
సాక్షి, న్యూఢిల్లీ : మహమ్మారి కరోనా వైరస్ కేసులు విస్తృతంగా వ్యాప్తి చెందడంతో నోయిడా ప్రాంతంలో ఏప్రిల్ 30 వరకూ 144 సెక్షన్ విధిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈనెల 14తో దేశవ్యాప్త లాక్డౌన్ ముగిసినా నోయిడాలో నిషేదాజ్ఞలు కొనసాగుతాయి. మరోవైపు దేశమంతటా లాక్డౌన్ అమలవుతున్నా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3000 దాటగా మృతుల సంఖ్య 75కు పెరిగింది. 212 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యేందుకు సిద్ధంగా ఉన్నా రోజురోజుకూ ఈ మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.
ఇక కరోనా పాజిటివ్ కేసులను పరిశీలిస్తే పలు దేశాల్లో వయసు మళ్లిన వారిలోనే ఎక్కువగా వైరస్ ప్రభావం కనిపిస్తుండగా భారత్లో మాత్రం 80 శాతం రోగులు 60 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. 60 ఏళ్లు దాటిన వారిలో వైరస్ బారిన పడినవారి సంఖ్య కేవలం 16.69 శాతమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. ఇక వైరస్ కారణంగా మరణించే వారిలో మధుమేహం, హైపర్టెన్షన్, కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారు అధికంగా ఉన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 11,97,405కు చేరగా 64,606 మంది మరణించారని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment