సీడబ్ల్యూసీ క్లియరెన్స్‌ తీసుకోండి | Take the CWC clearance | Sakshi
Sakshi News home page

సీడబ్ల్యూసీ క్లియరెన్స్‌ తీసుకోండి

Sep 4 2017 2:10 AM | Updated on Sep 12 2017 1:46 AM

ఆలమట్టి ఆనకట్ట ఎత్తు పెంచే ప్రాజెక్టుకు ముందుగా కేంద్ర జల మండలి (సీడబ్ల్యూసీ) అనుమతి తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వానికి కేంద్ర నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది.

- తర్వాతే పర్యావరణ అనుమతులిస్తాం 
- ఆలమట్టి ఎత్తు పెంపుపై కర్ణాటకకు తేల్చి చెప్పిన నిపుణుల కమిటీ  
 
న్యూఢిల్లీ: ఆలమట్టి ఆనకట్ట ఎత్తు పెంచే ప్రాజెక్టుకు ముందుగా కేంద్ర జల మండలి (సీడబ్ల్యూసీ) అనుమతి తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వానికి కేంద్ర నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. ఆ తర్వాతే తాము పర్యావరణ అనుమతులను ఇస్తామంది. అంతర్‌ రాష్ట్ర వివాదాలు, హైడ్రాలజీకి సంబంధించి సీడబ్ల్యూసీ నుంచి అనుమతి తెచ్చుకోవాలంది. ఉత్తర కర్ణాటకలో కృష్ణానదిపై ఉన్న ఆలమట్టి డ్యాం ప్రస్తుత ఎత్తు 519.6 మీటర్లు కాగా, దానిని 524.256 మీటర్లకు పెంచుకుంటామని కర్ణాటక కోరుతోంది. ఆ ప్రతిపాదనను నిపుణుల కమిటీ గత నెల్లో పరిశీలించింది.

అంతర్‌ రాష్ట్ర వివాదాలు, హైడ్రాలజీకి సంబంధించిన అంశాలను తప్పనిసరిగా సీడబ్ల్యూసీ పరిశీలించాల్సిందేననీ, ఆ తర్వాతే తాము ఎత్తు పెంపుపై మరోసారి ఆలోచిస్తామని కమిటీ చెప్పింది. సాధారణంగా కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ప్రాజెక్టులకు జల వనరుల మంత్రిత్వ శాఖ అనుమతులిస్తుంది. ఎగువ కృష్ణానది ప్రాజెక్టులో భాగంగా ఆనకట్ట ఎత్తును పెంచి మరిన్ని నీళ్లను నిల్వ చేసి కొత్తగా 4 ఎత్తిపోతల పథకాలను నిర్మించేందుకు కర్ణాటక ప్రణాళికలు రచిస్తోంది. వీటి ద్వారా ఉత్తర కర్ణాటకలోని 7 జిల్లాల్లో 5.3 లక్షల హెక్టార్లకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎత్తు పెంచితే 907 టీఎంసీల నీటిని అదనంగా నిల్వ చేసుకునే సామర్థ్యం కర్ణాటకకు లభిస్తుంది. అయితే కర్ణాటక ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలు కేంద్రం, ట్రిబ్యునల్, సీడబ్ల్యూసీ వద్ద గతంలో పలుమార్లు అభ్యంతరాలు లేవనెత్తడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర కమిటీ తాజా నిర్ణయం కర్ణాటకకు ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement