
బీజేపీ అసంతృప్తి నేత శత్రుఘ్న సిన్హా (ఫైల్ ఫోటో)
ముజాఫర్నగర్(ఉత్తరప్రదేశ్) : రఫేల్ డీల్పై విపక్షాల ఎక్కుపెట్టే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సతమతమవుతున్న మోదీ సర్కారుకు స్వపక్షం నుంచే సెగ తగులుతోంది. రఫేల్ డీల్పై బీజేపీ అసంతృప్తి నేత శత్రుఘ్నసిన్హా, సొంత ప్రభుత్వంపైనే మండిపడ్డారు. ఎంతో అనుభవపూర్వకమైన కంపెనీ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)ను పక్కనపెట్టి, కొత్త కంపెనీని రఫేల్ కాంట్రాక్ట్కు ఎంపిక చేయడమేమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఆదివారం తవ్లి గ్రామంలో జరిగిన వ్యవసాయదారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రఫేల్ డీల్కు ఫ్రెంచ్ ఏరోస్పేస్ దిగ్గజం దస్సాల్ట్ ఏవియేషన్కు భాగస్వామిగా రిలయన్స్ డిఫెన్స్ను కేంద్ర ప్రభుత్వమే ఎంపిక చేసిందని ఫ్రాన్స్ అప్పటి అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే చెప్పినట్టు వెల్లడైన విషయాన్ని గుర్తు చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఆ సమావేశానికి మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా హాజరయ్యారు. కాగా, రూ.58 వేల కోట్లకు పైగా విలువైన రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలు సంధించుకుంటున్నాయి. 2019 ఎన్నికలకు విపక్షాలకు ఇదే ప్రధాన అస్త్రంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment