రాజీనామాపై ఉమాభారతి నో కామెంట్స్
సాక్షి, న్యూఢిల్లీ: రాజీనామా వార్తల నేపథ్యంలో కేంద్ర జలవనరుల శాఖా మంత్రి ఉమాభారతి స్పందించారు. ఆ అంశంపై తనకు ఎలాంటి సమాచారం లేదని, కామెంట్ కూడా చేయబోనని ఆమె చెప్పుకొచ్చారు. కేంద్ర మంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో పలువురు మంత్రులకు ఉద్వాసన తప్పదంటూ పేర్లతోసహా సంకేతాలు అందిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మీడియా ఆయా మంత్రులను సంప్రదిస్తూ వస్తోంది. రాజీవ్ ప్రతాప్ రూడీ గురువారమే రాజీనామా చేయగా, తన నిర్ణయం కాదని.. అధిష్టానం ఆదేశాలమేరకే తాను రాజీనామా చేసినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వం ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశ దక్కిందని, ఇప్పుడు పార్టీకి సేవలు చేస్తానని రూడీ తెలిపారు.
మరో మంత్రి మహేంద్ర నాథ్ పాండేను యూపీ బీజేపీ అధ్యక్ష పదవి అప్పజెప్పగా, తదనంతరం ఆయన రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి పదవికి సంజీవ్ బల్యన్ కూడా రాజీనామా చేసినట్లు సమాచారం. వీరంతా అధిష్టానం ఒత్తిడి మూలంగానే రాజీనామా చేస్తున్నారా? అన్న ప్రశ్నలు మొదలవుతున్నాయి. ఇక మంత్రి వర్గ విస్తరణలో కొత్తగా జేడీ(యూ) కు రెండు బెర్త్లు దక్కే అవకాశం ఉంది.