విశ్లేషణలు వినిపించాయి. అందువల్లే రైతుల కోసం ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని కేంద్రం ప్రకటించిందని విశ్లేషకులంటున్నారు. రైతులకు 2 శాతం వడ్డీ రాయితీ ప్రకృతి వైపరీత్యాలు, అననుకూల వాతావరణ పరిస్థితులతో నష్టపోయే రైతులకు 2 శాతం వడ్డీ రాయితీని కేంద్రం బడ్జెట్లో ప్రకటించింది. రుణాలను సకాలంలో చెల్లించేవారికి 3 శాతం అధికంగా అందిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. చేపల పెంపకం, పశువుల పెంపకంపై ఆధారపడ్డ రైతులకు కూడా 2 శాతం వడ్డీ రాయితీని ప్రకటించారు. చేపల పెంపకం, పశువుల పెంపకంపై ఆధారపడ్డ రైతుల కోసం రూ.750 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్ సందర్భంగా కిసాన్ క్రెడిట్ కార్డులను చేపల పెంపకం, పశువుల పెంపకంపై ఆధారపడ్డ రైతులకు కూడా అందించాలని నిర్ణయించిన సంగతి తెల్సిందే.. ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులందరికీ పంటరుణాలపై 2 శాతం వడ్డీ రాయితీ వర్తింపజేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ రైతులకు జాతీయ వైపరీత్యాల సహాయ నిధి (ఎన్డీఆర్ఎఫ్) నుంచి అందించే సహాయంతో పాటు రుణాలను సకాలంలో తిరిగి చెల్లించే రైతులకు ఇచ్చే 3 శాతం ప్రోత్సాహాన్ని వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతాంగానికి కూడా వర్తింపజేస్తామని మంత్రి తెలిపారు. ఈ ప్రోత్సాహాన్ని రుణాలు రీషెడ్యూల్ చేసిన కాలం మొత్తానికి అందించనున్నట్లు గోయల్ వివరించారు. ‘‘ప్రకృతి వైపరీత్యాలు వాటిల్లినపుడు రైతులు సహజంగానే తమ రుణాలను తిరిగి చెల్లించలేరు. అలాంటి రైతులకు రుణాలను రీషెడ్యూల్ చేస్తున్నారు. వారికి రీషెడ్యూల్ చేసిన తొలి సంవత్సరం మాత్రమే 2 శాతం వడ్డీ రాయితీ వర్తింపజేస్తున్నారు.’’ అని గోయల్ పేర్కొన్నారు. రాయితీతో కూడిన రుణాలను సులభంగా అందజేయడానికి, రైతులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులు అందించడానికి గాను ఒక పరిపూర్ణమైన ప్రక్రియను ప్రారంభించనున్నామని,ఇందుకోసం సులభంగా పూర్తిచేసే దరఖాస్తు ఫారాలను అందించనున్నామని తెలిపారు. పేద, భూమిలేని రైతులు ఉత్పాదక వ్యయాలను ఎదుర్కోవడానికి వారికి నిర్మాణాత్మక ఆదాయం అవసరమని తెలిపారు. సంచార తెగలను పైకి తీసుకురావడానికి ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తామన్నారు. పెరిగిన కేటాయింపులు.. రైతులకు ప్రత్యక్ష నగదు బదిలీతో పాటు 2019–20 మధ్యంతర బడ్జెట్లో పాడి రైతులకు, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు కూడా ఉపశమన చర్యలను ప్రతిపాదించారు. పశుసంవర్థక, మత్స్యకార రుణాలకు కూడా వడ్డీ రాయితీ వర్తిస్తుందని ప్రకటించారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు రూ. 1,49,981 కోట్లు కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాలు రూ. 86,602 కోట్లతో పోలిస్తే రానున్న ఆర్థిక సంవత్సరానికి కేటాయింపులు భారీగా పెరిగాయి. ఈ ఏడాది ఎరువుల సబ్సిడీ రూ. 70,075 కోట్లు కాగా రానున్న ఆర్థిక సంవత్సరం రూ.74,986 కోట్లు. పేద రైతాంగానికి నిర్దిష్ట ఆదాయ సహాయాన్ని ప్రకటించిన ఆర్థిక మంత్రి.. సాగులో ఆదాయం తగ్గిపోవడానికి చిన్న కమతాలు, వ్యవసాయ ఉత్పత్తుల ధరల పతనం వంటి పలు కారణాలున్నాయని పేర్కొన్నారు. 12 కోట్లమందికి లబ్ధి.. విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ సామగ్రి, కూలీలు ఇంకా ఇతర అవసరాలు తీర్చడం కోసం రైతులకు పీఎం కిసాన్ పథకం ఉపకరిస్తుందని గోయల్ తెలిపారు. రైతు అప్పుల ఊబిలో చిక్కకుండా ఈ పథకం కాపాడుతుందని, ముఖ్యంగా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి రక్షిస్తుందని మంత్రి వివరించారు. ఈ పథకానికి నిధులను కేంద్ర ప్రభుత్వమే అందిస్తుందని, దాదాపు 12 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం వల్ల లబ్ధి చేకూరుతుందని గోయల్ పేర్కొన్నారు. రైతులు సంపాదించడానికి, గౌరవప్రదమైన జీవనం సాగించడానికి ఈ పథకం దారి చూపుతుందని ఆయన వివరించారు. దీనివల్ల అత్యంత నిరుపేద రైతు కుటుంబాలకు అదనపు ఆదాయం సమకూరడమే కాక, సాగు సీజన్కు ముందు అవసరమయ్యే అత్యవసర ఖర్చులకు ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి తెలిపారు. గోకుల్ మిషన్కు నిధుల పెంపు.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయ రుణ లక్ష్యం ఎంత అనేది ఆర్థిక మంత్రి వివరించలేదు. 2018–19లో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.11 లక్షల కోట్లను దాటి రూ. 11.68 లక్షల కోట్లకు చేరుకుందని మంత్రి గోయల్ తెలిపారు. రైతులకు రుణాలను అందుబాటులో ఉంచడం కోసం గత ఐదేళ్లలో వడ్డీ రాయితీని రెట్టింపు చేసినట్లు ఆర్థికమంత్రి వివరించారు. అందువల్లే 2018–19లో పంట రుణాలు రూ.11.68 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆయన తెలిపారు. రైతుల కష్టాలు తొలగించడానికి మోదీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని మంత్రి వివరిస్తూ.. మట్టి నాణ్యతా కార్డులు, నాణ్యమైన విత్తనాలు, నీటి పారుదల పథకాలు, ఎరువుల కొరత లేకుండా చూడడం వంటివాటి గురించి వివరించారు. పశుసంవర్థక శాఖ, మత్స్యకార రంగాలకు కూడా గణనీయమైన మద్దతు అవసరమని మంత్రి పేర్కొన్నారు. ఆ రంగాల ప్రాధాన్యతను గుర్తించినందునే ఈ ఆర్థిక సంవత్సరంలో ‘రాష్ట్రీయ గోకుల్ మిషన్’కు నిధులను రూ.750 కోట్లకు పెంచినట్లు గోయల్ తెలిపారు. కొత్తగా ‘రాష్ట్రీయ కామధేను ఆయోగ్’ కొత్తగా ‘రాష్ట్రీయ కామధేను ఆయోగ్’ అనే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఆవుల ఉత్పాదకతను పెంచడం, గో వనరుల వృద్ధికి అవసరమైన జన్యుపరమైన ప్రయోగాలను విస్తరించడం వంటి పనులను ఈ వ్యవస్థ పర్యవేక్షిస్తుంది. గో సంరక్షణ కోసం రూపొందించిన సంక్షేమ పథకాలను, చట్టాలను మరింత పటిష్టంగా అమలు చేయించడం కూడా ఈ వ్యవస్థ విధుల్లో భాగమే. మత్స్యకారుల అభివృద్ధిపై ప్రత్యేకంగా కేంద్రీకరించడం కోసం ఫిషరీస్కి ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు గోయల్ వెల్లడించారు. అత్యధికంగా మత్స్య సంపదను ఉత్పత్తి చేసే దేశాలలో రెండో అతి పెద్ద దేశం భారతదేశమేనని, ప్రపంచ ఉత్పత్తిలో భారత్ వాటా 6.3శాతమని మంత్రి వివరించారు. ఇటీవలి సంవత్సరాలలో చేపల ఉత్పత్తిలో సగటున 7శాతం వృద్ధి రేటు కూడా నమోదు చేశామని ఆయన తెలిపారు. 1.45 కోట్ల మందికి ఇది ప్రధాన జీవనాధారంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ఉద్దేశంతో ఉత్పాదక వ్యయం కన్నా కనీసం 50 శాతం ఎక్కువ ఉండేలా కనీస మద్దతు ధరను నిర్ణయిస్తున్నామని గోయల్ వివరించారు. చరిత్రలోనే తొలిసారిగా ఈ ప్రభుత్వం 22 పంటల కనీస మద్దతు ధరలు 50 శాతం పెంచిందని ఆయన తెలిపారు. ఆహార ధాన్యాలు, నూనెగింజలు, చెరకు,పత్తి, ఇతర ఉద్యానవన పంటల ఉత్పత్తి భారీగా జరగడం వల్ల ధరలు పడిపోతున్నాయని,దాంతో సరైన ఆదాయం రాక దేశంలోని అనేక ప్రాంతాల రైతులు పూర్తి నిస్పృహలో ఉన్నారని ఆర్ధికమంత్రి వివరించారు. తెలంగాణ, ఒడిశా పథకాలతో పోల్చలేం రైతులకు నేరుగా నగదు బదిలీ చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పీఎం కిసాన్’ పథకాన్ని వ్యవసాయ రంగ నిపుణులు స్వాగతించారు. అయితే ఈ పథకాన్ని ప్రస్తుతం తెలంగాణలోనూ, ఒడిశాలోనూ కొనసా గుతున్న పథకాలతో పోల్చలేమని వారు వ్యాఖ్యా నించారు. ఆ రాష్ట్రాలలో రైతులకు ఇస్తున్న మొత్తం కన్నా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకం కింద ఇచ్చే మొత్తం చాలా తక్కువని పేర్కొంటున్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న రైతుబంధు పథకం లేదా ఒడిశాలో అమలు చేస్తున్న కాలియా పథకం కన్నా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకం మొత్తం చాలా తక్కువని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ చైర్మన్ ఎంజేఖాన్ వ్యాఖ్యానించారు. పీఎం కిసాన్ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తేనే రైతులకు ఆ ఫలాలు అందుతాయని ఇన్సెక్టిసైడ్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ అగర్వాల్ వ్యాఖ్యానిం చారు. ధరల పతనం, పెరుగుతుండే ఖర్చులు వంటి ఇబ్బందుల నుంచి రైతులను కాపాడడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని పీడబ్లు్యసీ ఇండియాకు చెందిన అజయ్ వ్యాఖ్యానించారు. రైతన్నల కష్టాలు తీరాలంటే వారు ఎదుర్కొన్న సమస్యలన్నిం టినీ కలిపి చూడాల్సిన అవసరం ఉంది. ధరలు, పంట సేకరణ, పంపిణీల్లో సమస్యలకు సమష్టిగానే పరిష్కార మార్గాలు కనుగొనాలి. – ఎంఎస్ స్వామినాథన్, వ్యవసాయ శాస్త్రవేత్త రైతులకు ప్రయోజనం కలిగించే బడ్జెట్: నాబార్డ్ ముంబై: కేంద్ర బడ్జెట్ను జాతీయ వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్) స్వాగతిం చింది. వ్యవసాయ రంగంపై దృష్టి సారించిందని, బడ్జెట్ ప్రతిపాదనలతో చిన్న రైతులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడింది. కొత్త ప్రభుత్వం తన పూర్తి స్థాయి బడ్జెట్ను రైతులకు మార్కెట్ అనుసంధాన వసతులు కల్పించడం, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ, వాటి తయారీపై పెట్టొచ్చని నాబార్డ్ చైర్మన్ హెచ్కె భన్వాలా పీటీఐతో చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో వడ్డీ రాయితీతోపాటు అనేక స్వాగత చర్యలున్నాయని అన్నారు. ప్రాథమిక ఆదాయ మద్దతుతో చిన్న, సన్నకారు రైతులకు లబ్ధి కలుగుతుందని పేర్కొన్నారు. ఫిషరీస్, యానిమల్ హజ్బెండరీ రంగాలకు 5 శాతం వరకు వడ్డీ రాయితీని కల్పించడం వల్ల చేపల పెంపకం, పశువుల పెంపకం, వీటి అనుబంధ రంగాలపై ఆధారపడిన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. రైతులకు ఏడాదికి ఇచ్చే రూ.6,000 నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారని దీంతో విత్తనాలు, ఎరువులు, తదితరాల కొనుగోలుకు వినియోగించవచ్చన్నారు. అన్నదాత కరుణిస్తాడా? ఓట్ల కోసమైతేనేం.. చిన్న రైతుల ఖాతాల్లోకి నాలుగు నెలలకోసారి 2వేల రూపాయలు వచ్చిపడతాయి. అందరి ఆకలీ తీర్చే అన్నదాతకు.. ఇదేమీ కడుపు నింపేసేది కాకపోయినా.. విత్తనాలకోసం వడ్డీ వ్యాపారిని ఆశ్రయించాల్సిన దుస్థితి తప్పుతుంది. ఐదెకరాల లోపు కమతాలున్న 12 కోట్ల మంది రైతులపై నరేంద్ర మోదీ విసిరిన అస్త్రమిది. వీరికి తొలివిడత మొత్తం కూడా ఈ ఏడాది మార్చి 31లోగా.. అంటే ఎన్నికల్లోగానే చేతికందుతుంది. దీంతో పాటు వైపరీత్యాల బారినపడ్డ రైతుల రుణాలకు వడ్డీ రాయితీని కూడా పెంచారు. మోదీ తీసుకున్న ఈ ‘జై కిసాన్’ నినాదం ఏ తీరానికి చేరుస్తుందో! దేశంలో 5 ఎకరాలలోపు భూములున్న రైతులు 12 కోట్ల మంది మార్చి 31లోగా ఇవ్వటానికి కేటాయించింది రూ.20వేల కోట్లు 2019–20 బడ్జెట్లో పూర్తి కేటాయింపులు రూ.75వేల కోట్లు -
దశావతారాలు!
పది లక్ష్యాలతో భారతదేశ దశ దిశలో మార్పు తెస్తామంటూ సార్వత్రిక ఎన్నికలవేళ మోదీ ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్తో జనం ముందుకొచ్చింది. మోదీ ప్రభుత్వం పదిలక్ష్యాలను నిర్దేశించింది. బడ్జెట్ని ప్రవేశ పెడుతూ ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ రాబోయే పది ఏళ్లలో 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థకి తాత్కాలిక బడ్జెట్తో పునాదివేశారు. ఇది తాత్కాలికం కాదని ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పుకిది నాంది అని ప్రకటించారు. పది లక్ష్యాలతో దారిద్య్రం, పోషకాహార లోపం, నిరక్షరాస్యత, అపరిశుభ్రత లాంటి రుగ్మతలను రూపుమాపి సరికొత్త భారతాన్ని నిర్మించడం, ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రగతిపథంలో మున్ముందుకు సాగడమే ఈ ప్రభుత్వ ఉద్దేశమని పీయూష్ గోయల్ తెలిపారు. 1 మౌలిక సదుపాయాల మదుపు ప్రజా జీవనాన్ని మరింత సులభతరం చేసేందుకు ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు రోడ్లు, రైల్వే, సీపోర్టు, విమానాశ్రయాల అభివృద్ధికి బాటలు వేయడం. దీనికోసం అధికంగా నిధులు కేటాయించింది. గ్రామసడక్ యోజనకింద రూ. 19 వేల కోట్లను ఈ బడ్జెట్లో కేటాయించింది. 2 డిజిటల్ ఇండియా సరికొత్త ఆవిష్కరణలతో, నూతన కంపెనీల స్థాపన ద్వారా యువతకు ఉపాధికల్పన. దేశంలో లక్ష గ్రామాలను డిజిటల్ విలేజెస్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికల రూపకల్పన. 3 హరిత భారతం ఇంధన అవసరాలకు విదేశాలపై ఆధారపడకుండా స్వదేశీ ఆవిష్కరణలకు ప్రాధాన్యతనిస్తూ విద్యుత్తో నడిచే వాహనాలపై దృష్టి పెట్టి పర్యావరణానికి మేలు చేయడంతో హరిత భారత నిర్మాణానికి బాటలు వేసుకోవడం. 4 గ్రామీణ భారతానికి దన్ను గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి కార్యక్రమాలకు ప్రాధాన్యతనివ్వడం. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను స్థాపించి గ్రామీణ భారతాన్ని పారిశ్రామికాభివృద్ధి దిశగా పరుగులు పెట్టించడం. 5 నదుల ప్రక్షాళన మానవాళికి ప్రధానాధారమైన జలవనరులను కాపాడుకోవడానికీ, భారత ప్రజలందరికీ పరిశుభ్రమైన, రక్షిత మంచినీటిని అందుబాటులోకి తేవడానికి నదులను ప్రక్షాళన చేయడం. 6 సముద్రాలను జయిద్దాం రాబోయే పదేళ్లలో సముద్రతీర ప్రాంతాలను అభివృద్ధి పరచడం. సముద్ర ఆధారిత ప్రాజెక్టుల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవడం. ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరుచుకోవడం. 7 అంతరిక్షంలోకి దూసుకెళ్లడం అంతరిక్ష రంగానికి అత్య«ధిక ప్రాధాన్యతినివ్వడం. అందులో భాగంగానే బడ్జెట్ కేటాయింపుల్లో ఈ రంగానికి భారీగా నిధుల కేటాయింపు. 2020 కల్లా భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడం. 8 పౌష్టికాహారం వ్యవసాయరంగానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వడం ద్వారా ఆహారభద్రత అనే దీర్ఘకాలిక లక్ష్యానికి మార్గనిర్దేశనం చేయడం. ఆరోగ్యకరమైన ఆర్గానిక్ ఆహారాన్ని పండించుకోవడం ద్వారా స్వయం సమృద్ధిని సాధించడం. 9 ఆరోగ్యానికి అందలం ప్రజల ఆరోగ్యానికి అత్యున్నత స్థానాన్ని కల్పించడం. అందరికీ ఆరోగ్యం అనే నినాదంతో మారుమూల గ్రామ ప్రజలతో సహా సర్వజనానికీ వైద్యాన్ని అందుబాటులోకి తేవడం. 10 సుపరిపాలన ప్రజాజీవితంలో ప్రభుత్వ యంత్రాంగం జోక్యం సాధ్యమైనంత వరకూ తగ్గించి, ప్రజలందరికీ సుపరిపాలనా ప్రయోజనాలందించడం, సత్వర స్పందన, బాధ్యతాయుత, స్నేహపూరిత అధికార యంత్రాంగం, ఇ–గవర్నెన్స్కు సోపానం వేయడం. -
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
పార్లమెంటులో కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన పీయూష్ గోయల్ (54) మోదీ ప్రభుత్వం అమలు పరిచిన ఆర్థిక సంస్కరణలన్నింటికీ సూత్రధారి. ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ అనారోగ్య కారణంగా తాత్కాలిక ఆర్థిక మంత్రి బాధ్యతలు చేపట్టిన గోయల్ ఆ హోదాలోనే ‘మధ్యంతర’బడ్జెట్ ప్రవేశపెట్టారు. చార్టెర్డ్ అకౌంటెంట్గా, న్యాయ విద్యార్థిగా అత్యున్నత ప్రతిభా పాటవాలు చూపిన గోయల్ 2014 ఎన్నికల్లో సామాజిక మాధ్యమాల ప్రచారం ద్వారా ఎన్డీఏ విజయానికి దారులు వేశారు. విపత్కర సమయాల్లో నేనున్నానంటూ ముందుకొచ్చి పార్టీని, ప్రభుత్వాన్ని ఆదుకున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు పని చేస్తూ ‘పని రాక్షసుడి’గా పేరుపడ్డారు. రైల్వే మంత్రిగా బులెట్ రైళ్లు, స్పీడ్ రైళ్లతో భారతీయ రైల్వేను పరుగులు పెట్టిస్తున్నారు. రైల్వేల ఆధునీకరణ, ప్రయాణికుల సౌకర్యాలకు పెద్దపీట వేశారు. మోదీ ప్రభుత్వం అమలు చేసిన నిరంతర విద్యుత్, స్వచ్ఛ ఇంధనం, ఉదయ్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన వంటి పథకాల రూపకర్త గోయలే. దేశంలోని 5,97,464 గ్రామాలను పూర్తిగా విద్యుదీకరించినందుకుగాను గోయల్కు రెండు రోజుల క్రితమే పెన్సిల్వేనియా వర్సిటీ కర్నాట్ బహుమతిని ప్రదానం చేసింది. అంచెలంచెలుగా.. స్వతంత్ర ప్రతిపత్తి గల సహాయ మంత్రిగా మోదీ మంత్రివర్గంలో చేరిన గోయల్ తన శక్తిసామర్థ్యాలను నిరూపించుకుని అనతికాలంలోనే కేబినెట్ స్థాయికి ఎదిగారు. బొగ్గు, విద్యుత్ శాఖ మంత్రిగా బొగ్గు గనుల వేలాన్ని పారదర్శకంగా, విజయవంతంగా నిర్వహించారు. ఉజ్వల పథకం కింద దేశంలో ఎల్ఈడీ బల్బుల వినియోగాన్ని పెంచి కరెంటు ఖర్చు తగ్గించారు. త్వరగా, వినూత్నంగా నిర్ణయాలు తీసుకుంటారని పేరున్న గోయల్కు జ్ఞాపకశక్తి అపారం. సీఏలో ఆలిండియా రెండో ర్యాంకు సాధించారు. న్యాయవిద్యలో ముంబై యూనివర్సిటీలోనే సెకండ్ ర్యాంకు సంపాదించారు. స్టేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా డైరెక్టర్ల బోర్డుల్లో పని చేశారు. కేంద్ర మంత్రి వర్గంలో చేరే నాటికి గోయల్ బీజేపీ కోశాధికారిగా ఉన్నారు. ఆయన తర్వాత పార్టీ మరెవరినీ కోశాధికారిగా నియమించకపోవడం గమనార్హం. కార్పొరేట్ వర్గాలతో సన్నిహిత సంబంధాలున్న పీయూష్ గోయల్ తన 34 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రభుత్వానికి ఎన్నో విజయాలు సాధించి పెట్టారు. గోయల్ తండ్రి వేద్ ప్రకాశ్ గోయల్ బీజేపీ జాతీయ కోశాధికారిగా, కేంద్రంలో మంత్రిగా పని చేశారు. తల్లి చంద్రకాంత గోయల్ మహారాష్ట్ర శాసనసభకు మూడుసార్లు ఎన్నికయ్యారు. నాలుగు నెలలకు రూ.34.17 లక్షల కోట్లు న్యూఢిల్లీ: వచ్చే ఏప్రిల్ నుంచి నూతన ఆర్థిక సంవత్సరం (2019–20)లో మొదటి నాలుగు నెలల కాలానికి గాను (ఏప్రిల్ నుంచి జూలై వరకు) రూ.34.17 లక్షల కోట్ల వ్యయాల కోసం కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ ద్వారా పార్లమెంట్ అనుమతి కోరింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి స్థూల వ్యయాలు రూ.97.43 లక్షల కోట్లుగా మధ్యంతర బడ్జెట్లో ఆర్థిక మంత్రి అంచనాలను పేర్కొన్నారు. మొదటి నాలుగు నెలల కాలానికి అయ్యే వ్యయాలకు గాను పార్లమెంటు ఆమోదం కోరారు. లోక్సభ ఎన్నికలు ఏప్రిల్–మే నెలల్లో పూర్తవుతాయి. తదుపరి ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ను వచ్చే జూలైలో కొత్త ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించనుంది. -
చదివింపులు 10%
న్యూఢిల్లీ: విద్యారంగానికి 2019–20 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం రూ.93,847.64 కోట్లు కేటాయించింది. ఇది గత బడ్జెట్ కంటే 10 శాతం అధికం. ఈ బడ్జెట్లో ఉన్నత విద్యకు రూ.37,461.01 కోట్లు, పాఠశాల విద్యకు రూ. 56,386.63 కోట్లు కేటాయించింది. గత ఏడాది రూ.85,010 కోట్లు విద్యారంగానికి కేటాయించారు. వైద్య సంస్థలతోపాటు ప్రధాన విద్యాసంస్థల్లో పరిశోధనల రంగంలో పెట్టుబడులు, సంబంధిత మౌలిక వసతుల కోసం ‘రివైటలైజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సిస్టమ్స్ ఇన్ ఎడ్యుకేషన్ (రైజ్)’అనే కొత్త పథకాన్ని తాజా బడ్జెట్లో ప్రతిపాదించారు. ఇందులో 2022నాటికల్లా రూ. లక్ష కోట్లు పెట్టుబడిగా పెడతారు. కొత్తగా ఎస్పీఏలు.. ►‘స్కూల్స్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (ఎస్పీఏ)’పేరుతో రెండు పూర్తిస్థాయి సంస్థలను ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. దీనికి అదనంగా ఐఐటీ, ఎన్ఐటీల్లో 18 ఎస్పీఏలను స్వయంప్రతిపత్తి గల సంస్థలుగా ఏర్పాటుచేస్తారు. దీనికోసం ఐఐటీ/ఎన్ఐటీల డైరెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు ప్రతిపాదనలను సమర్పించాలని గోయల్ కోరారు. ►ఈసారి ప్రభుత్వం పరిశోధనలు, ఆవిష్కరణల కోసం రూ.608.87 కోట్లు కేటాయించింది. ఇది గత బడ్జెట్లో రూ.350.23 కోట్లుగా ఉంది. ►విద్యలో నాణ్యత పెరగాలంటే సాంకేతికతను వినియోగించుకుంటూ ముందుకెళ్లాలని, ‘బ్లాక్బోర్డు’నుంచి ‘డిజిటల్ బోర్డుకు’మారాలని చెప్పారు. టీచర్లు అధునాతన సాంకేతికత ఆధారంగా పరిష్కారాలు సాధించేందుకు, వారికి డిజిటల్ సౌకర్యాలు కల్పించేందుకు ‘దిక్షా’ను అభివృద్ధి చేశామన్నారు. -
చరిత్రలోని ఐదు ముఖ్యమైన బడ్జెట్లు
దేశ ఆర్థిక స్థితిని బడ్జెట్ ప్రతిబింబిస్తుంది. ఈ బడ్జెట్లో కేటాయింపుల ఆధారంగానే దేశ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సంక్షేమపథకాలకు కేటాయింపులు, కీలక నిర్ణయాలుండే ఈ బడ్జెట్పై సామాన్యుడి దగ్గర్నుంచి.. కార్పొరేట్ దిగ్గజాల వరకు అందరికీ ఆసక్తి ఉంటుంది. ఏడాదికోసారి ఆర్థిక శాఖ మంత్రి.. తమ ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికలను బడ్జెట్ ద్వారా దేశ ప్రజలకు, ప్రపంచానికి వెల్లడిస్తారు. కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో.. చరిత్రలోని ఐదు ముఖ్యమైన బడ్జెట్ల గురించి తెలుసుకుందాం. బ్లాక్ బడ్జెట్ 1973 1973లో ప్రవేశపెట్టిన బడ్జెట్ను దేశ చరిత్రలో బ్లాక్ బడ్జెట్గా పిలుస్తారు. రహస్య లేదా పేర్కొనలేని ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు జరిగినందునే ఈ బడ్జెట్ను బ్లాక్ బడ్జెట్ అంటారు. 1973–74లో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్రావ్ చవాన్ భారీ ద్రవ్యలోటుతో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ రూ.550 కోట్లు. ఇందులో రూ.56 కోట్లను బొగ్గుగనులు, సాధారణ బీమా కంపెనీలు, ఇండియన్ కాపర్ కార్పొరేషన్ల జాతీయీకరణకు కేటాయించారు. ఈ బడ్జెట్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. నవశకానికి నాంది 1991 భారత ఆర్థిక వ్యవస్థలో కొత్త శకానికి నాంది పలికినట్లుగా పేర్కొన్న బడ్జెట్ను 1991లో నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టారు. దేశం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఆర్థిక సరళీకరణకు బీజం వేసినందునే.. దీన్ని దేశ ఆర్థిక వ్యవస్థలో నవశకానికి నాందిపలికిన బడ్జెట్ అని అంటారు. పీవీ నరసింహారావు నేతృత్వంలోని ప్రభుత్వం ఎగుమతి, దిగుమతి విధానంలో మార్పులు తెచ్చింది. తద్వారా దేశ ఆర్థిక విధా నాలను ప్రపంచ వాణి జ్యానికి అనుగుణంగా.. సరళీకృతం చేశారు. 220%గా ఉన్న కస్టమ్స్ డ్యూటీని 150%కి తగ్గించారు. ఈ బడ్జెట్ విధానాల కారణంగానే.. రెండు దశాబ్దాల్లో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన నిలిచింది. డ్రీమ్ బడ్జెట్ 1997 భారత చరిత్రలో 1997లో నాటి యునైటెడ్ ప్రభుత్వ ఆర్థిక మంత్రి పి. చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ ‘డ్రీమ్ బడ్జెట్’గా నిలిచిపోయింది. వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్నుల్లో మార్పులు తీసుకొచ్చిన బడ్జెట్ ఇది. అప్పుడు 40%గా ఉన్న ఆదాయపన్ను రేటును 30%కు తీసుకొచ్చింది ఈ బడ్జెట్లోనే. చాలా చోట్ల సర్చార్జీలను, రాయల్టీ రేట్లను తగ్గించారు. పన్నుల భారం తగ్గడంతో దీన్ని ప్రజలు స్వాగతించారు. మిలీనియం బడ్జెట్ 2000 కొత్త శతాబ్దంలో (2000) యశ్వంత్ సిన్హా ప్రవేశపెట్టిన బడ్జెట్ను మిలీనియం బడ్జెట్ అంటారు. భారత సమాచార రంగంలో విప్లవాత్మక మార్పులకు ఈ బడ్జెట్ బాటలు వేసింది. ఇందులో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా సాఫ్ట్వేర్ ఎగుమతిదారులకు ఇచ్చిన ప్రోత్సాహకాలను విడతలవారిగా తగ్గించారు. కంప్యూటర్లు, సీడీలు మొదలైన 21 వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించారు. తద్వారా ఐటీ రంగం జోరు పెరిగేందుకు కారణమైంది. ఇది కేంద్రం తీసుకున్న సాహసోపేత నిర్ణయమని ఆర్థిక నిపుణులు కూడా ప్రశంసించారు. రోల్బ్యాక్ బడ్జెట్ 2002 బడ్జెట్ అంటే ప్రతిసారీ కొత్త ప్రణాళికలు, వాటి అంచనాలను ప్రకటించమేనని తెలుసు. కానీ 2002–03కోసం యశ్వంత్ సిన్హా ప్రవేశపెట్టిన బడ్జెట్లో పథకాలు ప్రతిపాదించారు. ఇందులో ఎల్పీజీ సిలిం డర్ల ధరలు పెంచడం, సర్వీస్ టాక్స్ పెంపు వంటి నిర్ణయాలు ప్రకటించారు. అయితే విపక్షాలనుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో.. ఈ నిర్ణయాలను వెనక్కు తీసుకున్నారు. అందుకే ఇది దేశ చరిత్రలో రోల్బ్యాక్ బడ్జెట్గా నిలిచిపోయింది. -
హౌ ఈజ్ ద జోష్..?
న్యూఢిల్లీ: బడ్జెట్ సందర్భంగా సభలో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రసంగం దాదాపు ఉత్సాహంగా సాగింది. ఇటీవల సూపర్ హిట్ అయిన బాలీవుడ్ సినిమా ‘ఉడీ.. ది సర్జికల్ స్ట్రైక్స్’ను ప్రస్తావిస్తూ.. ‘హౌ ఈజ్ ద జోష్?’అంటూ విపక్ష సభ్యుల్ని బీజేపీ నేతలు ప్రశ్నించారు. పీయూష్ గోయల్ రైతులకు నగదు బదిలీ పథకం, ఆదాయ పన్ను మినహాయింపులు వంటి పలు కీలక ప్రకటనలు చేస్తున్నప్పుడు బీజేపీ సభ్యులు మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేస్తూ, బల్లలు చరుస్తూ స్వాగతించారు. సాధారణంగా ఆర్థిక మంత్రులు బడ్జెట్ ప్రసంగాన్ని చదవడానికే పరిమితమవుతుంటారు. అయితే ఇందుకు భిన్నంగా పీయుష్ గోయల్ కీలక ప్రకటనలు చేస్తున్నప్పుడు విపక్ష సభ్యుల్ని ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ అజెండా గురించి పీయూష్ ప్రస్తావిస్తూ ‘నేను ఉడీ సినిమా చూశాను. అందులో మంచి జోష్ ఉంది..’అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యా నించారు. మరోవైపు న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్తో పాటు మరికొందరు బీజేపీ సభ్యులు సైతం ‘హౌ ఈజ్ ద జోష్?..’అంటూ కాంగ్రెస్ నేతలను వ్యంగ్యంగా ప్రశ్నించారు. పీయూష్ రూ.5 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ప్రకటన చేయగానే బీజేపీ సభ్యులు బల్లల చరుస్తూ.. మోదీ, మోదీ అంటూ నినాదించారు. దీంతో నిమిషం పాటు గోయల్ తన ప్రసంగాన్ని ఆపారు. ప్రధాని కూడా పలు ప్రకటనలప్పుడు బల్లను కొడుతూ సంతోషం వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తయిన తర్వాత గోయల్ మోదీ వైపు తిరిగి నవ్వుతూ నమస్కారం చేశారు. అనంతరం మోదీ చిరునవ్వుతో గోయల్ వద్దకు వెళ్లి వెన్నుతట్టి అభినందించారు. కాగా, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు బిగ్గరగా నవ్వుతూ పీయూష్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సభ ప్రారంభమవ్వడానికి ఐదు, ఏడు నిమిషాల ముందు లోపలికి వచ్చిన గోయల్ కేంద్ర మంత్రు లు నితిన్ గడ్కరీ, ఉమా భారతి, బీజేపీ సీనియర్ నేత శాంత కుమార్ల పాదాలకు నమస్కారం చేసి.. ఆశీర్వాదం తీసుకున్నారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత చాలా మంది ఎంపీలు గోయల్ వద్దకు వెళ్లి అభినందించారు. అదే సమయంలో విజిటర్స్ గ్యాలరీలో నిల్చొని ఉన్న తన కుటుంబసభ్యుల్ని చేయి ఊపుతూ పలకరించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొద్దిసేపు సభ నుంచి బయటకు వెళ్లారు. దీంతో పలువురు బీజేపీ నేతలు ‘రాహుల్ పారిపోయాడు’అంటూ ఎగతాళి చేశారు. యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ విప్ జ్యోతిరాదిత్య సింథియా, డిప్యూటీ స్పీకర్ ఎం.తుంబిదురై సభకు గైర్హాజరయ్యారు. -
‘శ్రమ’కు ప్రతిఫలం
న్యూఢిల్లీ: దేశంలోని కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. నెలకు రూ.15,000 దాకా వేతనం పొందుతున్న వారికి ప్రత్యేక పింఛన్ పథకాన్ని శుక్రవారం బడ్జెట్లో ప్రకటించింది. ప్రధానమంత్రి శ్రమ–యోగి మాన్ధన్(పీఎంఎస్వైఎం) పేరిట అమలు చేసే ఈ పథకంలో కార్మికులకు 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు రూ.3,000 చొప్పున పింఛన్ అందజేస్తారు. ఇందుకోసం కార్మికులు, ప్రభుత్వం తమ వంతు వాటాగా నెలకు రూ.100 చొప్పున పింఛన్ ఖాతాలో జమ చేయాల్సి ఉం టుంది. ‘‘భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 50 శాతం అసంఘటిత రంగంలోని కార్మికుల శ్రమ నుంచే వస్తోంది. రిక్షా తొక్కేవారికి, పూట గడవడానికి ఇళ్లలో సేవకులుగా పనిచేస్తున్న వారికి, చిన్నాచితకా కంపెనీల్లో ఉపాధి పొందుతున్న వారికి వృద్ధాప్యంలో సమగ్ర సామాజిక భద్రత కల్పించడం తప్పనిసరి’’అని కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ లోక్సభలో బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. అసంఘటిత రంగ కార్మికులు 29 ఏళ్ల వయసులో పీఎంఎస్వైఎం పథకంలో చేరొచ్చు. నెలకు కేవలం రూ.100 చొప్పున చెల్లిస్తే 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతినెలా రూ.3,000 చొప్పున పింఛన్ అందుకోవచ్చు. 18 ఏళ్ల వయసులోనే చేరితే నెలకు రూ.55 చొప్పున చెల్లిస్తే సరిపోతుంది. ప్రభుత్వం అంతేమొత్తాన్ని తన వాటాగా ప్రతినెలా కార్మికుల పింఛన్ ఖాతాలో జమ చేస్తుంది. పీఎంఎస్వైఎం పథకం ద్వారా వచ్చే ఐదేళ్లలో 10 కోట్ల మంది కార్మికులు ప్రయోజనం పొందుతారని అంచనా వేస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు. ప్రపంచంలోని అతిపెద్ద పెన్షన్ పథకాల్లో ఇది కూడా ఒకటి అవుతుందని అన్నారు. పీఎంఎస్వైఎం పథకానికి తాజా బడ్జెట్లో కేంద్రం రూ.500 కోట్లు కేటాయించింది. అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు కేటాయిస్తామని పేర్కొంది. ఈ ఏడాది నుంచే ఈ పథకం అమల్లోకి రానుంది. దేశవ్యాప్తంగా కార్మికులకు కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్లో పలు వరాలు ప్రకటించింది. ప్రతి కార్మికుడికి కనిష్ట పెన్షన్ను రూ.1,000 నిర్దేశించింది. అలాగే కార్మికుడు సర్వీసులో ఉండగా మరణిస్తే ఈపీఎఫ్వో ప్రస్తుతం రూ.2.5 లక్షలు చెల్లిస్తోంది. కేంద్రం దీన్ని ప్రస్తుతం రూ.6 లక్షలకు పెంచింది. అన్ని కేటగిరీల అంగన్వాడీలు, ఆశా యోజన కార్మికుల గౌరవ వేతనాలను 50 శాతం పెంచేసింది. ఉద్యోగాల సృష్టిలో గొప్ప ప్రగతి సాధించామని పీయూష్ గోయల్ వెల్లడించారు. గత రెండేళ్లలో ఈపీఎఫ్వో సభ్యత్వాలు 2 కోట్లు పెరగడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం రూ.10 లక్షల గ్రాట్యుటీపై పన్ను విధిస్తుండగా, దీన్ని రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. అంటే రూ.20 లక్షల గ్రాట్యుటీపై ఎలాంటి పన్ను ఉండదు. ఒక సంస్థలో ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం పనిచేసిన ఉద్యోగులు పదవీ విరమణ పొందినప్పుడు లేదా ఉద్యోగం మానేసినప్పుడు గ్రాట్యుటీ తీసుకోవడానికి అర్హులని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో అన్ని వర్గాల కార్మికుల కనీస ఆదాయం 42 శాతం పెరిగిందని అన్నారు. విధివిధానాలేవీ? అసంఘటిత రంగ కార్మికులకు 60 ఏళ్లు దాటాక నెలకు రూ.3,000 చొప్పున పెన్షన్ ఇస్తామని కేంద్రం ప్రకటించినప్పటికీ.. ఈ పథకం విధివిధానాలను మాత్రం వెల్లడించలేదు. ఏయే రంగాల్లో, ఎలాంటి పనులు చేసుకునే వారికి ఇస్తారో స్పష్టం చేయలేదు. ఉదాహరణకు 59 ఏళ్ల కార్మికుడు ఒక సంవత్సరంపాటు నెలకు రూ.100 చొప్పున చెల్లిస్తే.. 60 ఏళ్ల వయసు దాటగానే అతడికి పెన్షన్ అందజేస్తారా? అనే దానిపై అనుమానాలున్నాయి. దేశంలో దాదాపు 42 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. వీరిలో ఎంతమందికి ప్రయోజనం దక్కుతుందో తెలియదు. పీఎంఎస్వైఎం పథకంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. పింఛన్తో పాటు.. గౌరవం! చిన్నచిన్న దుకాణాల్లో, ఇళ్లలో పనిచేస్తూ మనచుట్టూ ఎంతోమంది కనిపిస్తారు. పనిచేసినంతకాలమే వారికి గౌరవమైనా.. ఆదాయమైనా! వయసు మళ్లితే జీవితమే కష్టం. అలాంటి వారికి నెలకు రూ.3వేల చొప్పున పెన్షన్ ఇచ్చే పథకానికి శ్రీకారం చుట్టింది కేంద్రం. ఈ పింఛన్ల కోసం రాజకీయ నాయకుల దగ్గర లైన్లలో నిల్చుని పేర్లు రాయించుకోనక్కర్లేదు. ఎందుకంటే ఇది గౌరవంగా పొందే పింఛను. పని చేసినన్నాళ్లూ వారు నెలకు రూ.55 నుంచి 100 వరకూ నామమాత్రపు మొత్తం చెల్లింస్తే చాలు. అంతేమొత్తాన్ని ప్రభుత్వమూ చెల్లిస్తుంది. విద్యారంగం దేశంలో అసంఘటిత రంగంలో పనివారు 42 కోట్లు తాజా పథకంతో లబ్ధి పొందేవారు 10 కోట్లు -
మోదీ సర్కార్ ఎలక్షన్ సినిమా.. నమో ఓటర్
ఇదో విచిత్రమైన కొత్త సంప్రదాయం. బడ్జెట్ తేదీలనే కాదు.. తీరునూ మార్చేసింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. నాలుగున్నరేళ్లుగా ప్రవేశపెట్టడానికి ఇష్టపడని డ్రీమ్ బడ్జెట్ను.. మరో 3 నెలల్లో పదవీకాలం ముగుస్తుందనగా ముందుకు తెచ్చింది. ఎన్నికలే లక్ష్యంగా.. 25 కోట్ల మంది ఓటర్లే లక్ష్యంగా సమ్మోహనాస్త్రాలు సంధించింది. 12 కోట్ల మంది రైతులకు నేరుగా ఖాతాల్లో డబ్బులు వెయ్యటమే కాదు.. 3 కోట్ల మంది మధ్య తరగతి ఉద్యోగుల జేబులనూ నింపుతోంది. మరో 10 కోట్ల మంది అసంఘటిత కార్మికులపై పింఛన్ వల విసిరింది. నిజం చెప్పాలంటే... తీవ్రమైన నిరాశా నిస్పృహల్లో ఉన్న రైతాంగానికి ఎంత చేసినా తక్కువే. కాకుంటే ఎన్నికలు ఏప్రిల్లో ఉండగా... మార్చిలో ఖాతాల్లోకి డబ్బులు వేస్తామనటమే హర్షించడానికి మనస్కరించని విషయం. మూడు నెలల ఓటాన్ అకౌంట్ను ప్రవేశపెట్టే సంప్రదాయానికి గండికొట్టేసి... పూర్తి సంవత్సరానికి బడ్జెట్ పెట్టడమనేది ప్రజాస్వామ్యబద్ధమని మాత్రం చెప్పలేం. కార్మికుల పింఛను.. పన్ను రాయితీలు అన్నీ హర్షించదగ్గవే. కాకుంటే వీటిని గడిచిన ఐదు బడ్జెట్లలో ఎప్పుడు తెచ్చినా మరింత హర్షం వ్యక్తమయ్యేదేమో! 2019 సార్వత్రిక ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఓటర్లను ఆకట్టుకునేలా బడ్జెట్లో జిమ్మిక్కులు చేసింది. ఇటీవల మూడురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో ఆత్మరక్షణలో పడిన బీజేపీ.. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దేశ జనాభాలో ఎక్కువగా ఉన్న మధ్యతరగతి, రైతులు, అసంఘటిత రంగంలోని కార్మికులను లక్ష్యంగా చేసుకునే వ్యూహాత్మకంగా బడ్జెట్ను రూపొందించింది. మూడు నెలల్లో ప్రభుత్వం గడువు ముగుస్తున్నందున.. ఈ కాలపరిమితికే బడ్జెట్ ప్రవేశపెట్టాలి. కానీ, దుస్సంప్రదాయానికి తెరదీస్తూ.. ఆర్థిక మంత్రి పీయుష్ గోయల్ పూర్తిస్థాయి బడ్జెట్ను శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. ఐదు లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న వారికి పూర్తిగా పన్ను రిబేట్ ఇవ్వాలని బడ్జెట్లో నిర్ణయించారు. దీంతోపాటు చిన్న, సన్నకారు రైతులను ఆకట్టుకునేలా.. ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఏటా రూ.6వేలు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. అసంఘటిత రంగంలోని కార్మికులకు పదవీ విరమణ తర్వాత ఏటా రూ.3వేల పింఛను ఇచ్చే ప్రతిపాదనలను కూడా బడ్జెట్లో పేర్కొన్నారు. బడ్జెట్ మొత్తం- రూ.27,84,200 కోట్లు రెవెన్యూ వసూళ్లు- రూ.19,77,693 కోట్లు మూలధన వసూళ్లు- రూ.8,06,507 కోట్లు మొత్తం వసూళ్లు- రూ.27,84,200 కోట్లు 5 ఎకరాల్లోపు ఉన్న రైతులకు ఏటా ఇచ్చే ఆర్థిక సాయం- రూ.6,000 రూ. 5,00,000 ఆదాయం వరకు పన్ను లేదు, శ్లాబులు మార్చకుండా రిబేటు రూపంలో మినహాయింపు 60ఏళ్లు దాటిన అసంఘటిత రంగ కార్మికులకు ప్రతి నెలా రూ. 3,000 పింఛన్ సెక్షన్ 87 రిబేటు రూ.2,500 నుంచి రూ.12,500కు పెంపు రూ.40,000 నుంచి రూ.50,000కు పెరిగిన స్టాండర్డ్ డిడక్షన్ ఇకపై నెలకు రూ.40 వేలు వడ్డీ వచ్చినా టీడీఎస్ మినహాయించరు ఇంటద్దెపై టీడీఎస్ పరిమితి రూ.1.8 లక్షల నుంచి రూ.2.40 లక్షలకు పెంపు ఉద్యోగులకు రెండో ఇంటిపై అద్దె వస్తే దానికి పన్ను మినహాయింపు రెండో ఇంటికీ వర్తించనున్న దీర్ఘకాలిక మూలధన పన్ను లాభాలు బ్రహ్మాస్త్రంగా ఆదాయపు పన్ను! ఏటా ఐదులక్షల్లోపు ఆదాయం ఉన్న మూడుకోట్ల మంది వేతనజీవులు, పింఛనర్లు, స్వయం ఉపాధి పొందుతున్నవారు, చిరు వ్యాపారులను టాక్స్ చెల్లించే అవసరం లేకుండా ఆదాయపన్ను పరిమితిని పెంచారు. దీని ద్వారా ప్రతి ఒక్కరికీ రూ.13వేల వరకు లబ్ధిచేకూరనుంది. ఈ నిర్ణయం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ.18,500 కోట్ల ఆదాయం తగ్గుతుంది. స్టాండర్డ్ డిడక్షన్ను కూడా రూ.40 వేల నుంచి రూ.50వేలకు పెంచడం ద్వారా రూ.2,080 నుంచి రూ.3,588 వరకు మేలు (ఆదాయ స్థాయిల ఆధారంగా) జరగనుంది. బ్యాంకు వడ్డీలపై టీడీఎస్ మినహాయింపును రూ.10వేల నుంచి రూ.40వేలకు పెంచడం, గృహ ఆదాయ మినహాయింపును ఒక ఇంటి నుంచి రెండో ఇంటికి కూడా వర్తింపజేయడం, ఇంటి అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని రెండు వేర్వేరు ఆస్తులపై పెట్టుబడి పెట్టడం వంటివి బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయం విషయంలో కీలకంగా చెప్పుకోవాల్సిన అంశాలు. సన్నకారు రైతులపై దృష్టి దేశవ్యాప్తంగా 5 ఎకరాలకంటే తక్కువ భూములున్న 12కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చే ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఈ రైతుల బ్యాంకు అకౌంట్లలోకి నేరుగా ఏటా రూ.6వేలను (నాలుగు నెలలకోసారి 3 దఫాలుగా రూ.2వేల చొప్పున) జమచేయనున్నట్లు బడ్జెట్లో పేర్కొంది. ఇందుకోసం ప్రభుత్వంపై ఏటా రూ.75వేల కోట్ల భారం పడనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే ఈ పథకం అమల్లోకి వస్తుందని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఈ ఏడాది కోసం రూ.20వేల కోట్లను విడుదల చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వ్యవసాయాదాయ మద్దతు పథకం ద్వారా నిర్దేశిత 3.3% ద్రవ్యవలోటును చేరుకోవడంలో ప్రభుత్వం వెనకబడింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో టార్గెట్గా పెట్టుకున్న 3.1% ద్రవ్యలోటును చేరుకోవడం కూడా కష్టంగానే మారనుంది. ప్రకృతి విపత్తుల ద్వారా నష్టపోయే రైతులకు 2% వడ్డీ ప్రభుత్వ సాయంగా అందిచేందుకు కూడా కేంద్రం ముందుకొచ్చింది. రూ.3వేల పింఛన్తో.. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులపై వరాల జల్లు కురిపించింది. ప్రస్తుతం నెలకు రూ.100 కనీస చెల్లింపు ద్వారా 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3వేల పింఛను ఇవ్వాలని నిర్ణయించింది. ఈ తాత్కాలిక బడ్జెట్ కేవలం ట్రయలర్ మాత్రమేనని.. లోక్సభ ఎన్నికల తర్వాత దేశాన్ని సంక్షేమంగా మార్చేందుకు మరిన్ని పథకాలు తమ వద్ద ఉన్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అయితే రోజుకు 17 రూపాయలు ఇవ్వడం ద్వారా రైతులను అవమానించేలా ప్రభుత్వం వ్యవహరించిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఓట్ల కోసమే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్లుందని మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం విమర్శించారు. 7% పెరిగిన రక్షణ బడ్జెట్ రక్షణరంగ బడ్జెట్ను రూ.3లక్షల కోట్లకు (గతేడాదితో పోలిస్తే 7% పెంపు) పెంచడం, ఎల్పీజీ సబ్సిడీ రూ.2.66 లక్షల కోట్ల నుంచి రూ.2.97 లక్షల కోట్లకు పెంచడం వంటివి కూడా బడ్జెట్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.90వేల కోట్ల సేకరణ, ఆర్బీఐతోపాటు వివిధ బ్యాంకుల డివిడెండ్ల ద్వారా రూ.82,900కోట్ల ఆదాయం సమకూరిందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఆదాయపన్ను పరిమితి రూ.5లక్షలకు పెంచడమే ఈ బడ్జెట్ మొత్తానికి హైలైట్ అని పేర్కొన్నారు. ‘సంప్రదాయం ప్రకారం పూర్తిస్థాయి బడ్జెట్లో పన్నుల మినహాయింపుల గురించి ప్రస్తావించాలి. కానీ మధ్యతరగతి, వేతనజీవులు, పింఛనర్లు, సీనియర్ సిటిజన్లలో ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఆశలు, ఆకాంక్షలతో ఎదురుచూస్తున్న వారిని.. పూర్తిస్థాయి బడ్జెట్ వరకు వేచి ఉంచకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం’అని గోయల్ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో దేశాభివృద్ధికి ఇప్పటికే ఎన్డీయే ప్రభుత్వం పునాదులు వేసిందని.. దేశ ఆర్థిక వ్యవస్థను వచ్చే ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లే లక్ష్యంతో దూసుకెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇది ట్రైలర్ మాత్రమే... మధ్యంతర బడ్జెట్ అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చేలా ఉంది. లోక్సభ ఎన్నికల తర్వాత భారత్ పురోభివృద్ధికి ఏయే అంశాలు దోహదం చేస్తాయన్నదానికి ఈ బడ్జెట్ ట్రైలర్ మాత్రమే. ఈ బడ్జెట్తో 12 కోట్లకుపైగా రైతు కుటుంబాలు, అసంఘటిత రంగంలో ఉన్న 30–40 కోట్ల మంది కార్మికులు లబ్ధి పొందుతారు. – ప్రధాని నరేంద్ర మోదీ రోజుకు 17 రూపాయలా.. రైతులకు ఏటా రూ.6,000 ఇస్తామని గోయల్ ప్రకటించారు. గత ఐదేళ్లలో మీ చేతకానితనంతో రైతుల జీవితాలు నాశనమైపోయాయి. రైతులకు ఏటా రూ.6 వేలు అంటే రోజుకు రూ.16.44 ఇస్తామని చెప్పడం అవమానించడమే. 2 నెలల్లో రఫేల్ ఒప్పందం, ఉద్యోగాలు, నోట్ల రద్దులో మోదీపై సర్జికల్ స్ట్రైక్ జరుగుతుంది. – రాహుల్ గాంధీ పార్లమెంటు ప్రాంగణంలో బడ్జెట్ ప్రతులను తనిఖీ చేస్తున్న భద్రతా సిబ్బంది -
పల్లె.. డిజిటల్!
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ భారతాన్ని డిజిటల్ పుంతలు తొక్కించేందుకు ఎన్డీయే సర్కారు తన తుదిబడ్జెట్లో గట్టి ప్రయత్నమే మొదలు పెట్టింది. భారత్ నెట్ పథకం కింద అనుసంధా నించే 2.5లక్షల గ్రామ పంచాయతీల్లో కనీసం లక్ష గ్రామాలను డిజిటల్ గ్రామాలుగా తీర్చిదిద్దుతామని ఆర్థికశాఖ తాత్కాలిక మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం నాటి బడ్జెట్ ప్రసంగంలో తెలపడమే ఇందుకు తార్కాణం. అంతేకాదు..వేర్వేరు ప్రభుత్వ శాఖల్లోని సమాచారాన్ని విశ్లేషించి వనరులను మరింత సమర్థంగా వినియోగించు కునే లక్ష్యంతో ప్రభుత్వ శాఖల్లోనూ కృత్రిమ మేథను వాడేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. కృత్రిమ మేథ టెక్నాలజీలు మరింత కచ్చితంగా వాతావరణ అంచనాలు కట్టేందుకు మాత్రమే కాకుండా.. అనేక ఇతర రంగాల్లోనూ ఉపయోగపడతాయని వాహనాల్లో విద్యుత్ వ్యవస్థల సమర్థ నిర్వహణ, ఫొటోలు, వీడియోల విశ్లేషణ వంటివి వీటిల్లో ఉన్నాయని గోయల్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. కామన్ సర్వీసెస్ సెంటర్లు కేంద్రంగా డిజిటల్ గ్రామాలు.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిజిటల్ గ్రామాల వ్యవస్థ మొత్తం కామన్ సర్వీసెస్ సెంటర్లు కేంద్రంగా నడుస్తాయి. వచ్చే ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా లక్ష వరకూ గ్రామాల్లో ఈ కామన్ సర్వీసెస్ సెంటర్ల ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల చెంతకు చేర్చాలన్నది లక్ష్యం. గ్రామాల్లో డిజిటల్ టెక్నాల జీకి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించుకోవాల్సిన బాధ్యత కూడా ఈ కామన్ సర్వీసెస్ సెం టర్లపైనే ఉంచనున్నారు. దేశంలో ఇప్ప టికే దాదాపు మూడు లక్షల కామన్ సర్వీ సెస్ సెంటర్లు పని చేస్తున్నా యనీ, వీటి ద్వారా మరిన్ని ఎక్కువ సేవలు అందిం చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. గత ఐదేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం అనేక ప్రభుత్వ సర్వీసులను, విధానాలను డిజిటల్ రూపంలోకి మార్చేసిందని.. వీటన్నింటి ఆధారంగా 2030 నాటి డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేస్తామని వివరించారు. దేశ యువత సృష్టించే అనేక స్టార్టప్ కంపెనీలు సృష్టించే డిజిటల్ ఇండియా కారణంగా లక్షలాది కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో మొబైల్ డేటా 50 రెట్లు ఎక్కువైందని, ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యల ఫలితమిదని మంత్రి వ్యాఖ్యానించారు. డిజిటల్ గ్రామాల వంటి వాటి వల్ల మధ్యవర్తుల ప్రమేయం అస్సలు లేకుండా ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందుతాయని చెప్పారు. కృత్రిమ మేథతో అనేక లాభాలు.. ప్రభుత్వ ప్రాజెక్టుల్లో కృత్రిమ మేథ వినియోగం సర్వత్రా పెరగనుందని.. ఇందుకు తగ్గట్టుగా త్వరలోనే కేంద్ర ప్రభుత్వం కృత్రిమ మేథ సర్వీసుల కోసం ఓ జాతీయ పోర్టల్ను ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల వెబ్సైట్లు, సేవలు, కేంద్రాలకు ఈ పోర్టల్ ద్వారా సేవలు అందిస్తామని.. ఆసక్తికర ప్రైవేట్ వ్యాపార సంస్థలు కూడా ఈ పోర్టల్ సేవలు వినియోగిం చుకోవచ్చునని మంత్రి వివరించారు. త్వరలో సిద్ధం కానున్న నేషనల్ సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈ కృత్రిమ మేథ సర్వీసులు చాలా కీలకం కానున్నాయని మంత్రి చెప్పారు. దేశం ఇప్పటికే స్టార్టప్ రంగంలో గణనీయమైన పురోగతి సాధించిందని.. దీంతోపాటు కృత్రిమ మేథ తాలూకూ లాభాలను ప్రజల చెంతకు చేర్చేందుకు జాతీయ స్థాయిలో ఓ విస్తృత స్థాయి కార్యక్రమం చేపట్టాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రంగా.. ఇతర అత్యున్నత నైపుణ్య కేంద్రాలు కూడా ఏర్పాటు కావడం ద్వారా ఈ కార్యక్రమానికి ఊపు లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. కృత్రిమ మేథ సర్వీసులను ఉపయోగించు కునేందుకు ఇప్పటికే తొమ్మిది రంగాలను గుర్తించామని మంత్రి అన్నారు. -
లాభం ఎవరికి.. నష్టం ఎవరికి?
ఎన్నికల వేళ అన్ని వర్గాలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ప్రధాని నరేంద్రమోదీ పలు వర్గాలకు వరాలు ప్రకటించారు. రైతులకు ఆర్థిక సాయం, ఉద్యోగులకు ఆదాయపు పన్ను పరిమితి పెంపు, అసంఘటిత రంగ కార్మికులకు పింఛన్ వంటివి ఇందులో ముఖ్యమైనవి. బడ్జెట్ ప్రతిపాదనల వల్ల కొన్ని వర్గాలు లబ్ధి పొందుతాయని, మరికొన్ని నష్టపోయే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ‘పది’ కోటాకు దక్కని కేటాయింపులు అగ్రవర్ణాల పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవలే చట్టం తెచ్చిన ప్రభుత్వం.. ఆ మేరకు తాజా బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేయలేదు. పేదల కోటా అమలు చేయాలంటే విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో 25 శాతం సీట్లు పెంచాలి. లాబోరేటరీలు, లైబ్రరీలు అదనంగా కావాలని, టీచర్లు కూడా పెద్ద సంఖ్యలో అవసరమని నిపుణులు అంటున్నారు. బడ్జెట్లో ఉన్నత విద్యకు కేటాయించిన నిధులు వీటికి ఏ మాత్రం సరిపోవని స్పష్టం చేశారు. పది శాతం కోటా అమలు చేయాలంటే ఒక్క పంజాబ్ యూనివర్సిటీకే రూ.500 కోట్లు అవసరమని పేర్కొన్నారు. పది శాతం రిజర్వేషన్ వల్ల దేశ వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల సీట్లు పెరుగుతాయని పీయూష్ గోయల్ తన బడ్జెట్ ప్రసంగంలో సూచనప్రాయంగా చెప్పారు. ఉన్నత విద్యకు కేంద్రం బడ్జెట్లో రూ. 37,461.01 కోట్లు కేటాయించింది. గత ఏడాది కేటాయించిన 33,512.11 కోట్ల కంటే ఇది సుమారు 4 వేల కోట్లు ఎక్కువ. పది శాతం రిజర్వేషన్ల అమలుకు ఈ పెంపుదల సరిపోదనేది విద్యావేత్తల వాదన. కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు 6,604.46 కోట్లు, యూజీసీకి రూ. 4,600 కోట్లు కేటాయించారు. ఇక సాంకేతిక విద్యకు కేటాయింపులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఐఐటీలకు రూ. 6,143.02 కోట్లు కేటాయించారు. లాభపడేది.. రైతులు ప్రధానమంత్రి సమ్మాన్ యోజన పేరుతో రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6,000 చొప్పున నేరుగా వారి ఖాతాల్లోకే బదిలీ చేస్తారు. మూడు విడతలుగా ఈ సాయం అందిస్తారు. ఈ పథకంతో దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది సన్న, చిన్నకారు రైతులకు ప్రయోజనం కలుగనుంది. ఎన్నికలకు ముందే వీరి ఖాతాల్లో మొదటి విడత రూ.2,000 సాయం జమ కానుంది. పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను(ఐటీ) పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు. రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారు పన్ను చెల్లించనవసరం లేదు. రూ.6.5 లక్షల వార్షికాదాయం ఉన్నవారు కూడా ప్రావిడెంట్ ఫండ్, ఈక్విటీలలో పెట్టుబడులు పెడితే పన్ను పోటు నుంచి తప్పించుకోవచ్చు. దీనివల్ల 3 కోట్ల మంది ప్రయోజనం పొందుతారని అంచనా. గ్రామీణ భారతం పశు సంరక్షణ, మత్స్య రంగాలకు కేటాయింపులు పెంచడం, చిన్న, సన్నకారు వ్యాపారులకు వడ్డీ రాయితీ ఇవ్వడం వల్ల సంబంధిత కంపెనీలు గ్రామాలకు మళ్లే అవకాశం ఉంది. తద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. కార్మికులు అసంఘటిత కార్మికులకు పింఛను పథకం వల్ల వచ్చే ఐదేళ్లలో 10 కోట్ల మంది లాభం పొందుతారని కేంద్రం అంచనా వేస్తోంది. రూ.15,000 లోపు నెలవారీ ఆదాయం గల కార్మికులకు 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు రూ.3 వేల చొప్పున పింఛను ఇవ్వనున్నట్టు బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. రియల్ ఎస్టేట్ గృహ నిర్మాణ రంగానికి ఊతమిచ్చే చర్యలను బడ్జెట్లో పొందుపరచడంతో బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ సూచిక పైకెగిరింది. దేశంలో ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు సమకూరుస్తామని పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు. ఇంటి అద్దెపై వడ్డీ పరిమితిని కూడా పెంచారు. ఆటోమొబైల్ రంగం కూడా లబ్ధి పొందనుంది. గోయల్ ప్రసంగం చేస్తుండగానే ఎస్అండ్పీ బీఎస్ఈ ఇండెక్స్ 5.3 శాతం పెరిగింది. ప్రధాని మోదీ బడ్జెట్లో ప్రకటించిన రైతు సాయం, పింఛను పథకాలను ప్రధానమంత్రి పేరుతో రూపొందించారు. దీనివల్ల ప్రధాని నరేంద్ర మోదీ పరపతి ఎంతో కొంత పెరిగే అవకాశం ఉంది. నష్టపోయేది... బాండ్ హోల్డర్లు ఈసారి ద్రవ్యలోటు 3.4 శాతం వరకు ఉంటుందని బడ్జెట్లో అంచనా వేశారు. దీనివల్ల మన క్రెడిట్ రేటింగ్ తగ్గే అవకాశం ఉంది. పైగా బడ్జెట్లో ఆదాయం పెంపునకు కొత్త పథకాలేమీ లేవని ప్రధాని మోదీ చెప్పారు. దీనివల్ల వివిధ రకాల బాండ్లు కొనేవారికి పెద్దగా లాభం ఉండదు. ప్రతిపక్షాలు బడ్జెట్లో ప్రకటించిన రాయితీలు, ప్రోత్సాహకాలు రైతులు, మధ్య తరగతి వారితోపాటు వ్యాపారులను కూడా ఆకర్షి స్తాయి. వీటి ప్రభావంతో అధికార పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పడే వీలుంది. అది ప్రతిపక్షాలకు నష్టదాయకమే. వ్యవసాయ కూలీలు/కౌలు రైతులు మోదీ ప్రకటించిన రైతు సాయం భూయజమానులకే తప్ప కౌలు రైతులకు అందదు. దేశంలోని పంటలు సాగుచేస్తున్న వారిలో చాలామందికి సొంత భూమి లేదు. కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. రక్షణ రంగం గత బడ్జెట్తో పోలిస్తే ఈసారి కేవలం రూ.3 వేల కోట్లు మాత్రమే పెంచారు. ఫలితంగా రక్షణ శాఖ ఆధునికీకరణ కష్టమవుతుంది. -
రక్షణకు మేం రెడీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగానికి 2019–20 బడ్జెట్లో రూ. 3,18,931 కోట్లు కేటాయించారు. గత ఏడాది రక్షణ శాఖ బడ్జెట్తో కేటాయింపు రూ. 2,95,511 కోట్లతో పోలిస్తే ఇది 6.87 శాతం ఎక్కువగా తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆయుధాలు, యుద్ధవిమానాలు, యుద్ధనౌకలు, ఇతర పరికరాలు కొనడానికి బడ్జెట్ కేటాయింపులో రూ. 1,08,248 కోట్లను మూలధనంగా పేర్కొన్నారు. మూలధనం ఆర్మీకి రూ. 29,447 కోట్లు, నేవీకి రూ. 23,156 కోట్లు, ఎయిర్ఫోర్స్కు రూ. 39,302 కోట్లు కేటాయించారు. ఇక జీతాల చెల్లింపు తదితర రెవెన్యూ వ్యయానికి రూ. 2,10,682 కోట్లు కేటాయించారు. కేంద్రం ప్రభుత్వం మొత్తం మూలధనంలో 32.19 శాతం సాయిధ బలగాలకు కేటాయించామని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వ్యయం మొత్తంలో 15.48 శాతం రక్షణ రంగం కేటాయింపులేనని చెప్పారు. రక్షణ రంగానికి ఇచ్చిన దానికి అదనంగా పెన్షన్ల కోసం రూ. 1,12,079 కోట్లను కేటాయించారు. సరిహద్దులను కాపాడటానికి అవసరమైతే మరిన్ని నిధులు ఇవ్వడానికి కూడా సిద్ధమని పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. కఠినమైన పరిస్థితుల్లో దేశాన్ని కాపాడుతున్న సైనికులు గర్వకారణమని, అందుకే ఈ ఏడాది వారికోసం ఇప్పటివరకూ ఎవరూ కేటాయించని స్థాయిలో నిధులు కేటాయించామని తెలిపారు. నలభైఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఒకే హోదా ఒకే పింఛన్ను తాము పరిష్కరించామని తెలిపారు. యూపీఏ సర్కారు 2014–15 మధ్యంతర బడ్జెట్లో కేవలం రూ. 500 కోట్లు మాత్రమే కేటాయిస్తే తాము ఆ పథకం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ రూ.35 వేల కోట్లు పంపిణీ చేశామని పీయూష్ అన్నారు. యూపీఏ ఒకేహోదా ఒకే పింఛన్ (వన్ ర్యాంక్ వన్ పింఛన్)ను మూడు బడ్జెట్లలో ప్రస్తావించినప్పటికీ అమలు చేసింది మాత్రం తామేనంటూ ఆయన.. ‘మిలటరీ సర్వీస్ పే’లో అన్ని దళాల వారికీ అలవెన్సులను గణనీయంగా పెంచామని వివరించారు. అంతేకాకుండా ప్రమాదకర పరిస్థితుల్లో ఉద్యోగాలు చేస్తున్న నేవీ, వాయుసేనల సిబ్బందికి ఇచ్చే ప్రత్యేక అలవెన్సులను కూడా ఎక్కువ చేశామని గుర్తు చేశారు. హోం మంత్రిత్వ శాఖకు 1,03,927 కేంద్ర హో మంత్రిత్వ శాఖకు కేటాయింపులు తొలిసారి లక్ష కోట్ల రూపాయలు దాటాయి. 2019–20 కేంద్ర బడ్జెట్లో హోం మంత్రిత్వ శాఖకు రూ. 1,03,927 కోట్లు కేటాయించారు. 2018–19 బడ్జెట్లో ఆ శాఖకు రూ. 99.03వేల కోట్లతో పోలిస్తే ఈ సారి 4.9 శాతం ఎక్కువ. దేశ రాజధానిలో శాంతిభద్రత కాపాడే ఢిల్లీ పోలీసులకు ఈ బడ్జెట్లో రూ. 7,496.91 కోట్లు, సరిహద్దులో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 2 వేల కోట్లు కేటాయించారు. సీఆర్పీఎఫ్ బలగాల కోసం రూ. 23,742.04 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి సీఆర్పీఎఫ్కు దాదాపు రూ. 1,095 కోట్లు అదనంగా కేటాయింపులు జరిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం కోసం బీఎస్ఎఫ్ కోసం 19,647.59 కోట్లు ఇచ్చారు. ఇది గతేడాదితో పోలిస్తే రూ. 1,061 కోట్లు అదనం. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, సశస్త్ర సీమా బల్, అస్సాం రైఫిల్స్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్తో పాటు సాయిధ బలగాల కోసం మొత్తం రూ. 71,618.70 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో ఈ కేటాయింపులు రూ. 67,779.75గా ఉన్నాయి. ఇతర కేటాయింపులు.. - ఇంటెలిజెన్స్ బ్యూరోకు ఈ బడ్జెట్లో రూ. 2,198.35 కోట్లు కేటాయించారు. - ప్రధాని, మాజీ ప్రధాని భద్రతకోసం వినియోగించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్నకు రూ. 530.75 కోట్లు ఇచ్చారు. - పోలీస్ మౌలిక వసతుల అభివృద్ధి, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, వాహనాల కొనుగోళ్లు, బారక్లు, ఇళ్ల నిర్మాణం కోసం రూ. 5,117 కోట్లు ఇచ్చారు. - పోలీసు బలగాల ఆధునికీకరణ కోసం రూ. 3,378 కోట్లు, సరిహద్దులో మౌలిక వసతులు, నిర్వహణకు రూ. 2 వేల కోట్లు, మహిళల రక్షణ, సాధికారత మిషన్కు రూ. 1,330 కోట్లు, సరిహద్దు ప్రాంత అభివృద్ధి కార్యక్రమానికి రూ. 825 కోట్లు, జమ్మూకశ్మీర్లో వలసదారులు, స్వదేశానికి తిరిగివచ్చిన వారి పునరావాసం కోసం రూ. 809 కోట్లు, స్వాతంత్య్ర పోరాటయోధుల పింఛన్ల కోసం రూ. 953 కోట్లు, నిర్భయ ఫండ్కు రూ. 50 కోట్లు కేటాయించారు. - ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి జాతీయ విపత్తు రిలీఫ్ ఫండ్కు రూ. 10,000 కోట్లు కేటాయించారు. - రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్గా 2021 జనాభా లెక్కలకు రూ. 541.33 కోట్లు, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు రూ. 50 కోట్లు, జమ్మూ కశ్మీర్లో పరిశ్రమల ఏర్పాటుకు రూ. 78.09 కోట్లు, హిందీ భాష ప్రచారానికి రూ. 4,895.81 కోట్లు కేటాయించారు. - కేంద్ర పాలిత ప్రాంతాలైన అండమాన్ అండ్ నికోబార్ దీవులకు రూ. 4,817.48 కోట్లు, చండీగఢ్కు రూ. 4,291.70 కోట్లు, దాద్రా నగర్ హవేలీకి రూ. 1,117.99 కోట్లు, డామన్ అండ్ డయ్యు రూ. 821.4 కోట్లు, లక్షద్వీప్కు రూ. 1,276.74 కోట్లు ఢిల్లీకి రూ.1,112 కోట్లు, పుదుచ్చేరికి రూ. 1,545 కోట్లు కేటాయించారు. కంచె.. కాస్త పలచబడింది! ‘జై జవాన్’ అన్నది పేరుకేనా? సమయం దొరికినపుడల్లా సైనికుల గొప్పలు చెప్పే మోదీ సర్కారు.. రక్షణరంగానికి చేసిన కేటాయింపులెంత? ఆయుధాల దిగుమతుల్లో అతిపెద్ద దేశమైన మనకు.. ప్రస్తుత తరుణంలో రక్షణరంగ కేటాయింపులేమీ పెరగలేదు. రూ.3 లక్షల కోట్లకన్నా ఎక్కువ కేటాయించామని, ఈ స్థాయి నిధులివ్వటం ఇదే తొలిసారని చెబుతున్నారు. కానీ ఆయుధాలు కొనేది డాలర్లలో. గతేడాది డాలర్ విలువ ఇప్పటికన్నా చాలా తక్కువ. దీంతో గతేడాది కేటాయింపులు దాదాపు 44.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇపుడు రూ.3 లక్షల కోట్లు దాటినా... డాలర్లలో మునుపటేడాది కన్నా తక్కువే. డాలర్లలో గతేడాది కేటాయింపులు 44.5 బిలియన్లు డాలర్లలో ప్రస్తుత కేటాయింపులు 43 బిలియన్లు -
ప్రగతికి ‘పట్టాలు’!
న్యూఢిల్లీ: మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఊహించినట్లుగానే రైల్వే చార్జీల పెంపు లేకుండానే తాజా బడ్జెట్ వచ్చింది. అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేనంత మూలధన వ్యయాన్ని ఈ బడ్జెట్లో రైల్వేకు కేటాయించారు. గతేడాది అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉండగా రూ. 1.48 లక్షల కోట్లను రైల్వేకు కేటాయించగా, ప్రస్తుతం దాన్ని మరో పది వేల కోట్లు పెంచి రూ. 1,58,658 కోట్లకు పియూష్ గోయల్ చేర్చారు. అలాగే బడ్జెట్ నుంచి మూలధన సాయంగా రూ.64,587 కోట్లను రైల్వేలకు కేటాయించారు. ఇప్పటివరకు రైల్వే చరిత్రలో 2018–19 సంవత్సరమే అత్యంత సురక్షితమైనదనీ, బ్రాడ్గేజ్ పట్టాలపై వెంట ఉన్ని కాపలా లేని రైల్వే గేట్లను సంపూర్ణంగా తొలగించామని రైల్వే, ఆర్థిక శాఖల మంత్రి పియూష్ చెప్పారు. బడ్జెట్ ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ ‘వచ్చే ఏడాదికి రైల్వేకు కేటాయించిన మూలధన వ్యయం చరిత్రలోనే అత్యధికం. ఆ మొత్తం రూ. 1.58 లక్షల కోట్లు. దేశీయంగా తయారైన పాక్షిక అత్యంత వేగవంతమైన రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ (ట్రైన్ 18) భారతీయ ప్రయాణికులకు ప్రపంచ స్థాయి అనుభవాన్ని ఇవ్వనుంది. పూర్తిగా మన ఇంజినీర్లే తయారు చేసిన ఈ రైలుతో మనం సాంకేతికతలో మరో పెద్ద అడుగు ముందుకేశాం’అని వివరించారు. రైల్వేకు వచ్చే ఆర్థిక ఏడాదిలో రూ. 2.73 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్లో అంచనా వేశారు. గతేడాది ఈ అంచనా రూ. 2.5 లక్షల కోట్లుగా ఉంది. కొత్త మార్గాల నిర్మాణాలకు రూ. 7,255 కోట్లు, గేజ్ మార్పిడికి రూ. 2,200 కోట్లు, డబ్లింగ్ పనులకు రూ. 700 కోట్లు, ఇంజిన్లు, బోగీలు తదితరాలకు రూ. 6,114.82 కోట్లు, సిగ్నల్ వ్యవస్థ, టెలికాంలకు కలిపి రూ. 1,750 కోట్లు, ప్రయాణికులకు సౌర్యాలను మెరుగుపరిచేందుకు రూ. 3,422 కోట్లను ఈ బడ్జెట్లో కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ నిష్పత్తి 96.2కు మెరుగుపడిందనీ, వచ్చే ఏడాదికి దీనిని 95 శాతానికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని గోయల్ చెప్పారు. త్వరలో అధునాతన బోగీలు ఇంజిన్లు, బోగీలు తదితరాల కోసం గతేడాది కన్నా ఈ ఏడాది బడ్జెట్లో 64 శాతం అధిక కేటాయింపులకు చేశారు. 2018–19 బడ్జెట్లో ఈ కేటగిరీ కోసం రూ. 3,724.93 కోట్లు కేటాయించగా, తాజా ఆ బడ్జెట్లో ఆ మొత్తం రూ. 6,114.82 కోట్లుగా ఉంది. దీంతో త్వరలోనే అధునాతన బోగీలు రైల్వే ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రైలు బోగీల మార్కెట్లో ప్రపంచ వ్యాప్తంగా 200 బిలియన్ డాలర్ల వ్యాపారం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకునేందుకు తాజా బడ్జెట్ కేటాయింపులు ఉపకరించనున్నాయి. భారత్లో అత్యంత వేగవంతమైన రైలు ట్రైన్ 18 (వందే భారత్ ఎక్స్ప్రెస్), కొత్త ఏసీ కోచ్లు, మెట్రో కోచ్లు తదితరాల తయారీ విజయవంతం అవ్వడంతో అదే ఉత్సాహంతో 2021 వరకు తయారీ ప్రణాళికలను రైల్వే అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. ఇవి సరిగ్గా అమలైతే వచ్చే రెండేళ్లలో దేశంలోని వివిధ రైల్వే ఫ్యాక్టరీలు కలిసి దాదాపు 15 వేల బోగీలను తయారు చేయనున్నాయి. ప్రస్తుతం వివిధ నగరాల్లో తిరుగుతున్న ఈమూ, మెమూ రైళ్లకు బదులుగా కొత్త బోగీలను ప్రవేశపెట్టనున్నారు. త్వరలోనే మరో 6 ట్రైన్ 18లను తయారు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. ఫస్ట్ యాక్సిడెంట్.. ప్రపంచంలో తొలిసారి రైలు చక్రాల కింద నలిగిపోయిన అభాగ్యుడెవరో తెలుసా? ఈయనే. పేరు విలియం హస్కిసన్, బ్రిటన్ ఎంపీ. 1830 సెప్టెంబర్ 15న బ్రిటన్లోని లివర్పూల్, మాంచెస్టర్ రైల్వేలైన్ను ప్రారంభించేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ రైలు కింద పడి మరణించారు. ఇదే కార్యక్రమానికి వచ్చిన డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ ఆర్థర్ వెలస్లీతో మాట్లాడేందుకు పక్కనే ఉన్న పట్టాలపై నడుచుకుంటూ ముందుకు వెళ్లారు. అయితే అదే సమయంలో ఆ పట్టాలపై మరో రైలు వస్తోంది. రైలు దగ్గరికి రాగానే తడబడుతూ పట్టాలపై పడిపోయారు. అందరూ చూస్తుండగానే ఘోరం జరిగిపోయింది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ 1850 తొలినాళ్లలో మన దేశంలో ఇలా ఎడ్లే ఇంజిన్లుగా అప్పటి న్యారో గేజ్ రైలును లాగేవి. -
రూరల్ రంగస్థలం!
ఇన్నాళ్లు ఒకెత్తు.. ఇప్పుడు ఎన్నికల పైఎత్తు!! గ్రామీణ రంగస్థలంపై ప్రేక్షకుడిని ఆకట్టుకోవడమే లక్ష్యంగా మోదీ సర్కారు ఈ సారి బడ్జెట్పై పెద్ద కసరత్తే చేసింది. ఇటీవలి రాష్ట్రాల ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బలను దృష్టిలో ఉంచుకొని పల్లెల్లో ఓటర్ను ఆకర్షించేవిధంగా ‘ఫ్లాగ్షిప్’ ప్రణాళికను ప్రకటించారు. పేరుకు మధ్యంతర బడ్జెటైనా, పూర్తిస్థాయి బడ్జెట్ను తలపింపజేశారు. ఉపాధిహామీకి మరింత ధీమా, మారుమూల పల్లెల్లో కూడా అందరికీ విద్యుత్ సౌకర్యం, గ్రామీణ రోడ్లకు మెరుగులు దిద్దేందుకు నిధులను కుమ్మరించారు. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశారు. గ్రామపంచాయతీలకు డిజిటల్ సొబగులు, ప్రతిఒక్కరికి గృహవసతి కల్పన లాంటి తాయిలాలు ప్రకటించారు. ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధతో కొనసాగుతున్న స్వచ్ఛ భారత్ లక్ష్యానికి ఆమడదూరంలో భారత్ నిలిచింది. ఉపాధి హామీకి మరింత ఊతం - మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఈ దఫా బడ్జెట్లో రూ. 60వేల కోట్లు కేటాయింపు. - గతేడాది కన్నా ఈ మొత్తం రూ. 5వేల కోట్లు లేదా 11 శాతం అధికం. - అవసరమైతే ఈ కేటాయింపులు మరింత పెంచుతారు. - దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకుండా ఉండేందుకు, అర్బన్– రూరల్ విభజనను తగ్గించేందుకు కృషి. - 2005లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. - ఏడాదిలో వందరోజుల పాటు కనీస ఉపాధి హామీని ఇవ్వడమే ఈ పథకం ప్రధానోద్దేశం. దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్జ్యోతి యోజన - 2017లో ఆరంభించిన సౌభాగ్య పథకం కింద ఇప్పటిదాకా 2,48,19,168 కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేశారు. మొత్తం లక్ష్యం 2.5 కోట్ల కుటుంబాలు. - ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్కు కేటాయింపులు రూ. 3970 కోట్ల నుంచి రూ. 5280 కోట్లకు పెంచారు. - దీనికోసం ఇప్పటివరకూ రూ. 16320 కోట్ల వెచ్చింపు. - పేద, మధ్యతరహా కుటుంబాలకు 143 కోట్ల ఎల్ఈడీ బల్బుల అందజేత. - ఎల్ఈడీ బల్బులతో రూ.50వేల కోట్ల విద్యుత్ బిల్లుల ఆదా. మూడు రెట్లు పెరిగిన గ్రామీణ రోడ్ల నిర్మాణం - 2022కు బదులు 2019 మార్చికే అన్ని ఆవాసాలకు రహదారులు - ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద గ్రామాల్లో రోడ్ల నిర్మాణాలు 3 రెట్లు పెరిగాయి. - మొత్తం 17.84 లక్షల ఆవాసాల్లో 15.8 లక్షల ఆవాసాలకు పక్కా రోడ్లు వచ్చాయి. ఫేజ్–3 కింద ఆవాసాలను ఆస్పత్రులు, పాఠశాలలు, మార్కెట్లతో కలిపేందుకు లింక్ రోడ్ల నిర్మాణాలు. - హైవేల నిర్మాణంలో ప్రపంచంలోనే ముందంజ. రోజుకు 27 కి.మీ. హైవేల నిర్మాణం స్వచ్ఛ భారత్ సాకారం... - 2014–15 నుంచి ఇప్పటివరకు దాదాపు 9 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి. బహిరంగ మలవిసర్జన అలవాటు దాదాపు కనుమరుగైంది. - ఓడీఎఫ్(బహిరంగ మలవిసర్జన రహిత) గ్రామాల సంఖ్య 5.45 లక్షలకు చేరింది. - గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 98 శాతం శానిటేషన్ కవరేజ్ కల్పన. గ్రామీణ టెలిఫోనీ - భారత్ నెట్ ఫేజ్1 కింద 1, 21, 652 గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ కనెక్టివిటీ పూర్తి. - 1.16లక్షల పంచాయతీల్లో సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. - దీంతో 2.5 లక్షల గ్రామాల్లోని దాదాపు 20 కోట్ల మంది గ్రామీణవాసులకు బ్రాడ్బ్యాంక్ యాక్సెస్ లభించింది. - 39, 359 పంచాయతీల్లో వైఫై హాట్స్పాట్స్ ఇన్స్టలేషన్ పూర్తి. - ఐదు కోట్లమంది గ్రామీణులకు లబ్ది చేకూరేలా 5 లక్షల వైఫై స్పాట్స్ ఏర్పాటు లక్ష్యం. జాతీయ గ్రామీణ తాగునీటి పథకం - ఈ ‘భారత్ నిర్మాణ్’ పథకానికి నిధులు జోరుగానే అందుతున్నాయి. - దేశంలో తాగునీటి సౌకర్యం లేని(అన్కవర్డ్) అన్ని మారుమూల గ్రామీణప్రాంతాలకూ సురక్షితమైన, తగినంత తాగునీటిని అందించాలనేది ఈ పథకం ప్రధానోద్దేశం. - దీన్ని ఇప్పుడు విజన్ 2030లో భాగంగా చేర్చారు. - నాలుగేళ్లలో 28,000 ఆర్సినిక్, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని అందించాలనేది కూడా ఈ పథకంలో భాగంగా మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - 2019–20 కేటాయింపులు 25,853కోట్లు - 2018–19 సవరించినది 26,405 కోట్లు - ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇప్పటి వరకు 1.53 కోట్ల ఇళ్ల నిర్మాణం(గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలు కలిపి) - నేషనల్ హౌసింగ్ బ్యాంక్లో రూ. 10వేల కోట్ల కార్పస్తో కొత్తగా హౌసింగ్ ఫండ్(ఏహెచ్ఎఫ్) ఏర్పాటు. - ఇళ్ల నిర్మాణాలు ఇందిరా ఆవాస్ యోజన కన్నా ఈ పథకం కింద ఐదు రెట్లు అధికం. 2022 నాటికి అందరికీ గృహవసతి లక్ష్యం. ఊరటనిచ్చేదే! ‘బడ్జెట్ ప్రజలకు కొంత ఊరట కలిగించేదే. ముఖ్యంగా ఆదాయపు పన్ను పరిమితిని రూ.5 లక్షలకు పెంచడం మధ్యతరగతి వర్గాలకు మేలు చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన తరహాలో కేంద్ర స్థాయిలో నగదు బదిలీని పెట్టడం హర్షించదగిన పరిణామం’ –డాక్టర్ చిట్టెడి కృష్ణారెడ్డి, ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్. ఊరికి మరిన్ని మెరుపులు... పదిహేనేళ్లుగా నిరాటంకంగా కొనసాగుతున్న ఉపాధి హామీకి నిధుల హామీ దొరికింది. మునుపటికన్నా మరీ ఎక్కువ కాకున్నా... ఒక మోస్తరుగా కేటాయింపులు పెరిగాయి. ఇక గ్రామ్జ్యోతి యోజనంటూ ఏటా విద్యుత్ కనెక్షన్లిచ్చిన కుటుంబాల సంఖ్య పెరుగుతున్నందుకు ఆనందించాలో... అసలింకా కరెంటుకు నోచుకోని ఇళ్లున్న దౌర్భాగ్యానికి సిగ్గుపడాలో తెలియని పరిస్థితి. గ్రామీణ రోడ్ల నిర్మాణం మాత్రం జోరుగానే సాగుతోంది. స్వచ్ఛ భారత్ ఆశయంలో ఉన్నంత ఉదాత్తత ఆచరణలో ఇంకా కనిపించాల్సి ఉందన్నది కాదనలేని నిజం. కాకపోతే దీనికి ప్రభుత్వం కన్నా ప్రజలే ఎక్కువ చేయాల్సిందన్నది వాస్తవం. ఏడాదిలో కనీస ఉపాధి రోజులు: 100 -
డిమాండ్, వృద్ధికి బలం
మధ్యంతర బడ్జెట్లో ప్రకటించిన నిర్ణయాలు డిమాండ్కు ప్రేరణనివ్వడంతోపాటు దేశ వృద్ధి రేటుకు బలాన్నిస్తాయని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక సంఘాలు అభిప్రాయపడ్డాయి. కుప్తంగా చూస్తే... ఈ బడ్జెట్ మొత్తం మీద వినియోగదారుల విశ్వాసాన్ని పెంచుతుంది. బ్రాండెడ్ ఆహార ఉత్పత్తులు, కన్జ్యూమర్ ఉత్పత్తుల డిమాండ్కు ఊపునిస్తుంది. ద్రవ్యలోటును 3.4 శాతానికి సవరించడం కొంచెం ఆందోళన కలిగించే అంశం – సునీల్ దుగ్గల్, డాబర్ ఇండియా సీఈవో కనీస మద్దతు ధరలు, రైతులకు సంబంధించిన పథకంలో పెట్టుబడులు పెంచడం ద్వారా ఆర్థిక రంగానికి బలాన్నివ్వడం ఆహ్వానించతగినది. పన్ను మినహాయింపు పెంచడం, పన్ను రిటర్నుల ప్రక్రియను సులభతరం చేయడం అన్నవి పన్నుల భారాన్ని తగ్గించడమే కాకుండా పన్నులు చెల్లించే వారి సంఖ్యను కూడా పెంచుతుంది – సౌగత గుప్తా, మారికో ఎండీ, సీఈవో ముందుచూపుతో కూడిన బడ్జెట్ ఇది. వినియోగదారుల చేతుల్లో ఖర్చు చేసేందుకు మరిన్ని నిధులు ఉండేలా చేస్తుంది. వీటికితోడు ఇటీవల పలు గృహోపకరణాలపై జీఎస్టీ రేట్ల తగ్గింపుతో వినియోగదారులు చేసే ఖర్చు కూడా పెరుగుతుంది. ఇది మా రంగంలో డిమాండ్ పెంచుతుంది. – సునీల్ డిసౌజ, వర్ల్పూల్ ఇండియా ఎండీ 2030 నాటికి సమగ్ర ఆరోగ్య, చక్కని ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ‘ఆరోగ్య భారత్’ లక్ష్యాన్ని బడ్జెట్లో పేర్కొనడం ఆసక్తికరం. అయితే, ఈ బడ్జెట్లో ఆరోగ్య రంగానికి నిధుల కేటాయింపును పెంచకపోవడం లోటు. – అజాద్మూపెన్, ఆస్గర్ డీఎం హెల్త్కేర్ చైర్మన్ నూతన భారత్ కోసం ఉద్దేశించిన బడ్జెట్ ఇది. సమాజంలోని పలు వర్గాలకు సంబంధించి ప్రాధాన్యతల విషయంలో తాత్కాలిక ఆర్థిక మంత్రి సమతుల్యం పాటించారు. ఉద్యోగాల కల్పన, నైపుణ్య అంతరాలను భర్తీ అంశాలను పరిష్కరించేలా ఉంది. పన్ను మినహాయింపులు, తక్కువ ద్రవ్యోల్బణం దేశీయ డిమాండ్ను, వినియోగాన్ని పెంచుతాయి. దీంతో వ్యవస్థలో లిక్విడిటీ పెరుగుతుంది – రితేష్ అగర్వాల్, ఓయో హోటల్స్ అద్భుతమైన బడ్జెట్. దేశంలో అతిపెద్ద వర్గమైన మధ్యతరగతి, రైతులకు, అవ్యవస్థీకృత రంగంలోని పనివారికి ఏదైనా చేసేందుకు ఆర్థిక మంత్రి ప్రయత్నించారు. అదే సమయంలో ద్రవ్యలోటు 3.4 శాతం స్థాయిలోనే కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నారు. ఇది ప్రజానుకూల బడ్జెట్. ఆర్థిక రంగానికి మేలు చేస్తుంది. – అజయ్ సింగ్, స్పైస్జెట్ చైర్మన్, ఎండీ స్టార్టప్ల్లో పెట్టుబడులపై ఏంజెల్ ట్యాక్స్ను రద్దు చేయాలని, జీఎస్టీ సంబంధించి మరింత స్పష్టత ఇవ్వాలన్న పరిశ్రమ విజ్ఞప్తులకు ఈ బడ్జెట్లో చోటు కల్పించలేదు. అయితే, తగిన చర్చల ద్వారా వీటిని పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం – ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ రెండు హెక్టార్ల భూమి (ఐదెకరాల్లోపు) ఉన్న రైతులకు ఏడాదికి రూ.6,000 ఇవ్వాలన్న పథకం లక్షలాది మంది పత్తి రైతులకు మేలు చేస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో పత్తి పంట దెబ్బతిన్నది. ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం వారికి చేయూతనిస్తుంది – పి.నటరాజ్, చైర్మన్ సదరన్ ఇండియా మిల్స్ అసోసియేషన్ బడ్జెట్ ప్రకటనలు స్టీల్ రంగానికి మొత్తం మీద సానుకూలం. దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మధ్యంతర బడ్జెట్లోనూ చోటు కల్పించారు. రైల్వేలు, రోడ్లు, జలమార్గాలు వృద్ధికి కీలకం – ఏకే చౌదరి, సెయిల్ చైర్మన్ 2030 నాటికి వాహన కాలుష్య రహిత దేశంగా భారత్ను తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని స్వాగతిస్తున్నాం. పర్యావరణ అనుకూల వాహనాల విషయంలో ప్రభుత్వం తొలిసారిగా తన నిబద్ధతను ప్రకటించింది. తాజా ప్రకటనతో ఈ రంగంలో అనిశ్చితి తొలిగినట్టయింది. ఫేమ్–2 ప్రకటన కోసం ఆతృతగా పరిశ్రమ ఎదురుచూస్తోంది. – ఎన్.నాగసత్యం, ఈడీ, ఓలెక్ట్రా గ్రీన్టెక్ క్రెడిట్ నెగెటివ్ ... ఆదాయం పెంచే ఎటువంటి విధానపరమైన నిర్ణయాలు లేకుండా అధిక ఖర్చులకు దారితీసే పలు చర్యలు ద్రవ్యోలోటు పెరిగేందుకు దారితీస్తాయి. ఇది సార్వభౌమ క్రెడిట్ రేటింగ్కు పెద్ద ప్రతికూలం. 2020లోనూ ద్రవ్యలోటు 3.4 శాతాన్ని చేరుకోవడం కష్టమే. వరుసగా ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరుకోలేకపోవడాన్ని మేము క్రెడిట్ నెగెటివ్గానే చూస్తాం – రేటింగ్ ఏజెన్సీ మూడిస్ -
ద్రవ్యబాటలో ఒడిదుడుకులు!
మార్కెట్ రుణ సమీకరణ రూ.4.48 లక్షల కోట్లు మార్కెట్ నుంచి 2019–20 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ.4.48 లక్షల కోట్ల రుణ సమీకరణ జరపనుందని ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 2018–19 ఆర్థిక సంవత్సరం (రూ.4.47 లక్షల కోట్లు) రుణ సమీకరణకన్నా ఇది కొంచెం ఎక్కువ. నిజానికి 2018–19 ఆర్థిక సంవత్సరంలో 4.07 లక్షల కోట్ల మార్కెట్ రుణ సమీకరణలనే బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే నికరంగా ఈ పరిమాణం రూ.4.47 లక్షల కోట్లకు పెరిగినట్లు సవరిత అంచనాలు తెలిపాయి. ఇక స్థూలంగా చూస్తే రుణ పరిమాణం రూ.5.71 లక్షల కోట్ల నుంచి రూ.7.1 లక్షల కోట్లకు పెరిగింది. గడచిన రుణాల రీపేమెంట్లు కూడా స్థూల రుణాల్లో కలిసి ఉంటాయి. ఈ తరహా చెల్లింపులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2.36 లక్షల కోట్లు ఉంటాయని తాజా బడ్జెట్ పేర్కొంది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం– చేసే వ్యయం మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును పూడ్చుకునే మార్గాల్లో ప్రభుత్వానికి మార్కెట్ నుంచి రుణ సమీకరణ ఒకటి. డేటెడ్ బాండ్లు, ట్రెజరీ బిల్లుల ద్వారా ఈ నిధుల సమీకరణ జరుగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు కట్టుతప్పనున్న విషయం స్పష్టమైపోయింది. 2018–19 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.3 శాతంగా ద్రవ్యలోటు ఉండాలని వార్షిక బడ్జెట్ నిర్దేశించింది. విలువలో ఇది రూ.6.24 లక్షల కోట్లు. అయితే 2018 నవంబర్ పూర్తయ్యే నాటికే ఈ లోటు రూ.7.16 లక్షల కోట్లను తాకింది. అంటే లక్ష్యానికన్నా మరో 15 శాతం ఎక్కువయిందన్న మాట. మెజారిటీ ఆర్థిక సంస్థలు, విశ్లేషణలకు అనుగుణంగానే ద్రవ్యలోటు అంచనాలు పెరగనున్నట్లు ఆర్థికమంత్రి తన తాజా బడ్జెట్ ప్రసంగంలో పేర్కొనడం గమనార్హం. కాగా ద్రవ్యలోటును 2019–20 ఆర్థిక సంవత్సరంలో 3.4 శాతంగా కొనసాగించడానికి కేంద్రం కట్టుబడి ఉందని ఆర్థికమంత్రి తన ప్రసంగంలో తెలిపారు. రైతులకు మద్దతు ఇవ్వకపోతే... అంచనాలకు అనుగుణంగానే! ‘‘2018–19 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును 3.3 శాతానికి కట్టడి చేయాలనే అనుకుంటున్నాం. అయితే రైతులకు ఆదాయ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. ఇందుకు సవరించిన అంచనాల్లో (2018–19 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో) రైతులకు రూ.20,000 కోట్లను అందించాలని నిర్ణయించాం. 2019–20లో (బడ్జెట్ అంచనాలు) ఈ మొత్తం రూ.75,000 కోట్లుగా అంచనావేస్తున్నాం. అందువల్లే ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కొంత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాం. ఈ మద్దతు కల్పించకపోతే, ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3.3%, వచ్చే ఆర్థిక సంవత్సరం 3.1%గా ఉంటుంది’’ అని గోయెల్ పేర్కొన్నారు. 2020–21 నాటికి 3% లక్ష్యమన్నారు. కరెంట్ అకౌంట్ లోటు 2.5 శాతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కరెంట్ అకౌంట్ లోటు (ఎఫ్ఐఐ, ఎఫ్డీఐ, ఈసీబీలు మినహా దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) జీడీపీలో 2.5 శాతం ఉంటుందని గోయెల్ బడ్జెట్ పేర్కొంది. తగ్గిన పన్ను ఆదాయం 2018–19 ఆర్థిక సంవత్సరంలో స్థూల పన్ను ఆదాయం బడ్జెట్ అంచనాలకన్నా స్వల్పంగా రూ.23,067 కోట్లు తగ్గుతోంది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు అంచనాలకన్నా తగ్గడం దీనికి కారణం. జీడీపీలో స్థూల పన్ను వసూళ్లు 12.1 శాతానికి! 2019–20 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో స్థూల పన్ను ఆదాయం 12.1 శాతానికి పెరుగుతుందని బడ్జెట్ అంచనావేసింది. 2020–21లో ఇది 12.2 శాతానికి చేరుతుందని పేర్కొంది. లక్ష్యాలను దాటిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు ప్రత్యక్ష పన్ను వసూళ్లు మాత్రం 2018–19 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాలను దాటడం గమనార్హం. బడ్జెట్ అంచనా రూ.11.50 లక్షల కోట్లయితే, అదనంగా మరో రూ.50,000 కోట్లతో మొత్తం రూ.12 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2019–20 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు లక్ష్యం రూ.13.80 లక్షల కోట్లు. ఈ విభాగంలో కార్పొరేట్, వ్యక్తిగత ఆదాయ పన్ను (పీఐటీ) ఉంటాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.7.60 లక్షల కోట్లను కార్పొరేట్ పన్నుగా, వ్యక్తిగత ఆదాయపు పన్నుల ద్వారా రూ.6.20 లక్షల కోట్లను సమీకరించాలన్నది బడ్జెట్ ప్రణాళిక. 2018–19లో ఈ మొత్తాలు వరుసగా 6.71 లక్షల కోట్లు, రూ.5.29 లక్షల కోట్లుగా ఉన్నాయి. -
బడ్జెట్పై ‘కార్పొరేట్’ పలుకు...
దేశ ఆర్థిక వృద్ధికి మధ్యతరగతి వర్గాలు, చిన్న వర్తకులు, రైతులు జీవనాడి వంటివారు. బడ్జెట్ 2019లో ప్రకటించిన నిర్ణయాలు లక్షలాది మంది కలలు. – గౌతం అదానీ, అదానీ గ్రూపు చైర్మన్ ఆర్థిక రంగ దివాలా పరిస్థితి రాకుండా కీలకమైన మధ్యతరగతి, రైతాంగ విభాగాలకు ఇచ్చిన ఉపశమన నిర్ణయాలు గొప్పగా ఉన్నాయి. నియంత్రణతో కూడిన, ప్రేరణనిచ్చే కసరత్తు ఇది. ఆదాయాన్ని స్థిరీకరించి, ఒత్తిడిని ఎదుర్కొంటున్న వర్గాలకు రిస్క్ను తగ్గిస్తాయి. – ఆనంద్ మహీంద్రా, మహీంద్రా గ్రూపు చైర్మన్ గ్రామీణ ప్రజలకు ఉపశమనం కలిగించే, వినియోగానికి ప్రేరణనిచ్చేలా బడ్జెట్ ఉంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి వృద్ధికి ఊతమిచ్చేలా, ద్రవ్య క్రమశిక్షణతో, అదే సమయంలో ప్రభుత్వ ఖజానాపై పెద్ద భారం పడకుండా బడ్జెట్ను ప్రకటించినందుకు నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని అభినందించాలి’’ – అనిల్ అగర్వాల్, వేదాంత రీసోర్సెస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వినియోగాన్ని పెంచడం, వ్యవసాయం, గ్రామీణ వర్గాలు, అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు ప్రయోజనాలు కల్పించే కార్యాచరణ వృద్ధికి ప్రేరణనిస్తుంది. బడ్జెట్ నిర్ణయాలు ఆర్థిక రంగానికి మంచి చేస్తాయి. – సంజయ్పూరి, ఐటీసీ ఎండీ ఇది ఎన్నికల సంవత్సరం బడ్జెట్. అందరికీ ఉద్దేశించినది. రైతుల నుంచి వర్తకుల వరకు, అవ్యవస్థీకృత రంగంలోని పనివారి నుంచి మధ్యతరగతి వేతన జీవుల వరకు అందరికీ ఏదో ఒకటి ఉంది. ప్రభుత్వం చాలా సమతూకం పాటించింది. ద్రవ్యలోటుకు కట్టుబడి ఉంటామన్న సంకేతాన్నిచ్చింది. అయితే, ఆరోగ్య రంగానికి అదనపు కేటాయింపుల్లేకపోవడం లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి ప్రోత్సాహకాలు లేకపోవడం నిరాశ కలిగించింది. – కిరణ్ మజుందార్షా, బయోకాన్ సీఎండీ వ్యవసాయం, మధ్యతరగతి వర్గాలే స్పష్టమైన లక్ష్యంతో బడ్జెట్ ఉంది. నేరుగా నగదు, పన్ను మినహాయింపుతో లబ్ధిదారులకు రూ.93,000 కోట్ల వెసులుబాటు కలిగిస్తుంది. ఈ పథకాలు వినియోగాన్ని పెంచుతాయి. గ్రామీణ ఆర్థిక రంగానికి మేలు చేస్తాయి’’ – పవన్ ముంజాల్, హీరోమోటోకార్ప్ చైర్మన్ ప్రతీ రంగంలో, ప్రతీ వర్గంలో కొనుగోలు శక్తిని పెంచే విధంగా బడ్జెట్ ఉంది. వ్యక్తిగత ఆదాయపన్ను మినహాయింపును రూ.5 లక్షలకు పెంచడం చారిత్రక నిర్ణయం. దీంతో వారు ఖర్చు చేసేందుకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయి. మరింత మంది ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేస్తారని, పరిశ్రమ వృద్ధికి తోడ్పడుతుందని అంచనా. – వేణు శ్రీనివాసన్, టీవీఎస్ మోటార్ చైర్మన్ చిన్న, మధ్య స్థాయి రైతులకు ఆదాయాన్నిచ్చే పథకం ఎంతో ఆహ్వానించతగినది. పశు సంరక్షణ, చేపల పెంపకం కోసం వడ్డీ రాయితీతో కూడిన రుణాలు ఆయా రంగాలకు చేయూతనిస్తుంది. ఆదాయపన్ను మినహాయింపును రూ.5 లక్షలకు పెంచడం, బ్యాంకు డిపాజిట్లపై టీడీఎస్ పరిమితిని రూ.40,000కు పెంచడం కొత్త డిపాజిట్లను ఆకర్షించేందుకు తోడ్పడతాయి. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ సంక్షోభం లేని ఆరోగ్య వ్యవస్థకు, ఆరోగ్య భారత్ విషయంలో ప్రభుత్వ కట్టుబాటును మధ్యంతర బడ్జెట్ తెలియజేసింది. ప్రభుత్వ చర్యల్లో ఆరోగ్య సంరక్షణ చాలా కీలకంగా ఉండాలి. ఆరోగ్య సదుపాయాల విషయంలో పల్లెలు, పట్టణాల మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చేందుకు అవకాశాలను కోల్పోకూడదు. ఈ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించే విధానాలు అవసరం’’ – సంగీతారెడ్డి, అపోలో హాస్పిటల్స్ గ్రూపు జాయింట్ ఎండీ