
తిరువనంతపురం : రెండు విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ విద్యార్థి నేత హత్యకు గురైయ్యాడు. ఈ ఘటన కేరళలోని ఎర్నాకులం మహారాజ్ కాలేజీలో సోమవారం చోటుచేసుకుంది. ఫ్రెషర్స్ డే సందర్భంగా సీపీఎంకు చెందిన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) విద్యార్థులు కాలేజీ ఆవరణలో పోస్టర్ పెట్టినందుకు క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో ఎస్ఎఫ్ఐకు చెందిన విద్యార్థినేత అభిమన్యు కత్తిపోట్లకు గురై మృతి చెందగా, ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
ఘటనా స్థలానికి చెరుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. పాపులర్ ఫ్రెంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ), క్యాంపస్ ఫ్రెంట్కు చెందిన వ్యక్తులే ఈ ఘటనకు కారణమని పోలీసులు తెలిపారు. ఘటనకు కారణమైన వారిలో కేవలం ఒక్కరు మాత్రమే కాలేజీకి చెందిన వారని, మిగిలిన వారంతా బయటి వ్యక్తులుగా గుర్తించామని తెలిపారు. ఘటనను కేరళ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యుడు పీ. రాజీవ్ తీవ్రంగా ఖండించారు. ప్రగతిశీల వాదులంతా ఇలాంటి ఘటనలను ఖండించాలని కోరారు. విద్యార్థి నేత హత్యకు నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంఘాల బంద్కు ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది.