
సాక్షి, విశాఖపట్నం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బ్రాహ్మణుల సంక్షేమానికి పెద్దపీట వేశారని వైఎస్సార్ సీపీ నాయకులు మల్లాది విష్ణు అన్నారు. విశాఖలో బ్రాహ్మణ సంఘాలతో జరిగిన ఆత్మీయ సమావేశానికి వైఎస్సార్ సీపీ అధ్యకుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి, ఆ పార్టీ నాయకులు మల్లాది విష్ణు, కోన రఘుపతి, మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. టీడీపీ తొలి నుంచి బ్రాహ్మణులను ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. అర్చకులకు రిటైర్మెంట్ లేకున్నా.. రమణ దీక్షితులను తొలగించారని మండిపడ్డారు. ఆయనను ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ బ్రాహ్మణుల సంక్షేమానికి వెయ్యి కోట్లు ఖర్చుపెడితే.. చంద్రబాబు మాత్రం అరకొర నిధులే ఖర్చు చేశారని తెలిపారు. ప్రజాస్వామ్యం నిలబడాలంటే వైఎస్ జగన్ను సీఎం చేయాలని అన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే దేవాలయ భూముల పరిరక్షణకు, బ్రాహ్మణ సంక్షేమానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు. బ్రాహ్మణులంతా సంఘటితంగా ఉండి వైఎస్ జగన్ను ఆశీర్వదించాలని కోరారు.
కోన రఘపతి మాట్లాడుతూ.. నామినేటెడ్ పదవుల్లో బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ మాట మీద నిలబడే వ్యక్తి అని తెలిపారు. వైఎస్ జగన్ ఎవరినీ మోసం చేయలేదని.. నమ్మినవారే ఆయన్ని మోసం చేశారని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మకై వైఎస్ జగన్పై కేసులు పెట్టాయని గుర్తుచేశారు. వారు పెట్టిన ఒక్క కేసులో కూడా బలం లేదని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై ఏ రాజకీయ నాయకుడు చేయనన్నీ పోరాటాలు వైఎస్ జగన్ చేశారని చెప్పారు. ఆదివారం కంచరపాలెంలో వైఎస్ జగన్ సభకు హాజరైన జన సునామీని చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్రోల్పై 2 రూపాయలు తగ్గించారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment