
షిల్లాంగ్: మేఘాలయలోని ఓ అక్రమ బొగ్గు గనిలో గల్లంతైన 15 మంది కార్మికుల జాడ కనుక్కునేందుకు నేవీ గజ ఈతగాళ్లు రంగంలోకి దిగనున్నారు. పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లాలోని లుంథారి గ్రామం సమీపంలోని గనిలోకి ఈ నెల 13వ తేదీన నది వరద ప్రవేశించడంతో కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు వీరి జాడ కనిపెట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో విశాఖలోని నేవీ విభాగానికి చెందిన 15 మంది గజ ఈతగాళ్ల బృందం శనివారం ఆ ప్రాంతానికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు. వీరి వద్ద అత్యాధునిక పరికరాలు ఉన్నాయని, సహాయ చర్యలపై నేవీ అధికారులు సమీక్ష జరిపారని వివరించారు. ఇదిలా ఉండగా, 37 అడుగుల లోతైన గని నుంచి నీటిని తోడి వేసేందుకు కిర్లోస్కర్ కంపెనీకి చెందిన 18 అతి శక్తివంతమైన మోటార్లను అక్కడికి పంపే ఏర్పాట్లుచేస్తున్నారు. దీంతోపాటు ఒడిశా అగ్ని మాపక శాఖకు చెందిన 20 మంది సభ్యులతో కూడిన రక్షక బృందం అత్యాధునిక పరికరాలతో ప్రయత్నిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment