
బడ్జెట్ 2019 : కృత్రిమ మేథపై జాతీయ కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : అత్యాదునిక టెక్నాలజీగా శరవేగంగా దూసుకొస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేథ)ను సమర్ధంగా అందిపుచ్చుకునేందుకు పలు చర్యలు చేపడుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ దిశగా ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో రోడ్మ్యాప్ను ప్రకటించారు.
నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోర్టల్ను ప్రభుత్వం త్వరలో అభివృద్ధి చేస్తుందన్నారు. కృత్రిమ మేథపై ప్రభుత్వం జాతీయ కార్యక్రమాన్ని చేపట్టిందని గోయల్ వెల్లడించారు. ఈ కార్యక్రమం కింద కృత్రిమ మేథపై జాతీయ కేంద్రాన్ని (ఎన్సీఏఐ) ఏర్పాటు చేసి ఈ టెక్నాలజీని పెద్ద ఎత్తున ముందుకు తీసుకువెళతామని తెలిపారు. కృత్రిమ మేథకు హబ్గా వ్యవహరించే ఎన్సీఏఐ తోడ్పాటుతో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లను నెలకొల్పుతామని వెల్లడించారు.