
సాక్షి, అమరావతి : రాజధానిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలతోనే బాబు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని విమర్శించారు. రాజధాని అంశంపై అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. రాజధానిపై శిమరామకృష్ణ నివేదిక ఇస్తే చర్చ కూడా జరపలేదని మంత్రి అన్నారు. మొదట గుంటూరు, నూజివీడు అని చెప్పి ఆ తర్వాత అమరావతి రాజధాని అని ప్రకటించారని వెల్లడించారు. 4070 ఎకరాలు బాబు తన అనుచరులకు కట్టబెట్టారని బుగ్గన ఆరోపించారు.
‘చంద్రబాబు చేసింది కచ్చితంగా ఇన్సైడర్ ట్రేడింగే. రింగ్ రోడ్డు కూడా వారి భూములను ఆనుకుని పోయేటట్టు చేశారు. రైతులను బెదిరించి అసైన్డ్ భూములను తక్కువ ధరలకు లాక్కొన్నారు. లేని లంక భూములను ఉన్నట్టు సృష్టించి దోపిడీ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చంద్రబాబు సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు తీసుకొచ్చారు. రిజర్వు బ్యాంకుకైతే ఎకరా రూ.4 కోట్లా..! తన అనుచరులైతే ఎకరాకు రూ.20 లక్షలా..! ప్లాట్లు వేసి ఒక బిల్డింగ్ కట్టడం కోసం చంద్రబాబు సింగపూర్ కంపెనీలను తీసుకొచ్చారు. ఐదేళ్లలో విజయవాడలో ఫ్లైఓవర్ కట్టలేకపోయారు. అప్పులు తీసుకొచ్చి పండగలు చేసుకున్నారు. ప్రతి ఏడాది భూములు అమ్మి సంపద సృష్టిస్తారట’అని బుగ్గన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment