
లక్నో : ఉత్తరప్రదేశ్లోని లక్నో క్రికెట్ స్టేడియం పేరు మార్చడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ హయాంలో రూపుదిద్దుకున్న ఇకానా అంతర్జాతీయ స్టేడియం పేరును దివంగత ‘భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయీ అంతర్జాతీయ స్టేడియం’గా మార్చిన విషయం తెలిసిందే. మంగళవారం భారత్-వెస్టిండీస్ టీ-20 మ్యాచ్కు ఒక్కరోజు ముందే యోగి ప్రభుత్వం పేరును మార్చింది. దీనిపై స్పందించిన అఖిలేష్.. ప్రస్తుతం ఉన్న స్టేడియంకు పాతపేరునే కొసాగించి, వాజ్పేయీ పేరుతో మరో నూతన స్టేడియంను నిర్మించాలని సూచించారు. నగరాల, స్డేడియాల పేర్లు మార్చడం తప్ప బీజేపీ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు.
పాత వాటికి కొత్త పేర్లు పెట్టి యోగి సంతోషిస్తున్నారని.. వాజ్పేయీ పేరు మీదుగా రాష్ట్రంలో ఒక్క నిర్మాణం కూడా బీజేపీ ప్రభుత్వం చేపట్టలేకపోయిందని మండిపడ్డారు. కాగా అఖిలేష్ హయాంలో 50వేల సామర్థ్యంతో నిర్మితమైన ఇకానా మైదానంలో మంగళవారం తొలి అంతర్జాతీయ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే.