
ప్రజలు కరోనా మహమ్మారి కంటే లాక్డౌన్ ప్రభావంతో ఎదురయ్యే ఆర్థిక సమస్యలపైనే ఆందోళన చెందుతున్నారు.
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజలు కరోనా మహమ్మారి కంటే ఈ వ్యాధి ప్రభావంతో ఎదురయ్యే ఆర్థిక సంక్షోభం గురించే ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని తాజా సర్వే స్పష్టం చేసింది. లాక్డౌన్లో ప్రజల మనోగతంపై సీఎంఈఈ ఆధ్వర్యంలో ఐఐఎం లక్నో ఈ సర్వే చేపట్టింది. 23 రాష్ట్రాల్లోని 104 నగరాల్లో ఈ అథ్యయనం పలువురిని పలుకరించింది. వీరిలో అత్యధికులు లాక్డౌన్తో తలెత్తే ఆర్థిక సమస్యలపైనే ఆందోళన చెందుతున్నామని చెప్పినట్టు వెల్లడైంది.
ఇక లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ప్రజల ప్రవర్తన హేతుబద్ధంగా ఉండబోదనే భయం వెంటాడుతోందని మరికొందరు తెలిపారు. మహమ్మారి ప్రభావంతో ఆర్ధిక సమస్యలు చుట్టుముడతాయని అత్యధికంగా 32 శాతం మంది ఆందోళన చెందగా, లాక్డౌన్లో ప్రజలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంపై 15 శాతం మంది స్పందించారు. ఇక వైరస్ సోకుతుందనే భయంతో ఉన్నామని చెప్పినవారు కేవలం 14 శాతం కావడం గమనార్హం.
చదవండి : వృద్ధ జంటకు సానియా, అనుష్క ఫిదా
మరోవైపు వైరస్ను ఎదుర్కోవడంలో ప్రభుత్వం చేపట్టిన చర్యల పట్ల ప్రతి 5గురిలో ముగ్గురు సంతృప్తి వ్యక్తం చేశారు. మార్చి 25-మే 3 మధ్య లాక్డౌన్ అమలవుతున్న వ్యవధిలో ఫేస్బుక్, లింక్డ్డిన్ వంటి సామాజిక మాథ్యమాలపై ఆన్లైన్లో ఈ అథ్యయనం చేపట్టామని సీఎంఈఈ వెల్లడించింది.