
ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ (ఫైల్)
సాక్షి, హైదరాబాద్: ‘మీరేం మాట్లాడాలో కొంచెం ఆలోచించుకుని మాట్లాడాల’ని ప్రధాని మోదీని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఎగతాళి చేశారు. ‘లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీజీ ఏప్రిల్ 1న హైదరాబాద్ రానున్నారని తెలిసింది. ఆ రోజు ఫూల్స్ డే కాబట్టి, మీరు మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడితే బాగుంటుంద’ని ఓవైసీ హితవు పలికారు. ‘ఎలాంటి ఆహ్వానం అందనప్పటికీ.. మోదీ మళ్లీ పాకిస్థాన్లో పర్యటించగలరు. అదే ఆయన దౌత్య విధానం. దేశ భద్రత, బాలాకోట్ వైమానిక దాడుల అంశాల ప్రస్తావనతో ఎన్నికల ప్రచారాన్ని నరేంద్ర మోదీ హోరెత్తిస్తున్నారు. కానీ, గత ఐదేళ్లలో మన రక్షణ రంగాన్ని పటిష్టపరిచే చర్యలను ఆయన చేపట్టలేదు. ఒకవేళ ఉన్నపళంగా యుద్ధం చేయాల్సివస్తే, భారత ఆర్మీ దగ్గర కేవలం 10 రోజులకు మాత్రమే సరిపోయే యుద్ధసామాగ్రి ఉందన్నది వాస్తవం కాదా?’ అని మోదీని ఓవైసీ దెప్పిపొడిచారు.
Comments
Please login to add a commentAdd a comment