
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా మండిపడ్డారు. బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్లో ప్రతిపక్షాలు ప్రత్యేక హోదా గురించి అడిగితే మోదీ ప్రభుత్వం సభను నడవనివ్వటం లేదని రాజా విమర్శించారు. పార్లమెంట్ అంటే మోదీకి గౌరవంలేదన్నారు. ఉభయసభలను సక్రమంగా నడపాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా? అని ప్రశ్నించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్కు కనీస గౌరవం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఇవ్వక పోవటంపై మండిపడ్డారు.
బీజేపీ హటావో దేశ్కి బచావో స్లోగన్తో.. అందరం ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. ఆరెస్సెస్ ఎజెండాతో బీజేపీ పాలన కొనసాగిస్తొందన్నారు. అధికార పార్టీ జాతీయ ప్రయోజనాలను పక్కన పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ పాలనలో దళితులు, ఆదివాసులపై హత్యాచారాలు పెరిగాయని, రాజ్యాంగ పరంగా పౌరులకు లభించాల్సిన హక్కులను మోదీ ప్రభుత్వం హరిస్తోందన్నారు. అంబేద్కర్, గాంధీజీ, భగత్ సింగ్ భావాలను బీజేపీ కాలరాస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహామహుల ప్రాణత్యాగాల ఫలితంగా స్వతంత్రం వచ్చిందని, బ్రిటీష్ వారిపై చేసిన పోరాటం ఇప్పుడు బీజేపీపై చేయవల్సిన పరిస్థితి ఏర్పడిందని రాజా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment