
విప్లవ్ కుమార్ దేవ్
బిగ్బీ అనగానే మనకు వెంటనే గుర్తుచ్చేది బాలీవుడ్ దిగ్గజం అమితాబచ్చన్. కానీ త్రిపుర ప్రజలకు మాత్రం బిగ్బీ అనగానే గుర్తుచ్చేది విప్లవ్ కుమార్ దేవ్. కొన్ని రోజులుగా ఈ పేరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 25 ఏళ్ల చరిత్ర గల కమ్యూనిస్ట్ కంచుకోటను బద్దలు కొట్టిన వ్యూహకర్తగా పేరొందారు. త్రిపుర ప్రజలకు నూతన ముఖ్యమంత్రి కూడా. తన మద్దతు దారులకు, రాష్ట్ర ప్రజలకు బిగ్బిగా సుపరిచితులు. త్రిపురలో పుట్టి పెరిగిన విప్లవ్ తన గ్రాడ్యుయేషన్ అనంతరం ఢిల్లీ వెళ్లి 16 ఏళ్లు ఆరెస్సెస్లో పని చేశారు. అనంతరం 2015 లో త్రిపురకు తిరిగొచ్చి బీజేపీలో కీలక బాధ్యతలు చేపట్టారు. 15 ఏళ్లు సేవలు అందించి పార్టీ పిలుపుమేరకు రెండేళ్ళ క్రితం రాష్ట్ర పార్టీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు.
2014 సాధారణ ఎన్నికల సమయంలో రాష్ట్ర ఇన్చార్జ్ నుంచి.. మొన్నటి ఎన్నికల్లో 25 ఏళ్ళ నుంచి రాష్ట్రాన్ని అప్రతిహతంగా పరిపాలిస్తున్న మానిక్ సర్కార్ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో కీలక పాత్ర పోషించారు. సాధారణ ప్రజలతో మమేకమై.. వారి కష్టాలను దగ్గర నుంచి చూస్తూ.. నేడు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. తనను కలవడానికి వచ్చే ప్రజలే ఆదర్శమని.. వాళ్లు ప్రేమతో ఇచ్చే రోటీనే బలమంటారు విప్లవ్ కుమార్. తాను త్రిపుర ప్రజలను ప్రేమిస్తున్నాని, మానిక్ సర్కార్పై.. కమ్యూనిస్టు పార్టీ మీద తనకు అపారమైన గౌరవమని తెలిపారు. కానీ త్రిపుర ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించకోవడంలో మానిక్ ఘోరంగా విఫలమయ్యారన్నారు.