
సాక్షి, ముంబయి : బీజేపీ మిత్రపక్షం శివసేన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ప్రశంసల జల్లు కురిపించింది. గుజరాత్ ఎన్నికల బరిలో రాహుల్గాంధీ పోరాటం అద్భుతం అని శివసేన కొనియాడింది. ఎన్నికల ఫలితాలను పట్టించుకోకుండా, దాని గురించి అస్సలు ఆలోచించకుండా ఆయన ప్రధాని మోదీపై చేసిన పోరాటం అద్భుతం అని శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే తన అధికారిక పత్రి సామ్నాలో అన్నారు. అతిపెద్ద పురాతన పార్టీ(కాంగ్రెస్) కీలక పరిస్థితుల్లో ఉన్న సమయంలో రాహుల్ పార్టీ బాధ్యతలు చేపట్టారని, బాధ్యతను కీలక దశలో భుజానికెత్తుకున్నారని ప్రశంసించారు.
ఆయనకు శుభాభినందనలు చెప్పడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈ సందర్భంగా ఉద్దవ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీని విజయతీరానికి నడిపిస్తారా ఓటమి వైపా అనేది ఆయన స్వంత అంశానికి వదిలేయాల్సి ఉంటుందని దానిపై ఆయన వ్యక్తిగతం అన్నారు. ఎలాంటి ఫలితాలు ఊహించకుండానే గుజరాత్ ఎన్నికల ప్రచార బరిలో రాహుల్ దిగారని, మోదీని ఎదుర్కొన్నారని, ఓడిపోతామేమోనని బీజేపీ ఎన్ని యూటర్న్లు తీసుకున్నా రాహుల్ మాత్రం ఏమాత్రం ఆందోళన చెందలేదని, ఈ విశ్వాసమే ఆయనను ముందు రోజుల్లో మరింత ముందుకు తీసుకెళుతుందని తాను నమ్ముతున్నట్లు తెలియజేశారు. అదే సమయంలో మరోసారి బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. బీజేపీ వాళ్లు గత 60 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి లేదని అనుకుంటున్నారని, వారొచ్చిన గత మూడేళ్లలోనే దేశం మొత్తం అభివృద్ధి చెందిందని అంటున్నారని, వారి మాటలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని, అది వారి మూర్ఖపు ఆలోచన మాత్రమే అని అన్నారు.