
హైకోర్టులో పిల్ వేసిన గురువాచారిని అక్రమ కేసులో ఇరికించి టీడీపీలో చేర్చుకోవాలని చూశారని అన్నారు
గుంటూరు: గురజాల నియోజకవర్గ పరిధిలో జరిగిన అక్రమ మైనింగ్పై సీబీఐ విచారణ చేపట్టాల్సిందేనని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. విలేకరులతో మాట్లాడుతూ..అక్రమ మైనింగ్లో గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావుతో పాటు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ల హస్తం ఉందని ఆరోపించారు. అధికారులు అక్రమార్కులకు సహకరిస్తే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సీఐడీ విచారణతో నిజాలు బయటికి రావు..సీబీఐ విచారణ చేయాల్సిందేనని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నడికుడి, కొనంకి, కేసానుపల్లి గ్రామాల్లో ప్రభుత్వానికి రాయల్టీ ఎగ్గొట్టి యరపతినేని టన్నుల కొద్దీ ముడి ఖనిజాన్ని తవ్వి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
హైకోర్టులో పిల్ వేసిన గురువాచారిని అక్రమ కేసులో ఇరికించి టీడీపీలో చేర్చుకోవాలని చూశారని అన్నారు. అక్రమ మైనింగ్ విషయంలో ఎమ్మెల్యే యరపతినేనికి కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చిందని గుర్తు చేశారు. అక్రమ మైనింగ్పై కోర్టు మెట్లెక్కిన వారిపై యరపతినేని అక్రమ కేసులతో వేధిస్తున్నారని, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణా రెడ్డిపై 6 అక్రమ కేసులు బనాయించారని వెల్లడించారు. కోడెల కుటుంబానికి సహకరిస్తూ అక్రమాలకు పాల్పడుతోన్న సత్తెనపల్లి రెవెన్యూ అధికారులు తగిన మూల్యం చెల్లించాల్సిందేనని చెప్పారు.