
కోల్కత్తా : బెంగాల్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని జేఎన్యూ హింసకు నిరసనగా... విద్యార్థి సంఘాల నాయకులు ‘గోబ్యాక్ మోదీ’ అంటూ ప్లేకార్డులు పట్టుకుని నిరసన ప్రదర్శించారు. ప్రధాని కాన్వాయ్ వెళ్లే మార్గంలో పెద్ద ఎత్తున బ్యానర్లు ఏర్పాటు చేశారు. నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో నిరసనకారులను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా రెండు రోజుల పర్యటిన నిమిత్తం శనివారం మధ్యాహ్నం ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి కోల్కత్తాకు బయటదేరిన విషయం తెలిసిందే. కోల్కత్తా విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి పలువురు స్వాగతం పలికారు.
ప్రధాని మోదీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీలు శనివారం కోల్కతాలోని రాజ్భవన్ వేదికగా భేటీ అయ్యారు. అయితే ఏ అంశాలపై భేటీ జరగనుందో తెలియాల్సి ఉంది. అలాగే ఈ నెల 12న కోల్కతాలో జరగనున్న కోల్కతా పోర్ట్ ట్రస్ట్ (కేఓపీటీ) 150వ వసంతోత్సవ కార్యక్రమంలో వీరిరువురు మరలా ఒకే వేదికపై కలిసే అవకాశం ఉంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాలేదు.